Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు(Heavy rains) జనజీవనాన్నిస్తంభింపజేస్తున్నాయి. వర్షాలకు సిర్మౌర్ జిల్లాలో ఒక నివాస గృహం(Houses collapsed )కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారని జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ (DDMA) తెలిపింది. మౌజా పిసి డిడాగ్లోని చిచ్ఛడియాకు చెందిన భీమ్ సింగ్ నివాస గృహం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ఇంటి లోపల చిక్కుకుపోగా, స్థానిక గ్రామస్తుల సహాయంతో వారిని బయటకు తీశారు. భీమ్ సింగ్ భార్య నిర్మల (60), కుమార్తె పూజ (32) మరణించగా హీరా( 2), అభియానా (2) అనే ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరు పిల్లలను రాజ్గఢ్లోని సివిల్ దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంలో విద్యుత్ మౌలిక సదుపాయాలకు లేదా ఇతర ఆస్తులకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
కాగా, అధికారిక నివేదిక ప్రకారం భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్ అంతటా జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తూనే ఉన్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 204 రోడ్లు మూసుకుపోయాయి. గత 43 రోజుల్లో ప్రభుత్వ ఆస్తులకు జరిగిన మొత్తం నష్టం రూ. 910 కోట్లు దాటింది. పదేపదే కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, మేఘ విస్ఫోటనాలు, ఇతర వాతావరణ సంబంధిత సంఘటనల కారణంగా రోడ్లు, విద్యుత్ మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా వ్యవస్థలు,ప్రైవేట్ ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.