నల్లగొండ : ఎల్ నినో ( El Nino) పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ( Jagadishwar Reddy ) ఆరోపించారు. ఎల్ నినో ఎంత అబద్ధమో, బొగ్గు కొరత కూడా అంతే అబద్ధమని వెల్లడించారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం తెలకంటి గూడెం గ్రామంలో ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానిది ( Congress Government ) నేరపూరిత చర్య అని ఆరో పించారు. నీళ్లొచ్చినా కృష్ణా కింద పంటలు ఎందుకు ఎండబెడుతున్నారో సీఎం, మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు కృష్ణానీళ్లు వాడుకున్నామని అబద్ధం చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రైతులకు ఏం సమాధానం చెపుతారని నిలదీశారు.
గతంలోనూ కోమటిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పంటలు సాగుచేసుకోలేకపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. కేసీఆర్ వచ్చినంకనే పంటలు సాగుచేసుకుని, బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నారని, గడిచిన మూడేండ్లుగా పంటలు ఎండబెడుతున్నరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో వరుసగా నాణ్యమైన విద్యుత్తు 24 గంటలు అందించామని గుర్తు చేశారు.
యాదాద్రి, భద్రాద్రిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ యూనిట్లు ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. నీళ్లు లేవని ఒకరు, బొగ్గు లేదని మరొకరు బంద్ పెడుతున్నారని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యమంటే రైతులను ఇబ్బందులు పెట్టడమేనా అని ప్రశ్నించారు. ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.