ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబే క్యాంపస్లో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. హాస్టల్ రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (IIT Bombay Student Suicide) అయితే కుటుంబ సమస్యలు, రిలేషన్షిప్లో ఇబ్బందులు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజస్థాన్లోని పిలానీకి చెందిన 20 ఏళ్ల సోహిల్ రాజ్కుమార్ సాంగ్వాన్, ఐఐటీ బాంబే విద్యార్థి. మెటీరియల్ సైన్స్ విభాగంలో రెండవ సంవత్సరం చదువుతున్నాడు.
కాగా, పోవాయి క్యాంపస్లోని హాస్టల్ గదిలో సోహిల్ రాజ్కుమార్ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెడ్షీట్తో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సోహిల్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఆ విద్యార్థి ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు కుటుంబ సమస్యలు, రిలేషన్షిప్లో క్లిష్ట పరిస్థితులను సోహిల్ ఎదుర్కొంటున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. అయితే ఆత్మహత్యకు ఖచ్చితమైన కారణాలు, పరిస్థితులను తెలుసుకునేందుకు ఆ విద్యార్థి మొబైల్ ఫోన్, చాట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు.