Kasi Majili Kathalu Episode 21 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : మణిసిద్ధుని వద్ద ఒక ప్రభావవంతమైన మణి ఉంది. దాని సాయంతో ఏ కాలంలో జరిగిన కథలనైనా చూసినట్లే తెలుసుకుని, వివరించగలడు. గోపాలునికి కథలంటే మోజుకొద్దీ, మణిసిద్ధుని వెంట వచ్చాడు. వాళ్లిద్దరూ కాశీయాత్ర చేసుకుంటూ దక్షిణాదిలో చెప్పుకొన్న కథలను మధిర సుబ్బన్న దీక్షితకవి తొలిభాగపు మజిలీల్లో రచించాడు. ఇప్పుడు రెండోభాగంలోని మొదటికథ..
ఇరావతి పట్టణాన్ని ఇంద్రద్యుమ్నుడనే రాజు పాలిస్తున్నాడు. అతను ఒకనాడు సభామంటపంలో సింహాసనాన్ని అలంకరించి ఉండగా, కొందరు కోయవాళ్లు వచ్చారు. పులిగోళ్లు, నెమలి పింఛాలు, కస్తూరి మొదలైన కానుకలు సమర్పించారు.
“ఏలికా! మేము విద్యారణ్య వాసులం. ఈ మధ్యన భయంకరమైన సింహమొకటి మా గూడేలను అల్లకల్లోలం చేస్తున్నది. దానిని చంపనేరక మేమంతా గుడిసెలు విడిచి, ఆలుబిడ్డలతో సహా చెట్లపై కాపురాలు పెట్టుకుని బతకాల్సి వస్తున్నది. మీరోసారి మా అడవికి విచ్చేసి దాన్ని చంపి, మా బాధ తప్పించాలి” అని ప్రార్థించారు.
“అలాగే చేద్దాం. ఇవాళ్టికి మీరు విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయాన్నే అందరం కలిసే బయల్దేరదాం” అని ఇంద్రద్యుమ్నుడు వారికి అభయమిచ్చాడు. అంతఃపురానికి చేరుకుని, రాణి చంద్రసేనకు తన ప్రయాణాన్ని గురించి తెలిపాడు. అప్పుడామె చిగురుటాకులా వణికిపోతూ..
“నాథా! నేటి తెల్లవారుజామున నాకో కల వచ్చింది. ఉదయాన్నే మీతో చెప్పడానికి సంకోచించాను. కలలో కనిపించిన దాని ప్రకారం త్వరలోనే మనమిద్దరం విడిపోతామట. చాలా కష్టాలు పడిన తర్వాత తిరిగి కలుసుకుంటామట. చివరాఖరికి మీరు జగద్వ్యాప్తంగా కీర్తిని పొందుతారట. ఆ కల నిజం కాబోతున్నదా? అన్నట్లు ఇప్పుడు మీకీ అరణ్య ప్రయాణం సంభవించింది” అని చెప్పింది.
అందుకు ఇంద్రద్యుమ్నుడు తేలిగ్గా నవ్వేస్తూ..
“కలలు నిజమవుతాయా? ఏమిటీ వెర్రి?! నా అస్త్రపాటవం ముందు ఒక్క సింహం లెక్కలోనిది కాదు. నా కంటపడితే చిటికెలో దాన్ని సంహరిస్తాను. సరిగ్గా రేపీపాటికి మళ్లీ నీముందు వాలుతాను” అన్నాడు.
చంద్రసేన అంగీకరించలేదు.
“ప్రాణేశ్వరా! మిమ్మల్ని విడిచి, ఒంటరిగా ఉండలేను. నాక్కూడా మీతో రావడానికి అనుజ్ఞ ఇవ్వండి” అని బతిమాలింది.
ఇంద్రద్యుమ్నుడికి ‘సరే’ అనక తప్పలేదు. తెల్లవారుతూనే కోయవారితో కలిసి, రాజదంపతులు అడవికి బయలుదేరారు. పదిరోజులపాటు అడవిలో మాటువేసినా సింహం జాడలేదు.
“దేవరా! ఆ కనిపిస్తున్న గొందిలో గద్దె వేసుకుని పగలూ రాత్రీ కూర్చునేది. మమ్మల్ని ముప్పుతిప్పలు పెట్టేది. తీరా మీరు వచ్చేసరికి కంటికి కనిపించకుండా పారిపోయింది” అని చెప్పారు కోయవాళ్లు.
“మరోసారి ఆ సింహం జాడ కనిపిస్తే మాకు తెలియజేయండి. ప్రస్తుతానికి చక్కబెట్టవలసిన రాచకార్యాలు చాలా ఉన్నాయి. మా ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి” అన్నాడు మహారాజు.
వాళ్లలా సంభాషించుకుంటూ ఉండగా.. దూరంగా ఒక అబల రోదన వినిపించింది. ఇంద్రద్యుమ్నుని కనుసైగతో తక్షణం భటులు ఆ ధ్వని వినిపించిన దిక్కుగా పరుగెత్తారు.
ద్దిసేపటికి ఒక యవ్వనవతిని తీసుకువచ్చి, రాజుముందు నిలబెట్టారు.
“దేవా! ఈమె ఉరిపెట్టుకుని చావబోతుండగా, రక్షించి తీసుకువచ్చాం” అని నివేదించారు.
ఇంద్రద్యుమ్నుడు కరుణ నిండిన కంఠంతో..
“అమ్మాయీ! ఎవరు నువ్వు? నీకొచ్చిన కష్టం ఏమిటి? ఆత్మహత్య మహాపాతకమని నువ్వు ఎరగవా?” అని ప్రశ్నించాడు.
అప్పుడా అమ్మాయి..
“రాజా! నా ప్రాణాలను కాపాడి, తండ్రితో సమానమయ్యారు. కనుక మీ ఎదుట నిజం దాచలేను. నేను హేమాంగదుడని ప్రసిద్ధి వహించిన కాశీరాజు కూతురిని. నా పేరు విశాలాక్షి..” అని ఇంకా ఏదో చెప్పబోయింది. అంతలో ఇంద్రద్యుమ్నుడు ఆమెకు దగ్గరగా వచ్చి..
“అయ్యో అమ్మాయీ! ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చిందమ్మా!? నేను నీకు పెదతండ్రిని. నీ తండ్రి స్వయానా నా పినతల్లి కుమారుడు. ఈమధ్య మీనుంచి నాకు వార్తలేమీ లేవు. మీ అమ్మానాన్నలు కులాసాగా ఉన్నారా?!” అని కుశల ప్రశ్నలు కురిపించాడు.
అప్పుడు విశాలాక్షి తన కథనంతటినీ వివరంగా ఇలా చెప్పింది..
* * *
“నేను కాశీ విశాలాక్షీదేవి అనుగ్రహం వల్ల పుట్టానని నాకా పేరు పెట్టారు. పదహారేళ్ల ప్రాయం వచ్చేసరికి నాకు సకల విద్యలూ పూర్తయ్యాయి. నా ధారణా సామర్థ్యానికి కాశీ పండితులంతా అచ్చెరువొందే వారు.
నాకు అనురూపుడైన వరుడిని కనిపెట్టడానికి నా తండ్రి చాలా శ్రమించాడు. అనేక సంబంధాలు తీసుకువచ్చారు. కానీ, నాకెవ్వరూ నచ్చలేదు. అప్పుడు నావద్దకు ఒక దూతికను పంపి.. ‘నీకెలాంటివాడు భర్తగా కావాలో చెప్పు’ అంటూ నా తండ్రి అడిగించాడు. ఆ దూతిక చేతికి నేనొక పత్రిక రాసిచ్చాను. అందులో..
‘వరునిలో విద్య, శీలం, రూపం, సంపదలు వరుసగా పరిగణించాల్సినవి. శాస్త్రపాటవం లేనివాడి మనసెంత గొప్పదైనా.. నిప్పులో కాలని బంగారంలా శుద్ధం కాదు. విశాలమైన నేత్రాలు కలవాడైనా.. శాస్త్రప్రజ్ఞ లేనివాడు అర్థాన్ని గ్రహించలేడు కనుక, గుడ్డివాడే అవుతాడు. విద్యాబల సంపన్నమైన బుద్ధితో ఒప్పేవాడు ఉత్తముడు అనిపించుకుంటాడు. రెండోది శీలం.. శీలం లేనివాడు ఎంత విద్వాంసుడైనా పాము నెత్తిమీద మణిలాగా వాసికెక్కలేడు. మూడోది రూపం.. సాముద్రిక శాస్త్రంలో చెప్పిన రూపలక్షణాలు ఉన్నవాడికి అన్ని గుణాలూ పుష్పంలోని పరిమళంలా సహజంగా ఉంటాయి. ఇక నాలుగోదైన సంపద కలవాడే.. దానం చేసి త్యాగాన్ని, దాన్ని అనుభవించి భోగాన్నీ పొందుతాడు. శీలం లేకుండా మిగిలినవన్నీ ఉంటే, గర్వహేతువులు అవుతాయి. మొదటి మూడూ కలిగి నాలుగోదైన సంపద లేకపోతే ఎలాగోలా పొందవచ్చు. నాకు తోచినది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం’ అని రాశాను.
ఆ పత్రిక చదువుకున్న నా తండ్రి, రూపసి అయిన వరునికోసం నానా దేశాలకూ దూతలను పంపాడు. ఇదిలా ఉండగా ఒకనాడు నేను విశ్వేశ్వరుని ఆరాధించడానికి పల్లకీనెక్కి వెళ్లాను. అక్కడి విద్యామంటపంలో పండిత సింహాల మధ్య కిశోరంలా ఒక బ్రాహ్మణ బాలుడిని చూశాను.
కలకల నవ్వే ముఖం, సొగసైన కన్నులు, చక్కని చెక్కిళ్లు, విశాలమైన వక్షస్థలం, దీర్ఘమైన బాహువులు మొదలైన సాముద్రిక లక్షణాలన్నీ అతడిని మరో జయంతుడేమో అనిపిస్తున్నాయి. అతడి కింది పెదవిని చూడగానే సకలశాస్ర్తాలూ చదివిన పండితుడని చెప్పకనే చెబుతున్నాయి. అతడిని చూసిన మరుక్షణంలోనే మనసు పడ్డాను. అతడి గురించిన విశేషాలను సేకరించమని నా చెలికత్తెను నియోగించి, నేను అంతఃపురానికి వచ్చేశాను. సాయంత్రానికి నా చెలికత్తె ముఖం వేలాడేసుకుని వచ్చింది.
“రాకుమారీ! నేనక్కడ చాలాసేపు పండితుల ప్రసంగాలు వింటూ కూర్చున్నాను. అందరూ ఏదో విషయంమీద తీవ్రంగా వాదోపవాదాలు సాగించారు. నీవు మనసుపడ్డ కుర్రవాడు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. సభ ముగియగానే నేనతణ్ని ఒంటరిగా కలుసుకున్నాను.
‘అయ్యా! మీది ఏ ఊరు? ఏ పేరు? ఏం చదువుకున్నారు? కాశీ పట్టణానికి ఎందుకు వచ్చారు’ అని వినయంగా అడిగాను. దానికతడు.. ‘నా ఊరు, పేరు తెలియవు. మా గురువుగారు కింశుక శాస్త్రి అని పిలుస్తుంటారు. ప్రస్తుతం శబ్దాలు చదువుకుంటున్నాను’ అని సమాధానం చెప్పాడు. అతడి మాటలకు నాకు మతిపోయింది. ‘మీతో పని ఉండి వచ్చాను.. దయచేసి యదార్థం చెప్పండి’ అని ఎంత వేడుకున్నా అతడు ఒక్క అక్షరం కూడా మార్చకుండా ఇచ్చిన సమాధానమే మరల మరల ఇచ్చాడు” అని చెప్పింది.
నా చెలికత్తె మాటలు విని, పగలబడి నవ్వాను. నా తెలివి తేటలన్నీ వెలబోసి..
“ఓసీ! నువ్వేదో తెలివి గలదానివని అనుకున్నాను. కానీ, ఆయన మాటల్లోని శ్లేషను నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. విద్వాంసులకు ఒక ఊరు, పేరు ఉండవు. సర్వదేశాలు, సర్వనామాలు వారివే. సకల శాస్ర్తాలూ శబ్దజాలమే కనుక, శబ్దాలు చదువుకుంటున్నట్లు చెప్పారు. ఇకపోతే కింశుకమంటే మోదుగపూవు. తనకు స్వాతిశయం లేదనడానికే వాసనలేని ఆ పువ్వు పేరు చెప్పారు” అని వ్యాఖ్యానం చెప్పాను.
కొంతకాలానికి నేను కింశుక శాస్త్రిని మోహించిన సంగతిని చెలికత్తెలు మా తల్లికి చెప్పారు. ఆమెవల్ల తెలుసుకున్న మా తండ్రి అతడిని దర్బారుకు పిలిపించాడు. మన్మథుని వంటి అతని రూపాన్ని చూసి, ఇతర పరీక్షలేమీ చేయకుండా అప్పటికప్పుడే సిద్ధాంతులను పిలిపించి ముహూర్తం నిశ్చయించాడు.
నా పెళ్లి ముచ్చట్లు, మా తొలిరేయినాడు మావాళ్లు నాకు చేసిన ముస్తాబును గురించి చెప్పాలంటే కనీసం ఓ సంవత్సరమైనా సమయం పడుతుంది. కాబట్టి చెప్పడం లేదు. దైవజ్ఞులు నిర్ణయించిన శుభముహూర్తం సమీపించింది. నన్ను నా చెలులు లోపలికి తోసి తలుపులు మూసివేశారు. తలుపు వద్దనే చాలాసేపు తచ్చాడినా నన్ను నా మగడు పలుకరించనే లేదు. అనుమానం వేసి మంచం వద్దకు వెళ్లి చూసేసరికి, అప్పటికే దుప్పటి ముసుగు పెట్టి నిద్రపోతున్నాడు. అతడికి నిద్రాభంగం చేయడం ఇష్టం లేక దూరంగానే ఉండిపోయాను.
తెల్లవారిన తరువాత నా శరీరంపై మన్మథ చిహ్నాలేవీ కనిపించకపోవడం వల్ల ‘నీ మగడెంత చతురుడో.. చిన్ని గురుతునైనా బయటకి తెలియనివ్వకుండానే నీతో రమించిన అతగాడి కామకళా పాటవం ఎంత గొప్పదో!’ అని చెలికత్తెలు నాతో మేలమాడారు.
మరునాటి రాత్రి కూడా నన్ను అలంకరించి గదిలోకి పంపారు. కానీ, నా మగడి ప్రవర్తన గతరాత్రి లానే ఉంది. దుప్పటి ముసుగుతన్ని, పైగా గుర్రుపెట్టి నిద్రిస్తున్నాడు.
మూడోనాటి రాత్రి అతడు నిద్రించకముందే గదిలో ప్రవేశించాను. అతడి దుప్పటి పక్కకు జరిపి, సిగ్గువల్ల మాట్లాడలేక పక్కనే నిలబడ్డాను. దానికతడు భయపడుతూ లేచి కూర్చున్నాడు. నేను మెల్లగా కాళ్లవద్ద కూర్చుని పాదాలు ఒత్తబోతే ముడుచుకున్నాడు. గంధం అద్దితే తుడుచుకున్నాడు.
“తొలిరాత్రి నేను పలకరించలేదని అలిగారా? నన్ను మన్నించండి. మగవారితో సమానంగా ఆడవారు పంతం పట్టకూడదని ఆలస్యంగా తెలిసివచ్చింది. దయచేసి ఈ పళ్లు స్వీకరించండి” అని వద్దనే దాకా అందించాను. పాలు తాగిన తర్వాత, కర్పూర తాంబూలం ఇవ్వబోతే చేతితో పుచ్చుకుని నోటిలో కుక్కుకున్నాడు. ఆ తరువాత నేను మంచంమీద కూర్చోబోతే, భయపడి పక్కకి ఒదిగాడు. ఇక తప్పదని నేనే తెగువచేసి..
“నాథా! ఒకవేళ నాలో ఏమైనా తప్పుంటే మన్నించాలి కానీ, ఇలా బింకం వహించడం మీకు తగునా?! మీరిలా చేస్తే, నేనెవరితో చెప్పుకోగలను?!” అని పాదాలను పట్టుకున్నాను.
అప్పుడాయన నా చేతులు పట్టుకుని..
“ఏమమ్మా? నా కోపం నువ్వేం చూశావు?! నువ్వు పెట్టిన అప్పచ్చులన్నీ తిన్నాను. పాలు తాగాను. తాంబూలం నమిలాను. ఇంకేం చేయాలి?! నువ్వు గొప్పదానివి. నా కాళ్లు ముడితే వద్దనడం తప్పా?! పెళ్లి చేస్తామంటే వచ్చాను కానీ, ఇలా లేనిపోని మాటలంటారని తెలిస్తే మొదటే వచ్చేవాణ్ని కాను. నన్ను పోనివ్వు?!” అని మంచం దిగి వెళ్లబోయాడు.
నేనతణ్ని నిలువరించాను. జరుగుతున్నది కలో నిజమో తెలియలేదు. అతడి గురువు కింశుక శాస్త్రి అని తగిన పేరే పెట్టాడు. నేనే అతి తెలివితేటలతో అతడి మాటలకు తప్పుడు వ్యాఖ్యానాలు చేశానని గ్రహించుకున్నాను. ‘ఏరికోరి పెళ్లాడిన మగడు ఇటువంటివాడని లోకానికి వెల్లడైతే తలెత్తుకుని ఎలా బతకగలను!’ అని ఆలోచిస్తూ చాలాసేపు ఉండిపోయాను.
కంటతడి పెట్టుకుంటున్న నన్ను చూసి..
“ఏమమ్మా! ఎందుకు ఏడుస్తున్నావు?” అని ప్రశ్నించాడతను.
“బ్రాహ్మణుడా! నీవు నన్ను ‘అమ్మా!’ అని పిలువకూడదు. నీకు నేను భార్యను. భార్యంటే ఎవరో ఎరుగుదువా? ఎన్నడూ విడిచిపెట్టకూడదని అర్థం. నువ్వు నన్ను ఎప్పుడూ విడిచిపెట్టవు కదూ!” అని ప్రశ్నించాను.
అతడు సరేనన్నాడు.
“నేను చెప్పినట్టల్లా వింటావు కదూ!” అని తిరిగి ప్రశ్నించాను.
“ఏడుపు మానేస్తానంటే నువ్వెలా చెబితే అలాగే నడుచుకుంటాను” అన్నాడతను.
ఆవిధంగా అతనిచేత ప్రమాణం చేయించుకున్నాను. నా రహస్యాన్ని ఇతరులకు తెలియనివ్వకుండా కొంతకాలం కాపాడుకుంటూ వచ్చాను. నా మగణ్ని అంతఃపురం దాటి రానివ్వకుండా కట్టుదిట్టం చేశాను.
ఒకనాటిరాత్రి నిద్రలో ఒక పెద్ద ముత్తయిదువ కనిపించింది.
‘అబలా! నీకు ముందుముందు మేలు జరుగుతుంది’ అని చెప్పిందామె.
‘ఇటువంటి మగడున్న ఇల్లాలికి రాబోయే మేలేమిటో!?’ అని నేను విరక్తి చెంది ఉండగా.. మా తండ్రిగారు కాలం చేశారని కబురందింది. మా తల్లి సతీ సహగమనం చేసింది. మంత్రి మండలి నా మగణ్ని తీసుకుపోయి సింహాసనంపై కూర్చుండబెట్టింది.
అతడు రాజైనది మొదలుకుని, ప్రతిరోజూ నేనెంత బోధచేసినా ప్రయోజనం లేకపోయింది. త్వరలోనే అతడి తెలివితేటలు మంత్రులకు వెల్లడైపోయాయి. ఒకనాడు మంత్రిమండలి నుంచి నాకో పత్రిక వచ్చింది.
దానిలో శత్రురాజులందరూ కూడగట్టుకుని మా రాజ్యంపై దండెత్తబోతున్నట్లు సమాచారం ఉంది. శత్రురాజుల పేర్లపట్టికను చూడగా వారంతా, ఒకప్పుడు నన్ను కోరుకున్నవారే. తమను తిరస్కరించినందుకు నాపై కక్ష పెంచుకున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి మానమర్యాదలను వారే కాపాడుకోవాలి కదా! కోటలో ఏ మూల దాక్కున్నా నన్ను పట్టుకోవడానికి శత్రువులకు ఆరునెలలు పడుతుంది. అంతటి పటిష్ఠమైనది మా కోట. అయినప్పటికీ ఇంకా ఆ కోటలోనే కాలక్షేపం చేయడం మంచిది కాదనిపించింది. ఆపత్కాలంలో కోట దాటిపోయే రహస్యాలన్నీ ఒక పుస్తకంలో మా తాత తండ్రులు రాసి పెట్టారు. ఆ పుస్తకంలో కోటలోని అనేక రహస్య ద్వారాలను తెరిచే ఉపాయాలున్నాయి.
(వచ్చేవారం.. విశాలాక్షి మొగుడు-2)
అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu Episode 20 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు – 2
Kasi Majili Kathalu Episode 19 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు
Kasi Majili Kathalu Episode 17 ( కాశీ మజిలీ కథలు ) | చిత్రసేన
Kasi Majili Kathalu Episode 16 ( కాశీ మజిలీ కథలు ) | శరభసాళువం
Kasi Majili Kathalu Episode 15 ( కాశీ మజిలీ కథలు ) | దైవమిచ్చిన భార్య