Kasi Majili Kathalu Episode 29 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : జగన్నాథపురంలో పూలమాలలు అల్లుకునే రుచికుడు అకస్మాత్తుగా మాయమయ్యాడు. తాను మాయం కావడానికి వెనుక గల కథను తన ప్రేయసులిద్దరికీ వివరిస్తున్నాడు. దివ్యవిమానంలో తాను స్వర్గలోకానికి వెళ్లానని, తిలోత్తమ సాయంతో అక్కడి విశేషాలు అనేకం చూశానని చెప్పాడు. అతని రాకను దేవతలు కనిపెట్టడంతో, వెంటనే అతణ్ని తిలోత్తమ కిందికి తీసుకువచ్చింది.
“నేను కళ్లు నులుముకున్నాను. అది కలకాదు.. నిజమే! స్వర్గలోకపు తిలోత్తమను పోలిన ఒక అమ్మాయి ఈ భూలోకంలో కూడా ఉంది”.. అంటూ రుచికుడు తన ఎదురుగా ఉన్న తిలోత్తమ వంక సాభిప్రాయంగా చూశాడు. ఆమె సిగ్గుపడి తలవంచుకుంది. చంద్రలేఖ అతడి దృష్టిని మరలించింది. “మహాశయా! దయచేసి తరువాతేం జరిగిందో చెప్పండి” అన్నది.
రుచికుడు మళ్లీ తన కథను కొనసాగించాడు.
* * *
అప్పుడు తిలోత్తమా అప్సర నాతో..
“మానవా! ఆమెను చూశావు కదా! విద్యారూప సుకుమారాలలో నాకు సాటిరాగలదు. ఆమె నీకు ఇష్టభోగాలను అందిస్తుంది” అని చెప్పింది.
నేను దుఃఖపడుతూ..
“నువ్వు నాకు మేలు చేస్తున్నావు. కానీ నావల్ల నువ్వు కష్టాల పాలయ్యావు. మీవాళ్లు నిన్నేం చేస్తారో అని బెంగగా ఉంది” అన్నాను.
“కానున్నది కాకమానదు. నువ్వు వెళ్లిరా” అని తిలోత్తమ నన్ను చేయి పట్టుకుని, విమానం నుంచి దింపింది. భూలోక మందిరంలో విడిచిపెట్టింది.
చెలికత్తెలతో కలిసి వీణావాదంలో మునిగి ఉన్న ఈ తిలోత్తమను చూసిన వెంటనే నేను తీరని మోహంలో పడిపోయాను. ఆమె కూడా వరించింది. అప్పటికప్పుడే మేమిద్దరం గాంధర్వ వివాహం చేసుకున్నాం. మూడురోజులపాటు అహోరాత్రులు ఆనందడోలికల్లో మునిగితేలాం. కాలమంతా అలాగే గడిచిపోతే అసలు కథే లేదు.. ఒకనాడు నేను తెల్లవారి లేచి కళ్లు తెరిచేసరికి తిలోత్తమ పక్కన లేను. ఒక దివ్యవిమానంలో ఉన్నాను. నా ముందు దేవదూతలు ఉన్నారు. వారు నన్ను స్వర్గానికి తీసుకుపోతున్నారు. పాపం తిలోత్తమా అప్సర భయపడినంతా అయింది. నా గురించి దేవేంద్రుడికి తెలిసిపోయి ఉండవచ్చు. నన్ను విచారించడానికే తీసుకుపోతున్నారని అర్థమైంది. ఏ శిక్ష విధిస్తారో ఏమోనని ఆలోచిస్తూ విమానం దిగాను.
‘దేవేంద్రులు పూజలో ఉన్నారు. ఇతణ్ని కొంతసేపు చెరసాలలో ఉంచండి’ అని ఆజ్ఞలు వెలువడ్డాయి.
దేవదూతలు నన్ను కారాగారంలో పెట్టారు. నేనక్కడ చింతిస్తూ కూర్చుని ఉండగా, ఎక్కడినుంచో ఒక చిలుక నా దగ్గరికి ఎగిరివచ్చింది. దాని ముక్కుకు ఒక లేఖ తగిలించి ఉంది. నేను దాన్ని అందుకుని చదవసాగాను. అది తిలోత్తమ రాసింది. దానిలో ఇలా ఉంది.
“రుచికా! నువ్వు వెళ్లిన తరువాత దేవేంద్రుల వారు నన్ను విచారణకు పిలిచారు. తన సింహాసనం వెనుక కనిపించిన నీ ఉత్తరాన్ని చూపించి, దాని సంగతి నాకేమైనా తెలుసునా అని అడిగారు. నాకు తెలియదన్నాను. నన్నెవరో మానవునితో కలిసి ఉండగా చూసినట్లు కొంతమంది చెప్పారట. ఆ మనిషి ఎవరని దేవేంద్రులు ప్రశ్నించారు. అతనెవరో నాకు తెలియదని చెప్పాను. దేవేంద్రుడు నన్ను విడిచిపెట్టేశాడు. కానీ, జయంతుడు ఒకనాడు నా దగ్గరికి వచ్చి, అసలేం జరిగిందని గుచ్చిగుచ్చి ప్రశ్నించాడు.
‘నువ్వు నన్ను దారిమధ్యలో విడిచిపెట్టేసి వెళ్లిపోయావు. నన్నో రాక్షసుడు బలవంతంగా ఎత్తుకుపోయాడు. ఏదో పర్వతదుర్గానికి తీసుకుపోయి, ‘నా కోరిక తీరుస్తావా? చంపమంటావా?’ అని బెదిరించాడు. అందుకు నేను భయపడి.. ‘నీ కోరిక తీరుస్తాను. కానీ, నువ్వు అశుచిగా ఉన్నావు. నీతో క్రీడించకూడదు. స్నానం చేసి రా!’ అని పంపాను. అక్కడో చిన్నకాలువ ఉంది. వాడి శరీరం మాత్రం పర్వతంలాగా ఉంది. అందువల్ల వాడు ఆ కాలువలోని నీళ్లలో బోర్లా పడుకుని నెత్తిమీద నీళ్లు చల్లుకుంటున్నాడు. నేను సమయం కనిపెట్టి కత్తి తీసుకుని, వాడి తల నరికేశాను. కొండచరియ దొర్లిపడ్డట్లు వాడి దేహం నుంచి తలకాయ వేరైంది. ఆ కాలువలో కొట్టుకుపోయింది. తిరిగి నేను స్వర్గానికి వెళ్లే దారేమిటో తెలియక బాధపడుతుంటే, ఒక కింపురుషుల జంట కనిపించింది. వారికి నా కథ వినిపించడంతో జాలిపడి, వారి విమానం మీద నన్ను మళ్లీ స్వర్గానికి చేర్చారు’.. అని జయంతునితో చెప్పాను. అతడు నమ్మాడు.
కానీ, దేవేంద్రుడు నమ్మలేదు. తన సభలో కనిపించిన ఉత్తరం ఎవరిదో చదివించుకోడానికి బృహస్పతుల వారిని పిలిచారు. ‘ఆ ఉత్తరం జగన్నాథపుర కాపురస్తుడైన రుచికుడనే వాడికి, ఎవరో పూలమాలలు పంపమన్నట్లు రాసినది’ అని దేవగురువు విడమరిచి చెప్పారు. ‘ఇప్పుడా రుచికుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి?’ అని అడిగితే.. ఆయన తన జ్యోతిష విద్యాప్రభావం చేత చూసి నువ్వు ఉన్న తావు చెప్పారు. అందువల్ల నిన్ను మళ్లీ స్వర్గానికి తీసుకొచ్చారు. జరిగినదంతా నీకు చెప్పాను. ఇక నన్ను నీటముంచినా పాలముంచినా నీదే భారం. నా మాటలు అసత్యాలు కాకుండా కాపాడు”..
– నీ ప్రియురాలు, తిలోత్తమ
..ఆ ఉత్తరాన్ని పలుమార్లు చదువుకుని, దేవేంద్రునితో ఎలా మాట్లాడాలో మనసులోనే పథకం రచించుకున్నాను. ఈలోగా ఉత్తరం తెచ్చిన చిలుక ప్రత్యుత్తరం ఇమ్మని తెలివిగా సైగ చేయడం మొదలుపెట్టింది. ఆ లేఖపైనే పళ్లరసంతో..
‘నీ మాట నిలబెడతాను. నీ గౌరవాన్ని కాపాడతాను’ అని తిలోత్తమకు తిరుగు జవాబు రాసిచ్చాను. కొంతసేపటికి దూతలు వచ్చి, నన్ను దేవేంద్రుని ఎదుట ప్రవేశపెట్టారు. నేను ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాను. సభ్యులైన ఇతర దేవతలందరికీ మొక్కాను. చేతులు మోడ్చి..
“దేవా! నా పుణ్యంకొద్దీ తమను చూడగలిగాను. ధన్యుడినయ్యాను” అని చెప్పాను.
దేవేంద్రుడు సంతోషించాడు. అంతలోనే..
“ఏమయ్యా! నువ్వెవ్వరు? నీ పేరేమిటి? నువ్వింతకు ముందెప్పుడైనా స్వర్గాన్ని చూశావా?” అని అడిగాడు గంభీరంగా..
అప్పుడు నేను నా వృత్తాంతం వారికి ఇలా చెప్పాను.
..“దేవా! నాపేరు రుచికుడు. మాది జగన్నాథపురం. మా తండ్రి జగన్నాథ భక్తుడైన బలదేవుడు. ఆయన నాకు చక్కని విద్యాబుద్ధులు చెప్పించాడు. పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. కానీ, ఆయన తెచ్చిన సంబంధాలేవీ నాకు నచ్చలేదు. మానవ స్త్రీలలో శాస్త్రసిద్ధమైన సౌందర్యం కలవారు ఒక్కరూ కనిపించడం లేదు. ‘నేను దేవకాంతను తప్ప వేరొకరని వివాహం చేసుకోను’ అని మా తండ్రిగారితో చెప్పాను.
నా వ్యవహారం చూసి, ఆయన ఎంతో బాధపడ్డాడు. తన ఇష్టదైవం జగన్నాథ స్వామికి మొరపెట్టుకున్నాడు. ఆయన మా తండ్రిగారి కలలో కనిపించి..
‘రామచంద్ర నగరాన్ని పాలించే శూరసేనుని కుమార్తె తిలోత్తమ అంశతో పుట్టింది. ఆమెనిచ్చి నీ కుమారునికి వివాహం జరిపించు. ఆమె మూలంగా నీ కుమారునికి స్వర్గలోక దర్శనభాగ్యం దొరుకుతుంది’ అని చెప్పాడు. తనకు వచ్చిన కలను మా తండ్రిగారు నాతో చెప్పాడు. కలలో లాగానే మా పెళ్లి జరిగింది. కానీ, నా సంతోషం ఎక్కువకాలం నిలవలేదు.
‘స్వర్గాన్ని చూడాలనే నా కోరిక తీరనేలేదు. నేను సంసారం వదిలేసి సన్యసిస్తాను’ అని మా నాన్నను విసిగించాను. మళ్లీ మా తండ్రి తన కలలో స్వామిని దర్శించాడు. ఆయన కలలో చెప్పిన సమయానికే నేను, నా భార్య అయిన తిలోత్తమ కలిసి.. ఆలయానికి వెనుక దివ్యవిమానం ఎక్కి స్వర్గానికి వచ్చాము.
దారిలో కొంతమంది నా భార్యను చూసి, తిలోత్తమే అనుకున్నారు. వాళ్లెవరికీ మేము నిజం చెప్పలేదు. మేమిద్దరం కలిసి నందనవనంలో కొంతసేపు విహరించాం. మీరిప్పుడు కూచున్న సింహాసనానికి వెనుకవైపు నుంచి ఈ సభాభవనంలోకి అనుకోకుండా ప్రవేశించాం. కొద్దిసేపు ఇక్కడ గడిపిన తరువాత మేం మళ్లీ భూలోకానికి వెళ్లిపోయాం. నేను అత్తవారింట ఉండగా మీ దేవదూతలు నన్ను తీసుకువచ్చారు”..
అని నేను కట్టుకథ చెప్పాను. దేవసభలో అందరూ నేను చెప్పిందంతా నమ్మారు.
“రుచికా! నీవంటి గొప్ప భక్తుణ్ని చూడటం ఆనందం కలిగించింది. నీకు మూడు వరాలిస్తున్నాను. ఏం కావాలో కోరుకో!” అన్నాడు దేవేంద్రుడు.
అప్పుడు నేను చేతులు జోడించి..
“దేవా! తిలోత్తమా అప్సర నా భార్య పోలికతో ఉంటుందని వినడమే కానీ, చూడలేదు. ఆమెను చూడాలని ఉంది” అని మొదటివరం కోరుకున్నాను.
తిలోత్తమ వచ్చింది. ఆమెను దూరం నుంచే చూసి, ఆనందించాను. ఆమె కళ్లతోనే నాకు కృతజ్ఞతలు చెప్పింది.
“దేవా! నా రెండోవరం కోరుకుంటున్నాను. ఇదివరకు వచ్చినప్పుడు నందనవనంలో సంగీత వృక్షం చూశాను. నాకు ఆ చెట్టు విత్తనాలు ఇప్పించండి. దానిని భూమిలో సాగు చెయ్యడం ఎలాగో చెప్పండి” అని కోరుకున్నాను.
దేవేంద్రుడు ఇబ్బందిగా మొహం పెట్టాడు.
“మానవా! వరమిచ్చాను కనుక, ఆ విత్తనాలు తీసుకుపోనిస్తాను. భూలోకంలో ఆ చెట్టు బతికినా.. పుణ్యాత్ములు కానివారికి దాని సంగీతం వినిపించదు” అని చెప్పి, విత్తనాలు తెప్పించి ఇచ్చాడు.
“దేవా! నా మూడోవరం. నా మిత్రుడైన గౌతముడు నానుంచి దూరమై చాలా కాలమైంది. ఇప్పుడతను ఎక్కడున్నాడో! కొద్దిగా నన్నక్కడ దింపివేయమని మీ దూతలతో చెప్పండి” అని కోరుకున్నాను.
అలా దేవతల సహాయంతో నేను ఢిల్లీలో గౌతముడు ఉన్న ఇంటిముందు దిగాను. అక్కడినుంచి మేమిద్దరం ఈ ఊరు రావడం, జగన్నాథపురానికి వెళ్లాలని ప్రయత్నిస్తుంటే మీ కంటపడటం తెలిసిందే..
..అంటూ రుచికుడు తన కథను పూర్తిచేశాడు.
* * *
“బాగుంది. దేవతా స్త్రీలను చూసిన మీ కళ్లకు మాబోటివారు కనబడతారా?” అన్నది చంద్రలేఖ ఓరకంట చూస్తూ.
“ఎంతమాట?! మానవులకు మానవస్త్రీలతో పొందు మాత్రమే విధాయకం. నాకు నీ మీద, తిలోత్తమ మీదగల ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు” అన్నాడు రుచికుడు, ఆమెను దగ్గరికి తీసుకుంటూ.
అందరూ ఆ మాటలకు సంతోషించారు. ఆ తరువాత రుచికుడు తన తండ్రిని కలుసుకున్నాడు. కొడుకుపై ఆశలు వదిలేసుకున్న ఆ ముసలితండ్రి ఆనందానికి హద్దులేకుండా పోయింది.
అప్పటివరకు తన మంత్రిగా పురుషవేషంలో ఉన్నది ఒక స్త్రీ అని తెలిసిన రుక్మాంగదుడు ఆశ్చర్యపోయాడు. రుచికునితో సహా అందరినీ తన రాజ్యంలోనే ఉండిపొమ్మని బతిమాలాడు. కానీ, వారు ఒప్పుకోలేదు. చేసేది లేక చంద్రలేఖను తన కుమార్తెగా భావించి, రుచికునికి కన్యాదానం చేశాడు. చంద్రలేఖకు సారెపెట్టి అత్తవారింటికి సాగనంపాడు. రుచికునితో సహా వారంతా ముందుగా శూరసేనుని రాజ్యానికి వచ్చారు. అక్కడ తిలోత్తమతో బహిరంగంగా రుచికుని వివాహం జరిగింది. అనంతరం ఆ రాజ్యం కూడా అతనికే సంక్రమించింది.
దేవలోకం నుంచి తెచ్చిన సంగీతవృక్షం విత్తనాలను జగన్నాథపురిలోనే నాటాలని నిశ్చయించుకున్నాడు రుచికుడు. అయితే, అతిసూక్ష్మమైన ఆ విత్తనాలు ఎక్కడో పొరపాటున జారిపడిపోయాయి. రుచికుడు.. విత్తనాలు పడ్డాయన్న అనుమానం ఉన్న నేలంతా నీరు పారించాడు. క్రమంగా విత్తనాలు మొలకెత్తి, పెరిగి పెద్దవయ్యాయి. అక్కడికి సమీపంలోనే రుచికుడు అనేక భవంతులు నిర్మింప చేశాడు. ఆ తరువాత తాను బతికి ఉన్నంతకాలం ఏడాదికి ఆరు నెలలపాటు తన భార్యలిద్దరితోపాటు అక్కడికి వచ్చేవాడు. అనేకమంది వీణా విద్వాంసులు ఒకేసారి కచేరి చేసినట్లు సంగీతాన్ని వినిపించే ఆ దేవలోకపు చెట్లు పాడేపాటలను వింటూ ఆనందించేవాడు.
(వచ్చేవారం.. అదృష్టదీపుడు)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | స్వర్గంలో మానవుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | ఎగిరే చెట్లు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |కాశీ మజిలీ కథలు : దొంగల తప్పిదం
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |రహస్య స్నేహితుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | జగన్నాథ స్వామి
Kasi Majili Kathalu Episode 23 ( కాశీ మజిలీ కథలు ) | విశాలాక్షి కల”
Kasi Majili Kathalu Episode 22 | మలయాళ దేశం
Kasi Majili Kathalu Episode 20 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు – 2
Kasi Majili Kathalu Episode 19 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు