Kasi Majili Kathalu Episode 30 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కౌశాంబి పాలకుడైన ధర్మపాలుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. శత్రువుల దాడిలో తన పిల్లలను కోటనుంచి తప్పించాడు. అతని పెద్దకుమారుడు గొల్లగూడెంలో అదృష్టదీపుడనే పేరుతో పెరుగుతున్నాడు. సాటి పిల్లలతో తాను రాజుగా, ఇతరులు సేవకులుగా ఆడుకోవడం అతనికి అలవాటైంది. ఆ తరువాత అదృష్టదీపుని కథ ఏమైందో ఈ భాగంలో చదవండి.
అడవిలో దొరికే వెదురు బియ్యం, తేనె, ముత్యాలు, చామరాలు.. వీలైనన్ని సేకరించాడు అదృష్టదీపుడు. వాటికితోడు ఒక లేఖ రాసి గోపబాలకుల చేతికిచ్చి సింధుదేశ రాజుకు పంపాడు. అందులో ఇలా ఉంది..
సింధుదేశ రాజుగారికి, మీరు మా అడవికి రావడం సంతోషం కలిగిస్తున్నది. ప్రస్తుతం మాకు మీ దర్శనం చేసే అవకాశం లేదు. మేము మీతో స్నేహం కోరి, ఈ వస్తువులను పంపుతున్నాం. మీరు మా అడవికి వచ్చినందుకు ఇవ్వాల్సిన పన్నును రద్దు చేస్తున్నాం. వీటిని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం.
– ఇట్లు.. అదృష్టదీపుడు, అమరావతీ చక్రవర్తి.
.. ఆ ఉత్తరాన్ని చదివిన సింధురాజుకు మతిపోయింది. తాను వట్టి రాజు మాత్రమే, ఈ అదృష్టదీపుడెవరో కానీ తాను చక్రవర్తినని రాసుకున్నాడు. అంటే తనకంటే హోదాలో చాలా ఎక్కువ. పైగా అడగకముందే పన్ను రద్దుచేశాడు. ఇప్పుడు తాను కూడా తిరుగు బహుమానాలు పంపకపోతే మర్యాదగా ఉండదు. అందువల్ల సింధురాజు ఒక ఏనుగు, రెండు ఒంటెలు, నాలుగు గుర్రాలు, ఒక మణిపతకం తిరుగు కానుకగా అదృష్టదీపునికి పంపాడు.
అవే కానుకలను.. ఈసారి చేరరాజుకు పంపాడు అదృష్టదీపుడు. ‘మీతో మైత్రి కోరి ఈ కానుకలు పంపుతున్నాం’ అని ఉత్తరం కూడా రాశాడు.
చేరరాజు తబ్బిబ్బు పడ్డాడు.
“ఈ అమరావతి ఎక్కడుంది? ఈ అదృష్టదీపుడనే పేరు ఎప్పుడూ వినలేదే!?” అని విచారించాడు. కానుకలు తెచ్చిన వారిని అడుగుదామంటే పరువు తక్కువ.
“మనకు వివరాలు తెలియకపోయినా పోయేదేముంది? ఆయనే మైత్రిని కోరుతున్నప్పుడు కాదనడం ఎందుకు?!” అని అందరూ సలహా చెప్పారు. దాంతో చేరరాజు తాను పొందిన బహుమతులకు మూడురెట్లు ఎక్కువ బహుమతులను.. అదృష్టదీపునికి పంపాడు.
ఈసారి వాటిలో ఒకవంతు తనవద్ద ఉంచుకుని, మిగిలినవాటిని వేరే రాజుకు పంపాడు అదృష్టదీపుడు. ఆ విధంగా మూడేళ్లపాటు… భరతఖండంలో ప్రతిరాజు వద్దకూ అదృష్టదీపుడు కానుకలు పంపడం.. తిరుగు బహుమానాలు అందుకోవడం కొనసాగుతూనే ఉంది.
చూస్తుండగానే అడవిలో పశువులను మేపుకొనే అదృష్టదీపుడు గొప్ప చక్రవర్తి అయిపోయాడు. భరతఖండంలోని చక్రవర్తులందరి కంటే ఆయన వద్దే అధిక ధనం పోగైంది. ఆ ధనంతో అదృష్టదీపుడు తన పేరుతో ఊరూరా సత్రాలు కట్టించాడు. దానధర్మాలు చేయించసాగాడు. దాంతో ప్రజల్లో కూడా అదృష్టదీపుని పేరు ప్రఖ్యాతులు గొప్పగా పెరిగిపోయాయి.
* * *
ఇదిలా ఉండగా.. ఒకసారి కాశీలో గొప్ప ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవానికి నానా దేశాల రాజులు విచ్చేశారు. అక్కడికి అదృష్టదీపుడు రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భారతదేశ చిత్రపటం తెప్పించి ఎంత పరిశోధించినా అదృష్టదీపుడు ఏలుతున్న అమరావతీ రాజ్యం ఎక్కడుందో ఎవరికీ అంతుపట్టలేదు. ఎక్కడా రాజ్యమే లేకుండా ఇంతింత విలువైన బహుమానాలు ఇతర రాజులకు ఎలా పంపుతున్నాడో? కోట్లాది ధనం దానధర్మాలు ఎలా చేస్తున్నాడో? ఎవరికీ తెలియలేదు. ఈసారి ఎవరికైనా స్నేహం కోరుతూ అదృష్టదీపుడు కానుకలు పంపితే.. ఆ వచ్చిన సేవకుల ద్వారా అతని గురించి తెలుసుకోవాలని రాజులందరూ తీర్మానించుకున్నారు.
కాశీ ఉత్సవాలు ముగిసిన కొంతకాలానికి.. అదృష్టదీపుడు పాండ్యరాజుకు మైత్రి కోరుతూ కానుకలు పంపాడు. పదివేల గుర్రాలు, ఆరువేల ఒంటెలు, రెండువేల ఏనుగులు, లక్ష విలువ కలిగిన రత్నహారాలు, పదివేల వాహనాలు, చీనిచీనాంబరాలు కానుకలుగా చూసిన పాండ్యరాజు మలయధ్వజుడు బిత్తరపోయాడు. అంతకు రెట్టింపు విలువైన తిరుగు బహుమానాలు పంపడానికి నిశ్చయించుకున్నాడు. అయితే తానే స్వయంగా వచ్చి, ఆ కానుకలను అదృష్టదీప చక్రవర్తికి అందిస్తానని దూతలతో చెప్పాడు. కానీ, వారు అందుకు అంగీకరించలేదు.
“మీరు వారిని చూడదలుచుకుంటే ముందుగా వర్తమానం ఇవ్వాలి. వారు అంగీకరించాలి” అని చెప్పారు.
పాండ్యరాజు అందుకు అంగీకరించాడు. కానుకలతో పాటు తన దూతలను పంపాడు. ఇటువంటి సమయంలో ఏం చేయాలో అదృష్టదీపుడు ముందుగానే తనవారికి బోధించాడు. ఆ ప్రకారమే పాండ్యులు తమ దర్శనానికి వస్తున్నారనే వార్త ముందుగానే అదృష్టదీపునికి అందింది.
అతని దూతలు పాండ్యరాజు దూతలకు ఎదురు వెళ్లారు. మార్గమధ్యంలోనే వారిని కలుసుకున్నారు.
‘ప్రస్తుతం చక్రవర్తిగారు తీర్థయాత్రలకు వెళ్లారు. మరో సందర్భంలో వారే వచ్చి పాండ్యరాజును దర్శించగలరు’ అనే వర్తమానం అందించారు. పాండ్యరాజు ఇచ్చిన కానుకలు మొత్తం పుణ్యక్షేత్రాల్లో అదృష్టదీపుని పేరుమీదుగా పంచాలని వేరొక వర్తమానం అందింది. అంత విలువగలిగిన కానుకలను ఒక్కరోజులో దానం చేయమని చెప్పిన అదృష్టదీపుని ఔదార్యాన్ని చూసిన వారంతా విస్మయానికి లోనయ్యారు. పాండ్యరాజ దూతలు మార్గమధ్యంలోనే వెనక్కి మళ్లిపోయారు.
ఈ సంఘటనతో తానెవరో తెలుసుకోవాలని రాజులు ప్రయత్నిస్తున్నారని అదృష్టదీపునికి అర్థమైంది. తాను కొంతకాలం ప్రచ్ఛన్నంగా ఉండాలని, తీర్థయాత్రలు చేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకు తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నాడు.
“నాయనా! పసితనంలో ఒక నాగుపాము నీకు పడగ పట్టింది. నువ్వు అదృష్టవంతుడివని ఆనాడే గ్రహించాం. అది నిజం చేశావు. ఇంత సంపదను సమకూర్చుకున్నావు. ఏ చక్రవర్తికీ లేనంత కీర్తిని సాధించుకున్నావు. ఇప్పుడు దేశాటనకు బయలుదేరుతున్నావు. నీకు నీ అసలు తల్లిదండ్రులను కలుసుకునే అవకాశం కలగవచ్చు. అలా జరిగితే ఇంతకాలం నిన్ను పెంచిన మమ్మల్ని మరిచిపోవద్దు సుమా!” అని తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
“అలాగే నాన్నా!” అని మాటిచ్చాడు అదృష్టదీపుడు.
బలభద్రుడనే చెలికానితో కలిసి గుర్రాలపై పడమటి దిక్కుగా ప్రయాణం సాగించాడు. పదిరోజులకు విదర్భదేశపు రాజధాని ధర్మాపురానికి చేరుకున్నాడు. అక్కడ కూడా అతడు నెలకొల్పిన సత్రాలు ఉన్నాయి. వాటిలోనే సామాన్యుడిలా తాను కూడా తలదాచుకున్నాడు. ఆ సత్రంలోనే సాముద్రికుడైన సన్యాసి విడిది చేశాడు. ఆయన చెప్పిన మాట అక్షరం పొల్లుపోకుండా జరుగుతుందని, ప్రజలు చెప్పుకోవడం విన్నాడు. తానూ వెళ్లి, ఆయన ముందు తన అరచేతిని చాచాడు.
“స్వామీ! నా తల్లిదండ్రులు బతికున్నారో లేదో నాకు తెలియదు. వారి గురించి వర్తమానం చెప్పగలరా? అలాగే జ్యోతిషరీత్యా సోదరభావం ఎలా ఉందో కూడా చెప్పండి” అని కోరాడు.
అదృష్టదీపుని చేతిని, అతని ముఖకవళికలను చూసిన వెంటనే సన్యాసి ఆశ్చర్యానికి మేరలేకుండా పోయింది.
“ఆహా! ఇంతవరకూ ఇంతగొప్ప చేతిని చూడలేదు. సాముద్రిక శాస్త్రం చెప్పిన అన్ని ఉత్తమ పురుష లక్షణాలూ నీలో ఉన్నాయి. నువ్వు సామాన్యవేషంలో ఉండటం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికే నీకు అదృష్టదీపునికి వచ్చినంత కీర్తి రావాల్సి ఉంది. నాయనా! వెంటనే నీ అదృష్టాన్ని పరీక్షించుకో! నీవడిగిన రెండు ప్రశ్నలు.. నీ తల్లిదండ్రులు బతికే ఉన్నారు. నీకో సోదరుడు కూడా ఉన్నాడు. త్వరలోనే నువ్వు వారిని కలుసుకోగలవు” అని చెప్పాడు.
సన్యాసికి నమస్కరించి, అదృష్టదీపుడు అక్కడినుంచి వచ్చేశాడు. బలభద్రునితో కలిసి పట్టణంలోకి వెళ్లిపోయాడు. అప్పటివరకూ గోడమాటున దాగి ఉండి, వారి మాటలను విన్న ఒక యువతి తాను కూడా అదృష్టదీపుని అనుసరించి వెళ్లింది. ఆమె చతురిక. విదర్భ యువరాణి కాంతిమతి చెలికత్తె. తమ యువరాణికి తగినజోడు ఎక్కడ లభిస్తుందో సన్యాసి ద్వారా తెలుసుకోవాలని అక్కడికి వచ్చింది. ‘అందంలో మన్మథునికి, గొప్పతనంలో అదృష్టదీపునికి సాటివచ్చే జాతకం కలిగిన ఈ పురుషుడే మా యువరాణికి తగినవాడు’ అనుకుంది. అయితే అతని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం రెండురోజులపాటు అదృష్టదీపుని దూరం నుంచి గమనించింది.
* * *
మూడోరోజున అతని ఎదుటపడి, తానొక చిత్రకారిణి అని పరిచయం చేసుకుంది.
“మీవంటి అందగాడి చిత్రపటం గీస్తే ఎక్కువ వెలకు అమ్ముకోవచ్చు. దయచేసి నాతో సహకరించగలరా?” అని కోరింది. అదృష్టదీపుడు అందుకు అంగీకరించాడు.
కొంతసేపటికి చిత్రం గీయడం పూర్తయింది. తన బొమ్మ చూసుకున్న అదృష్టదీపుడు.. ఆమెకొక రత్నపతకం బహుమతిగా ఇచ్చాడు. ఆమె ఆ పతకాన్ని, చిత్రపటాన్ని తీసుకుపోయి యువరాణి కాంతిమతికి చూపించింది. దాన్ని చూసిన కాంతిమతికి మూర్ఛ వచ్చినంత పనైంది.
“ఏదో ఆటపట్టించడానికి నువ్వీ బొమ్మగీశావు. ఇటువంటి అందగాడు ఈ భూలోక మానవుల్లో ఉంటాడంటే నేను నమ్మను” అన్నది కాంతిమతి.
ఆమె మనసును అర్థం చేసుకున్న చతురిక, ఈసారి యువరాణి చిత్రపటాన్ని అదృష్టదీపుని వద్దకు తీసుకెళ్లింది.
“ఈ పటంలో ఉన్నది మా యువరాణి కాంతిమతి. ఆమెకు మీ బొమ్మ చూపించాను. ఇటువంటి అందగాడు భూమ్మీద ఉండడు.. ఇతడు నిజంగా ఉన్నాడని తెలిస్తే తప్ప నీకు బహుమానం ఇవ్వను అన్నదామె. శ్రమ అనుకోకుండా మీరు నాతో వస్తే మిమ్మల్ని చూపించి, మీ బొమ్మను ఆమెకు అమ్ముకుంటాను” అని బతిమాలింది.
యువరాణి చిత్రపటాన్ని చూసిన అదృష్టదీపుడు, మంత్రం వేసినవాడిలా ఆమెవెంట నడిచాడు. ఒక ఉద్యానంలో యువరాణిని రహస్యంగా కలుసుకున్నాడు.
తొలిచూపులోనే అదృష్టదీపుడు కాంతిమతి గాఢమైన ప్రేమలో పడ్డారు. అదృష్టదీపుడు.. తాను ప్రచ్ఛన్నవేషంలో ఉన్నానని, తన అసలు పేరు వగైరాలు వెంటనే చెప్పలేనని కాంతిమతితో చెప్పాడు.
ఆమె తలవంచుకుని కూర్చుంది.
“మీరు చక్రవర్తి కాగలరని సాధువు చెప్పడం విన్నాను. మా యువరాణిని మీ పట్టమహిషిగా స్వీకరిస్తామంటేనే మీ ప్రేమకు నేను సహాయపడగలను” అన్నది చతురిక.
అదృష్టదీపుడు ఆ మేరకు కాంతిమతికి హామీ ఇచ్చాడు. అప్పటినుంచి చతురిక సహాయంతో వారిద్దరూ ఉద్యానంలో రహస్యంగా కలుసుకోసాగారు. వారి మనసులతోపాటు తనువులు కూడా ఏకమయ్యాయి. తొందరలోనే కాంతిమతి నెల తప్పింది. అంతఃపుర రహస్యం అందరికంటే ఆలస్యంగా మహారాణికి, ఆ తరువాత మహారాజుకు తెలిసిపోయింది. అంతఃపురం నుంచి కదలకుండా కూతురిని కట్టుదిట్టం చేశారు. ఆమె నెలతప్పిన విషయం నిజమో కాదో అని రాజదంపతులు అనునయంగా అడగసాగారు. వారికి ఏం సమాధానం చెప్పాలో కాంతిమతికి అర్థం కావడం లేదు. అటువంటి తరుణంలో చతురిక ద్వారా ఒక లేఖ వచ్చింది. అందులో ఇలా ఉంది..
“కాంతా! నువ్వు నాతో చెప్పిన మాటలు జ్ఞాపకం ఉన్నాయి. నిన్ను తప్పకుండా నా పట్టమహిషిని చేసుకుంటాను. ఇదివరకు నా గురించి పూర్తి వివరాలు నీతో చెప్పడం కుదరలేదు. ఇప్పుడు పేరు మాత్రం చెబుతున్నాను. త్వరలోనే నిన్ను కలుసుకోగలను”
– అదృష్టదీప మహారాజు.
.. ఆ ఉత్తరాన్ని చూసిన రాజదంపతులు సంతోషించారు. కాంతిమతి పతీవియోగానికి సంతాపం చెందినా, త్వరలోనే అతణ్ని కలుసుకోగలనని మనసు నెమ్మది చేసుకుంది.
అంతకుముందే అదృష్టదీపుడు ఊరు వదిలిపెట్టి, పుష్పగిరి అనే పట్టణానికి చేరుకున్నాడు. అక్కడో సత్రంలో విడిది చేశారు. ఆ మరునాడు ఊరు చూడటానికి వెళ్లిన బలభద్రుడు హడావుడి పడుతూ వెనక్కి వచ్చాడు. సత్రం అరుగుమీద అదృష్టదీపుణ్ని చూసిన తరువాత స్థిమిత పడుతూ.. ‘హమ్మయ్య!’ అనుకున్నాడు.
“ఏమైంది బలభద్రా! ఏమిటీ కంగారు?!” అడిగాడు అదృష్టదీపుడు.
“అంగడివీధిలో అచ్చం నీలాగే ఉన్న ఓ కుర్రవాణ్ని బంధించి తీసుకు వెళుతున్నారు. నేను దగ్గరికి వెళ్లబోతే రాజభటులు తోసేశారు” అని చెప్పాడు బలభద్రుడు.
అప్పుడే ఒక బ్రాహ్మణుడు సాభిప్రాయంగా అదృష్టదీపుణ్నే చూస్తూ దగ్గరగా వచ్చాడు.
“బ్రాహ్మణోత్తమా! ఎందుకలా చూస్తున్నారు?! ఇంతకుముందు మీరు నన్ను ఎరుగుదురా?!” అని ప్రశ్నించాడు అదృష్టదీపుడు.
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | అదృష్టదీపుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | పాటపాడే చెట్టు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | స్వర్గంలో మానవుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | ఎగిరే చెట్లు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |కాశీ మజిలీ కథలు : దొంగల తప్పిదం
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |రహస్య స్నేహితుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | జగన్నాథ స్వామి
Kasi Majili Kathalu Episode 23 ( కాశీ మజిలీ కథలు ) | విశాలాక్షి కల”
Kasi Majili Kathalu Episode 22 | మలయాళ దేశం
Kasi Majili Kathalu Episode 20 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు – 2
Kasi Majili Kathalu Episode 19 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు