Kasi Majili Kathalu Episode 10 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : మధిర సుబ్బన్న దీక్షితకవి 1930వ దశకంలో రచించిన ‘కాశీమజిలీ కథలు’ తెలుగు పాఠకలోకాన్ని ఉర్రూతలూగించాయి. మణిసిద్ధుడు అనే యతి, తనకు తోడుగా వచ్చిన గోపాలకునికి వివిధ మజిలీల్లో చెప్పిన కథలుగా ఈ కాశీమజిలీ కథలను ఆయన రూపొందించారు. ‘వరప్రసాదుల కథ’ అనే మొదటి కథ గతవారంతో పూర్తయింది. ఇప్పుడు ‘పురుషద్వేషిణి’ కథ మొదటిభాగాన్ని చదవండి.
చోళదేశపు యువరాజు పేరు విక్రమసింహుడు. అతడికి బహుశ్రుతుడు అనే ప్రాణస్నేహితుడు ఉన్నాడు. వారిద్దరూ గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, తమ రాజ్యానికి తిరిగి వస్తున్నారు. వస్తూ వస్తూ మలయాళ దేశంలోని ఒక పట్టణంలో బస చేశారు. భోజనాదికాలు పూర్తయిన తరువాత విక్రమసింహుడు ఆ సత్రపు అరుగుమీద నున్న ఒక చిత్రపటాన్ని చూశాడు.
‘ఓహో! ఇది చిత్తరువా? ఎంత మోసపోయాను?! ఇంకా ఎవరో మోహనాంగి ఇక్కడ నిలబడిందని అనుకున్నాను’ అని ఆశ్చర్యపోయాడు. అలా అనుకుంటూనే ఆ చిత్రపటంలోని అందగత్తె మీద మనసు పారేసుకున్నాడు. తన మిత్రునికి దాన్ని చూపించాడు.
“మిత్రమా! ఇది ఎవరో చిత్రకారుడు గీసిన బొమ్మకాదు సుమా! కుంచెతో రంగులద్దితే ఈ వగలాడి మేను కందిపోయి ఉండేది. అలా కాలేదంటే ఈమె ఎవరో పాపం.. ఏ రుషి శాపమో తగిలి ఇలా చిత్రపటంలా మారిపోయి ఉంటుంది” అన్నాడు.
బహుశ్రుతుడు తన ధోరణిలో తానున్నాడు. మిత్రుని మాటలు పట్టించుకోలేదు.
“మిత్రమా! నువ్వు నా మాటలు ఆలకిస్తున్నట్లు లేదు. లోకంలో నిజంగా ఇంత చక్కదనం ఉంటుందా? ఈ సుందరాంగిని చేపట్టకపోతే నా ప్రాణం నిలబడదు. నీకు నీ మిత్రుడు కావాలంటే ఈమెను తెచ్చి నా ముందుంచాలి” అన్నాడు విక్రమసింహుడు.
“అయ్యో మంచి ధైర్యశాలివే! ఎక్కడైనా చిత్రాలు చూసి విరాళిలో తూలిపడేవారు ఉంటారా? ఎవరో చిత్రకారుడు ఊసుపోక దీన్ని గీసి ఉంటాడు. ఈమె నిజమైన రమణి అయితే ఏమైపోయేవాడివో కదా! సరే.. ముందు ఈ చిత్రం గీసినవారెవరో కనుక్కుందాం పద” అంటూ బహుశ్రుతుడు దారితీశాడు.
నిపుణికుడు అనే చిత్రకారుడు ఆ చిత్రాన్ని గీసినట్లు మిత్రులిద్దరి పరిశోధనలో తేలింది.
“నిజమేనండీ! ఆ బొమ్మ నేనే గీశాను” అని ఒప్పుకొన్నాడు నిపుణికుడు. “కానీ, నేనామె ముఖం చూడలేదు” అని మెలిక కూడా పెట్టాడు.
“విసిగించకుండా అసలు విషయం చెప్పవయ్యా కళాకోవిదుడా!” మేలమాడాడు బహుశ్రుతుడు.
“మూడేళ్ల కిందట ఒకసారి నేను కాశీనగరానికి వెళ్లాను. అక్కడికి వేరే దేశం నుంచి పురుషద్వేషిణి అనే ఒక యువరాణి కూడా వచ్చింది. ఆమె గంగా స్నానానికి వచ్చేటప్పుడు దారిలో పురుషులెవరూ ఉండకూడదని చాటింపు వేశారు. పురుషుని ముఖం చూడని ఆ అందగత్తె ఎలా ఉంటుందో చూడాలనే పట్టుదల కలిగింది. నాకు జలస్తంభన విద్య వచ్చు. అందువల్ల మణికర్ణికా ఘట్టంలో మునిగి, ఆ యువరాణి కోసం వేచి ఉన్నాను. కొంతసేపటికి ఆమె వచ్చింది. మోకాలిబంటి నీటిలో నిలిచి, చెలికత్తెలు నీరు తోడి పోస్తుండగా స్నానం ముగించి వెళ్లిపోయింది. నీటిలో మునిగి ఉన్న నాకు ఆమె ముఖం కనబడలేదు. ఆమె కాలి బొటనవేలిని మనసులో ఉంచుకుని, మిగిలిన ఆమె రూపమంతా ఊహించి ఈ చిత్రం గీశాను. నచ్చినవారు కొనుక్కుపోతారని ఆ సత్రం అరుగుమీద వేలాడగట్టాను” అంటూ నిపుణికుడు ఆ చిత్రపటానికున్న నేపథ్య కథను వివరించాడు. మిత్రులిద్దరికీ నోటమాట రాలేదు.
“నా విద్యను అనుమానించాల్సిన అవసరం లేదు. కచ్చితంగా ఆమె అలాగే ఉండి ఉంటుంది” చెప్పాడు నిపుణికుడు.
“ఇంతకూ ఆమెది ఏ రాజ్యమో తెలుసా?” అడిగాడు బహుశ్రుతుడు.. అతడి చేతిలో నాణేలు ఉన్న మూటను ఉంచుతూ.
“తెలియదు ప్రభూ!” అన్నాడు నిపుణికుడు.
“నీకు తప్పినా నాకు తప్పదు కదా!” అంటూ తన మిత్రుణ్ని అక్కడినుంచి బయలుదేర దీశాడు బహుశ్రుతుడు.
మిత్రులిద్దరూ అనేక దేశాలు తిరుగుతూ ఆ చిత్ర పటంలోని పురుషద్వేషిణి అనే యువరాణి కోసం వెతుకుతున్నారు.
* * *
ఒకనాడు ఉదయాన్నే నిద్రలేచి వారొక అరణ్యమార్గంలో నడుచుకుంటూ వెళుతున్నారు. అసలే ఎండపొద్దు కావడంతో మేనువాడిన విక్రమసింహుడు నడువలేక..
“మిత్రమా! దగ్గరలో ఏదైనా జలాశయం ఉందేమో చూసిరా” అంటూ బహుశ్రుతుణ్ని పంపాడు.
కొంతదూరం నడిచి వెళ్లిన బహుశ్రుతునికి ఆకాశంలో నీటిపక్షులు ఎగురుతున్న జాడ కనిపించింది. ఆ దిక్కులో వెళ్లగా వెళ్లగా అక్కడో సరోవరం కనిపించింది. ‘హమ్మయ్య!’ అనుకుంటూ సరస్సులో దిగబోయిన అతగాడికి అక్కడో శిలాఫలకం దర్శనమిచ్చింది.
అందులో.. ‘ఇది పురుషద్వేషిణి యువరాణి గారు క్రీడించే కేళీ సరోవరం. దీని చెంతకు పురుషులు రాకూడదు. అలా వచ్చినవారు విచారణ లేకుండానే ఉరి తీయబడతారు’ అని రాసి ఉంది.
వెతకబోయిన తీగ కాలికి తగిలిందని సంబరపడ్డాడు బహుశ్రుతుడు. ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకుని యథేచ్ఛగా సరస్సులో దిగి, నీరు తాగాడు. మరికొంత నీటిని దొన్నెలో సేకరించుకుని మిత్రుని వద్దకు బయలుదేరాడు.
ఇది ఇలా ఉండగా.. నీటిని తెచ్చే మిత్రుని కోసం వేచిచూస్తున్న విక్రమసింహునికి ఉన్నట్లుండి సింహగర్జన వినబడింది. అప్పటికి తాను నిరాయుధుడై ఉన్నందున విక్రమసింహుడు పక్కనే ఉన్న మర్రిచెట్టును ఎక్కాడు.
సింహం రానేవచ్చింది. నోటిదాకా వచ్చిన కబళం చెట్టెక్కి కూర్చుందని తెలిసి కిర్రెక్కిపోయింది. తోక తిప్పుకొంటూ పళ్లు నిక్కబట్టుకుని ఆ చెట్టుకింద చాలాసేపు కూర్చుంది. చివరికి విసిగి సింహం తనదారిన తాను పోయింది. మరికొద్దిసేపు చూసి చెట్టు దిగాలనుకున్నాడు విక్రమసింహుడు.
ఇంతలో ఒక విచిత్రం జరిగింది. విక్రముడు కూర్చున్న కొమ్మ ఒక్క ఉదుటన గాలిలోకి ఎగరసాగింది. తొందరపడి దిగిపోబోయాడు కానీ సాధ్యం కాలేదు.
అసలేం జరిగిందంటే.. అతడు కూర్చున్నది చెట్టుకొమ్మ కాదు. కొమ్మమీద కూర్చున్న క్రౌంచపక్షి కాలిపై విక్రమసింహుడు తెలియక కూర్చున్నాడు. ఇప్పుడా పక్షి ఆకాశంలోకి ఎగిరింది. కిందపడితే ఎముకలు విరుగుతాయి కనుక, పక్షి కాలిని గట్టిగా పట్టుకున్నాడు. సముద్రాన్ని దాటి ఆకాశంలో ఎగురుతూ పడమటి దిక్కుగా వెళ్లింది క్రౌంచపక్షి. దాదాపుగా ఆ రోజంతా ప్రయాణం చేసి ఒక దీవిలోని చెట్టుమీద వాలింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ విక్రమసింహుడు ఆ చెట్టుకొమ్మల మీదనుంచి కిందికి దిగాడు.
అది క్రౌంచద్వీపంలోని సముద్ర తీరప్రాంతం. మనుషులెవ్వరూ లేనిచోట ధైర్యాన్నే సహాయంగా తీసుకుని, విక్రమసింహుడు ముందుకు నడిచాడు. కొంతదూరం నడవగా నడవగా క్రౌంచ ద్వీపానికి రాజధాని అయిన ఏకశిలానగరం సమీపించింది. అక్కడి ప్రజలను చూసి విక్రమసింహుడు నిర్ఘాంతపోయాడు. అక్కడ మగవాళ్లందరికీ తోకలున్నాయి. మూతులు, ముఖాలు కోతుల్లా ఉన్నాయి. ఆడవాళ్లు గొప్ప అందగత్తెల్లా ఉన్నారు. కానీ, వాలకం చూస్తే వాళ్లలో రాక్షస ప్రవృత్తి స్పష్టంగా కనిపిస్తున్నది.
పూర్వం రామరావణ యుద్ధంలో మూర్ఛపోయిన లక్ష్మణుణ్ని బతికించడానికి హనుమంతుడు ద్రోణగిరిని పెళ్లగించుకుని వచ్చాడు. తిరిగి ఆ గిరిని యథాస్థానంలో ఉంచడానికి వెళుతూ ఈ క్రౌంచద్వీపంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు అక్కడున్న స్త్రీపురుషులు హనుమంతుడి చుట్టూచేరి ఆయనను వెక్కిరించసాగారు. దానితో కోపించిన ఆంజనేయుడు.. ‘ఇకనుంచి మీ ద్వీపంలోని పురుషులందరికీ కోతి ముఖాలు, తోకలు వస్తాయి. ఆడవాళ్లందరూ రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారు’ అని శపించాడు. సాధుపురుషులను పరిహాసం చేసిన పాపం ఊరికే పోతుందా? ఇన్ని యుగాలుగా వారి తలరాతను మార్చే నాథుడెవడూ లేకపోయాడు.
ఇప్పుడు విక్రమసింహుడు ఆ ద్వీపంలో అడుగుపెట్టాడు. దారివెంట వెళుతున్న అతడిని చూసి, ఒకానొక స్త్రీ మోహించింది.
దగ్గరికి వచ్చి “ఎవరు నీవు?” అని అడిగింది. కానీ, ఆమె భాష ఏమిటో విక్రమసింహునికి అర్థం కాలేదు.
“ఏం చెబుతున్నావో తెలియడం లేదు. ఎవరు నువ్వు?” అని ఎదురు ప్రశ్న వేశాడు. ఈసారి ఇతగాడి భాష ఆమెకు అర్థం కాలేదు.
చేతి సైగల ద్వారా వాళ్లు ఒకరిగురించి ఒకరు కొంత తెలుసుకున్నారు. ఆమె విక్రమసింహుని తన ఇంటికి రమ్మని బతిమాలింది. ఆ ఊళ్లో తనకు తెలిసినవాళ్లెవరూ లేకపోవడం వల్ల అతను కూడా ఒప్పుకొన్నాడు.
వాళ్లిద్దరూ కలిసివెళుతుంటే దారివెంట అందరూ విక్రమసింహునివైపు కళ్లప్పగించి చూడసాగారు. అతడిని ఎంత రహస్యంగా తనతో తీసుకువెళ్లాలనుకున్నా ఆమెకు సాధ్యం కాలేదు.
“ఏమే పుష్పవతీ! ఎవరే ఈ అందగాడు?” అని అడిగిందో స్త్రీ.
చూపుడు వేలిని నోటిమీద ఉంచుకుని.. “హుష్” అన్నది పుష్పవతి.
“ఇతగాడెవరో మన దీవికి కొత్తవాడిలా ఉన్నాడు. మన భాష తెలియదన్న మాటే గానీ, ఇతగాడిలో ఏ లోపమూ లేదు. నాకు కొంచెం సహకరించావంటే మనమిద్దరం, ఇతణ్ని రహస్యంగా తీసుకుపోయి కొద్దిగా సుఖపడదాం. ఈ రహస్యం మన రాణిగారికి గానీ తెలిసిందంటే.. ఇతగాణ్ని మనకు దక్కనివ్వదు” అన్నది పుష్పవతి.
అందుకు రెండో స్త్రీ ఒప్పుకొన్నది. ఎంత కాదనుకున్నా నలుగురి కన్నూ అతడిపై పడనే పడింది. అందరూ పుష్పవతి ఇంటివద్ద పోగుపడ్డారు.
‘ఆ కొత్త పురుషుడు తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలి’ అని నగరంలోని స్త్రీలందరూ పోట్లాటకు కూడా దిగారు. విక్రమసింహుడు మాత్రం తనను మొదటగా పిలిచిన పుష్పవతి ఇంటికే వెళతానని సైగ చేసి చెప్పాడు. మిగతా వారందరూ నిరాశగా వెళ్లిపోయారు.
* * *
విక్రమసింహుని పుష్పవతి తన ఇంటిలోకి తీసుకుపోయి, తాను తినే పచ్చిమాంసం తినమని పెట్టింది. అతడు దాన్ని నిరాకరించి పళ్లు, పాలతో కడుపు నింపుకొన్నాడు.
అటుపై తనతో సంగమించమని పుష్పవతి కోరింది. విక్రమసింహుడు ఆమెను శతవిధాల వారించాడు. కానీ, ఆమె బెదిరింపులకు దిగింది.
ఆ రాజ్యంలో స్త్రీ సర్వస్వతంత్రురాలు. పురుషులందరూ అర్భకులు, కోతిరూపు గలవారు కావడం వల్ల వారికి ఎట్టి అధికారాలూ లేవు. ఆ రాజ్యంలో వ్యభిచారం తప్పుకాదు. అందువల్ల పుష్పవతి తన ప్రియుణ్ని నేరుగా ఇంటికే తీసుకుపోయింది. అతడు వద్దని ఎంతగా చెప్పినా బెదిరించి, ఆశపెట్టి, చివరికి తన దీనత్వాన్ని బయటపెట్టి అతడు ఒప్పుకొనేలా చేసింది.
* * *
కొద్దిరోజులు గడిచాయి.
పుష్పవతి ఇంటిలో అందగాడైన ఓ మహాపురుషుడు ఉన్నాడని రాజ్యాన్నేలే క్రౌంచవతికి తెలిసింది.
“అమూల్యమైన వస్తువులు లభించిన వెంటనే మహారాణికి సమర్పించాలి. పుష్పవతి అలా చేయని నేరానికి, ఆమెను చెరసాలలో వేయండి. ఆ పురుషుణ్ని నా ముందు ప్రవేశపెట్టండి” అని రాణి ఆజ్ఞాపించింది.
విక్రమసింహుడు రాణిగారి ముందు నిలబడ్డాడు.
మహారాణి అతని అందాన్ని చూసి చకితురాలైంది.
“పురుష సింహమా! నీ అందం ముల్లోకాల వారిచేత పొగడదగినది. మీరు మా దేశాన్ని గమనించారు కదా! సుందర పురుష సంయోగం లేని కారణంగా తరతరాలుగా మా జాతి వికృత రూపాన్ని వదిలించుకోలేక సతమతం అవుతున్నది. మీరు మా దురవస్థను పోగొట్టడానికే ఇక్కడ అవతరించారని అనిపిస్తున్నది. దయచేసి మీరు నన్ను భార్యగా స్వీకరించి, ఈ రాజ్యానికి మీవంటి సుందరుడైన ఒక వారసుణ్ని నాకు ప్రసాదించండి” అని కోరింది మహారాణి.
ఆమె కోరికను విక్రమసింహుడు మన్నించాడు. చిరకాలంలోనే రాణి గర్భం దాల్చింది. ఆ రాజ్యంలో గర్భిణులు పురుష సాంగత్యం చేయరు. అందువల్ల “నా చెల్లెలికి కూడా పుత్ర సంతానాన్ని ప్రసాదించు” అని విక్రమసింహుని మహారాణి కోరింది. అలా కొంతకాలం గడిచేసరికి ఆ దీవిలో విక్రమసింహుని వల్ల పెక్కుమంది స్త్రీలు గర్భవతులయ్యారు.
ఇది ఆ రాజ్యంలోని పురుషులకు కంటగింపుగా మారింది. విక్రమసింహుడు వచ్చింది మొదలు తమకు ప్రాధాన్యం తగ్గిపోవడం, తమ భార్యలంతా తమను పురుగుల్లా చూడటం పురుషులను బాధించింది. వారందరూ కలిసి ఎలాగైనా విక్రమసింహుని వధించాలనే నిర్ణయానికి వచ్చారు.
మంచి తరుణం కోసం కనిపెట్టుకున్నారు. ఒకనాడు విక్రమసింహుడు నిద్రపోతుండగా, తాళ్లతో బంధించి, మంచంతో సహా మోసుకుపోయి సముద్రంలో పారేశారు. పీడ విరగడైందని సంతోషిస్తూ ఇళ్లకు తిరిగి వెళ్లారు.
కానీ, విక్రమసింహుడు తప్పించుకున్నాడు. సముద్రంలో నుంచి బయటపడ్డాడు. మొదటిరోజున తనను క్రౌంచపక్షి ఏ చెట్టుమీద అయితే దించిందో ఆ చెట్టువద్దకు చేరుకున్నాడు. అదృష్టం కొద్దీ ఆరోజున ఆ క్రౌంచపక్షి మళ్లీ అక్కడికి వచ్చింది.
త్వరత్వరగా వెళ్లి విక్రమసింహుడు ఆ పక్షి కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. కొద్దిసేపటికి పక్షి యథాప్రకారం ఆకాశంలోకి ఎగిరింది.
దైవప్రేరణ కాబోలు అనిపించేలా క్రౌంచపక్షి ఏ చెట్టుమీదనుంచి అయితే విక్రమసింహుని తీసుకువచ్చిందో ఆ చెట్టుమీదనే తిరిగివెళ్లి వాలింది.
విక్రమసింహుడు చెట్టుదిగి వచ్చేసరికి, అతనికోసం బహుశ్రుతుడు వేచి ఉండటం విక్రమసింహుని విస్మయ పరిచింది.
“మిత్రమా! నువ్వింకా నాకోసం ఇక్కడే వేచి ఉన్నావా? విసుగుచెంది ఈపాటికి ఎటైనా వెళ్లిపోయి ఉంటావేమో అనుకున్నాను” అన్నాడు ఆనందాన్ని ప్రకటిస్తూ.
“నేను వచ్చేసరికి ఇక్కడ సింహం పాదముద్రలు ఉండటం చూసి, నువ్వు చనిపోయి ఉంటావని అనుకున్న మాట నిజమే మిత్రమా! కానీ, వెతగ్గా వెతగ్గా పక్షి రెక్కల మాటునుంచి నువ్వు కిందికి జారవిడిచిన ఉత్తరం కంటపడింది. ఇక్కడివారిని విచారిస్తే ఆ క్రౌంచపక్షి ప్రతి సంవత్సరం ఇదే సమయంలో ఇక్కడికి వస్తుందని తెలిసింది. మరో వారం రోజులు కనుక నువ్వు రావడం ఆలస్యం చేసి ఉంటే, నేను ఆత్మహత్య చేసుకుని ఉండేవాణ్ని” అన్నాడు బహుశ్రుతుడు.
“అటువంటి మాటలనవద్దు” అన్నాడు విక్రమసింహుడు.. మిత్రుని నోటికి తన చేతిని అడ్డుపెట్టి.
“మిత్రమా! నీ మనసు దోచుకున్న పురుషద్వేషిణి జాడ కనిపెట్టాను. నీ మనోరథం తీరనున్నది” అని చెప్పాడు బహుశ్రుతుడు.
“నిజమా! ఇంతకీ ఎక్కడ చూశావు? చిత్రపటంలో చూసినట్లే ఉన్నదా? ఏ రాజ్యపు స్త్రీ? నా గురించి ఆమెకు చెప్పావా లేదా?” ఆసక్తిగా ప్రశ్నించాడు విక్రమసింహుడు.
(వచ్చేవారం.. పురుషద్వేషిణి-2)
అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu Episode 9 ( కాశీ మజిలీ కథలు ) | తిరిగి కలిసిన మిత్రులు
Kasi Majili Kathalu Episode 8 ( కాశీ మజిలీ కథలు ) | విద్యాధరి రాగమంజరి
Kasi Majili Kathalu Episode 7 ( కాశీ మజిలీ కథలు ) | మంత్రిగారి భార్య
Kasi Majili Kathalu Episode 6 ( కాశీ మజిలీ కథలు ) | హేలానగరంలో ప్రవరుడు
Kasi Majili Kathalu Episode 5 | రాముని మెచ్చిన లతాంగి
Kasi Majili Kathalu Episode 4 | చేపమింగిన కంకణం
“Kasi Majili Kathalu Episode 3 | పంజరంలో రామచిలుక”
“Kasi Majili Kathalu Episode 2 | దేవతా వస్త్రాలు”
“Kasi Majili Kathalu Episode 1 | జారిపడ్డ మామిడిపండు”