న్యూఢిల్లీ, ఆగస్టు 4 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వ్యవస్థను మరింత కఠినతరం చేయడానికి సన్నద్ధమవుతున్నది. ఇదివరకే మంజూరు చేసిన వీసాల పొడిగింపునకు అదనపు వీసా ఫీజును వర్తింప చేయాలని ఆలోచిస్తున్నది. ఇప్పటివరకు కొత్త హెచ్-1బీ, ఎల్-1 వీసాలకు మాత్రమే ఈ రుసుము చెల్లించాల్సి ఉండేది. హెచ్-1బీ వంటి వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులను తమ వద్దే కొనసాగించుకోవాలనుకునే కంపెనీలకు దీనివల్ల ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే హెచ్-1బీ వీసా పునరుద్ధరణలో అత్యధిక వాటా కలిగిన భారతీయ నిపుణులపై కూడా దీని ప్రభావం పడనున్నది. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కొత్త హెచ్-1బీ వీసాలపై 1,00,000 డాలర్ల రుసుము విధించాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించడానికి అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు గత నెలలో నిరాకరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఈ ప్రతిపాదన(అధికారికంగా దీనిని ప్రతిపాదిత నియమ-నిర్మాణ ప్రకటన అని పిలుస్తారు)ను హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ 2024 జూన్లో మొదటిసారిగా ప్రచురించాయి. దీనిని యూఎస్ ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించారు. ప్రస్తుతం అర్హత కలిగిన యజమాని ప్రాథమిక హెచ్-1బీ లేదా ఎల్-1 పిటిషన్ను దాఖలు చేసినపుడు లేదా విదేశీ ఉద్యోగి తన యజమానికి(ఉపాధి సంస్థను) మార్చుకున్నప్పుడు మాత్రమే ఈ రుసుము వర్తిస్తుంది. ప్రతిపాదిత నిబంధన ప్రకారం అదే యజమానులు ఇప్పటికే ఉన్న హెచ్-1బీ లేదా ఎల్-1 ఉద్యోగి బస కాలాన్ని పొడిగించాలని కోరినపుడు కూడా ఈ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి, వారిలో కనీసం సగం మంది హెచ్-1బీ, ఎల్-1 హోదాను కలిగి ఉన్న యజమానులను ఈ ప్రతిపాదన లక్ష్యంగా చేసుకుంది. ఈ యజమానులు ప్రస్తుతం కొత్త హెచ్-1బీ పిటిషన్ల కోసం కనీసం 4,000 డాలర్లు చెల్లిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం ఈ యజమానులు దాఖలు చేసే అన్ని నివాస పొడిగింపు పిటిషన్లకు ఈ చార్జీలను విస్తరిస్తారు.
హెచ్-1బీ పొడిగింపు ఆమోదాలలో అత్యధిక వాటా కలిగిన భారతీయ నిపుణులపై ఎక్కువగా ఆధారపడే యజమానులపైనే ప్రతిపాదిత మార్పు అత్యధిక ప్రభావం చూపుతుందని అంచనా. యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) గణాంకాల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ 4,06,348 హెచ్-1బీ దరఖాస్తులను ఆమోదించింది. వీటిలో 2,91,542(దాదాపు 72%) దరఖాస్తులు ఉద్యోగ కొనసాగింపునకు సంబంధించినవి. ఈ ఆమోదాలలో భారతీయులకు సంబంధించినవి 2,26,359 కాగా ఇది మొత్తం హెచ్-1బీ పొడిగింపులలో 77.6% ఉంది. దీని ఫలితంగా హెచ్-1బీ, ఎల్-1 వీసా పునరుద్ధరణ దరఖాస్తులపై అదనపు రుసుమును పొడిగించే ప్రతిపాదన అమల్లోకి వస్తే ముఖ్యంగా సాంకేతిక రంగంలో పెద్ద సంఖ్యలో భారతీయ ఉద్యోగులను కలిగి ఉన్న యజమానులు ఆ ఉద్యోగులను తమ వద్దే కొనసాగించుకోవడానికి గణనీయంగా అధిక వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. విదేశీ కార్యాలయాల నుండి అమెరికాకు ఎగ్జిక్యూటివ్లు, మేనేజర్లు, ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులను బదిలీ చేయడానికి ఉపయోగించే ఎల్-1 వీసాలను పొడిగించే బహుళజాతి కంపెనీలకు ఈ ప్రతిపాదన ఖర్చులను కూడా పెంచుతుంది.
హెచ్-1బీ, ఎల్-1 వీసా పునరుద్ధరణ దరఖాస్తులపై అదనపు రుసుమును పొడిగించాలన్న ప్రతిపాదన వల్ల భారీ సాంకేతిక సంస్థలు, ఐటీ సేవల సంస్థలు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ(ఎన్ఎఫ్ఏపీ)ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాన్ని కొనసాగించడం కోసం అమెజాన్ అత్యధికంగా 14,532 హెచ్-1బీ దరఖాస్తులను ఆమోదించింది. తర్వాతి స్థానాల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(5,293,), మైక్రోసాఫ్ట్(4,863), మెటా(4,740), ఆపిల్(4,610), గూగుల్(4,509) ఉన్నాయి. ఈ గణాంకాలు ప్రత్యేక ఉద్యోగులను కాకుండా ఆమోదించిన పిటిషన్లను సూచిస్తాయని ఎన్ఎఫ్ఏపీ పేర్కొంది. ఎందుకంటే బదిలీలు లేదా సవరించిన ఫైలింగ్ల కారణంగా ఒక హెచ్01బీ ఉద్యోగి ఈ ఒక సంవత్సరంలో బహుళ ఆమోదాలను పొందవచ్చు. తాజా ప్రతిపాదన ఖరారైన పక్షంలో నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులపై ఆధారపడే పెద్ద సంస్థలపై ఇది మరో ఆర్థిక భారాన్ని మోపుతుంది. టెక్నాలజీ రంగంలో హెచ్-1బీ ఆమోదాలలో అధిక భాగం వీసా పునరుద్ధరణకే కేటాయించడం జరుగుతుంది.