పరకాల, ఆగస్టు 15 : బీఆర్ఎస్ హయాంలోనే అన్ని విధాలుగా పరకాల అభివృద్ధి చెందిందని, గత ప్రభుత్వంలో కేసీఆర్ సహకారంతో నిర్మించిన భవనాలకు కాంగ్రెస్ సర్కారు రంగులు అద్ది ప్రారంభిస్తూ ప్రచారం చేసుకుంటున్నదని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. శనివారం పరకాలలో విలేకరులతో మాట్లాడుతూ పరకాల ప్రజల ఆకాంక్ష మేరకు మంజూరు చేసి పూర్తి చేసిన వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాలకు రంగులు వేసి, తామే అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.
రెండున్నరేళ్లలో పరకాల పట్టణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని, పూర్తయిన వంద పడకల ఆస్పత్రిని ఇంతకాలం ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారో ఎమ్మెల్యే ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఇప్పటికీ హాస్పిటల్కు అవసరమైన యంత్ర పరికరాలు రాలేదని, సిబ్బంది నియామకం కూడా చేపట్టలేదన్నారు. అధికార పార్టీ నాయకులు మాత్రం ప్రారంభం పేరిట హడావుడి చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులకు రంగులు వేసుకోవడం కాదని, కాంగ్రెస్ చేసిన ఒక కొత్త అభివృద్ధి పనినైనా ప్రజలకు చూపించాలని చల్లా సవాల్ విసిరారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలున్నారు.