న్యూఢిల్లీ, జూన్ 8: విపక్ష ఇండియా కూటమిలోని అంతర్గత విభేదాలు సోమవారం మరోసారి బయటపడ్డాయి. ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వంపై సోమవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో అనేక పార్టీలు బహిరంగంగా విమర్శించడంతో కూటమిలోని అనైక్యత బట్టబయలైంది. ఎన్నికల ప్రచార సమయంలో పార్టీల మధ్య సమన్వయ లోపం, కాంగ్రెస్ నాయకులు కూటమిలోని పార్టీల నాయకులను దూషించడం వంటి అంశాలపై పలువురు నాయకులు సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసినట్లు వర్గాలు తెలిపాయి. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నుంచి ముందుగా ఈ విమర్శలు వ్యక్తం కాగా ఇతర పార్టీల నాయకులు ముఖ్యంగా లెఫ్ట్ పార్టీల నాయకులు ఆయనతో గొంతు కలిపారు. ఏడాదికోసారి కూటమి సమావేశాన్ని నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటని కొందరు ప్రశ్నించగా తరచు సమావేశాలు జరుగాలని పలువురు సూచించారు. అయితే విమర్శలకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ జాతీయ స్థాయిలో కూటమి ఐక్యంగా ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారాల సమయంలో స్థానిక రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర విభాగ నాయకుల నుంచి వచ్చే అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని అన్నారు.
సీజేపీపై చర్చ
ఇటీవల పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)పై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రజల మదిలో ప్రతిధ్వనించే సమస్యలను లేవనెత్తుతున్న కారణంగా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. 2029 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలు రాజకీయ, ఆర్థిక అంశాలపై బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఒక ఐక్య వ్యూహాన్ని రూపొంది ంచాలని సమావేశంలో నిర్ణయించారు. తదుపరి సమావేశం ఆగస్టులో హైదరాబాద్లో నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశానికి రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ సహా సీనియర్ విపక్ష నాయకులు ఈ హాజరయ్యారు. కాంగ్రెస్తో విభేదాలను కారణంగా చూపుతూ ఇండియా కూటమి సమావేశానికి ప్రధానంగా డీఎంకే, ఆప్ గైర్హాజరయ్యాయి.