Delhi fire : ఢిల్లీలో గతవారం భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఒక హోటల్లో జరిగిన ఈ ప్రమాద ఘటనలో 21 మంది మరణించారు. అందులో గుర్గావ్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ కుటుంబంలో మిగిలిన ఏకైక వ్యక్తి కూడా మరణించాడు. దీంతో ఇక ఆ కుటుంబం మొత్తం మరణించినట్లైంది. ఢిల్లీ, మాలవీయ నగర్లోని బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో గతవారం అగ్నిప్రమాదం సంభవించింది.
ఇందులో వివేక అగర్వాల్తోపాటు అతడి కుటుంబ సభ్యులు 8 మంది మరణించారు. వీరంతా గుర్గావ్కు చెందిన వారు. తమ కుటుంబ పెద్ద 78 ఏళ్ల రాధేశ్యామ్ అగర్వాల్ అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను చూసుకోవడానికి, పరామర్శించడానికి అతడి కుటుంబం అంతా గుర్గావ్ నుంచి ఢిల్లీ వచ్చింది. రాధేశ్యామ్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి దగ్గర్లో ఉన్న హోటల్లో బస చేశారు. ఈ నెల 3న ఈ హోటల్ అగ్నిప్రమాదానికి గురికావడంతో కుటుంబంలోని మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, మిగిలిన ఏకైక వ్యక్తి రాధేశ్యామ్ తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
దీంతో ఆ కుటుంబంలో ఇంకా ఎవరూ మిగలకపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. రాధేశ్యామ్ భార్య ప్రేమ్లత, తనయుడు వివేక్ అగర్వాల్, వివేక్ భార్య తర్జని, మనవరాళ్లు జివిషా, వర్యాతోపాటు మరో ముగ్గురు బంధువులు కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో జివిషా బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతోంది. ఆమె తన తాతను చూడటానికి వచ్చి, హోటల్ అగ్ని ప్రమాదంలో మరణించింది. హోటల్ యజమాని, వంట మనిషి నిర్లక్ష్యం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదానికి కారణమైన హోటల్ యజమాని, చెఫ్ సహా సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ జరుపుతున్నారు.