Rain : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని ఆదివారం విడుదల చేసిన బులెటిన్లో స్పష్టంచేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. ఆదివారం ఉదయం ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం, పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది. ఇది సోమవారం (సెప్టెంబర్ 21) నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడనుంది.
బుధవారం ఉదయానికి ఈ వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలోకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దాని ప్రభావంతో సెప్టెంబర్ 24న తెలంగాణలోని మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రత్యేకంగా హెచ్చరించింది.
అలాగే ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల సహా మరికొన్ని జిల్లాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇదిలాఉండగా.. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వివరించింది.
గడిచిన 24 గంటల్లో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో అత్యధికంగా 13.9 సెంటీమీటర్లు, ములుగు జిల్లా ఏటూరునాగారంలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాజా హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.