Kasi Majili Kathalu Episode 35 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : మణిప్రస్థ నగరాన్ని ఏలే కుంతీభోజుని ఏడో కుమారుడు జయభద్రుడు. వేశ్యా లోలుడై భార్యను నిర్లక్ష్యం చేసి, చివరికి అడవిలోని ఒక బావిలో చిక్కుకున్నాడు. అదే సమయానికి మరో అమ్మాయిని వేరొకరెవరో అదే బావిలో పడవేయగా.. జయభద్రుడే రక్షించాడు. ఆ అమ్మాయి మగధ రాకుమారి హైమవతి. ఆమె తన కథను జయభద్రునితో చెబుతున్నది..
తెల్లవారితే నా పెళ్లి. ఇద్దరు పెళ్లికొడుకులూ ఎవరి సన్నాహాల్లో వారున్నారు. అధికారికంగా పెళ్లికొడుకు కనుక, గుణవర్మ పల్లకి ఎక్కి పురవీధుల్లో ఊరేగాడు. ధనవర్మను మా అమ్మ రహస్యంగా పిలవడం వల్ల, తాను సంపన్నుడైనా.. ఆడంబరాలకు పోకుండా విడిదిలోనే ముహూర్తం కోసం నిరీక్షిస్తూ ఉండిపోయాడు.
నడిరాత్రి వేళ మా అమ్మ నన్నొక తమలపాకుల తట్టలో కూర్చోబెట్టింది. పైన మూతవేసి, లోపలికి గాలి వచ్చే ఏర్పాటుచేసింది. ఒక దాసి ఆ తట్టను నెత్తిన పెట్టుకుని, నన్ను ధనవర్మ వద్దకు తీసుకుపోతున్నది. ఆ సమయంలో ఉన్నట్లుండి రాజవీధిలో మంటలు చెలరేగాయి. ఇళ్లు అంటుకున్నాయి. పౌరులందరూ ఇళ్లలోని వస్తువులను రాజవీధిలో వేసి, మంటలను ఆర్పుతున్నారు.
ఆ సందడిలో తట్టను ఓ వీధిలో పెట్టి పారిపోయింది
ఆ దాసి. లోపలి నుంచి నేనంతా గమనిస్తూనే ఉన్నాను. కానీ, బయటికి రాలేకపోయాను. ఇంతలో మరోపక్కన దొంగల దోపిడీ మొదలైంది. మంటలార్పడం కోసం అందరూ హడావుడి పడుతుంటే.. నడివీధిలో పడి ఉన్న వాటిలో విలువైన వాటిని దోచుకోసాగారు దొంగలు. నేను కూర్చున్న తమలపాకుల తట్ట చెక్కనగిషీలతో ఉండటం, బరువుగా తోచడం వల్ల కష్టంమీద గుర్రంమీదికి ఎక్కించారు. తెల్లవారేసరికి ఈ అడవిలో తేలారు. గుర్రాల మీది వస్తువులను దించకుండానే.. ఒక చెరువు దగ్గర వాళ్లు కాలకృత్యాలు తీర్చుకుంటుండగా, పులి గాండ్రింపు వినిపించింది. దాంతో నేను కూర్చున్న తట్టను మోస్తున్న గుర్రం అదురుపాటుతో దౌడు తీసింది. రెండు జాముల పొద్దెక్కే వరకూ ఎక్కడెక్కడో తిప్పింది. చివరికి నేను నెమ్మదిగా తట్టలోనుంచి బయటికి వచ్చాను. మా అమ్మ నాకోసం కొన్ని పిండివంటలు తట్టలో పెట్టింది. వాటిని తిని ఆకలి తీర్చుకున్నాను. అక్కడినుంచి ఎటుపోవాలో తోచక తిరుగుతున్నాను.
ఎవరైనా రక్షించకపోతారా!? అని ఎదురుచూస్తున్న తరుణంలో మళ్లీ నాకు అతి దగ్గరగా పులి గాండ్రింపు వినిపించింది. ఏం జరుగుతున్నదో అర్థమయ్యే లోపు గాలిలో ఒక ఊచ ఎగిరి వచ్చింది. కన్నుమూసి తెరిచేలోగా భయంకరంగా గాండ్రిస్తూ పులి నేలకొరిగింది. ఆ ఊచను విసిరిన వేటగాడు భీకరమైన ఆకారంతో నా ముందుకు వచ్చాడు.
“ఎవరు నువ్వు? ఈ అడవి దేవతవా? వేరే లోకంనుంచి వచ్చావా?” అని అడిగాడు. నాకు వాడి మాటలు కొన్ని అర్థమయ్యాయి. కొన్ని అర్థం కాలేదు.
“మాది మగధదేశం. దొంగలు ఎత్తుకొచ్చి ఈ అడవిలో వదిలేశారు” అని చెప్పబోయాను. కానీ, వాడికేమీ అర్థం అయినట్లు తోచలేదు. నా దుస్తులవైపు, నగలవైపు వింతగా చూడసాగాడు. నన్నో దేవతగానే తలపోయసాగాడు. నా దగ్గరున్న బూరెలు రెండు వాడి చేతిలో పెట్టాను. వాటిని ఆబగా తిని..
“ఈ అడవిలో నేనెప్పుడూ ఇలాంటి పళ్లు చూడలేదు. మరో రెండు పెడతావా?” అని అడిగాడు. నేను జాలిపడి మరికొన్ని దోసిట్లో పోశాను.
“అమ్మోరూ! రేత్రి కావస్తున్నది. ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు? పోనీ మా ఇంటికొస్తావా?” అని అడిగాడు.
“సరే” అంటూ వాడివెంట నడిచాను. చాలాదూరం నడిపించి నన్ను వాళ్లింటికి తీసుకుపోయాడు.
“అమ్మోరూ! ఈ పులిచర్మం కప్పుకొని హాయిగా నిదరపో. నాపెళ్లాం వచ్చే ఏళయింది. దానికి కనబడితే పెమాదం” అంటూ ఓ పులి చర్మం ఇచ్చాడు వాడు. ఇంతలోనే.. ఎలుగుబంటిలాంటి ఆకారంతో ఆ వేటగాడి భార్య రానేవచ్చింది. వస్తూనే.. “వేట తేకుండా వచ్చావేం!” అని మొగుడితో గొడవ పడింది. వాళ్ల పోట్లాటలో నేనామె కంటిలో పడనే పడ్డాను.
“ఎవత్తినో తెచ్చుకుని కులుకుతున్నావా? ఉండు.. ఇప్పుడే పెద్దలతో చెప్పి నిన్ను కులంలో నుంచి వెలి వేయించేస్తాను” అంటూ వెళ్లిపోయింది. మరికొద్దిసేపటికి కొందరు అడవి మనుషులు వచ్చారు. నన్ను రక్షించిన వేటగాణ్ని నానా మాటలూ అన్నారు. నా కాళ్లూ, చేతులూ కట్టేసి, తీసుకొచ్చి ఈ బావిలో పడేశారు. అప్పుడే దేవుడిలా వచ్చి, మీరు నన్ను రక్షించారు. ఆ తరువాతి కథ మీకు తెలిసిందే..
* * *
..అని అప్పటివరకూ జరిగిన కథను హైమవతి వివరంగా చెప్పింది. జయభద్రుడు తలపంకించాడు.
“నిన్ను మళ్లీ మీ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాను” అని హామీ ఇచ్చాడు. హైమవతి సంతోషించింది.
అడవిదారుల్లో ఎన్నెన్నో కష్టాలు పడుతూ ప్రయాణం చేశారు ఇద్దరు. మధ్యమధ్యలో మజిలీలు చేసుకుంటూ అనేక గ్రామాలు, పట్టణాలు దాటుతున్నారు. కొన్నిచోట్ల ఆదరించి, అన్నంపెట్టే సత్రాలుండేవి. కొన్ని ఊళ్లలో జయభద్రుడు సంబారాలు తీసుకువస్తే హైమవతి వండి వడ్డించేది. అలాంటి సమయంలో ఒకరోజున..
జయభద్రుడు వంటసామగ్రి తీసుకువచ్చాడు. హైమవతి వంట పూర్తిచేసింది.
“ఆర్యా! ఈవేళ సంక్రాంతి. ఎవరైనా అతిథులకు ముందుగా భోజనం పెట్టి, ఆ తరువాత మనం భుజిస్తే బాగుంటుంది. మీరేమంటారు?!” అని ప్రశ్నించింది.
జయభద్రుడు సరేనంటూ గ్రామంలోకి వెళ్లాడు. దేవాలయంలో ఒక సాధువు ఒంటరిగా కనిపించాడు. అతనికి ఆ పూట భోజనం దొరికినట్లు లేదు.
“ఊరు గొడ్డుపోయిందా?! ఒక్కడైనా పిలిచి, ఇంత అన్నం పెట్టలేదీ పూట” అని ధుమధుమలాడుతున్నాడు.
జయభద్రుడు అతని దగ్గరికి వెళ్లి వినయంగా..
“ఈ పూట మీరు మా ఆతిథ్యం తీసుకోవాలి” అని వేడుకున్నాడు. దీంతో జయభద్రుని వెంట నడిచాడు ఆ సాధువు. చెట్టుకింద వంటచేసి, పక్కనే శుభ్రం చేసి ఉంచింది హైమవతి. సాధువు కూర్చున్నాడు. హైమవతి భోజనం వడ్డించింది.
“విస్తరి పక్కన ఒక్క వరహా పెట్టకపోతే నేను దీన్ని ముట్టుకోలేను నాయనా! అది నా వ్రతం. వరహా ఇచ్చుకోలేక పోవడం వల్లనే ఈ గ్రామస్తులెవరూ నన్ను భోజనానికి పిలవరు. చెప్పు మరి.. వరహా తెచ్చిపెడతావా? నన్ను లేచి వెళ్లిపోమంటావా?” అని అడిగాడు.
“స్వామీ! నా దగ్గరున్న సొమ్మంతా ఖర్చుపెట్టి సంబారాలు తెచ్చాను. ఇప్పుడు ఇచ్చుకోలేను. దయచేసి భోజనం కానివ్వండి” అని వేడుకున్నాడు జయభద్రుడు.
సాధువు కనికరించలేదు.
“సొమ్ము లేనివాడివి తగుదునమ్మా అని నన్నెందుకు పిలిచావు? వరహా ఇస్తావా.. లేచి పొమ్మంటావా?” అని బెదిరించ సాగాడు.
అప్పుడు హైమవతి తన మెడలోని హారాన్ని తీసి సాధువు ముందుంచింది.
“స్వామీ! ఈ హారం మీరడిగిన వరహా కంటే విలువైనది. దీన్ని స్వీకరించి, మమ్మల్ని అనుగ్రహించండి” అని కోరింది. సాధువు శాంతించాడు. ఆతిథ్యం స్వీకరించాడు.
“మీరు భార్యాభర్తలై, పిల్లాపాపల్ని కని దీర్ఘాయువులై వర్ధిల్లండి” అని ఆశీర్వదించాడు. జయభద్రుడు, హైమవతి మనసులోనే నవ్వుకున్నారు.
“స్వామీ! ఈమె మగధదేశపు రాకుమారి. అనుకోకుండా తప్పిపోయింది. ఈమెను వారి తల్లిదండ్రులకు అప్పగించడానికి వెళుతున్నాను. నేనీమె భర్తను కాదు” అని జయభద్రుడు చెప్పాడు.
“ఇప్పుడు కాకపోయినా ఇకముందు కాగలవు. అయినా చెబుతున్నాను విను. ఇప్పుడీమెను రాజధానికి తీసుకుపోవడం వల్ల ప్రయోజనం లేదు. మగధరాజ దంపతులు ప్రస్తుతం చెరసాలలో ఉన్నారు. తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తామని.. ఆ దంపతులిద్దరూ విడివిడిగా ధనవర్మ, గుణవర్మ అనే ఇద్దరు రాకుమారులకు మాటిచ్చారు. పెళ్లి సమయానికి పెళ్లికూతురు కనిపించలేదు. దాంతో ఆ రాకుమారులిద్దరూ మగధరాజును నిలదీశారు. జవాబివ్వక పోవడంతో చెరలో పెట్టించారు. తమ మధ్యనున్న శత్రుత్వాన్ని మరిచిపోయి, మగధ రాజ్యసింహాసనాన్ని ఇద్దరూ పంచుకుని పాలిస్తున్నారు. హైమవతి తిరిగి వచ్చి, తమలో ఒకరిని పెళ్లాడేవరకూ మగధ దేశానికి విముక్తి లేదని ప్రకటించారు. కనుక ఈమెను ఎక్కడికైనా దూరంగా తీసుకుపోయి పెళ్లి చేసుకుని సుఖపడు. ఒకవేళ నిజంగా వీరుడివైతే వాళ్లిద్దరినీ జయించి, మగధ సింహాసనంతో పాటుగా హైమవతిని కూడా చేపట్టు” అని అన్ని విషయాలూ హెచ్చరికగా చెప్పి సాధువు నిష్క్రమించాడు.
ఆ మాటలు వినగానే తల్లిదండ్రులకు కలిగిన కష్టాన్ని తలుచుకుని, హైమవతి కళ్లలో నీరు నింపుకొన్నది.
సాహసవంతుడైన జయభద్రుడు వెనకడుగు వేయలేదు. హైమవతికి మారువేషం వేయించి, రాజధానిలో ప్రవేశించాడు. ఆమెను ఒక ఇంటిలో దాచిపెట్టి, తానువెళ్లి నగరంలో సంచరించ సాగాడు. ఏదో ఒక ఉపాయం పన్ని కొలువులో ఉద్యోగం సంపాదించాడు. తన తెలివితేటలతో ధనవర్మను, గుణవర్మను సమానంగా మెప్పించాడు. అతి తక్కువ కాలంలోనే వారికి తలలో నాలుకలా మెలగసాగాడు. ఒకే వయసు వారు కావడంతోనూ, మనసు తెలిసి మాట్లాడే తీరువల్లనూ ధనవర్మ, గుణవర్మలిద్దరూ తమ రహస్యాలను జయభద్రునితో పంచుకునేవారు. అలా ఉండగా ఒకనాడు..
“జయభద్రా! హైమవతి అందచందాలు, సుగుణాలను గురించి విని పెళ్లాడాలని వచ్చి మోసపోయాను. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేకపోతున్నాను. దీనికి పరిష్కారం తోచకుండా ఉంది” అని ధనవర్మ తన మనసులో మాట చెప్పుకొన్నాడు .
అందుకు జయభద్రుడు..
“మహారాజా! ఈ విషయం గురించి నాకు కొంత సమాచారం ఉంది. నా అంచనా నిజమైతే ఒకటిరెండు రోజుల్లో ఆమెను మీకు చూపించగలను” అన్నాడు.
“నేను ఎదురు చూస్తుంటాను” అన్నాడు ధనవర్మ.
ఆ మరునాడు సరిగ్గా ఇలాంటి సంభాషణే గుణవర్మతో కూడా జరిగింది. తన పాచిక పారే తరుణం వచ్చిందని, జయభద్రుడు సంతోషించాడు.
“హైమవతి ఎక్కడికీ పోలేదు మహారాజా! మన ధనవర్మగారు ప్రతిరోజూ ఆమె ఉండే ఇంటికి వెళ్లి వస్తూ ఉంటారు” అని గుణవర్మతో చెప్పాడు.
“నిజమా! మిత్రుడిలా నటిస్తూ ఆ ధనవర్మ నాకు వెన్నుపోటు పొడిచాడన్నమాట. ఇంతకూ నువ్విది నిరూపించగలవా?” అని ప్రశ్నించాడు గుణవర్మ.
“రేపు సాయంకాలం మీరు నాతో రండి. ఆయన హైమవతితో కలిసి ఉండగా మీకు చూపిస్తాను” అని సమాధానమిచ్చాడు జయభద్రుడు.
“సరే” అన్నాడు గుణవర్మ.
“మీకిచ్చిన మాట ప్రకారం హైమవతిని చూపిస్తాను” అని ధనవర్మను కూడా అదే సమయానికి అదే ఇంటికి రప్పించాడు జయభద్రుడు. అందులో ఒక గదికి రెండు దిక్కుల గోడలకూ కిటికీలున్నాయి. ఆవలివైపు నుంచి ధనవర్మ, ఈవలివైపు కిటికీ నుంచి గుణవర్మ కూడా రాకుమారిని చూశారు.
“కొద్దిసేపటిలో ప్రియుడు రాగానే గదిలో దీపాలు ఆరిపోతాయి” అని ఇద్దరికీ ఒకే మాట చెప్పాడు జయభద్రుడు. వాళ్లు యథాస్థానాల్లో వేచి ఉండగా.. తాను గదిలో ప్రవేశించి, హైమవతితో శ్రుతికలిపి పాడుతూ, దీపాలు ఆర్పేశాడు. కళ్లతో చూసిన నిజాన్ని నమ్మలేకపోవడం అనే ప్రశ్న లేదు. మరునాడు సభాస్థలిలో.. ధనవర్మ – గుణవర్మలిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుంటూనే కత్తులతో పొడుచుకుని ఒకేసారి మరణించారు. జయభద్రుడు మగధ సింహాసనాన్ని కైవసం చేసుకున్నాడు. మంత్రపాలుణ్ని, అతని భార్యనూ చెరనుంచి విడిపించాడు. దరిమిలా ధనవర్మ గుణవర్మల రాజ్యాలనుంచి వచ్చిన దాడులను తిప్పికొట్టాడు. హైమవతితో జయభద్రుని వివాహం వైభవంగా జరిగింది. మంత్రపాలుడు అనేక దానాలు చేశాడు. ఆ దానాలు అందుకునే బ్రాహ్మణులను తన చాపల్యం కొద్దీ..
“ఇటీవలి కాలంలో ఇంత గొప్ప బహుమానాలు ఎక్కడైనా పొందారా?” అని ప్రశ్నించాడు.
ఎవరూ మాట్లాడలేదు. ఒక వృద్ధ బ్రాహ్మణుడు లేచి..
“మహారాజా! మణిప్రస్థ నగరంలో సునీతి చేసే దానాలతో పోల్చుకుంటే, మీరు చేసేవాటిని దానమనే చెప్పనక్కరలేదు. మరొక్క చిన్నవిషయం కూడా మనవి చేయాలి. ఆమె భర్త జయభద్రుడు.. అచ్చంగా మీ అల్లుడి పోలికలోనే ఉంటాడు” అన్నాడు.
(వచ్చేవారం.. అగ్నిపునీత)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | నీతిమంతురాలు
Kasi Majili Kathalu | అనంగ చంద్రిక
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | అదృష్టదీపుడు – 2
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | అదృష్టదీపుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | పాటపాడే చెట్టు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | స్వర్గంలో మానవుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | ఎగిరే చెట్లు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |కాశీ మజిలీ కథలు : దొంగల తప్పిదం
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |రహస్య స్నేహితుడు