Bachupally | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మలాజిగిరి జిల్లా బాచుపల్లి సర్వే నంబర్ 83లోని భూములకు సంబంధించిన సంక్లిష్ట వివాదంలో 3 ఎకరాల 9 గుంటల భూమి యజమానికి హైకోర్టు ఉపశమనం కల్పించింది. ఆ సర్వే నంబర్లో 3 ఎకరాల 9 గుంటల భూమిని కలిగి ఉన్న ఆ యజమాని అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నది. భూ గరిష్ఠ పరిమితి (ల్యాండ్ సీలింగ్) కేసులో వివాదాస్పద భూముల లావాదేవీలపై ఆంక్షలు విధిస్తూ నిరుడు ఏప్రిల్ 10న జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల పరిధి నుంచి ఆ 3 ఎకరాల 9 గుంటల భూమిని మినహాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. బాచుపల్లి సర్వే నంబర్ 83లో మొత్తం 17.30 ఎకరాల భూమి ఉన్నది. దీని అసలు యజమాని జాగీర్దార్ జుల్ఫికర్ అలీ. 1966లో ఆయన రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా ఆ మొత్తం భూమిని ముగ్గురికి విక్రయించారు. కొనుగోలుదారుల్లో ఒకరైన వెంకట్రామయ్య ఆ ప్రాంతంలో దాదాపు 116 ఎకరాల పట్టా భూమిపై తనకు యాజమాన్య హక్కులున్నట్టు ప్రకటించడంతో వ్యవసాయ భూ గరిష్ఠ పరిమితి సంసరణల అమలు తర్వాత వివాదం తలెత్తింది. దీనిపై జరిగిన విచారణలో అధికారులు దాదాపు 27 ఎకరాలను మిగులు భూమిగా నిర్ధారించారు. అందులో 5.25 ఎకరాలు సర్వే నంబర్ 83 పరిధిలోకి వచ్చాయి. 1976లో ప్రభుత్వం ఆ మిగులు భూమిని స్వాధీనం చేసుకున్నప్పటికీ సీలింగ్ ప్రక్రియకు సంబంధించిన న్యాయపోరాటం వివిధ కోర్టులు, అప్పిలెట్ వేదికల్లో దశాబ్దాలపాటు కొనసాగింది.
1970 మార్చి 30న రాసుకున్నట్టు చెప్తున్న సాధారణ, రిజిస్టర్ కాని పత్రం ఆధారంగా సర్వే నంబర్ 83లోని 6.25 ఎకరాలపై తనకు హకులున్నాయని ఎంఏ ఖయ్యూమ్ అనే వ్యక్తి పేరొన్నారు. ఆ తర్వాత 1989, 1992లో సెక్షన్లు 13బీ, 13సీ కింద ధ్రువీకరణ పత్రాలు జారీ అయినట్టు చూపే రికార్డులను సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. కానీ, అప్పటికే 83 సర్వే నంబర్లోని భూములన్నీ రిజిస్టర్డ్ అమ్మకపు పత్రాల ద్వారా హకులు పొందిన కొనుగోలుదారుల పేరిట నమోదై ఉండటంతో రెవెన్యూ రికార్డుల్లో ఖయ్యూమ్ పేరును చేర్చడం సాధ్యం కాలేదు.
ఆ తర్వాత రెవెన్యూ అధికారులు కొన్ని రికార్డుల నుంచి వెంకట్రామయ్య పేరును తొలగించి, ఖయ్యూమ్ పేరును నమోదు చేసినట్టు ఆరోపణలు రావడంతో ఈ వివాదం మరింత సంక్లిష్టమైంది. ఆ తర్వాత ఆ భూమి పలుమార్లు చేతులు మారింది. ఈ వ్యవహారం 2025 ఏప్రిల్లో హైకోర్టు ముందుకు రావడంతో.. సర్వే నంబర్ 83లోని 17.30 ఎకరాలతోపాటు ఆ చుట్టుపక్కల సర్వే నంబర్లలోని భూముల క్రయవిక్రయాలను నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అసలు కొనుగోలుదారుల్లో ఒకరి వారసురాలు హైకోర్టును ఆశ్రయించారు.
తన 3.09 ఎకరాల వాటాకు సీలింగ్ మిగులు భూమితో ఎలాంటి సంబంధం లేదని, అయినప్పటికీ దానిని పొరపాటున నిషేధిత భూముల జాబితాలో చేర్చారని ఆమె పేర్కొన్నారు. ఆ మహిళ కథనం ప్రకారం ఆ భూమి మొదట దివంగత నిమ్మగడ్డ రామనాథంకు చెందినది. ఆయన రిజిస్టర్డ్ సేల్ డీడ్లు, సదా బైనామా ద్వారా ఆ ఆస్తిలోని కొన్ని భాగాలను కొనుగోలు చేశారు. ఆ తర్వాత కుటుంబ పరిషారం ద్వారా సర్వే నంబర్ 83లోని 3.09 ఎకరాల భూమి ఆమెకు లభించింది. దానిపై ఆమెకు ఉన్న హక్కులు రెవెన్యూ రికార్డులతోపాటు ఆన్లైన్ పహాణీ ఎంట్రీల్లో ప్రతిబింబించాయి.
దీంతో ఆమె భూమికి పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్తో సంబంధం లేదని గుర్తించిన హైకోర్టు.. 2025 ఏప్రిల్ 10 నాటి మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని, తద్వారా ఆ 3.09 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అనంతరం ఆ ఆస్తిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ సెక్షన్ 22-ఏ(4) కింద దరఖాస్తుదారు వినతిపత్రం సమర్పించేందుకు స్వేచ్ఛను మంజూరు చేసింది. ఆమె సమర్పించే వినతిని పరిశీలించి 3 నెలల్లోగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించింది.