Kasi Majili Kathalu Episode 28 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : జగన్నాథపురంలో పూలమాలలు అల్లుకునే రుచికుడు అకస్మాత్తుగా మాయమయ్యాడు. అందుకు కారణమైన చంద్రలేఖ త్రిగర్త దేశానికి మంత్రి అయింది. తిలోత్తమ అనే రాజకుమారి శివభక్తురాలైంది. చివరికి మిత్రునితోసహా త్రిగర్తకు వచ్చిన రుచికుడు, తన చరిత్రను వారిద్దరికీ చెబుతున్నాడు. చంద్రలేఖ ఉద్యానంలోని అశోక వృక్షంపై దాక్కుని ఉండగా కనిపించిన దివ్యవిమానం ఎక్కాడు రుచికుడు. ఆ విమానం స్వర్గానికి వెళ్తున్నది. అంతలో..
విమానానికి సమీపంలో కలకలం రేగింది. స్వర్గంనుంచి కొందరు కింపురుషులు బిలబిలలాడుతూ వస్తుండగా, దారిమధ్యలో సిద్ధులు ఆపారు. “ఏం జరిగింది?” అంటూ ఆరా తీశారు.
“రక్తాక్షుడనే రాక్షసుడు వరగర్వంతో స్వర్గంపై దాడి చేశాడు. వాడితో విరోధం ఎందుకులెమ్మని, దేవేంద్రుడు ఆ రాక్షసుణ్ని తన సేనలతో సహా నందనవనంలో విడిది చేయించాడు. అనేకమంది పరిచారకులను సేవలకోసం నియమించాడు. దానితో రక్తాక్షుడు సంతృప్తి చెందలేదు. ‘దేవకాంతలు మమ్మల్ని చూసి తలుపులు మూసుకున్నారేమి? దేవసభలోకి మమ్మల్ని రానివ్వడం లేదేమిటి?’ అంటూ గందరగోళం చేయసాగాడు. అందుకు ఇంద్రుడు.. ‘దేవసభకు వెళ్లడానికి రాక్షసులకు అనుమతి లేదు’ అని సాత్విక వచనాలతో ఒప్పించడానికి చూశాడు. కానీ వాడు వినకపోవడంతో దేవదానవ యుద్ధం తప్పలేదు. చివరికి రక్తాక్షుడు ఇంద్రుణ్ని ఓడించి.. పాశాలతో కట్టి, తన లోకానికి తీసుకుపోయాడు. స్వర్గంలో రాక్షసుల అల్లరిని తట్టుకోలేక, మేం పారిపోతున్నాం” అని చెప్పారు వాళ్లు.
ఆ మాటలన్నీ విమానం నుంచి విన్న జయంతుడు..
“తిలోత్తమా! విన్నావా? నువ్వు ఇంటికి పో. నేను వెళ్లి ఆ రాక్షసుణ్ని గెలిచి, మా తండ్రిని విడిపించుకుని వస్తాను” అని పలికి ఆయుధాలు ధరించి, రౌద్రాకారంతో విమానం దిగి ఆకాశమార్గంలో వెళ్లిపోయాడు.
మేమెక్కిన విమానం ఊర్ధ్వదిశగా ప్రయాణించింది. కొద్దిసేపటి తరువాత నందనవనంలోని విమానశాలలో దిగింది. దిగబోయే సమయంలో తిలోత్తమ స్తంభం మాటున దాగి ఉన్న నన్ను చూసి ఆశ్చర్యపోయింది.
“అయ్యా! మీరెవరు? ఈ విమానంలోకి ఎలా వచ్చారు?” అని ప్రశ్నించింది.
అప్పుడు నేను ఆమెకు ఇలా జవాబిచ్చాను.
“నేను పూరి జగన్నాథస్వామి భక్తుణ్ని. నన్ను రుచికుడు అంటారు. నేను అనేక పురాణాల్లో స్వర్గలోక విషయాల గురించి చదువుకున్నాను. ‘స్వామీ! నీ అనుగ్రహం ఉంటే దానిని చూడగలను కదా!’ అని ప్రార్థిస్తూ నిద్రపోయాను. అప్పుడు జగన్నాథుడు కలలో కనిపించి.. ‘భక్తా! నీ కోరికను నెరవేరుస్తాను. రేపు రాత్రి ఈ ఊరిలో ఉన్న చంద్రలేఖ అనే వేశ్య ఇంటి పెరటితోటలో ఉన్న అశోకవృక్షాన్ని ఎక్కి కూర్చో. అక్కడికి తిలోత్తమ, జయంతులు విహారం కోసం వస్తారు. నా వరంవల్ల నువ్వు వారి విమానంలో ఎక్కగలుగుతావు. నీకు తిలోత్తమతో స్నేహం కుదురుతుంది. ఆమె నీకు స్వర్గలోక విశేషాలన్నీ చూపిస్తుంది’ అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. స్వామి మాట తప్పదు. ఇంతకూ నువ్వు తిలోత్తమవేనా?” అని ప్రశ్నించాను.
అందుకామె తనలోని భయభక్తులన్నీ ప్రదర్శిస్తూ..
“జగన్నాథస్వామి ఆనతిచ్చాడంటే ఎవరైనా పాటించి తీరాల్సిందే కదా! అయ్యా! మీ పని నేను చేసిపెడతాను” అంటూ నన్ను తీసుకుని అలకాపురిలో ప్రవేశించింది.
అక్కడ కావలివారు లేరు. రాక్షసభయంతో దేవతలు పారిపోయారు. తమతో యుద్ధం చేసేవారు లేక రాక్షసులు కూడా తమకు తోచిన దిక్కుకు వెళ్లిపోయారు. అలకాపురం చాలావరకూ చడీచప్పుడు లేకుండా ఉంది. విహారశాలలు, రత్నశాలలు వెలవెలబోతున్నాయి. మణిశిలామయమైన బాటల వెంట నడుస్తుంటే మనసుకు హాయిగా ఉంది. ఒకచోట సంగీతం వినవస్తున్నది. కానీ అక్కడెవరూ లేరు. పరీక్షించి చూస్తే.. ఆ మనోజ్ఞమైన సంగీతం కొన్ని చెట్ల నుంచి వస్తున్నట్లు తెలిసింది. తిలోత్తమను అడిగితే..
“అది సంగీత వృక్షం’ అని చెప్పింది. అనేకమంది వైణికులు ఒకేసారి వీణావాదనం చేసినట్లుగా సంగీతాన్ని వినిపిస్తాయా చెట్లు. పూర్వం ఆ చెట్టు కైలాసంలో ఉండేదట. శివుణ్ని ప్రార్థించి దానిని విష్ణువు వైకుంఠానికి తెచ్చుకున్నాడు. అక్కడినుంచి శతానందుడు, బ్రహ్మ పొందారు. బ్రహ్మనుంచి ఇంద్రలోకానికి వచ్చిందంటూ తిలోత్తమ ఆ వృక్షచరిత్రను వివరించింది.
“ఇది భూమిలో పెరుగుతుందా? విత్తనాలు దొరుకుతాయా?!” అని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేదు.
మేమిద్దరం మరికొంత దూరం నడిచాం. ఇంతలో కొందరు దేవకాంతలు మమ్మల్ని చూశారు. ఆమెను దూరంగా పిలిచి, నా గురించి ఆరా తీశారు.
‘ఎవరో పుణ్యపురుషుడు’ అని తిలోత్తమ వారికి చెప్పినట్లుంది. ఆ తరువాత ఆమె నన్ను రమ్మని సైగచేసి పిలిచింది. నేను అడుగు ముందుకు వేయబోతే.. మామధ్య ఓ మహాప్రవాహం కనిపించింది. ఉన్నట్లుండి ఆ ప్రవాహానికి ఆవలిగట్టున ఒక తలుపు కనిపించింది. ఆ తలుపు వెనుకనుంచి తిలోత్తమ గొంతు వినిపించింది.
“ఇంకా రావేమిటి?” అని.
“ఈ నదిని ఎలా దాటేది? ఆ తలుపు మూసేసినట్లుంది.. లోపలికి ఎలా రాను?” అని అడిగాను.
ఆమె నవ్వి..
“అది ప్రవాహం కాదు.. మణికాంతులు. అది తలుపు కాదు.. ప్రతిబింబం. భయపడకుండా రా” అన్నది.
నేను భ్రమలు విడిచిపెట్టి, ఆమె మాటలపై విశ్వాసంతో ముందుకు అడుగువేశాను. ఆమె నా చేతిని అందుకుంది. పట్టణంలోని సౌధాల విశేషాలన్నీ చెబుతూ నన్ను ముందుకు నడిపించింది.
“ఆ కనిపించేదే.. దేవేంద్రుడి మందిరం. దానిపేరు వైజయంతం. దానికి ఎడమవైపున ఉన్నది శచీదేవి మందిరం. కుడివైపున వారి కుమారుడైన జయంతులవారి మందిరం ఉంది. దానికి దగ్గర్లో ఉన్నదే సుధర్మ అని పిలిచే దేవసభా మందిరం” అని చెప్పింది.
నాకు సుధర్మలో ప్రవేశించాలని ఉన్నదని చెప్పాను. అప్పుడామె..
“దానికొక రహస్యమార్గం ఉంది. మరోసారి నిన్ను తీసుకుపోతాను. ప్రస్తుతం మా ఇంటికి పోదాం” అన్నది.
అపూర్వమైన ఆమె మందిరంలో, నన్నో మెత్తని హంసతూలికా తల్పంపై కూర్చోబెట్టింది.
“ఆర్యా! నువ్వు హరిభక్తునివి. నిన్ను నేను అర్చించాల్సి ఉంది” అని చెబుతూ, నాకు చందనసేవ చేసింది. మందారమాలను నా మెడలో వేసింది. శృంగార ప్రబంధాలను చదువుకున్న తెలివి ఆ సమయంలో నాకు పని చేసింది.
“మగువా! నీ అర్చన స్వీకరించి నేను ఊరికే ఉండిపోకూడదు. ప్రతిచర్య చేయాల్సి ఉంది” అంటూ చందనాన్ని ఆమె గళమందు పూతపూశాను. ఆమెకు పులకరింతలు కలిగేలా చేశాను. అటుపైన ఆమెతో పంచుకున్న ఆనందానుభూతులు వర్ణించడానికి అలవికానివి.
అలా కొంతకాలం గడిచింది.
* * *
ఒకనాడు దేవసభను చూపించడానికి తిలోత్తమ నన్ను తీసుకుపోయింది. ఒక రహస్య స్థలానికి చేరుకుని, ఒక మర తిప్పగా దారి తెరుచుకుంది. ఆ మార్గం.. దేవేంద్రుడి సింహాసనం వెనక్కి తీసుకుపోయింది. యోజనం మేరకు విస్తరించిన గొప్ప సభా మందిరం అది. తూర్పుదిశలో ఉన్న ఇంద్ర సింహాసనానికి చింతామణి అని పేరు. దానికి కుడిఎడమల్లో దిక్పాలకులు, మహర్షులు, బృహస్పతి వంటివారు కూర్చునే రత్నపీఠాలు ఉన్నాయి. ఎదురుగా రంభాదులు నాట్యంచేసే రంగస్థలం ఉంది. అక్కడి శిల్పవిశేషాలన్నీ నేను ఆసక్తిగా చూస్తున్నంతలోనే, రహస్యద్వారం వద్ద ఎవరివో మాటలు వినిపించాయి.
“విజయా! ఈ రహస్య ద్వారం తీసి ఉందేమిటి? శత్రువులెవరైనా లోపల దూరలేదు కదా! ఈ సంగతి తెలిస్తే ప్రభువులు నిన్ను బతకనీయరు”.
“అయ్యయ్యో! ఎంతపని జరిగింది?! నందా! నన్ను రక్షించు. ఈ సంగతి ఎవరికీ చెప్పకు”.
..ఈ మాటలు వినిపించిన తరువాత రహస్య ద్వారాన్ని మూసివేసిన చప్పుడయ్యింది. నంద, విజయులు అనే కావలివాళ్లు ఇద్దరూ సభలోకి వచ్చారు. నేను, తిలోత్తమ ఒక ఆసనం చాటున దాక్కున్నాం. ఆ తర్వాత వారిద్దరి మాటలవల్ల తేలిందేమిటంటే.. రక్తాక్షుని చెరలో బందీగా ఉన్న దేవేంద్రుణ్ని జయంతుడు విడిపించాడు. మహావిష్ణువు దయవల్ల రాక్షసునిపై దేవతలు విజయం పొందారు. కొద్దిసేపటిలో దేవేంద్రుడు ఈ సభలోకి రాబోతున్నాడు.
.. ఆ మాటలు వినగానే నా గుండెలు పగిలిపోయాయి. తిలోత్తమ ఎంత భయపడిందో ఆమె కళ్లే చెబుతున్నాయి. కానీ చేసేదేమీ లేక, మేమిద్దరం దాక్కుని ఉన్నచోటనే రహస్యంగా ఉండిపోయాం. ఇంతలో భేరీధ్వనులు వినిపించాయి. జయజయ ధ్వానాల నడుమ మేళతాళాలతో దేవేంద్రుడు వచ్చి చింతామణి సింహాసనంపై కూర్చున్నాడు. బృహస్పతి లేచి, ఇంద్రుడి పరాక్రమాన్ని కీర్తించాడు. రంభాదుల నాట్యవినోదం కొద్దిసేపు జరిగింది. అటుపైన యుద్ధంలో సహకరించిన వారికి బహుమతులిచ్చారు. రేపటిరోజున పుష్పయాగం జరుగుతుందని ప్రకటించి దేవేంద్రుడు వైజయంతానికి తరలిపోయాడు.
మేమిద్దరం ఆసనాల వెనుక నుంచి బయటికి వచ్చాం. చింతామణి వెనుక ఉన్న రహస్య మార్గానికి తాళం వేసి, నందుడనే కాపలాదారుడు ఎటో వెళ్లిపోయాడు.
“రహస్య ద్వారం మూసివేశారు. ప్రధానద్వారం నుంచి లోనికి వచ్చేవారికి, బయటికి వెళ్లేవారికి ఒక లెక్క ఉంది. కాబట్టి అటువైపునుంచి వెళ్లడానికి వీల్లేదు” అని తిలోత్తమ చెప్పింది. బయటపడే మార్గం లేక, ఆ రోజంతా మేమిద్దరం అక్కడే ఉన్నాం. దేవసభలో అలంకారం కోసం వేలాడగట్టిన పండ్లు తిని నేను ఆకలి తీర్చుకున్నాను.
“ఈరోజు పుష్పయాగం నిర్వహిస్తారు. అనంతరం బృహస్పతి రచించిన పార్వతీ పరిణయంలో పార్వతి వేషం ఊర్వశి కడుతుంది. నేను ఆమె చెలికత్తె అయిన జయ వేషం ఆడాలి. దాని ఏర్పాట్లకోసం నేనిప్పుడు బృహస్పతిగారి ఇంటికి పోవాలి. కానీ ఎలా వెళ్లను?” అని తిలోత్తమ కళ్ల వెంట నీరు కార్చుతూ ఉండిపోయింది.
అంతలో ఏవో శబ్దాలు వినిపించాయి. మేమిద్దరం మళ్లీ రహస్యంగా దాక్కున్నాం. దేవేంద్రుడు అత్యవసరంగా సభ ఏర్పాటుచేశాడు. రక్తాక్షుని కుమారుడైన విరూపాక్షుడు స్వర్గంపై దండెత్తబోతున్నట్లు వదంతి పుట్టింది. దానిని వట్టి వదంతిగానే కొట్టిపారేయడమా?! పుష్పయాగం నిర్వహించడమా? వాయిదా వేయడమా? అనే విషయంలో ఇంద్ర బృహస్పతులిద్దరికీ కొద్దిసేపు తర్జన భర్జనలు జరిగాయి. చివరికి యాగాన్ని వాయిదా వేసి, సభను ముగించారు.
నందుడు మళ్లీ రహస్యద్వారం తెరిచి కాపలా ఉన్నాడు.
“రుచికా! నేను వెళ్లి ఆ నందుణ్ని మోహపెట్టి, వాణ్ని దూరంగా తీసుకువెళ్లగానే అదును చూసుకుని నువ్వు బయటపడు” అని చెప్పి, తిలోత్తమ ముందుగా వెళ్లింది.
నేను గోడచాటున నిలబడి చూస్తుండగా..
“బావా! ఎలా ఉన్నావు? నీకో రహస్యం చెప్పాలి. ఇలా రా” అంటూ నందుణ్ని పలకరించి, దూరంగా తీసుకుపోయింది. నేను సమయం చూసి ఇవతలికి వచ్చేశాను.
ఆ తరువాత తిలోత్తమ ముందుగా నన్ను తన ఇంటికి తీసుకువెళ్లింది. ‘గండం తప్పింది కదా!’ అనుకున్నాం. చాలాసేపు గడిచిన తరువాత తిలోత్తమ ఇంటికి కొంతమంది చెలికత్తెలు వచ్చారు.
“ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లావు? ఎలా ఉన్నావు?” అని కుశల ప్రశ్నలు వేశారు.
“నేనెక్కడికీ పోలేదు. ఇంట్లోనే ఉన్నాను’ అని తిలోత్తమ వారికి అబద్ధం చెప్పింది.“నీకో సంగతి చెప్పాలి. దేవేంద్రులవారు కూర్చునే చింతామణి సింహాసనం వెనుక ఒక లేఖ దొరికిందట. దానిలో మానవభాషలో ఏదో రాసి ఉన్నదట. దానిని కావలివాళ్లు దేవేంద్రుల వారికి అందించారట. ఆ లేఖ అక్కడికెలా వచ్చిందని ఆరా తీయిస్తున్నారు” అన్నది ఓ చెలికత్తె.
“నిజమా!?” అన్నది తిలోత్తమ అమాయకంగా.
“ఈ పోచికోలు కబుర్లకేం గానీ, విరూపాక్షుని దండయాత్ర అసత్యమని తెలిసింది. రేపోమాపో పుష్పయాగం నిర్వహిస్తారు. పార్వతీ పరిణయంలో నీ భాగం చదువుకోడానికి రావా మరి” అని అడిగింది మరో చెలికత్తె.
“మీరు వెళ్లండి. నేను వస్తున్నాను” అని వారిని పంపించింది తిలోత్తమ. ఆ తరువాత హడావుడి పడుతూ నందనవనంలో నన్ను విమానం ఎక్కించి, మళ్లీ భూలోకానికి తీసుకువచ్చింది.
ఆ విమానం ఓ మేడ దాపులోకి వచ్చి గాలిలో నిలుచున్నది.
ఆశ్చర్యం.. నా పక్కన తిలోత్తమ నిల్చుని ఉన్నది. ఆ మేడలోపలి హంసతూలికా తల్పంపై మరో తిలోత్తమ పడుకొని ఉన్నది.
(వచ్చేవారం.. పాటపాడే చెట్టు)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | ఎగిరే చెట్లు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |కాశీ మజిలీ కథలు : దొంగల తప్పిదం
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |రహస్య స్నేహితుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | జగన్నాథ స్వామి
Kasi Majili Kathalu Episode 23 ( కాశీ మజిలీ కథలు ) | విశాలాక్షి కల”
Kasi Majili Kathalu Episode 22 | మలయాళ దేశం
Kasi Majili Kathalu Episode 20 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు – 2
Kasi Majili Kathalu Episode 19 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు