అనుసృజన నేతి సూర్యనారాయణ శర్మ
జరిగిన కథ : నీటినుంచి బయటపడినా చాలాసేపు ప్రాణాలతోనే ఉన్న అద్భుతమైన చేప.. చనిపోయేముందు ఫక్కుమంటూ నవ్వింది. చేప నవ్విన కారణం చెప్పలేకపోతే ఉరిశిక్ష వేస్తానని తన మంత్రిని బెదిరించాడు సింహధ్వజుడు. ఆ కారణాన్ని తెలుసుకోవడానికి మంత్రి సంతానమైన ప్రద్యుమ్నుడు, లవంగి దేశాటనకు బయలుదేరారు. అడవిలో ఒక భేరుండపక్షి సలహామేరకు చేప నవ్విన కారణం తెలుసుకోవడానికి ప్రద్యుమ్నుడు పాతాళలోకానికి వెళ్లాడు. ఆ అరణ్యంలో లవంగి ఒంటరిగా మిగిలిపోయింది.
ఇంకా తెల్లవారలేదు. అడవిలో చెట్టుకింద ఆదమరిచి నిద్రపోతున్న లవంగి ఉలికిపాటుతో మేలుకొన్నది. ప్రద్యుమ్నుడు కనిపించలేదు. అన్నయ్య జాడ తెలియక.. పాపం ఆమె భయవిహ్వల అయింది. చాలాసేపు “అన్నా అన్నా!” అని అరుస్తూ, పిలుస్తూ ఉండిపోయింది. తన అన్నకు ఏదైనా ప్రమాదం సంభవించిందేమో అని తలపోసింది.
“ఇప్పుడు నేను ఏం చేయను? నాకింక దిక్కెవరు?” అంటూ రోదించసాగింది. ఉన్నట్లుండి చీకటికి తోడుగా జడివాన మొదలైంది. ఉరుములకు, మెరుపులకు తాళలేక ఆ సుకుమారి ధైర్యంలేక నిలువునా నీరైపోతున్నది. అటువంటి స్థితిలో.. మెరుపు వెలుగులో ఒక గుర్రం తానున్న దిక్కుకే రావడం ఆమెకు కనిపించింది. తన అన్నయ్యే కావచ్చనే ఆశతో, గట్టిగా కేకవేసింది. గుర్రం మెల్లిగా వచ్చి ఆమె ముందు ఆగింది. లవంగి పరుగు పరుగున వెళ్లి ఆ రౌతు చేతులు పట్టుకుంది.
“అన్నా! ఇంతసేపూ ఎక్కడికెళ్లి పోయావ్? నన్నొక్కదాన్నీ విడిచిపెట్టి ఏమైపోయావ్?!” అని అడిగింది గాభరాగా.
ఇంతలో మరోసారి ఒక పెద్ద మెరుపు మెరిసింది. వచ్చినవాడు తన అన్నకాదని ఆ వెలుగులో గుర్తించి, దూరంగా జరిగింది.
అప్పుడా గుర్రపు రౌతు..“అబలా! నేను మత్స్యదేశాధీశుని కుమారుడిని. నాపేరు జయసేనుడు. వేటకోసం ఈ అడవిలో విడిది చేశాను. అనుకోకుండా వచ్చిపడ్డ గాలివానకు మా శిబిరాలన్నీ ఎగిరిపోయాయి. సైనికులు తలోదారిన చెల్లాచెదురయ్యారు. చీకటిలో మా రాజధానికి దారి వెతుక్కుంటూ పోతున్నాను. ఇంతకూ ఈ కీకారణ్యంలోకి నువ్వెలా వచ్చావో తెలుసుకోవచ్చా?” అని అడిగాడు.
“జయసేనా! ఆపదలనే సముద్రంలో నన్ను పడదోసిన భగవంతుడు మిమ్మల్ని నాకోసం ఓ నావలా నాదగ్గరికి పంపి ఉంటాడు. నేను, మా అన్నయ్య ప్రద్యుమ్నుడు ఈ అడవిలో చిక్కుపడిపోయాం. ఇప్పటివరకూ ఇక్కడే ఉన్నాడు. ఇంతలో అన్న ఏమైపోయాడో తెలియలేదు. దయచేసి నన్ను రక్షించండి” అన్నది లవంగి నమస్కరించి.
మరికొంతసేపటికి ఒక మెరుపు మెరిసింది. ఆ వెలుగులో ఒకరినొకరు సరిగా చూసుకున్నారు. తొలిచూపులోనే వలపులో తడిసిపోయారు. లవంగి కన్నులు నేల వాల్చుకుని నిల్చుండిపోయింది. జయసేనుడు ఆమెకు దగ్గరగా వచ్చి..
“ఈ నిర్జన ప్రదేశంలో ఆగంతకునిగా ఎదురైన నా ప్రేమను నువ్వు నమ్ముతావో లేదో! నీ మనసు తెలుసుకోకుండా నేను అడుగు ముందుకు వేయలేను. నీకు అంగీకారమైతే ఇప్పుడే నిన్ను గాంధర్వ విధిని చేపట్టగలను” అన్నాడు.
లవంగి సిగ్గువిడిచి, తన చేతిని అందించింది. జయసేనుడు తమి తీరేలా ఆమెను కౌగిలించుకున్నాడు. వారిద్దరికీ ఆ చిత్తడినేలపై ఒకింత చోటు దొరికింది. ఉరుముల, మెరుపుల భయానక వానరాత్రి వెన్నెలరేయిగా మారిపోయింది. ఒకరికొకరు సరిగా తెలియకుండానే భళ్లుమంటూ తెల్లవారి పోయింది.
ఇద్దరూ గుర్రమెక్కి జయసేనుని రాజధాని దిక్కుగా ప్రయాణించారు. దైవవశాత్తూ ఆ గుర్రం దారి తప్పింది. మూడురోజుల ప్రయాణం తరువాత వారికో ఉద్యానవనం కనిపించింది. పద్ధతిగా పెంచిన పూలతోట అది. ఎవరైనా కనిపిస్తారేమోనని వెతికాడు జయసేనుడు.
మనుషుల అలికిడి లేనేలేదు. తోట మధ్యలో ఒక భవంతి దర్శనమిచ్చింది. లోపలకూడా ఎవరూ లేరు. ఆ భవంతి అనేక చిత్ర వస్తువులతో అలంకరించి ఉంది. కొన్ని ఆహారపదార్థాలు కూడా అందంగా అమర్చి ఉన్నాయి. వాటితో వారి ఆకలి తీరింది. సేద తీరేంతలో సాయంత్రమైంది. అదేం చిత్రమో కానీ.. ఎవరూ దీపాలు వెలిగించకుండానే ఆ భవంతిలో పట్టపగటిలా కాంతులు విరజిమ్మసాగాయి. పరీక్షించి చూసిన మీదట అవి మణిదీపాలని తెలిసింది.
అద్భుతమైన అలంకారాలతో నిండిన హంసతూలికా తల్పంపై ఆ దంపతులు ఆనందంగా గడిపారు. ఆ ఆనందం వారికి వరుసగా మూడురాత్రులు దక్కింది. నాలుగోనాటి ఉదయాన్నే లవంగి నిద్రలేచేసరికి అక్కడంతా మహారణ్యంగా మారిపోయింది. ఉద్యానవనం, భవంతి, హంసతూలికా తల్పం ఏమీ లేవు. పక్కనే ఉండాల్సిన జయసేనుడు కూడా కనిపించలేదు. ఆమె ఆశ్చర్యపోతూ, జయసేనుడు రావడం మొదలు జరిగినదంతా కల అనుకున్నది. నిజంగా తనను జయసేనుడు చేపట్టలేదు. తామిద్దరూ కలిసి రానేలేదు.
‘కేవలం స్వప్నమే ఇంతగా భ్రమపెట్టినదేమి?’ అనుకున్నది. అనుకున్నది కానీ.. అంతలోనే తెలివి తెచ్చుకుంది. తన దేహంపై జయసేనుడు చేసిన దంత, నఖక్షతాల గుర్తులు కనిపిస్తున్నాయి. అలాగే తాను నిద్రించిన ప్రదేశం వేరు, ఈ చోటు వేరు. కాబట్టి ఇది కలకాదు. అయితే జయసేనుడు ఏమై పోయినట్లు?! తననిలా జయసేనుని నుంచి విడదీసి, దూరంగా విసిరేసిన శక్తి ఎవరు?!
దైవం ప్రతికూలించినప్పుడు అన్నీ ఆపదలే ఎదురవుతాయి. భయాలే కలుగుతాయి. తల్లిదండ్రులను విడిచి, అన్నను పోగొట్టుకున్న ఆ అబలకు ఇప్పుడు ప్రాణనాథుడు కూడా దూరం కావడం భయాన్ని కలిగించింది.
భోగి అయినవాడికి రోగభయం వెన్నాడుతుంది. కులస్థునికి పరువు సమస్య అవుతుంది. డబ్బున్న వాడికి రాజు పన్ను వేస్తాడేమోనన్న భయం. గొప్పగా బతికేవాడికి దైన్యం భయం గొలుపుతుంది. బలవంతునికి శత్రువుల భయం తప్పదు. రూపసి అయినవాడికి వార్ధక్యంలో తన రూపం చెడుతుందని భయం. శాస్త్రం నేర్చుకున్న పండితుడు వాదాన్ని ఎదుర్కోవాలి. గుణవంతునికి తాను తన గుణాన్ని పోగొట్టుకుంటాననే భయం. దేహధారికి యముని వల్ల భయం. ఈలోకంలో సమస్తం భయంతో కూడుకున్నదే. వైరాగ్యం ఒక్కటే భయాన్ని దూరం చేయగలిగేది.
కళింగానికి తిరిగిపోదామంటే దారి తెలియదు. అడవిలో ఒంటరిగా మిగిలిపోయిన తనకు దిక్కులేదు. లవంగికి కలిగిన ఆ అంతులేని భయం క్రమంగా వైరాగ్యంగా మారింది. అప్పటినుంచి ఆ మహారణ్యంలో నిర్భయంగా తిరుగుతూ దొరికిన పళ్లు, ఆకులతో కడుపు నింపుకోసాగింది. కొంతకాలానికి ఆమెకో అమ్మవారి గుడి కనిపించింది. లోనికి ప్రవేశించి చూడగా.. ఒక శాసనం కంటపడింది. అందులోని వివరాల ప్రకారం గుడిలోని అమ్మవారి పేరు సంయోగినీ దేవి అని, దసరారోజుల్లో ఆ గుడికి వేలాదిమంది భక్తులు వస్తుంటారని, మిగతా సమయాల్లో రహస్య ప్రదేశమని తెలిసింది. గుడి ఆవరణలో ఒక తటాకం ఉంది. ఆ నీటితో, పళ్లతో కడుపు నింపుకుంటూ.. మంటపంలో నివసించ సాగింది. యోగినిగా మారి, లవంగి తపస్సు చేసుకోసాగింది. ఆమె అలా ఒంటరిగా ఎంతకాలం గడిపిందో తెలియదు.
ఒకనాటిరాత్రి ఆ గుడికి స్వర్గలోకం నుంచి రంభాది అప్సరసలు వచ్చారు. సంయోగినీ దేవిని సేవించి, తిరిగి వెళ్తూ లవంగిని చూసి తమలో తాము సంభాషించుకోసాగారు.
“అక్కలారా! ఈమెను చూడబోతే సంయోగినీ దేవియే మానవాకృతి దాల్చి ఇక్కడ విహరిస్తున్నదేమో అనిపిస్తున్నది కదా?!” అన్నది మేనక.
“కాదు.. కాదు.. ఈ చిన్నదాని పేరు లవంగి. ప్రభుకీర్తి అనే మంత్రికూతురు. ప్రద్యుమ్నుడనే పేరుగల అన్నతో కలిసి తమ తండ్రికి ఏర్పడిన ఆపదను తప్పించడం కోసం దేశాటన చేస్తున్నది. అనుకోకుండా ఈ అడవిలో చిక్కుకుపోయింది” అని తాను దివ్యదృష్టితో చూసిన విషయాలను తెలియచేసింది ఊర్వశి.
“ఏమైంది పాపం?! ఈమె తండ్రికి వచ్చిన ఆపద ఏమిటి?” అని ఆదుర్దాగా అడిగింది రంభ.
“అక్కా! కళింగ రాజైన సింహధ్వజుని వద్ద ఈమె తండ్రి మంత్రిగా ఉన్నాడు. ఆ సింహధ్వజుని వద్దకు ఒకరోజు జాలరివాళ్లు ఒకానొక అద్భుతమైన చేపను తెచ్చారు. దాన్ని తన రాణులకు చూపించేముందు.. ఆ చేప ‘మగదా? ఆడదా?’ అని ప్రశ్న వేశాడు సింహధ్వజుడు. దానికి సమాధానం ఎవరూ చెప్పలేకపోయారు. ఇంతలో ఆ చేప ఫక్కుమంటూ నవ్వి, చనిపోయింది. ‘చేప ఎందుకు నవ్వింది?’ అని మళ్లీ ఓ దిక్కుమాలిన ప్రశ్న వేశాడు రాజు. దానికి ఆరునెలల లోపుగా సమాధానం చెప్పకపోతే మంత్రిని ఉరి తీయిస్తానన్నాడు. అప్పుడు తమ తండ్రిని ఉరిశిక్ష బారినుంచి రక్షించుకోవడం కోసం అన్నాచెల్లెళ్లిద్దరూ ఇల్లు విడిచిపెట్టారు. దారిలో పాపం ఈమె తన అన్నను, భర్తను దూరం చేసుకుంది” అని చెప్పింది ఊర్వశి.
“ఇంతకూ చేప నవ్విన కారణం ఏమిటి? ఆ కారణం తెలుసుకోవాలని రాజుకు ఎందుకు అనిపించింది?”.. ఈసారి మేనక ప్రశ్నించింది.
“ఏమున్నదీ.. ఆ రాజుకు అందగత్తెలయిన చాలామంది భార్యలున్నారు. వారికంట మగపురుగు కూడా పడకుండా చాలా కట్టుదిట్టాలు చేశాడు. ఆ చేపకూడా మగదైతే తన రాణులకు చూపించ కూడదని అనుకున్నాడు. అందుకే ఆ ప్రశ్నవేశాడు. కానీ, వాడికి తెలియదు. తన అంతఃపురంలోనే ఎందరో పురుషులు స్త్రీవేషాలు ధరించి, రాణులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని. ఆ కారణం తెలిసినందువల్లే చేప నవ్వింది. ఆ విషయం పాపం ప్రభుకీర్తి చెప్పలేకపోయాడు” అని వివరించింది ఊర్వశి.
“అదిసరేగానీ అక్కా! ఈ చిన్నదాని అన్నగారు, ఈమె భర్త ఏమైపోయినట్లు?!” అని అడిగింది రంభ.
“త్వరలోనే వాళ్లిద్దరూ ఇక్కడికే వచ్చి, ఈమెను కలుసుకోగలరు” అన్నది ఊర్వశి.
“అయితే ఈ సంయోగినీ దేవి నిజంగా సార్థక నామధేయురాలే కదా!” అనుకుంటూ ఆ అప్సరసలు వచ్చిన దారినే దివికి ఎగసిపోయారు.
వారి మాటలను విన్న లవంగి సంతోషానికి మేరలేదు. తండ్రి మరణాన్ని తప్పించే ఉపాయం దొరికింది. తన అన్న, భర్త కూడా త్వరలో రానున్నారని తెలిసి వారికోసం ఎదురు చూడసాగింది.
ఆ మరునాడు ఆమె ధ్యానంలో ఉండగా గుడిబయట కోలాహలం వినిపించింది. అటువైపు తిరిగి చూసేసరికి, ఎవరో కొందరు దుండగులు ఒక అమ్మాయిని బలాత్కారంగా తీసుకు వస్తున్నారు. వాళ్లను ఒక బాలయోగి అడ్డుకున్నాడు. అతికష్టం మీద వారిని తరిమికొట్టాడు.
బాలయోగి, ఆ అమ్మాయితో కలిసి గుడిలో అడుగుపెట్టాడు. అతణ్ని చూస్తూనే లవంగి పోల్చుకుంది.
“అన్నా” అంటూ ఎదురువెళ్లి స్వాగతించింది.
“ఇంతకాలం ఎక్కడికి వెళ్లావు?” అని అడగడంతో.. ప్రద్యుమ్నుడు తన కథ ఇలా చెప్పాడు.
అడవిలో లవంగిని ఒంటరిగా వదిలిపెట్టి, పాతాళానికి వెళ్లిన ప్రద్యుమ్నుడికి రత్నాంగి అనే నాగకన్య వశమైంది. ఆత్రేయుడనే మహర్షి ఆమెను.. ‘నాగమణిని చేతపుచ్చుకుని వచ్చిన మానవుణ్ని పెళ్లాడతావు’ అని శపించాడు. ఆ శాపం ప్రకారమే ఆమెకు ప్రద్యుమ్నుడు లభించాడు. వాళ్లిద్దరూ కొంతకాలం సుఖాలు అనుభవించారు. లవంగి గుర్తురాగానే ఆమెను వెతుక్కుంటూ ప్రద్యుమ్నుడు బయలుదేరాడు. అతడితోపాటు రత్నాంగి కూడా భూలోకానికి వచ్చింది. ఒక చెరువు గట్టున కట్టుబట్టలు విడిచి స్నానం చేస్తుండగా నాగశిరోమణిని ఒక గద్ద తన్నుకుపోయింది. ప్రద్యుమ్నుడు గద్దవెంట మూడురోజులపాటు పరుగులు తీశాడు. చివరికి మణిని సంపాదిం
చాడు. కానీ, రత్నాంగి దూరమైంది. ఆమెను వెతుక్కుంటూ వచ్చిన ప్రద్యుమ్నుడు, తన భార్యను దుండగులు అపహరిస్తుండగా చూశాడు. ఆమెను కాపాడి, చెల్లెల్ని కలుసుకున్నాడు.
..ఈ కథను ప్రద్యుమ్నుడు చెబుతుండగానే, గుడి ఆవరణలోని తటాకంలో ఆకాశం నుంచి దబ్బుమంటూ ఏదో పడ్డట్లు పెద్దపెట్టున శబ్దం అయింది. అందరూ వచ్చి చూసేసరికి మడుగు నుంచి ఒక రాకుమారుడు బయటికి వస్తున్నాడు. అతడు జయసేనుడు.
మాయాభవనంలో లవంగితో ఆ రాత్రి శయనించిన జయసేనుడు తెల్లవారేసరికి, ఓ మర్రిచెట్టు కింద ఉన్నాడు. ఆమెను వెతుక్కుంటూ చాలాచోట్ల తిరిగాడు. ఎన్నిరోజులు గడిచాయో తెలియదు. చివరికి ఒకచోట ఒక పాలరాతి మందిరాన్ని చూశాడు. ఆశకొద్దీ భవనంలో అడుగుపెట్టి అడుగడుగునా వెతికి చూశాడు.
ఆ పాలరాతి మందిరంలో ఒక జవ్వని ఆదమరిచి నిద్రపోతున్నది. ఆమె అపురూప లావణ్యాలను చూసిన జయసేనునికి మతిపోయింది. ఆమెనే చూస్తూ అక్కడే నిలబడిపోయాడు. కొద్దిసేపటికి నిద్రలేచిన ఆ సుందరాంగి.. పళ్లు పటపట కొరుకుతూ ఉగ్రరూపం దాల్చింది.
“ఈ మనుషులకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదు. మళ్లీమళ్లీ వస్తూనే ఉంటారు” అంటూ తన శరీరాన్ని అమాంతం కొండంతగా పెంచేసింది. ఆమె ముందు పిట్టలా ఉన్న జయసేనుని రెక్క పుచ్చుకుని గిరగిరా తిప్పి విసిరింది.
“ఆ విసురుకు వచ్చి ఈ చెరువులో పడ్డాను. ఇంకెక్కడైనా పడి ఉంటే ఈ పాటికి చచ్చి ఉందును” అన్నాడు జయసేనుడు.
నలుగురూ ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకుని సంతోషించారు. ప్రద్యుమ్నుడు అంతకుముందు తనకు సాయం చేసిన బేరుండ పక్షులను మనసులో తలుచుకున్నాడు.
విస్తారమైన రెక్కలను అల్లార్చుతూ, పెద్దకొండల్లా ఉన్న భేరుండ పక్షులు వారిముందు వచ్చి వాలాయి. రెండు జంటలూ తలో పక్షినీ అధిరోహించాయి. వారిని ఆ పక్షులు మూడురోజుల ప్రయాణంతో కళింగదేశానికి చేర్చాయి.
అప్పటికే గడువు దాటిపోవడంతో ప్రభుకీర్తిని ఉరి తీయించమని సింహధ్వజుడు ఆనతిచ్చాడు. చివరి నిమిషంలో ప్రద్యుమ్నుడు, లవంగి రావడంతో శిక్ష నిలిపివేశారు. రాజు ఏకాంతంగా ఉన్న సమయంలో అతడిని కలుసుకుని..
“మీ అంతఃపురంలో కొంతమంది ఆడవేషాల్లో తిరుగుతున్నారు. ఆ విషయం తెలిసినందువల్లనే చేప నవ్వింది” అని తాను తెలుసుకున్న విషయాన్ని ప్రద్యుమ్నుడు చెప్పాడు.
రాణివాసంలో స్త్రీవేషాలు ధరించి, పరిచారికలుగా నటిస్తున్న వారందరినీ పిలిపించాడు. వారితో పలుచటి వస్ర్తాలు ధరింపజేశాడు ప్రద్యుమ్నుడు. వారి ఒంటిపై నీళ్లుపోసి తడిపేశాడు. వారి అవయవాల్లో తేడాను గుర్తించేలా చేశాడు.
“నువ్వు చెబుతున్నది నిజమేనని నమ్మకమేంటి?” అని ప్రశ్నించాడు సింహధ్వజుడు.
రాణివాసంలో స్త్రీవేషాలు ధరించి, పరిచారికలుగా నటిస్తున్న వారందరినీ పిలిపించాడు. వారితో పలుచటి వస్ర్తాలు ధరింపజేశాడు ప్రద్యుమ్నుడు. వారి ఒంటిపై నీళ్లుపోసి తడిపేశాడు. వారి అవయవాల్లో తేడాను గుర్తించేలా చేశాడు.
సింహధ్వజుడు ఆ దృశ్యాన్ని చూసి ఆగ్రహోదగ్రుడయ్యాడు. అంతఃపుర ద్రోహులందరినీ ఇనుప చిక్కాలలోకి ఎక్కించి తోటలో వేలాడగట్టించాడు. అన్నం, నీళ్లు ఇవ్వకుండా వారిని చిత్రవధ చేశాడు. అప్పటికీ తాను చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం జరగలేదనిపించింది.
వద్దని ఎంతవారించినా వినకుండా రాజ్యాన్ని ప్రభుకీర్తికి అప్పగించి.. ప్రద్యుమ్నుణ్ని రాజుగా అభిషేకించి, వానప్రస్థానికి వెళ్లిపోయాడు. లవంగి తన భర్తతోపాటు మత్స్యదేశానికి తరలివెళ్లింది. అన్నాచెల్లెళ్లిద్దరూ తమ కుటుంబాలతో చిరకాలం హాయిగా జీవించారు.
(వచ్చేవారం… విశాలాక్షి మొగుడు)