Smrithi Irani | కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ ఓటు గల్లంతయ్యింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లా మైదాన్ మైవా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో నుంచి ఆమె ఓటును తొలగించడం కలకలం రేపింది. ఈ ఘటన సంచలనంగా మారడంతో అధికారులు స్పందించి, విచారణకు ఆదేశించారు. అయితే అదే ప్రాంతానికి సంబంధించిన లోక్సభ, అసెంబ్లీ ఓటర్ల జాబితాల్లో మాత్రం ఆమె పేరు ఉన్నట్లుగా తెలిపారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని ఓడించి 2019 నుంచి 2024 వరకు అమేథీ లోక్సభ నియోజకవర్గానికి స్మృతి ఇరానీ ప్రాతినిథ్యం వహించారు. 2019లో ఎంపీగా గెలిచిన తర్వాత గౌరీగంజ్ అసెంబ్లీ పరిధిలోని మైదాన్ మవా గ్రామంలో ఒక ఇల్లు నిర్మించుకున్నారు. అక్కడే ఓటరుగా పేరు నమోదు చేసుకోవడమే కాదు.. గత లోక్సభ ఎన్నికల్లోనూ అక్కడి నుంచే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కాగా, జూన్ 10వ తేదీన విడుదలైన పంచాయతీ ఓటర్ల జాబితాలో మాత్రం స్మృతి ఇరానీ పేరు లేదు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చి సంచనలంగా మారడంతో జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ చౌహాన్ స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. విచారణకు సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాతే ఓటు తొలగింపుపై స్పష్టత వస్తుందని తెలిపారు.
అమేథీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుధాంశు శుక్లా మాట్లాడుతూ.. స్మృతి ఇరానీ పేరును పంచాయతీ ఓటర్ల జాబితాలో చేర్చాలని దరఖాస్తు ఇచ్చినట్లు తెలిపారు. అవసరమైన ధ్రువీకరణ అనంతరం ఆమె పేరును జాబితాలో చేరుస్తామని అధికారులు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.