V Srinivas Goud | రైతులను కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ మండల పరిధిలోని మిల్లును పరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పంట కొనుగోలు చేయక పోవడంతో వర్షానికి పంట తడిసింది. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నది..కానీ మంచిగా ఉన్న ధాన్యం కూడా కొనడం లేదన్నారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలను ప్రభుత్వం తెలుసుకోవాలని.. రోహిణి కార్తె రావడంతో పంటలు వేసుకునేందుకు రైతులు సిద్ధం అవుతుంటే కనీసం పిండి సంచులు లేవన్నారు.
రైతు బంధు లేదు.. రుణ మాఫీ లేదు.. సకాలంలో కరెంటు ఇవ్వలేదు.. ఆరుగాలం కష్టం చేసి పండిన పంట కూడా కొనుగోలు చేయడం లేదన్నారు శ్రీనివాస్ గౌడ్ .
పాలమూరు పనులు పూర్తి చేసేందుకు పిలిచినా టెండర్లు రద్దు చేసారు. ప్రాజెక్ట్ పూర్తి చేయమంటే మంత్రులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
నకిలీ పత్తి విత్తనాలను మార్కెట్ లో రాకుండా అధికారులు చూడాలి. ఇచ్చిన హామీలు అమలు చేయాలని..రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు కొనుగోలు చేయడంతో పాటు పిండి సంచులు సకాలంలో ఇవ్వాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. మేము అధికారంలో ఉన్నప్పుడు రైతులకు అన్ని అందుబాటులో పెట్టాం. పంట కొనుగోలు చేసి బోనస్ ఇచ్చాం. రైతు బంధు సకాలంలో విడుదల చేశామన్నారు. కాంగ్రెస్ వచ్చి రెండున్నరేండ్లు ఐనా రైతులకు చేసిందేమి లేదు. ఇదే రకమైన పాలన కొనసాగితే రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. శ్రీనివాస్ గౌడ్ వెంట గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మండల సీనియర్ నాయకులు మల్లు నర్సింహా రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.