Kasi Majili Kathalu Episode 17 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాంచీపురాన్ని ఏలే విష్ణుచిత్తుని కుమారుడు కామపాలుడు. అతడు మంత్రి కుమారుడైన బుద్ధిసాగరునితో కలిసి దేశాటన చేస్తున్నాడు. మధ్యార్జునంలో భేరుండపక్షిని సంహరించి, సుగుణావతిని వివాహం చేసుకున్నాడు బుద్ధిసాగరుడు. శ్రీరంగపురంలో శరభ సాళువాన్ని తెలివిగా మట్టుపెట్టి, యువరాణి పద్మావతిని పెళ్లాడాడు కామపాలుడు. మిత్రులిద్దరూ మళ్లీ దేశాటనంలో పడ్డారు. చంద్రగుప్తమనే పట్టణంలో చిత్రసేనను చూసి, కామపాలుడు మనసు పారేసుకున్నాడు. ఆమె కామపాలునికి ఒక ప్రేమలేఖ రాసింది.
“రాక్షస వివాహంలో మోసం ఉంటుంది. ఈ రాజు కంటే మనమే బలవంతులం అయినప్పటికీ, యుద్ధానికి తలపడితే జయాపజయాలు ఎవరివో చెప్పలేం. అలాగని ఆమెనే ఇల్లువిడిచి లేచిపోయి రమ్మంటే.. వచ్చేదారిలో ఎవరైనా చూస్తే మొదటికే మోసం వస్తుంది. కనుక ఆమె చెప్పిన మార్గాలు రెండూ మంచివి కావు” అన్నాడు బుద్ధిసాగరుడు.
“మరేం చేయమంటావు?” అడిగాడు కామపాలుడు.
అప్పుడు బుద్ధిసాగరుడు చెప్పిన విషయాలనే ఒక ఉత్తరంలో రాసి.. పూలబంతిలో కుక్కి, మేడపైకి విసిరేశాడు కామపాలుడు. ఆ ఉత్తరంలో ఉన్న విషయాలను చిత్రసేన ఇలా చదువుకుంది..
“చిత్రసేనా! నీ హృదయంలోని సంతాపాన్ని వింటే నా గుండె తల్లడిల్లిపోతున్నది. మదనుడు నిన్ను ఏ ములుకులతో బాధిస్తున్నాడో, వాటితోనే నన్ను కూడా వేధిస్తున్నాడు. నీ అందం నా డెందాన్ని లాక్కుపోయింది. మనం కలుసుకునేదాకా దాన్ని నీ దగ్గరే జాగ్రత్తగా దాచిపెట్టు. ఇప్పుడు నీవు రాసిన రెండు పద్ధతులూ నా మనస్సుకు నచ్చలేదు. వీలుచేసుకుని, నేను నీ అంతఃపురానికే వస్తాను. అంతవరకూ ఓపిక పట్టు”.
ఆ ఉత్తరాన్ని చదువుకున్న చిత్రసేన అంతఃపురానికి తిరిగివెళ్లి, కామపాలుని రాకకోసం దినమొక యుగంగా కాలం వెళ్లబుచ్చసాగింది.
ఆమె తండ్రి అయిన చంద్రగుప్త మహారాజు తాలూకు అధికార విశేషాల భోగట్టా అంతా సేకరించాడు బుద్ధిసాగరుడు. అతడు సూర్యప్రతాపుడనే రాజుకు సామంతుడని తెలిసింది.
మిత్రులిద్దరూ సూర్యప్రతాపుని రాజధానికి వెళ్లాడు. అక్కడ కొన్ని దినాలుండి, బుద్ధిసాగరుడు తన బుద్ధిబలంతో సూర్యప్రతాపుని మెప్పించాడు. అతనితో.. “మీకేం కావాలో కోరుకోండి” అనిపించుకున్నాడు.
“మీ మూలబలము, బిరుదులు, శిబిరాలు కొన్నిరోజులపాటు మాతో ఉండేలా ఆజ్ఞాపించండి” అని కోరాడు బుద్ధిసాగరుడు.
సూర్యప్రతాపుడు అంగీకరించాడు.
వాటితో సహా మిత్రులిద్దరూ చంద్రగుప్త పట్టణానికి వెలుపల విడిదిచేశారు. సామంతుడు కనుక, చంద్రగుప్తుడు తన చక్రవర్తిని చూడటానికి వచ్చాడు. అక్కడ బుద్ధిసాగరుడే కపట వేషంతో సూర్యప్రతాపునిగా కనిపించాడు. చంద్రగుప్తుడు తన చక్రవర్తిని అంతవరకూ చూడకపోవడం వల్ల పోల్చుకోలేక పోయాడు. సామంతుల లక్షణాన్ని అనుసరించి, తన కిరీటాన్ని, కటారును బుద్ధిసాగరుని పాదపీఠంపై పెట్టాడు.
అప్పుడు కపట వేషంలో ఉన్న బుద్ధిసాగరుడు.. “చంద్రగుప్తా! నీవు మాకేమైనా కప్పం కట్టవలసి ఉందా? బకాయిలన్నీ చెల్లించినట్లేనా?!” అని గంభీరంగా ప్రశ్నించాడు.
“దేవా! నేనెప్పుడూ బకాయి పెట్టేవాడిని కాను. కావాలంటే ఇప్పుడే మా కోశాధికారిని పిలిచి లెక్కలు చూపిస్తాను” అన్నాడు చంద్రగుప్తుడు.
“అక్కరలేదు. నీ నిజాయతీ నాకు తెలిసినదే. అయినా ఇప్పుడు మేము దేశాటనకు వెళుతున్నాం. నీనుంచి ఒక చిన్న సహకారం ఆశించి, ఇక్కడ విడిది చేశాం” అన్నాడు బుద్ధిసాగరుడు.
అందుకు చంద్రగుప్తుడు వినయం ప్రదర్శిస్తూ.. “ఆనతివ్వండి దేవా! నేను మీ దాసుడను” అన్నాడు.
“మరేమీ లేదు. మా దేశాటనలో మేమెన్నో అరణ్యమార్గాలను దాటవలసి రావచ్చు. నేనెంత వద్దని చెప్పినా మాతోపాటు మా ప్రియభార్య కూడా వచ్చింది. ఆమెను నీ దగ్గర విడిచి వెళ్లాలనుకుంటున్నాను. నీ అభిప్రాయం..” అని అర్ధోక్తిలో ఆపాడు బుద్ధిసాగరుడు.
చంద్రగుప్తుడు తన అతిమంచితనాన్ని రంగరిస్తూ.. “దేవా! నేను మీ భృత్యుడిని. ఈ మీ భృత్యుడికి ఒక కుమార్తె ఉన్నది. మీరు తిరిగివచ్చే దాకా రాణిగారు ఆమె వద్ద క్షేమంగా ఉండ గలరు” అన్నాడు.
కపట వేషంలో ఉన్న బుద్ధిసాగరుడు, తన గాంభీర్యాన్ని చెడగొట్టుకోకుండా తల ఊపి సరేనన్నాడు.
కామపాలుడు స్త్రీ వేషాన్ని ధరించి, పల్లకీ ఎక్కి దర్జాగా చిత్రసేన అంతఃపురంలోకి వెళ్లాడు. పోతుటీగనైనా పరీక్ష చేయకుండా కూతురి వద్దకు చేరనీయని చంద్రగుప్తుడు.. స్త్రీ వేషంలోని కామపాలుని సంగతి కనిపెట్టలేకపోయాడు. పైగా.. “రాణిగారు ఆ అంతఃపురంలో ఉన్నన్ని రోజులూ ఎవరూ ఆ ఛాయలలోనికైనా వెళ్లకూడదు” అని ఆజ్ఞాపించాడు.
చిత్రలేఖ అంతఃపురంలోకి స్త్రీ వేషంలో కామపాలుడు అడుగుపెట్టిన వెంటనే ఆ మందిరం తలుపులు మూసివేశారు.
తన మనోనాథుణ్ని ఆడవేషంలో చూసి, చిత్రసేన మురిసిపోయింది.
“భలే భలే! మన్మథుడు పాపం మీతో పోటీపడలేక, మిమ్మల్నిలా మార్చినట్లున్నాడు” అని నవ్వింది.
“ప్రేయసీ! కాముడికి నన్ను ఆడదాన్నిగా చేయడం ఓ లెక్కా?! సకల జగత్ప్రభువైన శంకరుడినే అతగాడు సగము మగువగా మార్చివేశాడు. ఇదంతా మీ ఆడవారి మహిమే కదా!” అన్నాడు కామపాలుడు ఆమెను కౌగిలిలో ఒడిసిపడుతూ.
ఇతరుల ఊహకు కూడా అందని ఏకాంతం ఆ జంటకు లభించింది. వారిమధ్య పగళ్లు రాత్రులనే భేదాలు చెరిగిపోయాయి. వారి కౌగిళ్లలో మూడుమాసాల కాలం మూడుపూటల వలె కరిగి పోయింది.
* * *
ఈలోగా బుద్ధిసాగరుడేం చేశాడంటే.. తాను ధరించిన కపటరాజు వేషం తీసేశాడు. తానెప్పుడు కోరినా సైన్యమంతా మళ్లీ రావాలని ఆనతిచ్చి, వారిని నిజస్థానాలకు పంపివేశాడు.
తానొక బల్జీవేషం ధరించాడు. దూదిని నేసేందుకు తగిన గడలు, ఏకులతో నగరంలో ప్రవేశించాడు.
“విచిత్రమైన పరుపులను కుట్టి సరసమైన ధరలకు అందిస్తా” అని ప్రచారం చేసుకున్నాడు. చిత్రసేన మందిరం దిగువన కోటగోడను ఆనుకుని బస ఏర్పాటు చేసుకున్నాడు.
నగరంలోని ప్రజలంతా పాత పరుపులనే కాకుండా కొత్తపరుపులను కూడా చించుకుని, తమ ఇళ్లలో దూది తీసుకొచ్చి బల్జీకి ఇచ్చారు. పట్టణంలోని దూది అంతా కోటగోడ పక్కన పెద్ద పర్వతమంత రాశిగా కుప్పపోశారు.
కొంతకాలం గడిచింది.
చిత్రసేన మందిరంలో ఒక మగవాడు ఉన్నాడని, అప్పటివరకూ ఎవరికీ తెలియ రాలేదు. కానీ, ఎందుకో చిత్రసేన అన్నగారైన సత్యవంతునికి అనుమానం కలిగింది. తలుపులు మూసి ఉండటం వల్ల కవాటపు అద్దాలు తొలగించి, మందిరంలోనికి చూశాడు. చిత్రసేన ఒడిలో తలపెట్టుకుని, ఆమెతో కబుర్లు చెబుతున్న కామపాలుడు కంటబడ్డాడు.
ఆవేశంతో కవాటాన్ని బద్దలుకొట్టి, లోనికి దూకాడు. ఒరలోనుంచి కత్తి దూశాడు.
అతడిని చూస్తూనే కామపాలుడు మెరుపు వేగంతో పైకి లేచాడు. కోటగోడ వైపున్న కవాటాన్ని భేదించి బయటికి దూకేశాడు.
అనుకోకుండా జరిగిన పరిణామం అర్థంకాక, సత్యవంతుడు ముందు కంగారుపడ్డాడు. వెంటనే తేరుకుని, అతడిని పట్టుకోవడానికి అదే కిటికీ నుంచి సత్యవంతుడు కూడా దూకేశాడు. బల్జీ వేషంలో బుద్ధిసాగరుడు పోగుచేసిన దూదిలో పడటం వల్ల, వాళ్లిద్దరికీ దెబ్బలు తగల్లేదు. కానీ, ఎప్పుడైతే తనవెనుక శత్రువు కూడా దూకాడో, అతడి చేతిలోని కత్తిని లాక్కుని తల నరికేశాడు కామపాలుడు.
సత్యవంతుని శవంతో కలిపి, ఆ దూది మొత్తాన్ని తగలపెట్టేసి మిత్రులిద్దరూ ఊరు దాటేశారు.
వాళ్లుచేసిన పనిని పైనుంచి చూసిన చిత్రసేన, తండ్రికి ఇలా ఉత్తరం రాసింది.
“తండ్రీ! నిన్నరాత్రి సత్యవంతుడు ఏదో పనిమీద నా మందిరానికి వచ్చాడు. సూర్యప్రతాపుని భార్యను చూసి మోహించాడు. ఆమె ఎన్నోవిధాల అన్నకు నచ్చచెప్పబోయింది. అతడు వినిపించుకోలేదు. దాంతో ఆమె నా మందిరపు కిటికీనుంచి బయటికి దూకేసింది. ఆమెను అనుసరించి, అన్నకూడా దూకేశాడు. వాళ్లిద్దరూ ఏమయ్యారో తెలియలేదు. అందువల్ల నీకీ విషయాన్ని తెలియ చేస్తున్నాను”.
దాన్ని చూసిన చంద్రగుప్తుడు నరికేసిన అరటిచెట్టులా నిలువునా కూలిపోయాడు. ఈ విషయం సూర్యప్రతాపునికి తెలిస్తే తన ప్రాణాలు దక్కవని.. అనవసరంగా రాణిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని కొడుకును కూడా పోగొట్టుకున్నానని తీవ్రదుఃఖంలో మునిగిపోయాడు.
పదిరోజులు గడిచాయి. బుద్ధిసాగరుడు మళ్లీ కపటరాజు వేషంలో వచ్చాడు. అతనితోపాటు మంత్రివేషంలో కామపాలుడున్నాడు. చంద్రగుప్తుడు హడలిపోతూ వారిని సందర్శించాడు.
“చంద్రగుప్తా! ఇంతకాలం నా రాణిని కంటికి రెప్పలా కాపాడినందుకు చాలా సంతోషించాం. ఆమెను వెంటనే చూడాలని మనసు తొందర పెడుతున్నది” అన్నాడు బుద్ధిసాగరుడు.
చంద్రగుప్తునికి గొంతు తడారిపోయింది. “చిత్తం చిత్తం!” అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. సూర్యప్రతాపుడు మండిపడుతూ చూశాడు.
“ఏమిటీ ఊరికే నిలబడిపోయావ్? నా మాట వినిపించలేదా?!” అన్నాడు.
చంద్రగుప్తుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, జరిగిన సంగతిని బుద్ధిసాగరునికి విన్నవించాడు. ఆ మాటలు వింటూనే సంవర్తక మేఘం వలె భయంకరంగా గర్జిస్తూ, సింహాసనం పైనుంచి లేచి ఒరనుంచి కత్తి లాగాడు.
పక్కనే మంత్రివేషంలో ఉన్న కామపాలుడు అతణ్ని శాంతింపజేసి, తిరిగి కూర్చోబెట్టాడు.
చంద్రగుప్తుడు నీరసించి.. బుద్ధిసాగరుని ముందు మోకాళ్లపై నిలిచి.. “దేవా! నేను దీనికి పరిహారం చేస్తాను. నా కుమార్తె చిత్రసేన మిక్కిలి చక్కనిది. మీరామెను చేపట్టి, నా తప్పును మన్నించాలి” అని అడిగాడు. బుద్ధిసాగరుడు కనికరించిన వానివలె నటించాడు.
“నీవు చెప్పినట్లే నీ కూతురు చక్కనిదైతే నేను తప్పక పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే నా మంత్రిని తీసుకువెళ్లి, నీ కూతురిని చూపించు. అతడు చూసి చెపితే, నేనీ పెళ్లికి అంగీకరిస్తాను” అన్నాడు.
‘హమ్మయ్య!’ అనుకుంటూ మరేమీ ఆలోచించకుండా మంత్రిని వెంటపెట్టుకుని తన కూతురి మందిరానికి వెళ్లాడు. మారువేషంలో ఉన్నా తన ప్రియసఖుడైన కామపాలుని చిత్రసేన గుర్తించింది. చిరునవ్వుతోనే పెళ్లికి తన అంగీకారాన్ని తెలియచేసింది.
కామపాలుడు, చంద్రగుప్తుడు తిరిగి వచ్చారు. ఆమె చక్కదనాన్ని కామపాలుడు వర్ణించి చెప్పాడు. తీరా అప్పుడు బుద్ధిసాగరుడు తప్పు తెలుసుకున్నవాడిలా ముఖం పెట్టాడు.
“చంద్రగుప్తా! భార్యా వియోగ శోకంలో ఇందాక గుర్తించలేదు. ఈ కామపాలుడు నాకు ప్రియమిత్రుడే అయినా, చిత్రసేనకు మాత్రం పరపురుషుడే కదా! పరుని కంటపడ్డ స్త్రీని పెళ్లాడటం నాకిష్టం లేదు. కానీ, నాకు మా మంత్రి ప్రాణంతో సమానమైనవాడు. ఇతడికి నీ పిల్లనిచ్చి నిక్షేపంగా పెళ్లిచేయి. నాకే ఇచ్చినంతగా సంతోషిస్తాను. నిన్ను క్షమిస్తాను కూడా” అన్నాడు.
చంద్రగుప్తునికి వేరేదారి లేదు. కామపాలునికి, చిత్రసేనకు పెళ్లి జరిపించేశాడు.
మరికొంతకాలం గడిచింది.
* * *
బుద్ధిసాగరుడు ఒకనాడు చంద్రగుప్తునికి ఒక పిలుపు పంపాడు.
“నీ అల్లుడైన నా మిత్రుణ్ని మా ఊరికి తీసుకుపోయి, మళ్లీ పంపిస్తాను” అని చెప్పాడు.
మిత్రులిద్దరూ కలిసి మళ్లీ దేశాలు తిరగడం మొదలుపెట్టారు. కొంతకాలం దేశాటన చేసిన తరువాత వాళ్లిద్దరూ శ్రీరంగపురం దిక్కుగా మళ్లారు. సాయంత్రానికి పట్టణానికి చేరుకుంటారనగా ఆ మధ్యాహ్నం ఒక తోటలోని చెట్టుకింద విశ్రమించారు.
ప్రయాణపు బడలిక వల్ల కామపాలుడు వెంటనే నిద్రపోయాడు. మెలకువగా ఉన్న బుద్ధిసాగరుడి చెవులకు ఆ చెట్టుపైనున్న పక్షుల మాటలు వినిపించసాగాయి.
“నాథా! ఏమైనా విశేషాలుంటే చెప్పండి. ఏమీ ఊసుపోవడం లేదు” అడిగింది ఆడపక్షి.
“చెప్పడానికేమీ లేవు. ఇప్పుడు మనమున్న చెట్టుకింద నిద్రిస్తున్న కుర్రాళ్లలో ఒకడు రాజపుత్రుడు. అతడీ సాయంత్రానికి తన అత్తవారింటికి వెళుతున్నాడు. కానీ పాపం.. ఇంట్లోకి వెళ్లి భార్యను కళ్లారా చూసుకోకుండానే.. కోట బురుజు విరిగిపడి, మరణించబోతున్నాడు” చెప్పింది మగపక్షి.
“అయ్యో పాపం! కానీ స్వామీ ఒకవేళ ఆ గండం గడిచి, అతను బతికిపోతే!?”.
“రాత్రి భోజనంలో తొలిముద్దలో చేపముల్లు గొంతులో గుచ్చుకుని చనిపోతాడు”.
“ఒకవేళ అనుకోకుండా ఆ గండమూ తొలగిపోతే!?”.
“భార్య చేత్తో ఇచ్చిన తాంబూలంలో, ఒక విషపు పురుగు చేరడం వల్ల మరణిస్తాడు”.
“దైవవశాత్తూ ఆ గండం కూడా తప్పిపోతే!?”.
“ఈ రాత్రికే అతడు తన భార్యచేతిలో చనిపోతాడు. ఇది తప్పదు”.
“నాథా! పాపం ఆ చిన్నవాడికి ఎంత కష్టం వచ్చింది? మీరిప్పుడు నాతో చెప్పిన మాటలన్నీ ఎవరైనా ఆలకించి, చావు తప్పించుకునే ఉపాయాన్ని ఆ కుర్రవాడికి బోధిస్తే అప్పుడేమవుతుంది?” అని ప్రశ్నించింది ఆడపక్షి.
“ఈ రహస్యం తెలిసినవాళ్లు ఎవరికీ చెప్పకూడదు. అలా చెబితే వాళ్లు రాయిగా మారిపోతారు” అని చెప్పి, మగపక్షి చెట్టు మీదినుంచి ఎగిరిపోయింది. ఆడపక్షి దాన్ని అనుసరించింది.
బుద్ధిసాగరుడు ఆ మాటలను ఆలకించి, ఆలోచనలో పడ్డాడు. మిత్రుని మరణ రహస్యం తెలిసి, చెప్పలేకపోవడం కంటే పెద్ద శిక్షేం కావాలి? ఒకవేళ తాను ప్రయత్నపూర్వకంగా కాపాడుకోలేక పోతే మిత్రుణ్ని కోల్పోవాల్సి వస్తుంది. అలా కాదని ఆ రహస్యాన్ని మిత్రునితో చెప్పివేస్తే తాను రాయిగా మారిపోతాడు. రెండూ చిక్కులే.. ఏమిటి చేయడం?!
బుద్ధిసాగరుడు ఆలోచనల్లో తలమునకలుగా ఉండగానే, కామపాలుడు నిద్రలేచాడు.
“మిత్రమా! బయలుదేరదామా? చీకటిపడేలోగా శ్రీరంగపురం చేరుకోవాలి” అన్నాడు.
“పోనీ ఈసారికి మన ఊరికి పోయి, కొంతకాలం ఆగిన తరువాత శ్రీరంగం వెళదాం కామపాలా!” అన్నాడు.. దారి మళ్లిస్తే మిత్రుడు తనకు దక్కుతాడనే ఉద్దేశ్యంతో.
“వద్దొద్దు. పద్మావతిని వెంటనే చూడాలని మనసు ఉరకలేస్తున్నది. పదపద” అంటూ కామపాలుడు దారితీశాడు.
శరభసాళువాన్ని చంపిన తరువాత వీర్యశుల్కంగా పద్మావతిని చేపట్టిన కామపాలుడు.. చాలాకాలానికి మళ్లీ పద్మావతిని కలుసుకోబోతున్నాడు. ఆ ఉత్సాహంలో అతడి అడుగులు వేగంగా పడుతున్నాయి.
దేవుడిపైనే భారం వేసి బుద్ధిసాగరుడు అతడిని అనుసరించాడు.
(వచ్చేవారం.. తప్పిన గండం)
అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu Episode 16 ( కాశీ మజిలీ కథలు ) | శరభసాళువం
Kasi Majili Kathalu Episode 15 ( కాశీ మజిలీ కథలు ) | దైవమిచ్చిన భార్య
Kasi Majili Kathalu Episode 14 ( కాశీ మజిలీ కథలు ) |ధీమంతుడు
Kasi Majili Kathalu Episode 13 ( కాశీ మజిలీ కథలు ) | కీలుగుర్రం -2
Kasi Majili Kathalu Episode 12 ( కాశీ మజిలీ కథలు ) | కీలుగుర్రం
“Kasi Majili Kathalu Episode 11 ( కాశీ మజిలీ కథలు ) | పురుషద్వేషిణి- 2”
Kasi Majili Kathalu Episode 10 ( కాశీ మజిలీ కథలు ) | పురుషద్వేషిణి