Kasi Majili Kathalu Episode 15 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : గృహస్థు అయినవాడు అతిథి లేకుండా ఒంటరిగా భోజనం చేయకూడదు. ఒంటరిగా ఉండటానికి నిశ్చయించుకున్న యతులైనా సరే.. తోడులేకుండా తీర్థయాత్ర చేయకూడదు. ఈ నియమాన్ని అనుసరించి తనతోపాటు కాశీదాకా తోడురమ్మని గోపాలుని పిలిచాడు యతి అయిన మణిసిద్ధుడు. ఆయన దగ్గర మహిమగల మణి ఉన్నది. ఆ మణిని ముట్టుకుని ధ్యానం చేస్తే, ప్రపంచంలోని అన్ని విషయాలూ తెలిసిపోతాయి. మణి సహాయంతో కాశీమజిలీల్లో ఎదురయ్యే ప్రతి కథనూ గోపాలునికి వివరంగా చెబుతున్నాడు మణిసిద్ధుడు.
కాంచీపురాన్ని విష్ణుచిత్తుడనే రాజు పాలించేవాడు. అతడు చాలాకాలం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. ఎన్ని సంబంధాలు వచ్చినా ఎప్పటికప్పుడు ఏవో సాకులు చెప్పి తిరగగొట్టేవాడు.
ఒకనాడు మంత్రి అయిన దీర్ఘదర్శి..
“మహారాజా! దేశమంతా ఇప్పుడు యువరాజు కోసం నిరీక్షిస్తున్నది. మీరింకా ఆలస్యం చేయడం మంచిది కాదు. మీ వివాహం వెంటనే జరిగిపోవాలి” అన్నాడు.
ఎప్పటిలానే నిరాసక్తంగా తల పక్కకు తిప్పుకొన్నాడు మహారాజు.
“దీర్ఘదర్శీ! నువ్వు బుద్ధిమంతుడివి కదా! నీకు నేనెక్కువగా చెప్పాల్సిన పని లేదు. లోకంలో అనేకమంది స్త్రీలున్నారు. కానీ, చక్కని పిల్లకు మంచినడత ఉండదు. నడత ఉన్న స్త్రీలో అహంకారం ఉంటున్నది కానీ, ప్రేమ కనిపించడం లేదు. భర్తను ప్రేమించే గుణం ఉన్న భామకు చక్కదనం లోపిస్తూ ఉంటుంది. ఏం చేద్దాం?!” అని ప్రశ్నించాడు.
“అది కాదు మహారాజా!” అంటూ.. దీర్ఘదర్శి ఏదో సర్దిచెప్పబోయాడు. కానీ విష్ణుచిత్తుడు వినిపించుకోలేదు.
“నాకు పెళ్లి చేయదలుచుకుంటే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ ఉన్న చిన్నదానిని తీసుకురా. లేదంటే నేను పెళ్లి చేసుకోను” అని సింహాసనం మీదినుంచి లేచి వెళ్లిపోయాడు.
మహారాజుకు తగిన సంబంధం అన్వేషించడం కోసం దీర్ఘదర్శి నాలుగువైపులకూ దూతలను పంపాడు. అనేకమంది మహారాజులు తమ పుత్రికలను విష్ణుచిత్తునికి ఇచ్చి పెళ్లి చేయాలని ఉవ్విళ్లూరారు. త్వరలోనే అన్ని దేశాల నుంచి రాజకన్యల చిత్రపటాలు కంచికి చేరుకున్నాయి.
అనేక వడపోతల తర్వాత మహారాజుకు కొన్ని పటాలను చూపాడు దీర్ఘదర్శి. వాటిలో పాండ్యదేశపు యువరాణి సుశీల పటాన్ని చూసిన వెంటనే, విష్ణుచిత్తుడు మనసు పారేసుకున్నాడు. పెళ్లి రాయబారాలు నడిచాయి. శుభముహూర్తం నిర్ణయమైంది. కులాచారం ప్రకారం పెళ్లి వేడుక నిర్వహించడానికి, తన కత్తిని ఇచ్చి దీర్ఘదర్శిని పాండ్యదేశానికి పంపాడు విష్ణుచిత్తుడు.
ఒకపక్క తనకు వివాహ ప్రయత్నాలు జరుగుతుంటే.. పాండ్య రాకుమారి సుశీల, గురుదక్షిణ సమర్పించడానికి స్వయంగా బయలుదేరింది. కానుకలతో నింపిన పళ్లేలను గురువు ముందు పెట్టింది. కానుకల వైపు కన్నెత్తి చూడకుండా..
“వాటి బదులుగా నిన్నే నాకు సమర్పించుకో!” అన్నాడు గురువు.
“శివ శివా!” అని చెవులు మూసుకున్నది సుశీల.
“నాకు చదువు నేర్పి తండ్రితో సమానం అయ్యావు కదా?! ఇటువంటి కోరిక కోరవచ్చునా? నీకు నోరెలా వచ్చింది? ఇష్టమైతే ఈ కానుకలు తీసుకో లేదా పారబోసుకో!” అంటూ తెచ్చినవాటిని నేలమీద విసిరేసి అక్కడినుంచి వెళ్లిపోయింది.
అలా తిరస్కారానికి గురైన గురువు సుశీలమీద పగబట్టాడు. కోటలో పెళ్లి వేడుకలు జరుగుతుండగా, కాంచీపురానికి వెళ్లాడు. విష్ణుచిత్తుడిని కలుసుకున్నాడు. పండితుడు, మంచివాడనుకుని మహారాజు అతడికి మర్యాదలు చేశాడు.
“అయ్యా! మీరాజు కూతురు సుశీలను ఎరుగుదురా? ఆమె గుణశీలాలు ఎటువంటివో చెప్పగలరా?” అని ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నకోసమే కాచుకుని ఉన్న కపట గురువు..
“రాజా! ఆమెకు చదువు చెప్పినవాడిని నేనే. ఆమెను గురించి ఆమె తల్లిదండ్రులకంటే నాకే బాగా తెలుసు. ఆమెకు అప్పుడప్పుడూ మూర్ఛరోగం వస్తుంది. ఆమె చిత్రపటాన్ని కూడా రంగులు బాగా వేసి మాయచేశారు. చిత్రంలో కనిపించేంత అందగత్తె కాదు. అనకూడదు కానీ, మీవంటివారికి ఆ చిన్నది తగినది కాదు” అని ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పాడు.
ఆ మాటలు విన్న విష్ణుచిత్తుడు కోపోద్రిక్తుడయ్యాడు.
“ఆ పాండ్యరాజు నన్నెంత మోసం చేశాడు. రోగాన్ని కప్పిపెట్టి తన కూతుర్ని నాకు కట్టబెట్టాడు. దీనికి తగిన ప్రాయశ్చిత్తం చేస్తాను. నేనింక సుశీల ముఖమైనా చూడను” అని ప్రతిజ్ఞ చేశాడు.
తన పథకం పారినందుకు కపట గురువు సంతోషించాడు. అంతటితో ఆగకుండా..
“మహారాజా! విక్రమసేన మహారాజు కూతురు దేవయాని నీకు తగినది. మీరు సమ్మతిస్తే ఈ సంబంధం నేను కుదర్చగలను” అన్నాడు.
పాండ్యరాజు మోసం చేశాడని నమ్మిన విష్ణుచిత్తుడు వెంటనే సమ్మతించాడు. ‘నిష్కారణమైన క్రోధం అనర్థహేతువు’ అన్న మాట విష్ణుచిత్తుని విషయంలో అక్షరాలా నిజమైంది.
ఆ తరువాత కొంతకాలానికే సుశీల పెద్దసారెలతో మెట్టినింటికి కాపురానికి వచ్చింది. విష్ణు చిత్తుడు ఆమెకు ఒక భవనాన్ని కేటాయించాడు. కానీ, ఆమె ముఖం ఎన్నడూ చూడలేదు. పతి రాకకోసం ఎదురుచూస్తూ, సుశీల క్షణమొక యుగంగా గడుపుతున్నది.
ముందే మాటిచ్చినట్లుగా కపటగురువు దేవయానితో విష్ణుచిత్తునికి వివాహం జరిపించాడు. ఆమెను కాపురానికి తీసుకువచ్చేముందు..
“రాజా! మీకు ఇదివరకు పెళ్లికాలేదని విక్రమసేనునితో చెప్పాను. లేదంటే ఆయన తన కూతురైన దేవసేనను నీకిచ్చి పెళ్లి చేయడు. అందువల్ల నీ పాతభార్యను తీసుకెళ్లి అడవిలో దించేయి” అని సలహా ఇచ్చాడు.
సుశీలపైన అకారణ ద్వేషాన్ని పెంచుకున్న విష్ణుచిత్తుడు అలాగే చేశాడు. కొత్తభార్య తన కళ్లకు అపురూపంగా కనిపించకపోయినా, మనసు సరిపెట్టుకుని ఆమెతో కాపురం కొనసాగించాడు. సుశీల ఏమైపోయిందో అతనికి పట్టలేదు.
* * *
ఒక ఏడాదికాలం వేగంగా గడిచిపోయింది.
ఒకనాడు విష్ణుచిత్తునికి వేటమీద అభిలాష పుట్టింది. మంత్రి అయిన దీర్ఘదర్శితో కలిసి రాజు యథేచ్ఛగా వేటసాగిస్తుండగా.. ఆకాశం ముసురుపట్టి, గాలివాన ప్రారంభమైంది. సేనలన్నీ చెల్లాచెదురై పోయాయి. రాజు, మంత్రి ఒక చెట్టుకింద నిలబడ్డారు. గాలివానకు ఆ భారీచెట్టు కొమ్మలు విరిగి పడసాగాయి.
అప్పుడు దీర్ఘదర్శి..
“మహారాజా! ఈ ప్రాంతంలో ఒక భవంతిని చూసిన జ్ఞాపకం. అందులో ఒక రాకుమారి నివసిస్తున్నది. ఆమె మార్గస్థులకు సహకరిస్తుంటుంది. నాతో రండి, అక్కడికి వెళదాం” అంటూ తీసుకుపోయాడు.
సుశీలపై ఆదరం లేని విష్ణుచిత్తుడు ఆమెను అడవిలో దింపి వేయమన్నాడు. ఆ తర్వాత ఆమె క్షేమాన్ని గురించి పట్టించుకోలేదు. దీర్ఘదర్శి నిజంగానే దూరదృష్టి కలవాడు. ఆమెకు అడవిలో ఒక భవంతి కట్టించి, అందులో సకల సదుపాయాలు కల్పించాడు. ఆవేళ విష్ణుచిత్తుడు వేటకు వెళదామనగానే ఆ అడవికే తీసుకువచ్చాడు. గాలివాన మాత్రం దైవానుగ్రహం వల్ల వచ్చిపడింది.
విష్ణుచిత్తుడు, దీర్ఘదర్శి ఆ భవంతిలో ప్రవేశించారు. దీర్ఘదర్శి ముందుగానే కబురు పంపించడం వల్ల, సుశీల మేడంతా చక్కగా అలంకరించింది. దీపాలు వెలిగించి ఉంచింది.
ముసురుపట్టిన అడవిలో దీపాల మధ్య వెలిగిపోతున్న మేడను చూసి విష్ణుచిత్తుడు ఆశ్చర్యపోయాడు.
“మంత్రీ! ఈ నట్టడవిలో ఇంత చక్కని ఇల్లు కట్టించిన చిన్నది ఎవరు? ఏ దేశానికి చెందినది? ఎవరి కూతురు? భర్త ఉన్నాడా?” అని ప్రశ్నించాడు.
“రాజా! ఆమెది మలయాళ దేశమని విన్నాను. మిగిలిన వివరాలు తెలియవు. ఆమె ఎవరైనా ఈ రాత్రికి మనకు భోజనం, పొడిదుస్తులు ఇస్తే చాలును కదా!” అని సమాధానమిచ్చాడు దీర్ఘదర్శి.
వారలా మాట్లాడుకుంటున్నంతలో ఎవరో ప్రతీహారులు గొడుగులతో వచ్చారు. ఇద్దరినీ గౌరవంగా లోనికి తీసుకువెళ్లి, పన్నీటి స్నానాలు చేయించారు. వేట బడలిక తీరి హాయి కలిగింది వారికి. కట్టుకోవడానికి పట్టువస్ర్తాలు అందించారు. వంటశాలలోనికి దారి చూపించారు.
అక్కడ బంగారు పళ్లేలు, పీటలు అమర్చి ఉన్నాయి. ఇద్దరూ సుఖంగా కూర్చుని ఉండగా.. ఆ గదిలో గుప్పున కస్తూరి వాసనలు చెలరేగాయి. మువ్వల పట్టీల సవ్వడులు అల్లన వినవచ్చాయి. జలతారు పట్టుచీర గరగరల నడుమ, జరీపూల అంచు రవిక తొడిగి, మెరుపుతీగలా సుశీల ఆ గదిలోకి వచ్చింది.
ఆమె వడ్డన చేస్తున్నంతసేపూ మహారాజు చూపు తిప్పుకోలేక పోయాడు. తన పథకం పారినందుకు దీర్ఘదర్శి సంతోషించాడు. అతికష్టం మీద భోజనం పూర్తిచేశాడు రాజు.
భోజనాలు పూర్తవుతూనే శయ్యలు ఏర్పాటయ్యాయి. దీర్ఘదర్శి హాయిగా నిద్రపోయాడు. మదన పీడితుడైన రాజుకు మాత్రం నిద్రపట్టలేదు. కొద్దిగా రాత్రి గడవనిచ్చి, సుశీల ఎక్కడైనా కనిపిస్తుందేమోనని తన గది బయట తచ్చాడసాగాడు.
అతని కోసమే ఎదురు చూస్తున్నదేమో.. సుశీల కూడా ఎక్కువ ఆలస్యం చేయకుండా అక్కడ ప్రత్యక్షమైంది.
ఆమెను చూస్తూనే..
“కొంచెం దాహం కావాలి” అడిగాడు రాజు.
అందుకామె.. “తియ్యని దాహం కావాలా? పుల్లనిదా?!” అని ప్రశ్నించింది. అతడు తియ్యనిదే అడిగాడు.
చక్కెర కలిపిన పాలు వెండిచెంబులో తెచ్చింది సుశీల.
“తీయని రుచికి దీనికంటే అధరమే కానీ, నావద్ద అధికం లేదు” అన్నది సిగ్గుపడుతూ.
“యువతీ! నాకు అధరమే కావాలి” అన్నాడు మహారాజు కన్నుగిలిపి.
వెనువెంటనే కోపాన్ని ప్రదర్శించింది సుశీల.
“అయ్యా! తమరేదో పొరబడినట్లున్నారు. నేను అధరం అన్నది ‘తక్కువ రుచి కలది’ అన్న అర్థంలో..” అని సరిచేసింది.
“అవునా! నేనింకా పెదవి కాబోలనుకున్నాను. అతిథిగా వచ్చినవాడికి ఇస్తానని చెప్పినవాటిని ఇవ్వకుండా దాటేయడం మర్యాదేనా?” అంటూ ఆమెతో సరాగాలకు దిగబోయాడు.
“వ్రతం చెడ్డా ఫలం దక్కాలి. మగవారి మాటలు నీటిమీద రాతలని కూడా అంటారు. మొదట మురిపించి, అవసరం తీరిన వెనుక పలకరించకుండా పోతే నేనేం కావాలి?!” అన్నదామె కన్నులు వాల్చి..
అతడు చప్పున ఆమె చేతిని అందుకున్నాడు.
“నేను అటువంటి వాడిని కాను. ఒకసారి చేపట్టిన తరువాత విడువను” అన్నాడు.
ఎండతాపానికి గురైన వాడికే చెట్టునీడ సుఖకరంగా ఉంటుంది. దైవోపహతుడై దుఃఖాన్ని పొందినవాడు కష్టాలన్నిటినీ దాటిన తరువాత పొందే సుఖమే మిక్కిలిగా హాయి గొలుపుతుంది. సౌందర్య ప్రేమికుడైన విష్ణుచిత్తుని అన్వేషణ సుశీల పొందుతో ఫలించింది. భర్తకు దూరమైన సుశీల కష్టం ఆనాటితో పూర్తిగా తీరింది. కొద్ది కాలంపాటు లోకాన్ని మరిచి వాళ్లిద్దరూ సుఖించారు. సుఖలాలస ఎటువంటి వారినైనా కర్తవ్యం మరిచిపోయేలా చేస్తుంది. వేటకు వెళ్లిన భర్త ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆయనను వెతికించడానికి దేవయాని సైనికులను పంపింది. వార్తను అందుకున్న విష్ణుచిత్తుడు, తనతోపాటు కోటకు రమ్మని సుశీలను ఆహ్వానించాడు.
“మహారాజా! ఇప్పుడు మీకు కబురు పంపింది ఎవరు? మీకు భార్యలెందరు?! వారితో మీరు ప్రేమగానే మెలగుతారా? పిల్లలున్నారా?” అని ప్రశ్నించింది సుశీల.
“యువతీ! నాకు ఇద్దరు భార్యలున్నారు. మొదటిభార్య గురించి చెప్పనక్కరలేదు. రెండోభార్య దేవయాని. నేనంటే ఆమెకు మక్కువే కానీ, అంతగా చక్కనిది కాదు. నీతో సరిపోలదు. సంతానం ఇంకా కలగలేదు. నీగురించి చెప్పు. నాతో రావడం నీకిష్టమేనా?” అడిగాడు విష్ణుచిత్తుడు.
“పెద్దభార్య విషయం తలపెట్టనక్కర లేదంటారేమిటి? ఆమె ఏదైనా తప్పు చేసిందా? ముందు ఈ విషయం తేల్చి చెబితే కానీ, నా గురించి మీకు చెప్పలేను” అన్నది సుశీల.
విష్ణుచిత్తుడు నిట్టూర్పు విడిస్తూ.. “తన్వీ! ఆమె పేరు సుశీల. పాండ్యరాజు కూతురు. దాని తండ్రి మోసంచేసి మా పెళ్లి చేశాడు. ఆమెకు మూర్ఛరోగం ఉన్నదట. నాకు పంపిన చిత్రపటం చూస్తే అచ్చంగా నీ పోలికలో ఉంటుంది. కానీ, అనాకారి అని విన్నాను” అన్నాడు.
“విన్నారా.. అంటే మీరామెను చూడలేదా? చూడకుండానే నేరం మోపారా?!” అడిగింది సుశీల కన్నీళ్లను దాచుకుంటూ.
“ప్రత్యక్షంగా చూడవలసింది ఏముంది?! చిన్ననాటినుంచి ఆమెకు విద్యనేర్పిన గురువే నాకు స్వయంగా చెప్పాడు” అని జరిగిన సంగతంతా పూసగుచ్చినట్లు చెప్పాడు విష్ణుచిత్తుడు.
“ఆ గురువు కపట గురువు కావచ్చు కదా! అతను చెప్పినదంతా యథార్థం కాకపోవచ్చు కదా! స్వయంగా చూడకుండా ఆమెమీద ఎలా నేరం మోపగలిగారు?!” అని ప్రశ్నించింది సుశీల.
ఆ మాటతో విష్ణుచిత్తుడు మ్రాన్పడిపోయాడు. కొద్దిసేపటి తరువాత తన తప్పును గుర్తించినట్లు ఆయన ముఖ కవళికలే చెబుతున్నాయి.
“మహారాజా! సుశీల నాకు స్నేహితురాలే! తన గురువు ఆమెను కామించాడని.. తాను ఛీ కొడితే తనపై పగబట్టాడని నాతో చెప్పుకొని బాధపడింది”.. అప్పటికి కూడా తానెవరో సుశీల రాజుకు చెప్పలేదు.
ఆ మాటవింటూనే నిలువునా నీరై..
“ఎంత పొరబాటు చేశాను?! నిరపరాధి అయిన స్త్రీపై నిందమోపి, ఎంత కళంకం తెచ్చుకున్నాను?” అని చింతించసాగాడు విష్ణుచిత్తుడు.
సుశీల అతడిని ఓదార్చి.. “మహారాజా! మీరు కోరితే ఇప్పుడే మీ భార్యను చూపగలను. ఆమె ఎవరోకాదు.. నేనే!” అని చెప్పింది.
విష్ణుచిత్తుడు పరమానంద భరితుడయ్యాడు. సుశీలతో సహా కోటకు తరలివెళ్లాడు. ఇద్దరు భార్యలకూ ఏలోటూ రానీయకుండా చూసుకున్నాడు. కాలం హాయిగా, సుఖంగా గడిచిపోయింది. సుశీల – విష్ణుచిత్తులకు ఒక కుమారుడు కలిగాడు. అతడికి కామపాలుడు అని పేరుపెట్టారు. దీర్ఘదర్శి కుమారుడైన బుద్ధిసాగరునితో కలిసి కామపాలుడు విద్యాభ్యాసం చేశాడు. వాళ్లిద్దరూ ప్రాణస్నేహితులయ్యారు. యవ్వనంలో అడుగుపెట్టారు.
(వచ్చేవారం.. శరభసాళువం)
అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu Episode 14 ( కాశీ మజిలీ కథలు ) |ధీమంతుడు
Kasi Majili Kathalu Episode 13 ( కాశీ మజిలీ కథలు ) | కీలుగుర్రం -2
Kasi Majili Kathalu Episode 12 ( కాశీ మజిలీ కథలు ) | కీలుగుర్రం
“Kasi Majili Kathalu Episode 11 ( కాశీ మజిలీ కథలు ) | పురుషద్వేషిణి- 2”
Kasi Majili Kathalu Episode 10 ( కాశీ మజిలీ కథలు ) | పురుషద్వేషిణి
Kasi Majili Kathalu Episode 9 ( కాశీ మజిలీ కథలు ) | తిరిగి కలిసిన మిత్రులు
Kasi Majili Kathalu Episode 8 ( కాశీ మజిలీ కథలు ) | విద్యాధరి రాగమంజరి