Kasi Majili Kathalu Episode 13 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కళింగ రాజ్యాన్ని పాలించే శత్రుంజయుడు.. ఓ బ్రహ్మరాక్షసి వలలో పడ్డాడు. తన భార్యలను దూరం చేసుకున్నాడు. అతని కుమారుడైన సింహదమనుడు పెరిగి పెద్దవాడై తిరిగి వచ్చాడు. ఆకాశంలో ఎగిరే కీలుగుర్రాన్ని సంపాదించాడు. రాత్రుల్లో తన స్వేచ్ఛా విహారానికి అవరోధం కల్పించే సింహదమనుడి అడ్డం తొలగించుకోవాలని.. బ్రహ్మరాక్షసి ఒక పథకం ప్రకారం అతణ్ని లంకకు పంపింది. మార్గమధ్యంలో సింహదమనునికి మణిమంజరి తారసపడింది.
మణిమంజరి కౌగిళ్లలో చిక్కుకున్న సింహ దమనునికి మూడురోజుల పాటు వేరేలోకం తెలియలేదు. మనసులు కలుపుకున్న యువజంట ఆనందాలను అడ్డుకునేవారెవరూ ఆ అంతఃపురంలో లేరు. శుక్లపక్ష చంద్రుని వెన్నెలలు మన్మథుని ఒంటిరంగును పులుముకుని, ఆ యువజంటకు సహకరించాయి. సూర్యుడు చూడలేని ఆమె సొగసులన్నీ అతని పరమైనాయి. అలా మూడురోజులు మూడు నిమిషాల్లా గడిచిపోయాయి. గుర్తుతెలియని ఒక సుందరుడిని మణిమంజరి గాంధర్వవివాహం చేసుకున్నదన్న విషయం చెలికత్తెలకు తప్ప, ఆమె తల్లిదండ్రులకు తెలియదు.
నాలుగోనాటి తెల్లవారుజామున సింహదమనుని కంటే ముందుగా మేల్కొన్న మణిమంజరి, అతని దుస్తుల్లో ఒక లేఖను కనుగొన్నది.
అది బ్రహ్మరాక్షసి తన చెల్లెలికి రాసింది. పైశాచీ భాషలోని ఆ లేఖను సింహదమనుడు చదవలేదు. కానీ, భాష తెలిసినదైన మణిమంజరి చదవకుండా ఉండలేకపోయింది. అందులో ఇలా ఉంది..
“నిత్య జీవహింసా పరాయణురాలైన చెల్లెలు లంబోదరికి, మీ అక్క కంకాళి ఆశీర్వదించి వ్రాయునది. నేనిక్కడ శత్రుంజయుడనే రాజు పంచన చేరి, అతని భార్యలను అడవికి తోలాను. వారి కనుగుడ్లను పెరికించి నీకు పంపాను కదా! ఇంతవరకు జరిగిన కథ నీవు ఎరిగినదే. అప్పటినుంచి నేను ఏ ఆటంకం లేకుండా రాత్రులు ఏనుగులు మొదలైన జంతువులను తిని కడుపు నింపుకొంటున్నాను. ఆ గుడ్డిరాజుకు ఆ సంగతేమీ తెలియనివ్వకుండా మోసపుచ్చుతున్నాను. కాగా, ఈ ఉత్తరం తెచ్చిన వీరుడు ఇటీవల రాజువద్ద ఉద్యోగానికి చేరాడు. రాత్రుళ్లు గస్తీ తిరుగుతూ.. నా కడుపుకొడుతున్నాడు. సురాసురులైనా గెలవలేని వీరుడు వీడు. ఏదో ఒక మాయోపాయం చేసి, వీడిని చంపి నీ ఆకలి తీర్చుకో!”
– ఇట్లు, కంకాళి వ్రాలు.
.. ఆ లేఖను చదివి, మణిమంజరి భయవిహ్వల అయింది. ‘పాపం నా ప్రియునికి పైశాచీ భాష తెలియకపోవడం వల్ల చావును వెతుక్కుంటూ వెళుతున్నాడు. బహుశా వీరిని కాపాడటానికే దైవం నాతో జతకూర్చి ఉంటాడు. కార్యార్థియై వెళుతున్నవాడిని చెడగొట్టడం కంటే వేరే ఒక ఉపాయాన్ని పన్ని ఇతడిని రక్షించుకుంటాను’ అని మనసులో తలపోసింది.
వెంటనే ఆ ఉత్తరాన్ని అందులోని చేతివ్రాత పోలికలోనే ఇలా మార్చి రాసింది..
“ఇదివరకు నేను నీ వద్దకు కనుగుడ్లతో పాటు పంపిన ఉత్తరం వల్ల అన్ని సంగతులూ బోధపడ్డాయి కదా! ఇప్పుడు నాకు పుత్రతుల్యుడైన రాజపుత్రుని నీ వద్దకు పంపుతున్నాను. వీడికి మన ఇంటిలోని వింతలన్నీ చూపించు. మన గుట్లన్నీ వివరంగా తెలియచెప్పు. వీడు నిత్యం నాకు చాలా సహాయం చేస్తున్నాడు. అనేక విందులు చేసి సంతోషపెట్టు. నీ క్షేమ సమాచారాలు వీడితో జాబురాసి పంపు”..
.. అని రాసి, ఆ లేఖను యథాస్థానంలో ఉంచింది మణిమంజరి. ఆవేళ నిద్రలేస్తూనే సింహదమనుడికి తన కర్తవ్యం గుర్తుకు వచ్చింది. తన ప్రయాణాన్ని అడ్డుకుంటున్న మణిమంజరికి ఎన్నోవిధాల నచ్చచెప్పి, అక్కడినుంచి బయలుదేరాడు. కీలుగుర్రాన్ని అధిరోహించి మలయాళదేశం దిశగా సాగాడు.
సముద్రం దాటి, లంకలో ప్రవేశించాడు. నూరుయోజనాలు నేరుగా ప్రయాణించి, మూడు పర్వతాలను కనుగొన్నాడు. మధ్యనున్న పర్వతశిఖరంపై పెద్ద బండరాయి ఉండటాన్ని చూశాడు. ఆ రాయిపై అగ్ని వెలిగించి, దానిలో కంకాళి ఇచ్చిన పొడిని చల్లాడు.
అప్పుడా పెద్ద రాయికూడా చప్పుడు చేయకుండా రెండుగా విచ్చిపోయింది. ఆ పగులు మధ్య మెట్లదారి కనిపించింది. మెట్లు దిగుతూ సింహదమనుడు ఆ గుహలోకి ప్రవేశిస్తుండగానే లోపల నిద్రిస్తున్న లంబోదరికి మనిషి వాసన కొట్టింది.
నొసలు చిట్లిస్తూ, ముక్కుపుటాలు ఎగరేస్తూ గుహద్వారం వద్దకు వచ్చింది. దాని అవతారాన్ని చూస్తూనే సింహదమనుడు మ్రాన్పడిపోయాడు. అతగాడిని అమాంతం మింగడానికి లంబోదరి ముందడుగు వేసింది.
అంతలో తేరుకున్న సింహదమనుడు..
“కళింగం నుంచి.. లేఖ తెచ్చాను” అని రెండు ముక్కల్లో తన రాకను తెలియచేశాడు.
అతని చేతినుంచి లేఖను తీసుకుని, మణిమంజరి రాసిన విషయాన్ని చదువుకున్నది లంబోదరి. బద్దలైన రాళ్లు రెండూ పిండిపిండి అయిపోయేలా వికటాట్టహాసం చేసింది.
“ఓరి కుర్రా! ఈవేళ అనవసరంగా నా చేతిలో చచ్చేవాడివి కదరా!” అని సింహదమనుని వీపుపై చరిచింది. మరొకరైతే ఆ ప్రేమలోని మోటుదనానికి ఎముకలు విరిగి పడిపోయేవారే.
అతనిని లోనికి తీసుకువెళుతూ..
“నిన్ను మా అక్క పెంచుకోవడం మొదలుపెట్టి ఎన్నాళ్లయింది? ఎలా ఉంది? నిన్ను చాలా మర్యాద చేయమని రాసింది. లోపలికి పద. మనింటిలోని వింతలన్నీ చూపిస్తాను” అంటూ అనేక విషయాలు మాట్లాడసాగింది లంబోదరి.
ఆమె మాటలవల్ల కొద్దికొద్దిగా అసలు విషయాలన్నీ సింహదమనునికి బోధపడసాగాయి. మణిమంజరి సాయమూ అర్థం అయింది.
“ఒరే కుర్రా చూశావా! మా అక్క కంకాళి చంపిన మారాజుల కంకాళాలే అవన్నీ. తొందరలోనే శత్రుంజయుని పుర్రె కూడా అందులో చేరుతుంది. ప్రతి నలభై ఏళ్లకు ఒక్కో రాజును చంపడం మా అక్కకు అలవాటు. ఇక అటు చూశావా? వెలలేని రత్నరాశులు. బంగారం, వెండి నాణేలు. ఇక ఇది చిత్రశాల. ఇందులోని వింతలు ముల్లోకాలలోనూ లేవు” అంటూ ఆ గదులన్నీ చూపించసాగింది లంబోదరి.
“పిన్నమ్మా! మా అమ్మ నిన్ను చాలా విషయాలు అడగమని చెప్పింది. అన్నట్లు ఈ కనుగుడ్లేమిటి?” ప్రశ్నించాడు సింహదమనుడు.
“అయ్యో! వీటినే గుర్తుపట్టలేక పోయావా? ఆ శత్రుంజయ మహారాజు భార్యల కనుగుడ్లు. వీటినిక్కడ చెడిపోకుండా భద్రంగా దాచి ఉంచాను. ఇప్పుడైనా సరే.. ఈ గుడ్లను తీసుకుపోయి, తులసి ఆకు పసరుతో కళ్లు లేనివాళ్లకు అతికించవచ్చు” అని చెప్పింది లంబోదరి.
‘అవునా!’ అంటూ ఆ పెట్టెను జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటుండగా సింహదమనునికి రెండు పంజరాల్లోని చిలుకలు కంటపడ్డాయి.
“ఆ రెండూ ఏమిటి పిన్నమ్మా?” అని ప్రశ్నించాడు.
“చూడు నాయనా! మా గుట్టుమట్లన్నీ వివరంగా నీతో చెప్పమని మీ అమ్మ రాసింది. ఇదిగో ఈ ఎడమవైపు పంజరంలోని చిలుకలో నా ప్రాణం ఉంది. రెండోది మా అక్కది. ఈ రెండు చిలుకలూ భద్రంగా ఉన్నంతకాలం మా ఇద్దరి ప్రాణాలకూ భయం లేదు” అని లంబోదరి వివరించింది.
“పిన్నమ్మా! ఇంకా నిన్ను బోలెడన్ని విశేషాలు అడగాలని ఉంది. కానీ, నాకు ఆకలేస్తున్నది. ఇక్కడ మనుషులు తినే పదార్థాలేమైనా ఉన్నాయా?” అని అడిగాడు సింహదమనుడు.
“లేకేం నాయనా! పద” అంటూ వంటశాలలోకి దారితీసింది లంబోదరి. కడుపు నిండా భోజనం చేసిన తరువాత..
“పిన్నమ్మా! ఇంకేమైనా విశేషాలు చూపిస్తావా?” ఆసక్తిగా అడుగుతూ పక్క గదిలోకి దారితీశాడు సింహదమనుడు. అక్కడో పదహారేళ్ల పిల్ల నిద్రపోతూ ఉంది. ఆమెను చూసి.. “పిన్నీ! ఇక్కడేదో బంగారు బొమ్మను పెట్టావే?!” అని కలవరపాటుతో ప్రశ్నించాడు.
దానికి లంబోదరి వికవికా నవ్వుతూ..
“అది బొమ్మకాదురా కుర్రా! ఆడపిల్లే!” అన్నది. ఆ అలికిడికి మంచంమీది పడుచుపిల్ల నిద్రలేచి కూర్చున్నది.
“దీనిపేరు మోహిని. ఆరేళ్ల వయసున్నప్పుడు దీన్ని మీ అమ్మ ఇక్కడికి తీసుకువచ్చింది. అప్పటినుంచి ఇక్కడే పెరుగుతున్నది. చక్కని తెలివి గలది. దీనికి అన్ని విద్యలూ నేనే నేర్పించాను” అని లంబోదరి పరిచయం చేసింది.
చాలాకాలం తరువాత తనజాతి వాడైన మానవుణ్ని చూసిన ఆనందంలో మోహిని సిగ్గుల మొగ్గయింది. క్రీగంట సింహదమనుని వంక చూసింది. ఆమె అభిప్రాయాన్ని గమనించినవాడై సింహదమనుడు..
“నిజమే పిన్నీ! ఓసారి నేను మా అమ్మను నాకు పెళ్లి చేయమని అడిగాను. నీకోసం ఓ పిల్లను పెంచుతున్నాను. దానిని నువ్వు పెళ్లాడవచ్చని మా అమ్మ చెప్పింది” అన్నాడు.
“మీ ఇద్దరికీ ఇష్టమైతే ఇప్పుడే మీ మనువు చేసేస్తాను” అంటూ వాళ్లిద్దరి చేతులనూ కలిపింది లంబోదరి.
సింహదమనుడు పాణిగ్రహణంతో మోహిని భర్తయ్యాడు. కానీ, ఆమె మనసులో సందేహాలు అలాగే ఉన్నాయి. ఏకాంతం దొరికేదాకా ఓపిక పట్టి, “మానవులైన మీకు ఒక రాక్షసి తల్లి కావడం ఏమిటి?” అని భర్తను ప్రశ్నించింది.
అందుకు సింహదమనుడు..
“ఆ విషయాలన్నీ తరువాత వివరంగా చెబుతాలే! కానీ, రాక్షసులకు మానవులు ఆహార వస్తువులు కదా! అట్టివారికి మనపట్ల మక్కువ ఎక్కువకాలం స్థిరంగా ఉండదు. ఏదో ఒక ఆకలివేళ.. పెంచుకున్న ప్రేమను పక్కనపెట్టి ఈ రాక్షసి నిన్ను, నన్ను కూడా నమిలి మింగేయవచ్చు. కనుక ముందుగా దీనిని అంతం చేద్దాం” అన్నాడు.
మోహిని సరేనన్నది. లంబోదరి తన గదిలో నిద్రిస్తుండటాన్ని గమనించి, అడుగుల చప్పుడు కాకుండా నెమ్మదిగా చిత్రశాలలోని పంజరాల వద్దకు వెళ్లాడు సింహదమనుడు.
లంబోదరి ప్రాణం ఉన్న చిలుకను మెల్లగా బయటకు లాగి, దాని గొంతు నులిమేశాడు. గదిలో లంబోదరి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం విడిచింది.
అటుపైన రెండో పంజరాన్ని, తన తల్లుల కనుగుడ్లు దాచివుంచిన భరిణలను సేకరించాడు. మోహినితో కలిసి గుహ బయటికి వచ్చాడు. లోపలికి వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిలోనే ఉన్న తన కీలుగుర్రాన్ని అధిరోహించి కళింగదేశం దిశగా పయనమయ్యాడు సింహదమనుడు. మార్గమధ్యంలో మణిమంజరి సౌధంపైన గుర్రాన్ని నిలిపాడు. కానీ, సౌధంలో ఆమె కనిపించలేదు. వారిద్దరి ప్రేమ వివాహం విషయం మణిమంజరి తండ్రి అయిన యజ్ఞదత్తునికి తెలిసిపోయింది. సింహదమనుడు నేరుగా మామగారి వద్దకు వెళ్లి, తనను తాను పరిచయం చేసుకున్నాడు. అతడికోసమే ఎదురుచూస్తున్న యజ్ఞదత్తుడు చాలా సంతోషపడ్డాడు. మోహినికి, సింహదమనునికి ఉచిత రీతిన గౌరవమర్యాదలు జరిపించాడు.
రెండురోజుల పాటు మామగారింట ఆతిథ్యం స్వీకరించిన తరువాత..
“మామగారూ! మా తండ్రిగారు ఒకానొక రాక్షసి వలలో చిక్కుకున్నారు. నేనీ పంజరంలోని చిలుకను చంపివేస్తే ఆ రాక్షసి చనిపోతుంది. కానీ, నా తల్లులు నిరపరాధులని నిరూపణ కాదు. అందువల్ల మీరు నాకో సహాయం చేయాలి” అని ప్రార్థించాడు.
దానికి యజ్ఞదత్తుడు అంగీకరించాడు.
సింహదమనుని పథకం ప్రకారం యజ్ఞదత్తుడు కళింగరాజ్యంపై యుద్ధం ప్రకటించాడు. రాజధాని పొలిమేరల్లో సైనికులతో విడిది చేశాడు. సింహదమనుని తల్లులు ఏడుగురినీ రహస్యంగా రాజధాని నుంచి రప్పించాడు. అటుపైన శత్రుంజయుని వద్దకు రాయబారిని పంపాడు.
యుద్ధవార్త వినగానే శత్రుంజయుడు కంగారుపడ్డాడు. వార్ధక్యం వల్ల, సరైన సైన్యాధ్యక్షుల కొరతవల్ల అతడు యుద్ధానికి సిద్ధంగా లేడు. అందువల్ల యజ్ఞదత్తునితో సంధి చేసుకోవడానికి అంగీకరించాడు.
సంధి ఒప్పందం కోసం పొలిమేరలలోని సైనిక శిబిరాల వద్దకు వచ్చాడు.
“యజ్ఞదత్తా! ఎటువంటి శత్రుత్వం లేకుండా మీరు నా రాజ్యంపై దండెత్తడానికి కారణం ఏమిటో తెలియడం లేదు” అన్నాడు శత్రుంజయుడు.
“వారసులు లేని మీ రాజ్యాన్ని నేడు నేను.. కాకపోతే రేపు వేరెవరైనా కైవసం చేసుకుంటారు. ఆ అవకాశాన్ని మేమెందుకు పొందకూడదు? ఇంతకుమించి మా దండయాత్రకు వేరే కారణమంటూ ఏమీ లేదు. అన్నట్లు మీకు సంతానం లేదా? ఎవరినీ దత్తత తీసుకునే ప్రయత్నం చేయడం లేదా?” ప్రశ్నించాడు యజ్ఞదత్తుడు.
“మహారాజా! నా పాపిష్టికథను ఏమని చెప్పుకోను?! గర్భవతులైన ఏడుగురు భార్యలను అడివి పాలు చేసుకున్న దుర్మార్గుడిని నేను. వారి ఉసురు తగలడం వల్లనే నాకు మళ్లీ సంతానం కలగలేదు” అన్నాడు శత్రుంజయుడు విచారం వ్యక్తం చేస్తూ.
“మీ భార్యలని చెబుతున్నది వీరిని గురించేనా?” అంటూ యజ్ఞదత్తుడు వేలుపెట్టి చూపించిన దిక్కువైపు చూసి, ఆశ్చర్యపడ్డాడు శత్రుంజయుడు.
వారి వద్దకు ఆత్రంగా వెళ్లి చూసి, కలవర పడ్డాడు.
“ఇదేమిటి మీ కళ్లు ఎలా పోయాయి?” అని ప్రశ్నించాడు.
తండ్రిని ఎక్కువసేపు బాధించడం ఇష్టంలేని సింహదమనుడు అజ్ఞాతం నుంచి బయటికి వచ్చాడు. జరిగిన విషయం పూసగుచ్చినట్టు చెప్పాడు. తన తల్లులు నిరపరాధులని నిరూపించాడు. రాక్షసి గుహనుంచి తీసుకువచ్చిన కనుగుడ్లను తల్లులకు అతికించి వారికి కన్నులు తెప్పించాడు.
పంజరంలోని చిలుక మెడవిరిచి కంకాళిని హతమార్చాడు. కొండంత శరీరం కలిగిన ఆ రాకాసి శరీరాన్ని తగలెయ్యడానికి వేయిమణుగుల కలప కావాల్సి వచ్చింది. పదిహేను రోజులపాటు దాని శరీరం కాలుతూనే ఉంది. ఈలోపుగానే సింహదమనునికి కళింగ చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగింది.
(వచ్చేవారం.. ధీమంతుడు)
అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu Episode 12 ( కాశీ మజిలీ కథలు ) | కీలుగుర్రం
“Kasi Majili Kathalu Episode 11 ( కాశీ మజిలీ కథలు ) | పురుషద్వేషిణి- 2”
Kasi Majili Kathalu Episode 10 ( కాశీ మజిలీ కథలు ) | పురుషద్వేషిణి
Kasi Majili Kathalu Episode 9 ( కాశీ మజిలీ కథలు ) | తిరిగి కలిసిన మిత్రులు
Kasi Majili Kathalu Episode 8 ( కాశీ మజిలీ కథలు ) | విద్యాధరి రాగమంజరి
Kasi Majili Kathalu Episode 7 ( కాశీ మజిలీ కథలు ) | మంత్రిగారి భార్య
Kasi Majili Kathalu Episode 6 ( కాశీ మజిలీ కథలు ) | హేలానగరంలో ప్రవరుడు