Kasi Majili Kathalu Episode 47 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : సింధుబా రాజ్యాన్నేలే వీరప్రతాపుడు.. తన నలుగురు కుమారులనూ దేశాటన చేసి, తగిన భార్యలను ఎన్నుకోమని పంపాడు. నలుగురిలో మొదటివాడైన విజయుడు.. హేమను పెళ్లి చేసుకున్నాడు. ఆఖరివాడైన చంద్రుడు.. యక్షకన్యను పెళ్లాడాడు. మిగిలిన ఇద్దరూ దుష్టులై, తమ అన్నదమ్ములిద్దరినీ వంచించారు. ఆ కారణంగా మొదటివారు తమ భార్యలకు దూరమయ్యారు. దుష్టులైన ఇద్దరూ మరోసారి మరో పన్నాగం పన్నారు.
“ఎవరూ కనిపించడం లేదే?!” బావిలోకి తొంగిచూస్తూ అడిగారు విజయుడు, చంద్రుడు.
“అదుగో ఆ మూల మునిగింది. అదుగదుగో ఆవైపు తేలుతున్నట్లుంది” అంటూ చూపుతున్నది రుచిర.
ఆ సందడిలో బావిలోకి తొంగిచూస్తున్న అన్నదమ్ముల కాళ్లు వెనకనుంచి ఎత్తిపట్టి లోపలికి తోసేశారు మిగిలిన ఇద్దరూ. రెండు తాడిచెట్ల లోతైన బావి అది. పైనుంచి పడటం వల్ల అడుగువరకూ మునిగి, వెంటనే పైకి తేలారు వారు. పైనుంచి తమ సోదరులను లోపలికి తోసేసిన వాళ్లిద్దరూ..
“ఇందులోనే పడి చావండి” అని కసిగా తిట్టి, రుచిరతో కలిసి వెళ్లిపోయారు.
విజయుడు, చంద్రుడు ఇద్దరూ ఈత తెలిసిన వాళ్లే కావడంతో, నీటిలో మునిగిపోలేదు. అజ్ఞాని హృదయంలా ఇసుమంత కూడా వెలుగు లేకుండా చిమ్మచీకటిగా ఉన్న ఆ బావిలో.. చేతులతోనే వెతుకులాడుతూ ఈదుతూ చాలాసేపు గడిపారు.
చివరికి వారి చేతికి ధర్మశిలలు దొరికాయి. లోతైన బావులు నిర్మించినప్పుడు ప్రమాదవశాత్తూ ఎవరైనా అందులో పడితే.. వారికి ఊతంగా ఉండటం కోసం ధర్మశిలలను నిర్మిస్తారు. అవే ఇప్పుడు విజయునికి, చంద్రునికి ప్రాణరక్షణగా నిలిచాయి. అక్కడినుంచి పైకి రావడానికి మార్గం మాత్రం దొరకలేదు.
కొంత తేరుకున్న తరువాత..
“అన్నయ్యా! నేను ముందే చెబితే విన్నావు కాదు. ఈ దుర్మార్గుల్ని అప్పుడే మట్టుపెడితే ఇంతదూరం రాకపోయేది కదా! ఇప్పుడు చూడు.. ఇక్కడినుంచి పెడబొబ్బలు పెట్టినా ఎవడికీ వినిపించదు. ఒకవేళ వినిపించినా ఈ అడవిలోకి ఎవరు వస్తారు. వచ్చినా మనల్ని బయటికి తీయడానికి సరిపోయే పగ్గాలు, గొలుసులు పట్టుకు వస్తారు?” అన్నాడు చంద్రుడు.
“ఈత రాకపోయినా బాగుండేది. నీటిలో మునిగి చనిపోయేవాళ్లం. ఇప్పుడీ రాళ్లపై తిండిలేక మలమలమాడి చచ్చిపోతామేమో” బేలగా అన్నాడు విజయుడు.
“ఏం జరిగినా చేసేదేం లేదు. మృత్యువు కోసం నిరీక్షించడమే!” అని నిట్టూర్చాడు చంద్రుడు.
వాళ్లిద్దరూ అలాగే ఆ బావిలో మూడురోజులు గడిపారు. నాలుగోరోజున అక్కడికి సమీప గ్రామంలో ఒక ఇంటిలో దొంగతనం జరిగింది. గ్రామస్తులు దొంగలను తరుముకుంటూ వస్తుండగా దొంగలు తాము దోచుకున్న వస్తువులను బావిలో పారేసి వెళ్లారు.
ఆ వస్తువులను తీయడం కోసం యజమాని బావిలోకి పగ్గాలు వేసి, మనుషులను దింపాడు. ఆ మనుషుల వల్ల అన్నదమ్ములిద్దరూ కూడా బయటికి వచ్చారు.
కానీ, అప్పటికి వారు స్పృహలో లేరు. రోజుల తరబడి నీళ్లలోనే ఉండటం వల్ల శరీరమంతా తెల్లబడిపోయింది. ఊపిరి పల్చగా ఆడుతున్నది. నాడి బలహీనంగా కొట్టుకుంటున్నది. గ్రామస్తులు హుటాహుటిన మజ్జిగతో కలిపిన అన్నరసాన్ని వారికి పట్టించారు. నెగడు మండించి పక్కనే పడుకోబెట్టారు. కొంతసేపటికి ఇద్దరికీ చెమట పట్టింది. ప్రమాదం తప్పింది. అటుపైన మరో పదిరోజులపాటు గ్రామస్తులు వారికి ఆశ్రయం కల్పించారు. మునుపటి బలం పుంజుకున్నాక, గ్రామస్తులకు కృతజ్ఞతలు చెప్పి అన్నదమ్ములిద్దరూ అక్కడినుంచి బయల్దేరారు.
* * *
విజయుని భార్య హేమ పుట్టినిల్లు అయిన కరిపురం చేరుకున్నారు ఇద్దరూ. ఆ పట్టణంలోని రాజమార్గంలో నడుస్తుండగా ఒకచోట ‘వీణావాదన పరీక్షా మందిరం’ అనే ఫలకం కనిపించింది. దానిని చూసిన చంద్రుడు ఒక బాటసారిని నిలువరించి..
“అయ్యా! ఈ ఫలకానికి అర్థమేమిటి? ఇక్కడ మా వీణావిద్యను పరీక్షిస్తారా?” అని ప్రశ్నించాడు.
అందుకా బాటసారి నవ్వి..
“కాదయ్యా బాబూ! అక్కడో వీణ ఉంటుంది. దానిని మీట గలిగిన వాళ్లెవరూ దొరకడం లేదు. ఎంతోమంది విద్వాంసులు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. కానీ, ఎవరి వల్లా కాలేదు. ఎవరైతే ఆ వీణను మోగించగలరో వారికి గొప్ప బహుమానం ఇస్తామని మా మహారాణి ప్రకటించారు” అని అసలు సంగతి తెలియచేశాడు.
ఆ మాటలు వినగానే చంద్రుడు లోపలికి వెళ్లి, ఆ వీణను చూశాడు. దానిపైన ‘వీరప్రతాప పుత్ర చంద్ర’ అని చెక్కి ఉంది. దానిని చూడగానే ఆనందంతో..
“అన్నా! అది నా వీణే. దానిమీద నా పేరును చారుమతి స్వయంగా చెక్కింది” అని చెప్పాడు.
విజయుడు కూడా చాలా సంతోషించాడు.
“అయితే నువ్వీ వీణను మోగించగలవని మహారాణికి కబురు చేద్దాం” అన్నాడు.
మరునాడు సభ ఏర్పాటు అయింది. మహారాణి పరదాల మాటున కూర్చుంది. ఆమె ఐదేళ్ల కుమారుడు సింహాసనంపైన చాలా ఒద్దికగా కూర్చున్నాడు. అతడి ముఖాన్ని చూడగానే విజయునిలో పితృవాత్సల్యం పొంగులు వారింది.
సమయం చూసుకుని అతడి వద్దకు వెళ్లి.. “నాయనా! నీ పేరేమిటి?” అని ప్రశ్నించాడు.
“నాపేరు విజయపుత్ర గజదత్తుడు” అని సమాధానం చెప్పాడు.
వేదికపైన వీణను అమర్చారు. చంద్రుడు ఆ వీణకు నమస్కరించి, చారుమతి నుంచి నేర్చుకున్న మోహనరాగాన్ని అద్భుతంగా పలికించాడు. లోకసమ్మోహనకరమైన ఆ గానాన్ని ఆలకించిన సభాసదులందరూ నాట్యం చేయసాగారు. ఇంద్రియాలకు అతీతమైన లోకాల్లో తేలియాడసాగారు. విజయుడు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. అతని కన్నుల వెంట ఆనందబాష్పాలు జాలువారుతున్నాయి. మాటిమాటికీ అతడి స్మృతిపథంలో హేమ ప్రతిబింబం మెదులుతున్నది. పిల్లవాడు తన పేరును చెప్పడంతో అతని తల్లిని చూడాలనే ఆరాటం అంతకంతకూ ఎక్కువ అవుతున్నది.
చంద్రుని వీణాగానం పూర్తయింది. సభలో కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. గజదత్తుడు చిన్నారి చేతులతో చంద్రుని సత్కరించాడు.
“మీరు ఒకసారి అంతఃపురానికి రావాలి. మా తల్లిగారు మిమ్మల్ని కలుసుకోవాలని అనుకుంటున్నారు” అని చెప్పాడు.
విజయుడు, చంద్రుడు ఇద్దరూ లోనికి వెళ్లారు. అక్కడ హేమను చూసి, విజయుడు చలించిపోయాడు. అనేక సంవత్సరాల ఎడబాటు తరువాత కలుసుకున్న ఆనందం ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేయడం వల్ల దాన్ని తట్టుకోవడానికి ఆ దంపతులకు చాలాసేపు పట్టింది.
ఆ తరువాత హేమ తన కథను ఇలా చెప్పింది.
* * *
“..భానుడికి నేను లొంగకపోవడం వల్ల నన్ను అతనో బావిలో పారేసి వెళ్లిపోయాడు. అదే సమయానికి ఓ బ్రాహ్మణుడు ఆ బావివద్దకు స్నానానికి వచ్చాడు. నన్ను రక్షించి, తన ఇంటిలో ఆశ్రయం కల్పించాడు.
అప్పటికే నేను గర్భవతిని. నెలలు నిండిన తరువాత ఈ పిల్లవాణ్ని కన్నాను. ఏడాది వయసు ఉండగా ఓ రోజున వీడు చెట్టుకింద ఆడుకుంటూ ఉండగా ఒక అడవి ఏనుగు ఎత్తుకుపోయింది. దాంతో నాకు లోకమంతా చీకటైపోయింది. కట్టుకున్న భర్తకు, కన్నకొడుకుకు దూరమైన తరువాత జీవించడం ఎందుకని అనిపించింది. ఆత్మహత్య చేసుకోబోతుండగా నన్ను కాపాడిన బ్రాహ్మణుడే నన్ను మళ్లీ ఆపుచేశాడు.
‘పిల్లవాడు దూరమైన సమయానికి లగ్నం వేసి చూశాను. అతని ప్రాణాలకేమీ ప్రమాదం లేదు. పైగా ఈ సంఘటన వల్లనే త్వరలో నువ్వు నీ భర్తను కలుసుకోగలవు’ అని చెప్పాడాయన.
నాలో మళ్లీ ఆశ చిగురించింది. ఆయన చెప్పినట్లుగానే రెండురోజుల తరువాత మా గ్రామానికి కొంతమంది రాజభటులు వచ్చారు.
‘ఏనుగు ఎత్తుకుపోయిన పిల్లవాడి తల్లిదండ్రులెవరు?’ అని అడిగారు.
‘నేనే’ అని ముందుకు వెళ్లాను.
అప్పుడు వారు..
‘మేము బలవర్ధన మహారాజుగారి భటులం. అడవి ఏనుగు నుంచి పిల్లవాణ్ని మా రాజుగారు రక్షించారు. మీరు వచ్చి మీ పిల్లవాణ్ని కలుసుకోవచ్చు’ అని చెప్పారు.
ఆ వార్త వింటూనే నేను హతాశురాలినయ్యాను. పిల్లవాడు దొరికాడనే ఆనందం ఒకవైపు.. నేను లేచిపోయిన ఆడపిల్లనని, నన్ను శిక్షించాలని నా తండ్రి ఇంకా ఎదురు చూస్తున్నాడేమో అనే సంశయం మరోవైపు నన్ను చుట్టుముట్టాయి. అప్పుడు కూడా నన్ను కాపాడినవారే నాకు అక్కరకు వచ్చారు. నేను మా తండ్రిగారి కంటపడాల్సిన అవసరం లేకుండా చేశారు. తాను ఆ పిల్లవాడి తాతగా పరిచయం చేసుకున్నారు.
మా తండ్రిగారు చాలా సంతోషించారు.
తనకు మగపిల్లలు లేరని, ఏనుగు తెచ్చి ఇచ్చిన ఈ పిల్లవాణ్ని తన రాజ్యానికి వారసుణ్ని చేస్తానని ఆ బ్రాహ్మణుని బతిమాలుకున్నారు. అందుకు ఆ బ్రాహ్మణుడు అంగీకరించారు. పిల్లవానికి గజదత్తుడని పేరుపెట్టి, మా తండ్రిగారు పెంచుకున్నారు. కొంతకాలం నిరీక్షించిన తరువాత నా గురించి అసలు నిజాలను ఆ బ్రాహ్మణుడే మా తండ్రికి తెలియచేశారు.
మా తండ్రీకూతుళ్లం మళ్లీ కలుసుకున్నాం. ఇంతలో మా తండ్రిగారికి అవసానకాలం సమీపించింది. ఆయన చనిపోయేముందు మీ కుమారుణ్ని తన రాజ్యానికి వారసునిగా ఎంపిక చేశారు. అతను పెద్దవాడయ్యేదాకా నన్ను బాధ్యత వహించమని చెప్పారు. ఇలా గడుస్తుండగా ఒకనాడు మా దగ్గరికి ఈ వీణను తీసుకుని మరో బ్రాహ్మణుడు వచ్చాడు. దానిపై మీ తండ్రిగారైన వీరప్రతాపుని పేరును, చంద్రుని పేరును చూశాను.. దానిని పలికించగలిగిన వారు చంద్రుడే అవుతారని అప్పుడే ఊహించాను. అదే నిజమైంది. నా మాంగల్యబలం చేత మిమ్మల్ని మళ్లీ కలుసుకోగలిగాను”.
* * *
..అని హేమ చెప్పిన కథను విన్న విజయుడు ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. కొద్దిసేపు ఆలుమగలు ఆలింగన సుఖంలో పాతకష్టాలను మరిచిపోవడానికి ప్రయత్నించారు.
ఆ రాత్రికే ఏకాంత సమయంలో, చంద్రుడు తన వీణను శ్రుతి చేశాడు. ఇచ్చిన మాట ప్రకారం చారుమతి వచ్చింది. చంద్రుడు తనకు ఎదురైన కష్టాలను భార్యతో వివరంగా చెప్పుకొన్నాడు. అప్పుడామె..
“ఇకనుంచి వీణపైనే కాకుండా నోటితో ఆ రాగాన్ని పాడినా నేను మీముందు ఉంటాను” అని హామీ ఇచ్చింది.
కొంతకాలం కరిపురంలో గడిపిన తరువాత అన్నదమ్ములిద్దరూ తమ జన్మస్థానమైన సింధుబా నగరానికి బయల్దేరారు.
రాజధానిలో ప్రవేశించడానికి ముందుగానే అప్పటి పరిస్థితుల గురించి ఆరా తీశారు.
‘భానుడు, రాముడు కొద్దికాలం ముందే తిరిగి వచ్చారు. తమ సోదరులిద్దరూ అనుకోని రీతిలో మరణించారని తండ్రికి తెలియచేశారు. వార్ధక్య దశలో కడుపుకోతను భరించలేక వీరప్రతాపుడు కుమిలిపోతున్నాడు. ఇంకా వాళ్లిద్దరికీ రాజ్యాన్ని కట్టబెట్టలేదు. కానీ, భవిష్యత్తులో వారే రాజులు కాగలరు’ అని పౌరుల మాటల వల్ల తెలిసింది.
దాంతో విజయుడు, చంద్రుడు కలిసి పెద్దసైన్యంతో వెళ్లి.. దుర్మార్గులైన భానుడిని, రాముడిని బంధించారు. తమను గురించి బెంగపెట్టుకున్న తల్లిదండ్రులను కలుసుకుని, వారికి ఆనందం కలిగించారు.
అతిత్వరలోనే విజయునికి పట్టాభిషేకం జరిగింది. చంద్రుడిని అర్ధరాజ్యానికి అధికారిని చేస్తూ విజయుడు ఔదార్యం చాటుకున్నాడు.
అంతకుముందు చేసిన తప్పును ఈసారి దిద్దుకున్నాడు. దుష్టబుద్ధితో సోదరులనే మట్టుపెట్టాలని చూసిన భానుడిని, రాముడిని తేలికగా విడిచిపెట్టలేదు. వాళ్లిద్దరితో పాటు రుచిరను కూడా కోటగుమ్మానికి సమీపంలో స్తంభాలకు కట్టివేయించాడు.
అటువైపు నుంచి వెళ్లే పురుషులు భానుడు, రాముడికి రోజుకు పన్నెండేసి కొరడా దెబ్బలు వేయాలని ఆజ్ఞాపించాడు. ఇక స్త్రీలైతే రుచిరను చూసి ఉమ్మివేస్తుండేవారు. అలా రోజూ దెబ్బలు తిని, అవమానాలు పొంది.. చేసిన తప్పులకు తమలో తాము కుమిలిపోతూ త్వరలోనే వాళ్లు మరణించారు.
మరణం తరువాత కూడా వారి తప్పులకు శిక్షలు కొనసాగాయి. వారి విగ్రహాలను తయారుచేయించి, వాటినే కోటగుమ్మం వద్ద కొరడాలతో కొడుతుండేవారు. ఉమ్మివేస్తుండేవారు.
‘సోదరులకు ద్రోహం చేసిన వారికి తగిన శిక్ష’ అని నినాదాలు చేస్తుండేవారు. సోదరుల మరణం తరువాత విజయునికి, చంద్రునికి మాత్రం ఆ శిక్షలు చూస్తుంటే మనసులో బాధ కలుగుతుండేది. పౌరుల చేత ఆ పని మాన్పించాలని విజయుడు చాలాసార్లు అనుకున్నాడు. కానీ, ఇతరులకు ఆదర్శప్రాయం అయినప్పుడు.. క్రూరమైన పనిని కూడా ఒక్కొక్కప్పుడు సమర్థించాల్సి వస్తుంది.
ఆ రాజ్యంలో అదే జరిగింది. ఏ ఇద్దరు అన్నదమ్ములు ఘర్షణ పడ్డా.. వారిని ఆ రాజ్యంలోని పౌరులు కోటగుమ్మం వద్దకు తీసుకువచ్చి ఆ విగ్రహాలనే చూపిస్తుండేవారు.
(వచ్చేవారం.. అంతా విచిత్రమే!)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | ఇద్దరు మోసగాళ్లు
Kasi Majili Kathalu | శ్రీశైలంలో దేవకన్య
Kasi Majili Kathalu | వామన గుహ
Kasi Majili Kathalu | నలుగురు రాకుమారులు
Kasi Majili Kathalu | ఎగిరే జింక-2
Kasi Majili Kathalu | ఎగిరే జింక
Kasi Majili Kathalu | జయభద్రుని తెలివి
Kasi Majili Kathalu | నీతిమంతురాలు
Kasi Majili Kathalu | అనంగ చంద్రిక