Yogi Adityanath : సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు (Samajwadi Party Chief), మాజీ సీఎం (Ex CM) అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కుమార్తెపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (yogi Adityanath) ఖండించారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. నేతల కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకురావొద్దని హితవు పలికారు. అఖిలేష్ యాదవ్ కుమార్తెపై అసభ్యకరమైన కామెంట్స్తో మార్ఫింగ్ చేసిన చిత్రాలను కొందరు దుండగులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ దీనిపై స్పందించారు. అఖిలేష్ యాదవ్ కుమార్తె లక్ష్యంగా కొందరు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఆ పోస్టులు తన దృష్టికి వచ్చాయన్నారు. నిందితులపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆడపిల్లలు అందరికీ సమానమేనని, వారిని గౌరవించాలని సూచించారు. ప్రతి ఇంట్లో కుమార్తె, సోదరి ఉంటారని, ఇతరులను కూడా అదే భావనతో చూడాలని అన్నారు. అఖిలేష్ కుమార్తె తనకు కుమార్తెతో సమానమని చెప్పారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.