Kasi Majili Kathalu Episode 27 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : తండ్రికి భయపడి ఉద్యానవనంలో దాక్కున్న రుచికుడు మాయమయ్యాడు. అతణ్ని వెతుక్కుంటూ వెళ్లిన గౌతముడు అందించిన సమాచారం మేరకు.. చంద్రలేఖ రామచంద్ర నగరానికి వెళ్లింది. రాకుమారి తిలోత్తమకు రుచికుడు ఎలా తెలుసో తెలుసుకోవాలని అనుకున్నది. ఇంతలో ఆమెకు.. తిలోత్తమను అపహరించిందనే అపవాదుపై అరణ్యవాస శిక్ష పడింది. అక్కడినుంచి తప్పించుకుని, పురుషవేషంలో త్రిగర్త దేశానికి మంత్రి అయ్యింది. తారకేశ్వరాలయంలో భక్తురాలిగా ఉన్న తిలోత్తమను కలుసుకున్నది. అప్పుడు తిలోత్తమ తన కథను ఇలా చెప్పసాగింది.
“నాపేరు తిలోత్తమ. రామచంద్రనగరాన్ని ఏలే శూరసేనుని కుమార్తెను. ఓసారి నేను, నా మిత్రురాలైన చంద్రలేఖ, మరికొందరు చెలికత్తెలతో కలిసి.. ఊరిబయట తోటలో నిద్రిస్తుండగా, ఇద్దరు దొంగలు నన్ను అపహరించారు. అడవిలోకి తీసుకువెళ్లి, నా నగలన్నీ లాక్కున్నారు. ‘బలసింహుడు చెబితే చంద్రలేఖ అనుకుని, పొరబాటున నిన్ను ఎత్తుకొచ్చాం. జరిగిందేదో జరిగిపోయింది. మేం చెప్పినట్లు విను. నిన్ను మేమెక్కడో కొనుక్కుని వచ్చినట్లు చెబుతాం. నువ్వు కూడా అలాగే చెప్పాలి’ అన్నారు. ప్రాణాలమీద తీపి కొద్దీ నేను ఒప్పుకొన్నాను. వాళ్లు నన్ను ఈ పట్టణానికి తీసుకువచ్చి, ఒక వర్తకునికి దాసిగా అమ్మేశారు. నేను వారింట్లో చాలాకాలం సేవలు చేశాను. రోజులు బాగానే గడుస్తున్నాయని అనుకుంటున్న తరుణంలో.. అప్పటివరకూ దేశాటనలో ఉన్న వర్తకుని కుమారుడు వచ్చాడు. వచ్చిన దగ్గరి నుంచి నాతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. నేను నా యజమానులతో ఎంతగా మొరపెట్టుకున్నా వాణ్ని ఏమీ చేయలేదు. చివరికి విరక్తిచెంది, ఒకనాటి రాత్రి తారకేశ్వరస్వామికి ప్రదక్షిణం చేసి, వెనుక ఉండే బావిలో దూకి మరణించాలని నిశ్చయించుకున్నాను. ప్రదక్షిణ చేస్తుండగా ఎవరివో కొన్ని మాటలు వినిపించాయి. ఆ మాటలు ఒక సాధువుగారివి..
‘శిష్యా! ఈ దేహం గాలికి రెపరెపలాడే దీపం లాంటిది. దీనికి కలిగే పుత్ర, మిత్రాది బంధాలన్నీ స్వప్నంలో మనసుకు కలిగే సందడి వంటివి. బొమ్మలు చేసే నాట్యాల్లాగా ఇక్కడ మనం సంపాదించుకునే ఆస్తిపాస్తులేవైనా ఇంద్రజాలాలే. నిజాలు కావు. ఐహిక సుఖాల వల్ల మనం మూటగట్టుకునేదేమీ లేదు. నా సంగతే తీసుకో.. నేను పూర్వాశ్రమంలో జగన్నాథపురిలో నివసించేవాణ్ని. ప్రతిదినం పూలమాలలు అల్లి స్వామిని అర్చించేవాణ్ని. ఆయన వరప్రభావం వల్ల చక్కని కొడుకును కన్నాను. వాడు పుట్టినవెంటనే తల్లిని పోగొట్టుకున్నాడు. దాంతో నేనే తల్లీ, తండ్రీ అయి వాణ్ని అల్లారుముద్దుగా పెంచాను. వాడొకరోజున పూలదండలు అమ్ముకుని వస్తానని వెళ్లి మళ్లీ ఇంటికి రాలేదు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. గొడ్డు వీగికన్న బిడ్డ కాబట్టి, వాడు దూరమైతే తట్టుకోలేక పోయాను. నిద్రాహారాలు మానేశాను. చనిపోవాలని నిశ్చయించుకున్నాను. అలాంటి సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు నా దగ్గరికి వచ్చాడు. ‘బలదేవా! పుత్రవ్యామోహంతో నువ్వు బలవన్మరణం పొందాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అలాంటి పనులెప్పుడూ చేయకు. నీవు దైవభక్తునివి కదా!? ఆత్మహత్య చేసుకుంటే పూర్వపుణ్యమంతా కరిగిపోతుంది. మరణానంతరం నీచగతులకు పోవాల్సి వస్తుంది’ అని మంచిమాటలు చెప్పి.. నా ప్రయత్నం విరమింప చేశాడు. అప్పటినుంచి నేను ఈ వేషాన్ని ధరించి తిరుగుతున్నాను. పెద్దల వల్ల కొంత ఆత్మజ్ఞానం సంపాదించుకున్నాను. మనశ్శాంతి పొందాను’..
.. ఈ మాటలన్నీ నేను శ్రద్ధగా విన్నాను. నా చేత ఆత్మహత్య మానిపించడానికి తారకేశ్వరుడే ఇలాంటి ఏర్పాటు చేసి ఉంటాడని నమ్మకంగా అనిపించింది. చచ్చిన తరువాత కూడా కష్టాల పాలవ్వడం ఏమంత మంచిది కాదని తోచింది. ఇప్పటివరకూ పడ్డవాటి కంటే ఎక్కువ కష్టాలు రాబోతాయా అనే ధీమాతో బతకాలని నిశ్చయించుకున్నాను. నన్ను డబ్బిచ్చి కొనుక్కున్న వర్తకుని ఇంటికే మళ్లీ వెళ్లాను. రెండురోజులు మెదలకుండా ఊరుకున్న తరువాత ఒకనాటి రాత్రి వాడు మళ్లీ నావద్దకు వచ్చాడు. చేతిలో కత్తి పట్టుకుని.. ‘నన్ను వరిస్తావా? చస్తావా’ అని బెదిరించాడు. నేను పెద్దపెట్టున శోకాలు పెట్టాను. అందరూ బిలబిలలాడుతూ వచ్చారు. ఇంతలో మా మధ్య జరిగిన పెనుగులాటలో అనుకోకుండా వాడి తల తెగిపడింది. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేకపోవడం వల్ల నన్ను శిక్షించలేకపోయారు. కానీ, నాకు వాళ్లింట్లో స్థానం పోయింది. అప్పుడే నేను ఈ ఆలయానికి వచ్చి ఆ యోగి పుంగవుణ్ని ఆశ్రయించాను. ఇక్కడ నాకు ఏ లోటూ లేదు”..
..అంటూ తిలోత్తమ తన కథనంతా చెప్పుకొచ్చింది.
మంత్రిరూపంలో ఉన్న చంద్రలేఖ సావధానంగా అంతా విన్నది. తానే చంద్రలేఖనని తిలోత్తమకు ఎలా తెలియజేయాలి? ఆమెను తిరిగి తన ఇంటికి ఎలా పంపాలి అని ఆలోచిస్తుండగా.. ఒక ప్రతీహారి వచ్చాడు.
“దేవా! ఎవరో ఒక విదేశీ బ్రాహ్మణుడు తమ దర్శనం కోసం వచ్చాడు. ప్రవేశ పెట్టమంటారా?” అని అడిగాడు.
దానికి మంత్రి అంగీకరించాడు. కొద్దిసేపటికి ఆ బ్రాహ్మణుడు వచ్చాడు. మంత్రి రూపంలో ఉన్న చంద్రలేఖకు నమస్కరించి..
“అయ్యా! నాపేరు గౌతముడు. తప్పిపోయిన మా మిత్రుణ్ని వెతుక్కుంటూ దేశాలు తిరిగాను. చివరికి మావాణ్ని హస్తినాపురంలో కనుక్కోగలిగాను. వాణ్ని వెంటబెట్టుకుని మా పట్టణానికి వెళ్తూ మీ రాజ్యానికి వచ్చాను. ఇక్కడినుంచి మేం ఓడ ఎక్కి వెళ్లాల్సి ఉంది. ఈవేళ సాయంకాలానికి లంగరు విడుస్తారట. మేం విదేశీయులం కాబట్టి, పూర్తిగా పరీక్షించేదాకా మమ్మల్ని ఓడెక్కనివ్వరట. ఆ పరీక్షలన్నీ పూర్తయ్యేసరికి చాలా సమయం పట్టేట్లుంది. అప్పటిదాకా ఆగితే ఓడ వెళ్లిపోతుంది. మా ప్రయాణం తప్పిపోతుంది. మేం ఇల్లొదిలి చాలాకాలం అయింది. దయచేసి మీరు ఎలాగైనా ఈరోజే మా ప్రయాణం సాగేలా ఆజ్ఞాపత్రికలు ఇప్పిస్తే సంతోషిస్తాను. ఇదే నా కోరిక” అని చెప్పాడు.
చంద్రలేఖ ఆశ్చర్యపోయింది. ‘ఆహా! కాలమే మంచిచెడ్డలు చూస్తుంది. ఓర్పు కలిగి ఉన్నవారికి దుఃఖాలు వచ్చినట్లే సుఖాలు కూడా అప్రయత్నంగా వస్తాయి’ అనుకుంది. కానీ, తాను మంత్రివేషంలో ఉన్నది కనుక, ఆ సంతోషాన్ని బయటికి తెలియనివ్వకుండా దాచుకుంది.
“ఆర్యా! మీరు ఈరోజే ఓడ ఎక్కాలని అనుకుంటే నేనే స్వయంగా మిమ్మల్ని పరీక్షిస్తాను. మీ మిత్రుణ్ని కూడా తీసుకుని, మా ఇంటికి ఓసారి రండి. కొంచెం ఆలస్యమైనా మీకోసం ఓడను నిలిపివేస్తాను. మీలాంటివారికి ఈపాటి ఉపకారం చేసిపెట్టడం విశేషమేం కాదు” అని చెప్పింది. తన ఇల్లు చూపించడానికి ఒక భటుణ్ని గౌతముని వెంట పంపించింది.
అతను వెళ్లిపోయాక తిలోత్తమ వంక చూసి..
“అమ్మా! నువ్వు రాచబిడ్డవు. ఇలా నీచవృత్తిని చేపట్టడం న్యాయం కాదు. మీ తండ్రికి ఉత్తరం రాసి నిన్ను మీ దేశానికి పంపిస్తాను. అంతవరకూ మా అంతఃపుర స్త్రీలతో కలిసి ఉండవచ్చు” అని చెప్పి ఒప్పించింది.
తిలోత్తమ తనకు దక్కిన అపూర్వ గౌరవానికి చాలా సంతోషించింది. చంద్రలేఖ పంపిన పల్లకి ఎక్కి ఆమె ఇంటికి వెళ్లింది. ఆలోపుగా చంద్రలేఖ పురుషవేషం తీసివేసి, తిలోత్తమకు కనిపించింది. మొదట ఆమెను చూసి, మంత్రిగారి భార్య కాబోలు అనుకుంది. కానీ, ఆమె సాక్షాత్తూ తన ప్రాణమిత్రురాలైన చంద్రలేఖే అని తెలిసిన తరువాత ఆమె ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. చంద్రలేఖను కౌగిలించుకుని, బావురుమంది.
చంద్రలేఖ ఆమెను ఓదార్చి, అప్పటివరకూ తనకు చెప్పని వృత్తాంతమంతా చెప్పింది.
“సఖీ! మనకిప్పుడు మంచికాలం వచ్చింది. ఆనాడు నీ మేడకు వచ్చి నిన్ను మురిపించిన దివ్యపురుషుడు ఇప్పుడు ఈ పట్టణంలోనే ఉన్నాడు. కొద్దిసేపటిలో మన దగ్గరికి రాబోతున్నాడు. అతని వృత్తాంతం నాకు కొంతవరకు తెలిసినా.. ఇప్పటివరకూ నీతో చెప్పలేదు. అతనిచేతే చెప్పిస్తాను” అన్నది.
ఆమె ఆ మాట చెబుతున్నంతలోనే ఒక ఆంతరంగిక సఖురాలు వచ్చి..
“ఎవరో ఇద్దరు విదేశీయులు మంత్రిగారి దర్శనం కోరుతున్నారు” అని చెప్పింది.
“వారిని ఇక్కడికే తీసుకురా” అన్నది చంద్రలేఖ.
కొంతసేపటికి రుచికుడు, గౌతముడు వచ్చారు. అక్కడ ఇద్దరూ స్త్రీలే ఉండటం చూసి, దారితప్పి వచ్చాం కాబోలనుకుని వెళ్లిపోబోయారు. కానీ చంద్రలేఖ వారిని ఆపింది. మునుపటికన్నా అద్భుతమైన తేజస్సుతో రుచికుడు వెలిగిపోతూ ఉండటం చూసి చంద్రలేఖ, తిలోత్తమ ఆశ్చర్యపడ్డారు. చాలాకాలం తరువాత కలుసుకున్న ఆనందంలో కొద్దిసేపు వారిలో ఎవరూ మాట్లాడలేదు.
ఆ తరువాత గౌతముడు తానెంత కష్టపడి రుచికుణ్ని కలుసుకున్నాడో చెప్పుకొచ్చాడు.
అప్పుడు చంద్రలేఖ..
“గౌతమా! నీ మిత్రునికోసం నువ్వు చాలా కష్టాలు పడ్డావు. నీ మిత్రుని చరిత్ర ఇంద్రజాలంలా ఉంది. జగన్నాథంలో అంతర్ధానమై హస్తినాపురంలో తేలాడంటున్నావు. ఇలాంటి చిత్రాలు ఎక్కడా చూడలేదు. ఆనాడు ఏ చెట్టో నీ మిత్రుణ్ని ఎగరేసుకు పోయి ఉండొచ్చన్నావు. నీ ఊహ నిజమేనా?! ఇదిగో ఈ తిలోత్తమ ఇతనికోసం జోగిని అయింది. ఇక బలదేవుడేమో కన్నుల్లో ప్రాణాలు నిలుపుకొని, ఎదురు చూస్తున్నాడు. ఆ తండ్రీ కొడుకులిద్దరినీ తరువాత కలుపుతాను. ప్రస్తుతానికి ఈ వింతబాటసారి ఏయే దేశాలు తిరిగొచ్చారో తెలియచేస్తే బాగుంటుంది” అన్నది.
రుచికుడు ఓసారి మనసారా నవ్వి, తన కథనంతా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు.
* * *
“ఆనాడు మానాన్నకు భయపడి, నీ సలహా మేరకు తోటలో ప్రవేశించాను. ఒక పొడవాటి అశోక వృక్షాన్ని ఎక్కి మరుగుపిందెలా ఆకులచాటున దాక్కున్నాను. నడిరాత్రి వేళకు ఏవో మాటలు వినిపించాయి. అదిరిపడి తలెత్తి చూశాను. మెరుపుతీగల్లాంటి కాంతులేవో నామీద పడసాగాయి. చూస్తున్నంతలోనే ఆ కాంతిమండలం నేనెక్కిన చెట్టు సమీపంలోకి వచ్చింది. చూడబోతే ఏదో బంగారు రథంలాగా ఉంది. కానీ, ఆకాశంలో ఎగురుతున్నది. ‘తిలోత్తమా! మన పయనానికి ఆటంకం కలిగించేందుకు వాయుదేవుడు ఈ పూల సువాసనలను ఆతిథ్యంగా ఇచ్చి, మనల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు కాబోలు. వేగంగా పోయి, నీకు కావలసిన పూలను కోసి తెచ్చుకో!’ అన్నమాటలు వినిపించాయి. అందుకు సమాధానంగా తిలోత్తమ.. ‘జయంతా! నేనొక్కదాన్నే వెళ్లలేను. నువ్వు కూడా రావాలి’ అంటూ చేయిపుచ్చుకుని విమానం నుంచి కిందికి దించింది.
విమానం మాత్రం నా చేతికి అందే ఎత్తులో ఆకాశంలోనే ఉంది. నేను సాహసంతో దానిలోకి ఎక్కాను. అందులో రెండు మంటపాలు ఉన్నాయి. మొదటి మంటపంలో రత్నస్తంభాలు ఉండగా, రెండోదానిలో ఆసనాలు, శయ్యలు ఉన్నాయి. నేను కొంతసేపు వాటిని ఆసక్తితో చూసిన తర్వాత, మొదటి మంటపంలోని స్తంభాల చాటుగా బొమ్మలా నిలబడ్డాను. ఇంతలో తిలోత్తమ, జయంతులు ఇద్దరూ వచ్చారు. వారెక్కిన వెంటనే విమానం మరతిప్పిన బొమ్మలా రివ్వున ఎగురుతూ ఆకాశంలో ప్రయాణించసాగింది. నేను జారిపోతానేమోనని స్తంభాన్ని గట్టిగా పట్టుకున్నాను. కానీ, కొద్దిగా కూడా కుదుపు లేదు. కాసేపటికి కిందికి చూస్తే అంతా మసకమసగ్గా ఉంది కానీ, భూమి కనిపించలేదు. చేతిలో పూలతో జయంతుని పక్కన నిలుచున్న తిలోత్తమ..
‘మనోహరా! ఈ పూలు వింతగా ఉన్నాయి. ఇలాంటివి మన లోకంలో దొరుకుతాయా?! మనుషులు మనకంటే తక్కువవారని చెబుతారు కదా! వారికి ఇంతటి భోగాలేమిటి?!’ అని ప్రశ్నించింది.
‘తప్పు. అలా అనకూడదు. రూపంలో, భోగంలో దేవతలను తిరస్కరించేవాళ్లు మనుషుల్లో అనేకమంది ఉన్నారు. ఒకప్పుడు మీ ఊర్వశి, పురూరవ చక్రవర్తిని వరించలేదా?! మానవుడైన మహర్షికి బ్రహ్మ కానుకగా ఇచ్చిన అహల్యపై మా తండ్రి మనసు పడినందువల్లే ఆయన శాపానికి గురయ్యాడు?! జరామరణ వ్యాధులు, ఆకలి దప్పికలు మానవులకు ఉన్నాయి. మనకు లేవు. ఇదే వారికి, మనకు ఉన్న వ్యత్యాసం. ఇదికాకుండా దేవలోకంలో ఉండే గొప్ప వస్తు సముదాయమంతా భూమిపైనా ఉంది. నాకు తెలిసినంతవరకూ సంగీతం పాడే చెట్లు మాత్రం భూమిపై లేవనుకుంటాను’ అని జయంతుడు ఇంకా ఏదో చెబుతున్నాడు. ఇంతలో ఆ విమానానికి అతి సమీపంలో పెద్ద కలకలం రేగింది.
(వచ్చేవారం… స్వర్గంలో మానవుడు)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |రహస్య స్నేహితుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | జగన్నాథ స్వామి
Kasi Majili Kathalu Episode 23 ( కాశీ మజిలీ కథలు ) | విశాలాక్షి కల”
Kasi Majili Kathalu Episode 22 | మలయాళ దేశం
Kasi Majili Kathalu Episode 20 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు – 2
Kasi Majili Kathalu Episode 19 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు