Kasi Majili Kathalu Episode 12 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : 1930వ దశకంలో మధిర సుబ్బన్న దీక్షిత కవి కాశీమజిలీ కథలను రచించారు. అప్పట్లో పన్నెండు భాగాలుగా వెలువడి, తెలుగు పాఠక లోకాన్ని ఈ కథలన్నీ విశేషంగా అలరించాయి. సినిమాలు, నాటకాలుగా కూడా రూపొంది.. అపూర్వమైన విజయాన్ని నమోదు చేశాయి. కాశీమజిలీ కథల అనుసృజనలో భాగంగా ఇప్పుడు మొదటిభాగం లోనిదే మరో ప్రసిద్ధ కథ.. కీలుగుర్రం.
కళింగ దేశానికి రాజధాని విజయపురం. రాజు శత్రుంజయుడు. అతనికి ఏడుగురు భార్యలున్నారు కానీ, సంతానం లేదు. దాంతో ఒక యోగిని ఆశ్రయించాడు. ఆయన ఇచ్చిన మామిడిపండు వల్ల కళింగ రాణులంతా తొందరలోనే గర్భవతులయ్యారు.
అటువంటి సమయంలో ఒకనాడు రాజు వేటకు వెళ్లాడు. అడవి పందిని వేటాడుతూ సైన్యం నుంచి వేరుపడ్డాడు. ఒంటరిగా చాలాదూరం వెళ్లిపోయాడు. పంది దొరకలేదు కానీ, అతనికి ఒక సుందర ఉద్యానవనం కనిపించింది. స్వర్గలోకంలోని నందనవనమేమో అనిపించేలా ఉన్న ఆ ఉద్యానంలో వనదేవతలా ఒక సుందరాంగి దర్శనమిచ్చింది.
ఆమె సోయగాన్ని చూస్తూనే శత్రుంజయుడు మతి పోగొట్టుకున్నాడు.
“సుందరీ! ఎవరు దేవలోక ఊర్వశివేనా? ఇది నందనవనమేనా?” అని ప్రశ్నించాడు.
ఆమె దూరంగా వెళ్లిపోబోయింది. కానీ, రాజు ఆమెను అనుసరించాడు.
అప్పుడామె.. “రాజా! దుష్యంతుని కథ నేనెరగనిది కాదు. నేను మరో శకుంతలను కాదలుచుకోలేదు. నానుంచి వివరాలేమీ ఆశించకుండా ఇక్కడినుంచి వెళ్లిపోతే బాగుంటుంది” అన్నది క్రీగంట చూస్తూ.
“నీ పలుకుల చేతనే నీకు పెండ్లి కాలేదని తెలుస్తున్నది. నీవు నన్ను పెళ్లాడితే నా సర్వస్వం నీ అధీనం చేస్తాను. నువ్వెలా చెబితే అలా నడుచుకుంటాను” బతిమాలాడు శత్రుంజయుడు.
“రాజా! మగవారి మాటలను నమ్మి మోసపోకూడదు. కానీ, ఆడదాన్నయి పుట్టిన తరువాత ఎవరో ఒక మగవాణ్ని నమ్మక తప్పదు కదా! నేను అవంతీశ్వరుని కూతురిని. నాపేరు సూర్యప్రభ. ఇది నా ఉద్యానవనమే. నీవు నేను చెప్పినట్లు అక్షరాలా వింటానని మాటిస్తేనే, నిన్ను చేపడతాను” అన్నది కులుకులు ఒలకబోస్తూ.
“ఆహా! ప్రేయసీ! నువ్వు చేపడితే కావలసిందేముంది?” అన్నాడు శత్రుంజయుడు చేతులు చాచి, కౌగిలికి పిలుస్తూ.
ఆమె కూడా మనసారా నమ్మినదానివలె అభినయిస్తూ, యమపాశాలతో పోల్చదగిన తన చేతులతో అతనిని గాఢాలింగనం చేసుకున్నది. ఆమె రాజకన్యే అని భ్రమించి, కాళరాత్రి వంటి ఆమెను రాజు తన పురానికి తెచ్చుకున్నాడు.
నిజానికి ఆ సూర్యప్రభ ఒక బ్రహ్మరాక్షసి. ఆ సంగతి తెలియని శత్రుంజయుడు ఆమెను అంతఃపురంలో ప్రవేశపెట్టి, పట్టపురాణి హోదా కల్పించాడు. రాజభోగానికి తగ్గట్టుగా ఆమెకు ప్రతిరోజూ విందుభోజనం అందుతుంది. కానీ, మానవమాత్రులు తినే ఆహారం ఆ రాక్షసస్త్రీకి ఒక్క డొక్కలోకి అయినా సరిపోదు కదా! అందుచేత ప్రతిరోజూ అర్ధరాత్రివేళలో అంతఃపురంనుంచి బయటికొచ్చేది. ఏనుగులు, అశ్వాలు, ఒంటెల్లో ఏదో ఒకదాన్ని చక్కగా తినేసి, ఎముకలు మాత్రం అక్కడే వదిలేసేది. ఏమీ ఎరగని దానిలా మళ్లీ మనిషి వేషం వేసుకుని, శత్రుంజయుని పక్కన శయనించేది.
ఇలా రోజుకో జంతువు మాయమైపోతుండటం ఆ రాజ్యంలో కలకలం రేపింది. రాత్రిపూట గస్తీ తిరగడానికి ఎందరో శూరులను రాజు నియమించాడు. కానీ, వాళ్లెవరూ ఆ బ్రహ్మరాక్షసి ఆగడాలను అరికట్టలేకపోయారు. ఒకనాడు శత్రుంజయుడు తన కొత్తభార్య అయిన సూర్యప్రభ వద్ద ఉండగా, అశ్వశాలలో మరో గుర్రం చనిపోయిందనే వార్త వచ్చింది.
“సూర్యప్రభా! నువ్వు బుద్ధిమంతురాలవు. పదిరోజుల నుంచి జరుగుతున్న ఈ జంతువధను ఆపడానికి ఏదైనా సలహా చెప్పగలవా?!” అని అడిగాడు శత్రుంజయుడు.
తన పంట పండిందని భావించిన ఆ రాకాసి..
“రాజా! నేరస్థులెవరో మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను” అన్నది.
ఆ రాత్రికి మరో ఏనుగును కడుపారా తినేసి, ఎముకలను తక్కిన భార్యల వంటశాలలో దాచిపెట్టింది. మరునాడు శత్రుంజయుణ్ని తీసుకుపోయి వాటిని చూపించి..
“రాజా! నీ భార్యలే నిజమైన రాక్షసులు” అని చెప్పింది.
కళ్లముందు కనిపిస్తున్న సత్యాన్ని రాజు కాదనలేకపోయాడు. వెంటనే భటులను రప్పించి, తన భార్యలు ఏడుమందినీ అడవిలో దించి రమ్మని ఆజ్ఞాపించాడు. రాణుల వెంట ఆ రాక్షసి మనుషులు కూడా వెళ్లారు. అడవిలోకి వెళ్లిన తరువాత రాక్షసి ఆజ్ఞ ప్రకారం రాణుల కనుగుడ్లు పెరికి, దానికి చూపించారు.
పూర్ణ గర్భవతులైన రాణులు నిర్జనారణ్యంలో అనేక ఇక్కట్ల పాలయ్యారు. వారికి ప్రసవ సమయం దగ్గర పడింది. ఒకరోజు మొదటిరాణి ప్రసవించింది. కానీ, అంధురాలైన ఆమె.. తన బిడ్డను సరిగ్గా చూసుకోకముందే ఏదో జంతువు లాక్కుపోయింది. ఇలా ఆరుమంది పిల్లలు పుట్టారు. వారంతా అడవి జంతువుల పాలయ్యారు. అప్పుడు తెలివి తెచ్చుకున్న రాణులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రసవిస్తున్న ఆఖరి రాణి చుట్టూ కంచెవలె నిలిచి, బిడ్డను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఆ బిడ్డను నేలమీద పెట్టకుండా కొంతకాలం పెంచారు.
ఈలోగా అడవిలోని తాపసులెవరో వారిని తమ ఆశ్రమానికి తీసుకెళ్లి, రక్షణ కల్పించారు. ఏడుగురు తల్లుల పాలు తాగి పెరిగిన ఆ కుర్రవాడు అమిత బలవంతుడయ్యాడు. మూడేళ్ల వయసుకే ఏడేళ్ల పిల్లవాడిలో ఉండే బలం అతనికి సమకూరింది.
ఒకనాడు అనుకోకుండా ఆశ్రమానికి ఒక సింహం వచ్చింది. ఆ పిల్లవాడు దానిని తరిమికొట్టాడు. నాటినుంచి అందరూ అతనిని సింహదమనుడు అని పిలవసాగారు. ఊహ తెలిసే కొద్దీ సింహదమనుడు తన తల్లులకు తానే రక్షణగా నిలిచాడు. అడవిలోని కోయల నుంచి విలువిద్యను, ఖడ్గచాలనాన్ని నేర్చుకున్నాడు.
క్రమంగా ఇరవై ఏళ్ల వయసు వాడయ్యాడు. ఒకనాడు అతడు తల్లుల వద్దకు చేరి..
“అమ్మలారా! మనమిలా అడవిలో ఉండటానికి కారణం ఏమిటి? నా తండ్రి ఎవరు?” అని ప్రశ్నించాడు.
పాపం ఆ తల్లులు.. కన్నీళ్ల తెరలమాటున తమ కథనంతా కొడుకుకు వివరించి చెప్పారు. అయితే శత్రుంజయుని కొత్తభార్య బ్రహ్మరాక్షసి అన్న విషయం వారికి తెలియదు. కనుక వారు కూడా చెప్పలేదు. కేవలం తమ భర్త తమను అనుమానించి, ఈ అడవిలో విడిచిపెట్టాడని మాత్రమే తెలియజేశారు. తల్లుల చూపు పోగొట్టినందుకు తండ్రిపై సింహదమనునిలో ద్వేషం రగిలింది. కానీ పితృవధ మహాపాతకం గనుక, ఎలాగైనా అతనికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు.
తల్లులందరినీ కావళ్లలో కూర్చుండబెట్టుకుని, స్నేహితుల సహాయంతో విజయపురానికి చేరుకున్నాడు. అక్కడో ఇల్లు అద్దెకు తీసుకుని, తల్లులను అందులో ఉంచాడు. తండ్రిని కలుసుకునే అవకాశం కోసం నిరీక్షించసాగాడు.
***
అలా ఉండగా ఒకరోజున.. విజయపురంలోని విపణివీధికి ఒక వింతవస్తువు వచ్చింది. దానిని తీసుకువచ్చినవాడు తన వస్తువు గురించి ఇలా చెప్పాడు.
“అయ్యలారా! ఇది కీలుగుర్రం. ఇది నేలమీదే కాదు.. నీటిలో ఈదగలదు. ఆకాశంలో కూడా ఎగిరి వెళ్లగలదు. వీరులెవరైనా దీనిమీద స్వారీ చేసి చూసుకోవచ్చు. కానీ ఒక నియమం ఉంది. ఈ గుర్రం జీనులో ఒక ఖడ్గం ఉంది. దానిని ఎత్తిపట్టి ఖడ్గచాలనం చేసిన వీరునికి మాత్రమే దీనిపై ఎక్కే అర్హత ఉంటుంది!”.
ఆ గుర్రపు శిల్పి మాటలు ఆలకించిన వారిలో చాలామంది ఖడ్గాన్ని ఊడబెరకబోయారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.
‘ఈ కొయ్యగుర్రం ఎగిరేది కాదు, పెట్టేది కాదు.. ఇదేదో మమ్మల్ని మోసగించడానికి తెచ్చావు’ అంటూ వారంతా ఆ శిల్పిపై దాడి చేయబోయారు. అప్పుడు సింహదమనుడు ముందుకు వచ్చాడు. నేర్పుగా ఆ ఖడ్గాన్ని బయటికి తీశాడు. కొద్దిసేపు గాలిలో తిప్పాడు. అటుపైన కీలుగుర్రాన్ని అధిరోహించాడు. గుర్రానికి అమర్చివున్న మరలన్నీ సమయానుసారంగా తిప్పుతూ.. అందరూ చూస్తుండగానే గాల్లోకి ఎగిరాడు. రాజుగారి కోటమీదుగా గుర్రంతో సహా వలయాకారంగా ఎగిరి, మళ్లీ బజారులోకి వచ్చి దిగాడు.
తన కోటమీద ఎగురుతున్న గుర్రాన్ని చూసిన శత్రుంజయుడు, ఆ వీరుడెవరో తెలుసుకోండని తన భటులను పంపాడు. వారు హుటాహుటిన సింహదమనుని చేరుకున్నారు. రాజుగారి ముందు ప్రవేశపెట్టారు.
“మహావీరా! ఎవరు నువ్వు? ఏ ఊరు?” అడిగాడు శత్రుంజయుడు.
“నాపేరు సింహదమనుడు అంటారు ప్రభూ! ఏదైనా కొలువు దొరుకుతుందేమోనని ఇక్కడికి వచ్చాను” అని సమాధానమిచ్చాడు వీరుడు.
“మంచి సమయానికి వచ్చావు. నీవంటి వీరుణ్ని మా కొలువులో నిలుపుకోవడం మాకు ఆనందమే” అన్నాడు శత్రుంజయుడు.
“నాకూ ఇష్టమే మహారాజా! కానీ, నాకు నెలకు వేయివరహాల వేతనం కావాలి” అడిగాడు సింహదమనుడు.
“ఆ.. అంతపెద్ద మొత్తమే! నేను మా ప్రధానమంత్రికి కూడా అంత వేతనం ఇవ్వను. కానీ, నీ వంటి వీరుణ్ని వదులుకుని నష్టపోలేను. కనుక నీవు కోరిన వేతనం ఇస్తున్నాను” అని, సింహదమనుణ్ని కళింగ దేశానికి సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించాడు.
శిల్పి కోరిన మొత్తాన్ని ఇచ్చి పంపి.. కీలుగుర్రాన్ని కూడా సింహదమనునికి బహుమతిగా ఇచ్చాడు శత్రుంజయుడు. సింహదమనుడు పదవిలోకి వచ్చిన తరువాత రాజ్యపు పరిస్థితులు క్రమంగా మెరుగు పడ్డాయి. దేశంలో ఎక్కడా అల్లర్లు, అఘాయిత్యాలు జరగకుండా కళింగదేశం శాంతిధామంలా విలసిల్లసాగింది. కానీ, రాజుగారి కోటలో రోజుకొక్క జంతువు చనిపోవడం మాత్రం ఆగలేదు.
“మహావీరా! ఇన్ని సమస్యలు పరిష్కరించజాలిన వాడివి.. ఈ సమస్యను కూడా నీవే పట్టించుకోరాదూ!” అని అడిగాడు శత్రుంజయుడు.
సింహదమనుడు తన కీలుగుర్రాన్ని అధిరోహించి, కత్తి చేతబట్టి ఆ రాత్రినుంచే జంతుశాలలకు గస్తీ తిరగడం ఆరంభించాడు.
ఆ దెబ్బతో బ్రహ్మరాక్షసికి కాళ్లూచేతులూ ఆడటం మానేశాయి. సింహదమనుని వీరత్వాన్ని గురించి ఆ రాకాసి అంతకుముందే కథలు కథలుగా వినివుంది. అందుచేత అతను గస్తీ తిరుగుతున్న వైపునకు వెళ్లే సాహసం చేయలేకపోయింది.
కానీ ఎన్నిరోజులని ఆకలికి ఆగగలదు?! సింహదమనుని పీడ ఎలాగైనా వదిలించుకోవాలని ఒక పథకం వేసింది.
శత్రుంజయుడు అంతఃపురానికి వచ్చేసరికి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నదానిలా నటించసాగింది. భార్య కష్టాన్ని చూసి, రాజు కంగారుపడ్డాడు. వైద్యులకు కబురుపెట్ట
బోయాడు.
రాకాసి అతణ్ని వారించింది.
“ప్రభూ! నా తలనొప్పిని ఎవ్వరూ తగ్గించలేరు. మీరు సెలవిస్తే దీనికి కారణం చెబుతాను. నాకు భ్రమరవేణి అని ఒక చెల్లెలుంది. మీరు నా ఆరోప్రాణం అయితే, మొదటి పంచప్రాణాలూ నాకు నా చెల్లెలే. అటువంటి నా చెల్లెలు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నిన్న కల వచ్చింది. అప్పటినుంచి ఈ తలనొప్పి పీడిస్తున్నది. ఎవరైనా నా చెల్లెలి క్షేమసమాచారాన్ని తెలుసుకుని వేగంగా వచ్చి నాతో చెప్పగలిగితే చాలు” అని చెప్పింది.
అందుకు శత్రుంజయుడు..
“దేవీ! ఇంత చిన్నపనికి బుర్ర పగలకొట్టుకోవడం ఎందుకు? మన సింహదమనుని పంపిద్దాం. అతగాడైతే ఆకాశమార్గంలో వెళ్లి, పని చక్కబెట్టుకుని వస్తాడు” అని భరోసా ఇచ్చాడు.
వెనువెంటనే సింహదమనునికి కబురు పంపాడు.
“మహావీరా! నీ పరాక్రమాన్ని ఇదివరకే విన్నాను. నువ్వుగాక ఎవ్వరూ అక్కడికి వెళ్లలేరు. ఇక్కడినుంచి దక్షిణదిక్కుగా వెళితే మలయాళదేశం వస్తుంది. అటుపైన లవణ సముద్రం ఉంది. నూరుయోజనాల సముద్రాన్ని దాటివెళితే లంక కనిపిస్తుంది. అక్కడినుంచి నేరుగా ప్రయాణిస్తే.. నూరుయోజనాల పైన మూడు పర్వతాలుంటాయి. వాటిలో మధ్యనున్న పర్వతశిఖరంపైకి ఎక్కితే.. దానికి విశాలమైన రాయి ఒకటి బోర్లించినట్లుగా కనిపిస్తుంది. ఆ రాయిపైన అగ్నిని వ్రేల్చి, ఇప్పుడు నేనిచ్చిన పొడిని దానిలో వేస్తే.. ఆ రాయి పగిలి, లోపలికి దారి ఇస్తుంది. ఆ దారిలో వెళితే నా చెల్లెలి మందిరం కనిపిస్తుంది. దానికి ఈ ఉత్తరం ఇవ్వు. ప్రత్యుత్తరం తీసుకురా” అని మహారాణి హోదాలో బ్రహ్మరాక్షసి ఉత్తరువు ఇచ్చింది.
ఆ ఉత్తరాన్ని, అగ్నిలో వేసే పొడిని తీసుకుని సింహదమనుడు ఆకాశమార్గంలో బయలుదేరాడు. రాజ్యాలు దాటి దక్షిణదిక్కుగా వెళుతున్నాడు.
ఒకానొక పట్టణం సమీపించాడు. ఆ సమయంలో పట్టణపు రాజుగారి కూతురు మణిమంజరి.. తన సౌధంపైన చెలికత్తెలతో ఆటలాడుకుంటున్నది. గాలిలో ఎగిరి వెళుతున్న వీరుణ్ని చూసి, తన వద్దకు రమ్మని హేలగా చేయిచాచి పిలిచింది. సింహదమనుడు ఆ సైగను గ్రహించి మేడపైన తన గుర్రాన్ని దింపాడు.
ఆకాశంలో సుందరాకారుడొకడు ఎగురుతూ పోవడం ఏమిటి? తన దగ్గర వాలడం ఏమిటని మొదట మణిమంజరి విస్తుపోయింది. తటాలున లేచి నిలబడింది. తనను సమీపించిన అతడితో..
“సుందరుడా! నీవు మన్మథునివా? జయంతునివా? వసంతునివా? వారిలో ఏ ఒక్కరూ కాకపోతే మగవారిలో ఇంత సుందరాకారులు ఉంటారంటే నేను నమ్మలేను” అని సాభిప్రాయంగా పలికింది.
అందుకు సింహదమనుడు నవ్వుతూ..
“తరుణీమణీ! నేను వారిలో ఎవరినీ కాను. కేవలం బాటసారిని. నాకు బాగా దాహంగా ఉంది. ఏదైనా తియ్యని పానకం తెప్పించగలవా!” అని ప్రార్థించాడు.
“రాజపుత్రా! నీకు పానకమేమి? అమృతం దొరికే తావు కూడా చెప్పగలను. విను.. శ్రీకూర్మం మీదుగా వెళితే మకరాలయం కనిపిస్తుంది. దానిని దాటితే కదళీవనం కనిపిస్తుంది. దానిని దాటివెళితే కాంచీస్థానం.. అటుపైన పెద్ద చెరువున్నది. ఆ చెరువుకు ఆవలిగట్టున పైడిమెట్ల వెంబడి పైకి ఎక్కితే రెండు బంగారు కొండలు కనిపిస్తాయి. వాటిమీద కొంచెం సేపు విశ్రమించి, పైకి వెళితే శంఖచూడుని ఇల్లు కనిపిస్తుంది. దానిని దాటితే చంద్రలోకం వస్తుంది. అందులో వెతికితే అమృతపు బావి ఉంది. నీకు సమర్థత ఉంటే ఆ బావిలో అమృతం తాగి దప్పిక తీర్చుకోవచ్చు” అన్నది.
నిగూఢమైన శృంగార సంకేతాలతో సాగుతున్న ఆ సంభాషణలు విన్న మణిమంజరి చెలికత్తెలు అక్కడినుంచి పక్కకు తప్పుకొన్నారు.
“వన్నెలాడీ! నీవు చెప్పిన బావి వద్దకు మేము స్వతంత్రంగా పోవచ్చునా?” అని సింహదమనుడు నవ్వుతూ ప్రశ్నించాడు.
“మానసాన్ని గెలిచిన వారికే గానీ, ఇతరులకు అట్టి స్వాతంత్య్రం లేదు” అని జవాబిచ్చింది మణిమంజరి.
అప్పుడా పురుషపుంగవుడు.. ఆమెను అక్కడే ఉన్న హంసతూలికా తల్పంపైకి చేర్చి, పెదవులను చుంబించాడు.
(వచ్చేవారం.. కీలుగుర్రం-2)
అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
“Kasi Majili Kathalu Episode 11 ( కాశీ మజిలీ కథలు ) | పురుషద్వేషిణి- 2”
Kasi Majili Kathalu Episode 10 ( కాశీ మజిలీ కథలు ) | పురుషద్వేషిణి
Kasi Majili Kathalu Episode 9 ( కాశీ మజిలీ కథలు ) | తిరిగి కలిసిన మిత్రులు
Kasi Majili Kathalu Episode 8 ( కాశీ మజిలీ కథలు ) | విద్యాధరి రాగమంజరి
Kasi Majili Kathalu Episode 7 ( కాశీ మజిలీ కథలు ) | మంత్రిగారి భార్య
Kasi Majili Kathalu Episode 6 ( కాశీ మజిలీ కథలు ) | హేలానగరంలో ప్రవరుడు