Kasi Majili Kathalu Episode 30 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశీమజిలీ కథలు అప్పట్లో ఆబాలగోపాలాన్ని అలరించాయి. మధిర సుబ్బన్న దీక్షితులు ఈ కథలను పన్నెండు సంపుటాలుగా వెలువరించారు. ఇందులో జానపదాలు, చారిత్రకాలు, పౌరాణిక కథలు కూడా ఉన్నాయి. జానపదాల వరుసలో ఇప్పుడు మీరు చదువబోతున్న పసందైన కథ.. కాజీమజిలీల్లోని రెండోభాగంలోనిది.
మాళవ దేశాన్ని ధర్మపాలుడు అనే రాజు పాలిస్తున్నాడు. ఆ రాజ్యానికి ముఖ్య పట్టణం కౌశాంబి. ఒకనాడు మహారాజు తన మంత్రులిద్దరినీ పిలిచి.. “రాజధర్మాల గురించి చెప్పండి!” అని అడిగాడు.
మంత్రులిద్దరిలోనూ పెద్దవాడైన విజయకేతుడు..
“మహారాజా! అగ్నిలో కాల్చకుండా బంగారానికి వన్నెరాదు. అలాగే నీతి పరీక్షను ఎదుర్కోనివాడి బుద్ధిబలం అనామకంగా మిగిలిపోతుంది. నీతిలేనివాడు ఎంత పెద్ద పదవిలో ఉన్నా, తన నెత్తిన తాండవిస్తున్న శక్తులను అదుపు చేయలేడు. అతని ఆజ్ఞలకు కిందివారు కట్టుబడి ఉండరు. అలాంటివాడు రాజైతే ప్రజలు స్వేచ్ఛా విహారులు అవుతారు. ధర్మం అడుగంటుతుంది. అందుకే రాజు ఎప్పుడూ నీతిపరుడు కావాలి. సంకల్పసిద్ధుడు కావాలి. దండనీతిని చక్కగా పాటించాలి” అని చెప్పాడు.
ఆ తరువాత విహారభద్రుడు లేచి నిలబడి..
“మహారాజా! లోకంలో దైవానుగ్రహం వల్ల కొందరికి కొన్ని సిద్ధులు స్వతహాగా సంక్రమిస్తాయి. ధూర్తులైనవారు ఆ సిద్ధులన్నీ తమ ప్రయోజకత్వమే అనుకుంటారు. సామాన్యులను మోసపుచ్చుతారు. తాము యోగులమని, అల్పులనైనా చక్రవర్తులను చేయగలమని డాంబికాలు పలుకుతూ పొట్టపోసుకుంటారు. ఇప్పుడు మన విజయకేతులవారు చెప్పిన దండనీతి అటువంటిదే. అది చేంతాడంత ఉంటుంది. రాజులు ఏలాల్సిన రాజ్యవిద్యను శాస్త్రకారులు.. త్రయి, వార్త, అన్వీక్షకి, దండనీతి.. అని నాలుగుగా విభజించారు. పంచతంత్రం రాసిన విష్ణుగుప్తులవారే దండనీతిని చాలా సంక్షిప్తంగా ఆరువేల శ్లోకాల్లో రచించారు. అందులో.. పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రించేవరకు చక్రవర్తి ఎప్పుడెప్పుడు ఏమేం పనులు చేయాలో అంతా వివరంగా ఉంటుంది. దాన్ని పూర్తిగా చదివే సరికే ముసలితనం వచ్చేస్తుంది. ఇంక సుఖపడేదెక్కడ?! అయినా అవన్నీ చదివి పరిపాలన చేయడానికి మీరేమైనా చిన్నపిల్లవాడా?! అప్పుడే పుట్టిన పిల్లాడికి కూడా తల్లి తనను దగ్గరికి తీసుకునేసరికి, పాలు తాగడమెలాగో తెలుస్తుంది కదా! దీనికి చదువెందుకు?! కాబట్టి, రాజ్యభారాన్ని సమర్థుడైనవానికి అప్పగించి, ఉన్నంతలో యవ్వనం సార్థకమయ్యేలా జీవించడమే తెలివైన పని” అని బోధించాడు.
ధర్మపాలుడు తలపంకించాడు.
“నాకు బోధ చేసినందువల్ల మీరిద్దరూ నాకు గురువులు అయ్యారు. ఇద్దరి ఉపన్యాసాలూ నా చెవులకు ఇంపుగానే ఉన్నాయి” అని చెప్పి, సభ చాలించాడు.
* * *
రోజులు గడిచేకొద్దీ విజయకేతుణ్ని దూరంగా పెట్టసాగాడు మహారాజు. విహారభద్రునికి అన్ని బాధ్యతలూ అప్పగించాడు. క్రమక్రమంగా రాజ్యపాలన పట్ల విముఖుడు కాసాగాడు.
తఃపుర స్త్రీలతో సుఖభోగాలలో మునిగి తేలసాగాడు.
‘అయ్యో! విహారభద్రుని మాటలవల్ల రాజు మూర్ఖుడై చెడిపోతున్నాడు. నేనేం చేసేది?! ప్రియం కలిగేలా మాట్లాడి లోబరుచుకునేవారు లోకంలో ఎంతోమంది ఉంటారు. కఠినంగా ఉన్నా నిజాన్నే వినాలనే అభిలాష బలంగా లేకపోతే.. ఎవరి అదృష్టమైనా తిరగబడి తీరుతుంది. ఇక ఈ రాజ్యాన్ని, రాజును దైవమే కాపాడాలి!’ అని విజయకేతుడు మనసులోనే బాధపడసాగాడు.
అలా చెడ్డమంత్రికి రాజ్యాధికారాన్ని అప్పజెప్పి ధర్మపాలుడు కామలోలుడై కాలం గడుపుతుండగా.. చోళ దేశపు మంత్రిపుత్రుడు దుర్వినీతుడు ఒకనాడు కౌశాంబికి వచ్చాడు. విహారభద్రునితో చెలిమి చేశాడు. ఒకనాడు దుర్వినీతుణ్ని వెంటపెట్టుకుని, విహారభద్రుడు తన రాజు వద్దకు వచ్చాడు.
“మహారాజా! ఇతడు చోళ చక్రవర్తి మంత్రిగారి కొడుకు. ఆ రాజుతో ఇతనికి విభేదాలున్నాయి. చోళుడు ఎలాగూ మనకు శత్రువు. రాజనీతిలో శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అవుతాడు కదా! అందువల్ల ఇతనికి మన ఆస్థానంలో స్థానం కల్పించాలి” అని చెప్పాడు.
విజయకేతుడు ఆ చర్యను తిరస్కరించాడు.
“శత్రువును చేరనిస్తే రాజ్యక్షేమానికి భంగం వాటిల్లవచ్చు” అని అనుమానం లేవనెత్తాడు.
అందుకు నిరసనగా..
“ఈ పెద్దమంత్రిగారికి మనమేం చేసినా కాదనడం అలవాటే కదా! దుర్వినీతుడే మనకు చోళదేశపు గుట్టుమట్లన్నీ చెప్పబోతున్నాడు. కొంతకాలంపోతే ఇతనివల్ల మనకు కలిగే లాభం ఏమిటో మీకే తెలుస్తుంది” అని వాదించాడు విహారభద్రుడు.
“పోనీ అతణ్ని నీకిందే అట్టేపెట్టుకో. ఓ కంట కనిపెట్టుకుని ఉండు” అన్నాడు ధర్మపాలుడు.
ఆనాటినుంచి దుర్వినీతునికి ఎదురులేకుండా పోయింది. దేశంలో జూదం, వ్యభిచారం, మద్యపానం పెరిగిపోయాయి. ప్రజలు స్వేచ్ఛా విహారులయ్యారు. బలవంతులు బలహీనులను దోచుకుతినడం మొదలుపెట్టారు. రాజ్యం క్రమంగా క్షీణదశకు వస్తున్న దశలో దుర్వినీతుడు.. చోళ రాజ్యంనుంచి రహస్యంగా సేనలను రప్పించడం మొదలుపెట్టాడు. ఆ విషయాన్ని విజయకేతుడు కనిపెట్టి, ధర్మపాలుణ్ని హెచ్చరించాడు. కానీ, రాజు వినిపించుకోలేదు. రాజు ఉపేక్షిస్తుండటంతో దుర్వినీతుని ఆగడాలకు అంతులేకుండా పోయింది. పట్టణంలో ఒక ఎత్తయిన ప్రహరీ ఉన్న మహాభవంతిలో చోళదేశపు సైన్యాన్ని సమీకరించడం మొదలుపెట్టాడు. అలాంటి సమయంలో ధర్మపాలుని పట్టమహిషి అయిన సునందకు విజయకేతుడు ఒక లేఖ రాశాడు. అందులో రాజ్యపు పరిస్థితులన్నీ ఆమెకు అర్థమయ్యేలా వివరించాడు.
‘దుర్వినీతుని ఇంటిని పరీక్షిస్తే, రహస్యం బట్టబయలవుతుంది. మీరు పూనుకోకపోతే రాజ్యానికే ప్రమాదం’ అని ఉత్తరంలో రాసి, దానిని రాణికి అందేలా చేశాడు.
సునంద ఆనాటి రాత్రంతా భర్తకు అనేక నీతిబోధలు చేసింది. విజయకేతునిపై కలిగిన దురభిప్రాయాలన్నిటినీ దూరం చేసింది. దాంతో రాజులోని వివేకం మేల్కొన్నది.
మరునాటి ఉదయాన్నే సభ ఏర్పాటుచేశాడు.
“దేశంలో శాంతిభద్రతల పరిస్థితులు ఎలా ఉన్నాయి?” అని అడిగాడు మహారాజు.
విహారభద్రుడు ఎప్పటిలాగే ఏదో చెప్పబోయాడు. కానీ, ధర్మపాలుడు సరిగా వినిపించుకోకుండా..
“నేనే స్వయంగా పరీక్షిస్తాను” అంటూ అప్పటికప్పుడు బయలుదేరాడు.
మంత్రులిద్దరితోపాటు దుర్వినీతుడు కూడా రాజును అనుసరించారు. కొంతసేపు పట్టణంలోని పలువీధులు తిరిగిన తరువాత..
“దుర్వినీతా! నీ ఇల్లెక్కడ?” అడిగాడు ధర్మపాలుడు.
దీంతో అతను బిత్తరపోయి చూస్తుండగా.. విజయకేతుడే ఆ ఇల్లు చూపించాడు. అది మహారాజ భవనాన్ని మించిపోయి ఉంది. ధర్మపాలుడు కళ్లెర్ర జేసి, గుర్రం దిగి నిలబడ్డాడు.
“ఆ తలుపు తెరిపించు” అని ఆజ్ఞాపించాడు.
“మహారాజా! ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ లేరు. తాళం చెవి కూడా నా దగ్గర లేదు” అని చెప్పాడు.
ఆ సమాధానం విని ధర్మపాలుడు ఉగ్రుడైపోయాడు.
“తాళాలు బద్దలు కొట్టించండి” అన్నాడు.
తలుపులు తెరిచి చూసేసరికి లోపల దాదాపు అయిదువేల మంది సైనికులున్నారు. అకస్మాత్తుగా రాజు రావడం చూసి ఆయుధాలు సవరించుకోవడం మొదలుపెట్టారు. విజయకేతుడు తెలివిగా విహారభద్రుణ్ని, దుర్వినీతుణ్ని కూడా లోపలికి తోయించి, తాళాలు బిగించాడు.
“విజయకేతులవారూ! నన్ను మన్నించండి. కొద్దిసేపట్లో యుద్ధం మొదలుకావచ్చు. మన సైన్యాన్ని వెనువెంటనే సమీకరించండి” అని కోరాడు ధర్మపాలుడు.
సమయం ఎక్కువగా లేదు. అయినప్పటికీ విజయకేతుడు తనవంతు ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. భవంతిలో దాక్కున్న అయిదువేల సైన్యానికి తోడుగా, పొలిమేరలలో వేచి ఉన్న సైన్యం కూడా కౌశాంబిపై విరుచుకుపడింది.
ధర్మపాలుని ఓటమి దాదాపుగా ఖరారైంది.
“మహారాజా! రహస్యమార్గాలను తెరిపించండి. అంతఃపుర స్త్రీలను, పిల్లలను కోట దాటించండి” అన్నాడు విజయకేతుడు.
ధర్మపాలుడు అంగీకరించాడు. కౌశాంబి కోటమీద చోళుల పతాకం ఎగిరింది. ధర్మపాలుని కాళ్లు చేతులకు సంకెళ్లు తగిలించారు.
‘దుర్వినీతా! మోసం చేసి గెలవడం బంటుతనం కాదు. దైవమున్నాడు. ఏదో ఒకనాటికి నీకూ ఆపదలు కలగకపోవు. నాకు మంచిరోజులు రాకపోవు’ అనుకున్నాడు చెరసాలలో పడ్డ ధర్మపాలుడు.
* * *
అప్పటికి ధర్మపాలునికి మూడేళ్ల కొడుకు ఉన్నాడు. మహారాణి సునంద తొమ్మిదినెలల గర్భిణి. ఆమె నడవలేక నడుస్తున్నది. ఒక దాది ఆమెకు తోడుగా ఉంది. మరో దాది రాజపుత్రుణ్ని ఎత్తుకుని నడుస్తున్నది. కొంతదూరం ప్రయాణించిన తరువాత వాళ్ల దారులు వేరైపోయాయి.
రాజపుత్రుణ్ని ఎత్తుకున్న దాది వడివడిగా నడుస్తున్నది. తెల్లవారేసరికి ఆ మార్గం ఆమెను ఒక అరణ్యంలోకి తీసుకుపోయింది. ఇక నడవలేక రాజపుత్రుణ్ని అక్కున చేర్చుకుని చెట్టు నీడలో పడుకున్నది. కొంతసేపటికి ఆ చెట్టుతొర్రలోంచి ఒక నల్లతాచు బయటికి వచ్చి, దాదిని కాటువేసింది. పిల్లవాడి శిరస్సుపై పడగపట్టి ఆడసాగింది. దాది నిద్రలేవకపోవడం చూసి పిల్లవాడు ఏడుపు లంకించుకున్నాడు. ఆ పక్కనే పశువులను మేపుకొంటున్న కొందరు గొల్లవాళ్లకు ఆ పిల్లవాడి ఏడుపు చెవినపడింది.
వాళ్లు పరుగున వచ్చి చూశారు. పామును దూరంగా తోసేశారు. పిల్లవాణ్ని తమ గ్రామానికి తీసుకుపోయారు. గ్రామపెద్ద అయిన పింగళకునికి అప్పగించారు. సంతానం లేని పింగళకుడు ఆ రాజపుత్రుణ్ని తన కొడుకుగా పెంచుకోవడానికి నిర్ణయించుకున్నాడు. తన ఇంటికి దీపంలా వచ్చాడనే ఉద్దేశంతో పింగళకుడు ఆ పిల్లవాడికి అదృష్టదీపుడు అని పేరు పెట్టాడు. రత్నాన్ని బొగ్గులమూటలో పెట్టినా కాంతిని పోగొట్టుకోదు. అలాగే పల్లెలో పెరిగినా అదృష్టదీపుడు తన సహజ తెలివితేటలతో అన్ని విద్యల్లోనూ ఆరితేరాడు. ఎనిమిదేళ్లు వచ్చేసరికి ఆ పల్లెలో చదవడం, రాయడం బాగా వచ్చిన పండితుడు తానేనని అనిపించుకున్నాడు. కొడుకును ఇంకా చదివించడానికి అవకాశం లేనందువల్ల పింగళకుడు, అతణ్ని పశువులను మేపడానికి నియమించాడు. పగలంతా తోటి పిల్లలతో కలిసి అదృష్టదీపుడు సమీప అడవిలో పశువులను మేపేవాడు. రాత్రిపూట నానమ్మ వద్ద పూర్వరాజుల చరిత్రలను కథలుగా చెప్పించుకుని వినేవాడు. ఆ కథల ద్వారా లోకంలోని విశేషాలన్నిటినీ చక్కగా గ్రహించేవాడు.
* * *
పన్నెండేళ్లు వచ్చేసరికి విశాలమైన కళ్లు, దృఢమైన దవడలు, సింహం లాంటి నుదురుతో వీరపురుషునిగా రూపుకట్టాడు అదృష్టదీపుడు. మసిగుడ్డలో కట్టిన మాణిక్యంలా తన స్థితిని ఎరగకుండా.. ఆ పల్లెలో పశువులను మేపుకొంటూ ఉండేవాడు. ఒకనాడు అతడు తోటివారినందరినీ ఒకచోట చేరదీసి..
“స్నేహితులారా! ఈ భూమిని అనేకమంది రాజులు పాలిస్తుంటారు. వారికి మంత్రులు, భటులు అందరూ ఉంటారు. వారి సాయంతో ఆ రాజు తన ప్రజలను పాలిస్తుంటాడు. మనం కూడా అలాగే పాలించుకుందాం. నేను రాజును, వీళ్లిద్దరూ మంత్రులు, వీళ్లేమో భటులు, వీడు సేనాపతి, మిగతావాళ్లు పరిచారకులు, ప్రజలు. సరేనా! ఈ ఆట మీకు నచ్చిందా?” అని ప్రశ్నించాడు.
అందరూ “భలేభలే!” అని చప్పట్లు కొట్టారు. వెంటనే అడవిలోనే ఓ చోట కర్రలతో పీఠాలు, ఆవరణలు, ద్వారాలతో కూడిన సభాభవనం ఏర్పాటైంది. అదృష్టదీపుడు సింహాసనంపై కూర్చున్నాడు. అందరూ ఒక్కపెట్టున.. “అదృష్టదీప మహారాజుకీ.. జై!” అన్నారు.
ఆనాటినుంచి వాళ్ల బతుకులే మారిపోయాయి. అంతకుముందు అందరూ కలిసి పశువులను మేపుకోవాల్సి వచ్చేది. అదృష్టదీపుడు పాలనకు వచ్చిన దగ్గరనుంచి రోజుకు కొందరు చొప్పున వంతులవారీగా పనులు చేస్తున్నారు. పట్టుతేనె, కుంకుళ్లు వంటివాటిని పోగుచేసుకుని సమీప పట్టణాలలో అమ్మేవారు. దాంతో వచ్చిన సొమ్మును ఖజానాలో నిలువ చేసేవారు. ఇలా జరుగుతుండగా కొంతకాలానికి ఆ అడవికి సింధు దేశపు రాజు వేటకోసం వచ్చాడు.
(వచ్చేవారం.. అదృష్టదీపుడు- 2)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | పాటపాడే చెట్టు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | స్వర్గంలో మానవుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | ఎగిరే చెట్లు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |కాశీ మజిలీ కథలు : దొంగల తప్పిదం
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |రహస్య స్నేహితుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | జగన్నాథ స్వామి
Kasi Majili Kathalu Episode 23 ( కాశీ మజిలీ కథలు ) | విశాలాక్షి కల”
Kasi Majili Kathalu Episode 22 | మలయాళ దేశం
Kasi Majili Kathalu Episode 20 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు – 2
Kasi Majili Kathalu Episode 19 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు