Kasi Majili Kathalu Episode 23 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశీ యువరాణి విశాలాక్షి ఒక వెర్రివాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రాజ్యం శత్రువుల పాలయ్యేసరికి, తప్పించుకుని పారిపోతూండగా, ఆమె భర్త గుర్రంపై నుంచి జారిపడ్డాడు. ఆ ప్రమాదంలో అతడు మరణించి ఉంటాడని తలపోసిన విశాలాక్షి ఉరి వేసుకోబోయింది. ఇంద్రద్యుమ్న మహారాజు ఆమెను కాపాడాడు. విశాలాక్షి భర్తను వెతుకుతూ మలయాళదేశం చేరుకుని, అక్కడ బలిపురుషునిగా బందీ అయ్యాడు.
వృద్ధ సభాపతి సూచనతో బందీలందర్నీ పాతాళ గృహానికి చేర్చారు. అక్కడ తనవంటివారే అనేకమంది బలిపురుషులను చూసిన ఇంద్రద్యుమ్నుడు.. ‘ఓహో! ఆయువు తీరినవారందరినీ దైవం ఈ పట్టణానికి చేర్చుతుంటాడు కాబోలు!’ అనుకున్నాడు.
అందరినీ ఒకదగ్గర చేర్చి తన గురించి తాను చెప్పుకొన్నాడు. సింహాన్ని చంపడానికి తాను భార్యా సమేతంగా కోయగూడేనికి రావడం, విశాలాక్షి కనిపించడం, ఆమెను మగనితో కలపడం కోసం తాను రావడం మొదలైన కథంతా చెప్పి, అక్కడున్న వారందరినీ తమ గురించి చెప్పమని కోరాడు. అతని మాటలు పూర్తికాకుండానే, అక్కడున్న బందీలలో ఒకడు.. “హా విశాలాక్షీ! ప్రాణనాయకీ!” అని బిగ్గరగా రోదించడం వినిపించింది. గడ్డం, మీసాలు పెరిగినా దివ్యతేజస్సుతో ఉన్న ఆ పురుషుని ఇంద్రద్యుమ్నుడు తేరిపారా చూస్తున్నాడు.
“మహారాజా! మీరు పుణ్యాత్ములు. భార్యాపుత్రులకు దూరమైనా కూడా, పరుల నిమిత్తం పాటుపడుతున్నారు. మీరు వెతుకుతున్న విశాలాక్షి భర్తను నేనే. సింహాన్ని చంపినవాణ్ని కూడా నేనే!” అన్నాడతను.
“తన భర్త ఒట్టి వెర్రివాడని విశాలాక్షి చెప్పింది. నిన్ను చూస్తుంటే అలా కనిపించడం లేదే?!” అనుమానంగా అడిగాడు ఇంద్రద్యుమ్నుడు.
“అవును.. ఆ వెర్రివాడిని నేనే. కానీ, పుట్టుకతో తెలివిగలవాణ్ని. ఏకసంథా గ్రాహినని మా గురువుగారు మెచ్చుకునేవారు. మాది గోదావరీ తీరంలోని వీరభద్రపురమనే అగ్రహారం. మా తండ్రిపేరు సోమశేఖరుడు. ఆయన చిన్నతనంలోనే కాశీకి వెళ్లి విద్యాభ్యాసం చేశారు. మహర్షి తుల్యుడైన నా తండ్రి ఒకనాడు అగ్నిహోత్ర గృహంలో ఉండగా, మా తల్లిగారు పుత్రార్థమై ఆయనను యాచించింది. అప్పుడాయన పుత్రజన్మ హేతువైన ఒక ఇష్టిని చేశారు. ఫలితంగా నేను పుట్టాను. నా రూపాన్ని చూసి, మదనుడని పేరు పెట్టారు.
పుట్టుకనుంచే నా బుద్ధి సూక్ష్మమైనది. మా తండ్రిగారు నాకు ఉపనయనం చేసి, తన సహాధ్యాయుడైన విశ్వనాథ భట్టుగారి వద్ద విద్యాభ్యాసానికి కుదిర్చారు. నా చదువు చాలామట్టుకు బాగానే సాగింది. అంతలో మా గురువుగారు ఒక పడుచుకత్తెను మూడో వివాహం చేసుకున్నారు. ఆమె నా దురదృష్టరూపంలో కాపురానికి వచ్చింది. వచ్చిన నాటినుంచి నామీదే కన్నేసింది. ఆ సంగతి నేనెరగను. ఆమె తన జిత్తులతో నన్ను తెలివిగా వశపరుచుకుంది. ఒకనాడు మేమిద్దరం ఏకశయ్యపై ఉండగా మా గురువుగారు చూశారు. కోపం పట్టలేక..
‘విద్యలన్నీ మరిచిపోయి, పూర్వస్మృతి లేకుండా వెర్రివాడివై చరించు’ అని నన్ను శపించారు. అప్పుడు నేను వారి పాదాలపై పడి.. ‘శాపానుగ్రహ సమర్థులైన మీ వాక్కు నా పాలిట వరంగానే భావిస్తాను. కానీ, దయచేసి ఈ శాపాంతాన్ని కూడా అనుగ్రహించండి’ అని వేడుకున్నాను. అందుకు ఆ కరుణామయుడు నాపై జాలిదలిచి.. ‘మరణ సదృశమైన అపాయంలో నీవు ఇరుక్కున్న సమయంలో నీకు పూర్వస్మృతి కలుగుతుంది. విద్యలన్నీ స్ఫురిస్తాయి’ అని చెప్పాడు.
అలా శాప ఫలితంగా నేను వెర్రివాడిగా కాశీ వీధుల్లో చరిస్తుంటే, విశాలాక్షి ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఆ తరువాత శత్రురాజులు దండెత్తి రావడంతో మేమిద్దరం బిలమార్గంలో బయటపడ్డాం. గుర్రంపైనుంచి జారిపడటంతో నాకు మరణభయం కలిగింది. అప్పుడే పూర్వస్మృతి కలిగింది. పుట్టుకతో బ్రాహ్మణుడినైనా, క్షత్రియవిద్యలను కూడా కొంత సాధన చేశాను. అందువల్ల సింహాన్ని తేలికగా చంపగలిగాను. కానీ, ఇంద్రియ వ్యామోహాన్ని మాత్రం చంపుకోలేక పోయాను. దేశదిమ్మరినై తిరుగుతూ ఈ దేశానికి వచ్చి, ఒకానొక కపట స్త్రీ వలలో పడ్డాను. ఇలా బందీనయ్యాను. మీవల్ల విశాలాక్షి తిరిగి జ్ఞాపకం వచ్చింది. నేను వెర్రివాడిగా ఉన్నప్పుడే ఆమె నాపై ఎంతో భక్తి చూపించేది. నా శాపం తీరిందని తెలిస్తే సంతోషించగలదు. కానీ, ఆమెను సంతోషపెట్టే అదృష్టం నాకు లేకపోయింది”.. అంటూ, మదనుడు తన పూర్వగాథను వివరంగా చెప్పాడు.
* * *
అంతా విన్న తరువాత ఇంద్రద్యుమ్నుడు దీర్ఘంగా నిట్టూర్చాడు. కొన్ని సాంత్వన వాక్యాలు పలికి మదనుని ఊరడించాడు. ఆ పాతాళ గృహంలో వారు కొంతకాలం బందీలుగా పడి ఉన్నారు. అంతలో దేవీ నవరాత్రి దినాలు సమీపించాయి. బందీలందరినీ యథాస్థానాలకు తరలించారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాటి ఉదయాన్నే ఓ ఇంట్లో బందీగా ఉన్న ఇంద్రద్యుమ్నునికి తలంటు పోశారు. ఒళ్లంతా పసుపు పూశారు. మెడకు వేపరొట్ట కట్టారు. మంచి అలంకారాలు చేశారు. మహాకాళికి ఎదురుగా ఒక స్తంభం పాతి, బంగారు గొలుసులతో అతణ్ని కట్టివేశారు. ఆ చివరి నిమిషంలో కూడా విశాలాక్షిని, మదనుని ఎలాగైనా కలపమని అమ్మవారిని ప్రార్థించాడు ఇంద్రద్యుమ్నుడు. తన మెడను కత్తివేటుకు వాటంగా ఉండేలా జరిపాడు. మనసును ఈశ్వరాయత్తం చేశాడు. అతడి ధైర్యానికి అర్చకులు వెరగుపడ్డారు. కాళి గజగజా వణికింది. అర్చకులు పుష్పపూజ చేశారు. ధూపదీపాలు సమర్పించారు.
“మహానైవేద్యం అందించండి!” అని అర్చకుడు పలికాడు. యజమాని కత్తి ఎత్తిపట్టి ఇంద్రద్యుమ్నుని మెడ నరకబోయాడు.
అంతలో వీధి తలుపు దబదబమని బాదిన చప్పుడైంది. లోపలివారెవరూ కిమ్మనలేదు. వీరు నిశ్శబ్దం పాటించేకొద్దీ తలుపులు బాదడం మరీ ఎక్కువైంది. త్వరగా తలుపు తీయకపోతే తలుపులు విరగ దన్నేస్తారేమో అనిపించింది. దాంతో ఆ ఇంటి యజమాని ముఖాన బొట్టు చెరుపుకొని, వెళ్లి తలుపు తీశాడు. రాజభటులు బిలబిలమంటూ చొచ్చుకు వచ్చారు. వారి వెంట మహారాజు సింహకేతుడు కూడా ఉన్నాడు. అతని చేతిలో ఒక పుస్తకం ఉంది.
“ఏమయ్యా కృష్ణదాసూ! నీకీ పుస్తకం ఎక్కడిది?” అని అడుగుతుండగానే బలిపశువులా అలంకరించి, స్తంభానికి కట్టేసి ఉన్న ఇంద్రద్యుమ్నుని వైపు మహారాజు దృష్టి పడింది. ప్రశ్నించాల్సిన అవసరం లేకుండానే సమాధానం తెలిసింది.
“కృష్ణదాసును బంధించండి. ఆ బలిపురుషుని విడిపించండి” అని భటులను ఆజ్ఞాపించాడు.
మెడమీద పడాల్సిన కత్తివేటు తప్పిపోవడంతో ఇంద్రద్యుమ్నుడు తేలికగా ఊపిరి తీసుకున్నాడు. సింహకేతుని సమీపించి..
“మహారాజా! నీవంటివారి పాలనలో ఇటువంటి దుష్కృత్యాలు జరగడం వింతగా ఉంది. ప్రజల కష్టాలను పట్టించుకోని రాజు నరకంలో పడతాడని శాస్ర్తాలు చెబుతున్నాయి. ఈ నగరంలో నాలాగా బలికానున్నవాళ్లు వందమందికి పైగా ఉన్నారు. వారందరినీ కూడా దయచేసి కాపాడండి” అన్నాడు.
ఆ ఫిర్యాదును స్వీకరించిన సింహకేతుడు అప్పటికప్పుడే గ్రామంలోని ప్రతి ఇంటినీ శోధించాడు. నవరాత్రి బలుల కోసం సిద్ధపరిచిన బందీలందరినీ విడిపించాడు. ఆ బందీలైన స్త్రీలలో ఇంద్రద్యుమ్నుని భార్య చిత్రసేనాదేవి కూడా ఉన్నది. ఆ భార్యాభర్తలిద్దరూ సింహకేతుని దయవల్ల తిరిగి కలుసుకున్నారు. అడవిలో సింహం దాడిలో సేననుంచి విడిపోయిన తాను, ఈ కేరళీయులకు బందీగా చిక్కిన విధానాన్ని భర్తకు చెప్పుకొని చిత్రసేన సాంత్వన పొందింది. సింహకేతుడు బందీలందరికీ తగిన కానుకలిచ్చి, వారి స్వగ్రామాలకు పంపించాడు. ఇంద్రద్యుమ్నుని, చిత్రసేనను, మదనుని మాత్రం తన అంతఃపురానికి తీసుకొనిపోయి అపూర్వమైన సత్కారాలు చేశాడు.
అప్పుడు ఇంద్రద్యుమ్నుడు.. “అనఘా! నీవు మాకు చేసిన ఉపకారం ఎన్నటికీ మరువదగినది కాదు. యమలోకం దాపులదాకా వెళ్లిన మమ్మల్ని మళ్లీ వెనక్కు లాక్కువచ్చావు. ఇక మాకు అనుజ్ఞ ఇవ్వు. మా విశాలాక్షిని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది” అన్నాడు.
అందుకు సింహకేతుడు నవ్వుతూ..
“మహారాజా! ఈ మదనుడు శాపగ్రస్తుడై ఉన్న సమయంలో విశాలాక్షిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెను విడిచిపెట్టి కూడా చాలాకాలమైంది. ఇప్పుడు మళ్లీ ఆమె కనిపిస్తే స్వీకరిస్తాడా?” అని ప్రశ్నించాడు.
ఆ మాటవిని మదనుడు..
“భూపాలా! నేను శాపగ్రస్తుడనైనా ఆమె మనోవృత్తిని బాగా ఎరుగుదును. మేరువైనా చలిస్తుంది కానీ, ఆమె హృదయం స్థిరమైనది. ఆమెను చూడటం కంటే నాకు వేరే భాగ్యమున్నదా?!” అని పలికాడు.
సింహకేతుడు ఆ మాటలతో సంతోషించినవాడై..
“మహారాజా! ఆ చిన్నది ఈ ఇంటిలోనే ఉన్నది. మీకు చూడ వేడుక అయితే వెంటనే పిలుస్తాను” అంటూ తటాలున లేచి లోపలికి వెళ్లాడు. అతడు వెళ్లిన కొంతసేపటికి.. అదే ద్వారం నుంచి విశాలాక్షి వచ్చింది. ఇంద్రద్యుమ్నునికి, చిత్రసేనకు ముందుగా నమస్కరించింది. తరువాత మదనుని పాదాలు తాకింది. అప్పటికి గానీ మదనుడు ఆమెను గుర్తు పట్టలేకపోయాడు. ఆనందం పట్టలేక.. “హా ప్రేయసీ! హా విశాలాక్షీ!” అంటూ ఆమెను కౌగిలించుకున్నాడు.
“అమ్మా! నీవు మా విశాలాక్షివే. ఇక్కడికెలా వచ్చావు? ఈ రాజుగారి ఆశ్రయం ఎలా పొందావు?” అని ఇంద్రద్యుమ్నుడు ప్రశ్నించాడు.
“పెదనాన్నా! అదో పెద్దకథ. కొంచెం వివరంగా చెప్పవలసి ఉంది” అంటూ తన కథ చెప్పడం మొదలు పెట్టింది.
* * *
“నా భర్తను వెతకడం కోసం మీరటు వెళ్లగానే.. సింహం మా మీద విరుచుకుపడింది. సేనలన్నీ చెల్లాచెదురైపోయాయి. నేను కూడా ప్రాణభీతితో పరుగెత్తి, ఆ రాత్రికి ఒక చెట్టుకింద తలదాచుకున్నాను. ‘నా దురదృష్టం నన్ను రక్షించడానికి పూనుకున్నవారిని కూడా చుట్టుముడుతున్నది. ఇక నేను బతకడం ఎందుకు?’ అనుకుంటూనే అలసట వల్ల కొంతసేపటికి నిద్రపోయాను. ఆ నిద్రలో ఇదివరకెప్పుడూ నాకు కలలో తరచుగా కనిపిస్తూ ఉండే ముత్తయిదువ కనిపించింది. ‘తల్లీ! చింత మానుకో. నీకు త్వరలో మేలు కలుగుతుంది’ అని చెప్పి అంతర్ధానమైంది. నాకు పలుమార్లు ఇలాంటి కలలు రావడం శుభమో అశుభమో తెలియలేదు. నిద్రలేచి, గుర్రమెక్కి తోచిన దారిన పోనిచ్చాను. ఎంతదూరం పోయినా ఆ అడవికి అంతమే కనిపించలేదు. అలసటతో శరీరమంతా చెమటలు కమ్మసాగాయి. ఆకలి దప్పికలు పెరగసాగాయి. అటువంటి సమయంలో నీరునిండిన సరోవరం ఒకటి కన్నుల పండువగా కనిపించింది. ఆ నీటితో నా కడుపు నిండింది. గట్టునున్న చెట్ల పండ్లు తిని ఆకలి తీర్చుకున్నాను. ఒక చెట్టు నీడలో నిద్రించాను. కొంతసేపటిలోనే గాఢంగా నిద్రపట్టింది.
అలా ఎంతసేపు నిద్రించానో తెలియదు. తిరిగి కళ్లు తెరిచి చూసేసరికి నేనొక ఉద్యానవనంలో ఉన్నాను. నా గుర్రం, నీరు తాగిన తటాకం, నేను నిద్రించిన చెట్టు.. ఇవేవీ కనిపించలేదు. నేను కలలో ఉన్నానో, మేలుకుని భ్రమపడుతున్నానో కొద్దిసేపు గుర్తించలేకపోయాను. అది కలకాదు. కలలో కర్మేంద్రియాలన్నీ స్వాధీనంలో ఉండవు కదా! అప్పుడు నేనున్న చోటు తాకి, నడిచి, ఆఘ్రాణించి తెలుసుకోగలిగాను. అక్కడ సూర్యచంద్రులు కనిపించలేదు. కానీ, వెలుతురు మాత్రం చక్కగా ఉంది.
నేనా తోటలో చాలాసేపు నడిచాను. ఆ పుష్ప జాతులు, ఫలజాతులు భూలోకంలో ఎన్నడూ కనీవినీ ఎరిగినవి కావు. పూలల్లోనే కాకుండా పండ్లలోనూ అద్భుతమైన పరిమళం ఉండటం నన్ను ఆశ్చర్యపరిచింది. అక్కడ ఎంతసేపు నడిచినా ఆనందమే కానీ, అలసట లేనే లేదు. కానీ సరదాకోసం ఒక చెట్టు మీదినుంచి వింతైన ఫలాన్ని తెంచుకుని తిన్నాను. ఆ పండు మాధుర్యాన్ని ఏమని చెప్పను?! దాన్ని తిన్నప్పటినుంచి నాకు ఆకలి దప్పికలు పూర్తిగా నశించాయి. ఆ చెట్టుమీద అటువంటి పండు ఇంకొక్కటి మాత్రమే ఉండటం గమనించి, దాన్ని కూడా తెంచి మూట కట్టాను. మరికొంతదూరం నడిచాక నేనొక అద్భుతమైన పుష్పాన్ని చూశాను. చెట్టు మొత్తానికీ ఒకే పువ్వు ఉన్నది. దాని సువాసనకు మోజుపడి, దానిని కూడా కోసి భద్రపరిచాను.
మరికొంతదూరం వెళ్లేసరికి నవరత్నాలతో నిర్మించిన దేవాలయం ఒకటి కనిపించింది. ఆ ఆలయ ముఖమంటపంలో ఒక దివ్యస్త్రీ వీణావాదన చేస్తూ కనిపించింది.
అతివినయంతో చేతులు జోడించి నిలబడి ఉన్న నన్ను కూర్చోమని సైగచేసింది. నేను ఒక వారగా కూర్చున్నాను. ఆమె తనపేరు వీణావతి అని, తుంబురుని శిష్యురాలినని చెప్పింది. ఆ ఆలయంలోని విశాలాక్షిని సేవించడానికి ప్రతిదినం వస్తుంటానని చెప్పింది. తిరిగి తన వీణావాదనను ప్రారంభించింది. ఆమె స్వరకల్పనలు నన్ను విస్మయ పరిచాయి. ఆ పాటకు రాళ్లుకూడా కరిగిపోతాయేమో అనిపించింది. రాళ్లుకూడా నాట్యం చేస్తాయేమో అని తోచింది. నాకుకూడా సంగీతశాస్త్రంలో కొంత ప్రవేశం ఉన్నందువల్ల ఆ స్వర విశేషాలను సులభంగా గ్రహించాను.
ఆమె వీణాగానం పూర్తయ్యాక మరికొంచెంసేపు ఆమెతో మాట్లాడాలని అనిపించింది. సమయం కోసం వేచిచూస్తుండగా.. ఆమె మోహనరాగం మొదలుపెట్టింది. ఆ రాగాన్ని వింటుంటే నా మనసు నీరై పోయింది. మేను పరవశమైపోయింది. ఎప్పుడు నేలకొరిగానో నాకే తెలియదు. గాఢనిద్రలో కూరుకుపోయాను.
మెలకువ వచ్చి చూసేసరికి ఆ మునుపటి చెట్టు, తటాకం, నా గుర్రం మళ్లీ కనిపించాయి. ఇదంతా కలే కదా!? అనుకున్నాను. కానీ, ఉద్యానంలో నేను తెంచుకువచ్చిన అద్భుత ఫలం, అద్భుత పుష్పం.. నా చెంగునే దర్శనమిచ్చాయి”.
(వచ్చేవారం.. మన సొత్తు చేజారినా పోదు!)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu Episode 22 | మలయాళ దేశం
Kasi Majili Kathalu Episode 20 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు – 2
Kasi Majili Kathalu Episode 19 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు
Kasi Majili Kathalu Episode 17 ( కాశీ మజిలీ కథలు ) | చిత్రసేన
Kasi Majili Kathalu Episode 16 ( కాశీ మజిలీ కథలు ) | శరభసాళువం
Kasi Majili Kathalu Episode 15 ( కాశీ మజిలీ కథలు ) | దైవమిచ్చిన భార్య