Kasi Majili Kathalu Episode 46 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : వీరప్రతాపుని నలుగురు కుమారులు పెళ్లిళ్లు చేసుకోవడం కోసం దేశాటనకు బయలుదేరారు. విజయుని భార్యను భానుడు ఎత్తుకుపోయాడు. శ్రీశైలం కదళీవనంలోని స్ఫటికలింగ మహత్వం వల్ల చంద్రుడు ఒక యక్షకన్యను వివాహం చేసుకున్నాడు. అతనికి దారిలో కనిపించిన రాముడు.. తన కథ చెబుతున్నాడు. దొంగగా మారిన రాముడు తన భార్యనే తోడుదొంగగా చేసుకుని, విక్రమార్కుని అంతఃపురంలో దొంగతనానికి వెళ్లాడు.
ఆమె దొరికిపోయింది. కానీ, నా గురించి ఏమీ చెప్పలేదట. విక్రమార్క మహారాజు ఎన్ని విధాలుగా అడిగినా.. నోరు మెదపలేదని తెలిసింది. మూగదానిలా నటించసాగిందట.
‘నిన్ను దొంగతనానికి పురికొల్పిన వారెవరో చెబితే, వాళ్లను పట్టుకుని నిన్ను విడిచిపెట్టేస్తాను’ అని మహారాజు ఎన్నిసార్లు ప్రోత్సహించినా చెప్పింది కాదట.
దాంతో విసిగిపోయిన విక్రమార్కులవారు.. ప్రతిరోజూ రుచిరను సభాభవనంలో నిలబడమని చెప్పాడు.
‘ఈమె చేత ఎవరైనా మాట్లాడిస్తే ఏం కోరినా ఇస్తాను” అని ప్రకటించాడట. ఎంతోమంది ప్రయత్నించారని తెలిసింది. కానీ, ఎవరికీ ఆమె బదులు చెప్పలేదు. తన తోటిదొంగనైన నా గురించి ఎన్నిసార్లు అడిగినా.. ఆకాశం కేసి వేలు చూపిస్తూ మౌనంగా ఉండిపోతున్నదట. ఆమెను విడిపించి తెచ్చే ఉపాయం కోసం అన్వేషిస్తూ ఉండగా నువ్వు కనిపించావు.. ..అని రాముడు తన కథ చెప్పాడు.
* * *
నేను అతనికి ధైర్యం చెప్పి.. “అన్నా! విచారించకు. నీ రుచిరను నేను విడిపించి తెస్తాను” అని వాగ్దానం చేశాను.
మరునాడు విక్రమార్కులవారి సభకు వెళ్లి, ఆమెతో మాట్లాడిస్తానని ప్రతిజ్ఞ చేశాను.
“వదినా! రాముడు నాకు అన్నగారు. నేను నిన్ను విడిపించడానికే వచ్చాను. నువ్వు ఒక్కసారి మాట్లాడితే చాలు.. నీ విడుదలే ప్రతిఫలంగా కోరుకుని, నిన్ను అన్న దగ్గరికి తీసుకుపోతాను” అని ఆమె చెవిలో చెప్పాను.
మహారాజుగారి దిక్కు తిరిగి.. “మీరడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడీమె సిద్ధంగా ఉన్నది” అన్నాను.
అప్పుడాయన.. “అమ్మాయీ! నువ్వెవరు?” అని అడిగాడు.
అందుకామె.. “ఆడపిల్లను” అని సమాధానమిచ్చింది.
“ఎవరి కూతురివి?”.
“జనకుని కూతురిని”.
“ఎవరి భార్యవు?”.
“జగదభిరాముని భార్యను”.
ఆమె సమాధానాల్లోని శ్లేషను అర్థం చేసుకోవడానికి సభాసదులందరూ తికమకపడుతుండగా.. నేను లేచి, “మహారాజా! మీరు చెప్పినట్లే ఆమెతో మాట్లాడించాను. మరి నా అభీష్టం నెరవేర్చరా?” అని అడిగాను.
“మాట తప్పేవాణ్ని కాను. ఏం కావాలో కోరుకో” అన్నాడు మహారాజు.
“మరో ప్రశ్న వేయకుండా ఆమెను విడిచిపెట్టేయండి. అదే నా కోరిక” అని కోరుకున్నాను.
అంతటితో ఆమెను తీసుకుని బయటికి వచ్చేశాను. రహస్యంగా రాముణ్ని కలుసుకుని, ముగ్గురం ఉజ్జయిని నుంచి వెళ్లిపోయాం. ఆ తరువాత కూడా రాముడిలో దొంగతనాలు చేసే బుద్ధి పోలేదు. ఒకటి రెండుసార్లు నాకే పట్టుబడ్డాడు. అతనికి ఏదో విధంగా నచ్చజెప్పి, మంచిదారికి తీసుకురావాలని ప్రయత్నించాను.
“అన్నా! నువ్వు సహవాస దోషం వల్ల దొంగతనాలకు అలవాటు పడ్డావు. ఇకనైనా ఇటువంటి పనులు మానేయ్. ఆ రుచిరను వదిలేసి వేరొక పిల్లను పెళ్లి చేసుకో. అప్పుడు నీ బుద్ధి మారవచ్చు” అని చెప్పాను.
దానికి రాముడు అంగీకరించినట్లే కనిపించాడు.
“నేనొక యక్షకన్యను పెళ్లాడానని చెప్పాను కదా! ఆమె చెలికత్తె మల్లిక.. చాలా చక్కనిది. నువ్వొప్పుకొంటే మీ ఇద్దరికీ నేను పెళ్లి జరిపిస్తాను” అని చెప్పాను.
రాముడు దానికి “సరే!” అన్నాడు.
నేను వీణ తీసుకుని నిర్దేశిత రాగాన్ని వాయించాను. చెప్పినట్లుగానే చారుమతి ప్రత్యక్షమైంది. కానీ, పక్కనే రాముడు ఉండటం చూసి వెగటు చెందింది.
“పరపురుషులు ఉండగా నన్ను పిలవకూడదు” అని హెచ్చరించి, వెనువెంటనే మాయమైపోయింది. నేను చేసేది లేక మిన్నకుండిపోయాను.
ఆనాటి సాయంత్రం పట్టణంలో సంచరించి, సత్రానికి తిరిగి వస్తుండగా.. రాముని గదిలో నుంచి వినిపించిన మాటలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి.
“చూశావా! మనిద్దరం చిలకా గోరింకల్లా ఉండటం వాడికిష్టం లేదు. తన పెళ్లాం దగ్గరి దాసీదాన్ని తెచ్చి నాకు కట్టపెడతానంటున్నాడు. సవతి తల్లి పిల్లలకు ఇంతకంటే ప్రేమ ఉంటుందా?! ఆ మాత్రం తెలివితేటలు నాకు లేవనుకుంటున్నాడు..” అంటున్నాడు రాముడు.
వాడి మాటలు నాకు అనుమానం కలిగించాయి. ఎందుకైనా మంచిదని నేనారోజు నిద్రించే ప్రదేశాన్ని మార్చాను. తెల్లవారి లేచి చూసేసరికి నా గదిలో నిద్రించినవాడు హత్యకు గురయ్యాడు. ఆ పక్కనే ఉండాల్సిన నా వీణ కూడా లేదు. అప్పటినుంచి రాముణ్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాను.. .. అని చంద్రుడు తన కథంతా చెప్పాడు.
* * *
“అన్నా! దైవవశాత్తూ నువ్వు కనిపించావు మనిద్దరం సోదరుల మూలంగానే భార్యలు లేనివాళ్లమయ్యాం” చివరిగా అన్నాడు. అందుకు విజయుడు.. “భార్య లేని జన్మ వృథా! ఆమె లేని ఇల్లు పొల్లు. భార్యకు ప్రియాన్ని చేకూర్చడమే భర్తకు ఆనందం. భార్యను పోగొట్టుకోవడం దురదృష్టకరం” అన్నాడు.
ఆ అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు ఓదార్చుకున్నారు. కొన్నిరోజుల తరువాత విజయుడు తాను కొంతకాలం ప్రధానమంత్రిగా పనిచేసిన భీమవర్మ రాజ్యంలోని.. విజయపురమనే పట్టణానికి వెళ్లారు. అక్కడ విజయుడే స్థాపించిన సత్రంలో విడిది చేశారు. ఆ సత్రానికి ముందు భీమవర్మ మహారాజు తన పేరుతో వేసిన శాసనాన్ని చూసి, విజయుడు మురిసిపోయాడు. సత్రంలోకి ప్రవేశిస్తుండగా ఒక గదినుంచి ఒక సంభాషణ వినిపించింది.
“అన్నా! వాళ్లిద్దరికీ మనమంటే ముందునుంచీ అసూయే! నేను ఈ అమ్మాయితో ఉండటం ఇష్టం లేక, నాతో ఏమేమిటో చెప్పాడు. మనసిచ్చి పెళ్లాడిన ప్రియురాలిని విడిచిపెట్టడం ఎంత కష్టమో నువ్వే చెప్పు. అదీకాకుండా విక్రమార్కుడు ఎన్ని కష్టాలు పెట్టినా, నా పేరు చెప్పనే లేదు! అలాంటి పిల్లను ఎలా విడిచిపెట్టను!”.
“అదీ నిజమే! ఆశ్రితులైన వారు ఎటువంటివారైనా విడిచిపెట్టకూడదని నీతి. మంచిపని చేశావు”.
“పోనీ.. తాను నాకిచ్చి పెళ్లి చేస్తానన్న యువతి మాత్రం గొప్పదా?! తన భార్య వద్ద దాసీ పని చేసేదట. అంటే ఆ భార్యాభర్తలిద్దరికీ మేమిద్దరం దాసులం కావాలని వాడి బోడి అభిప్రాయం”.
“ఇంతకీ వాడి భార్యను చూశావా? అందంగా ఉంటుందా?!”.
“ఆఁ ఎర్రగా బొర్రగా ఉండగానే సరా?! అయినా నేను సరిగ్గా చూడలేదులే”.
“పోనీ! ఆ వీణ మీటి రప్పించలేకపోయావా?!”.
“అయ్యో! పడరాని పాట్లన్నీ పడ్డాను. కానీ, ఆ వీణమెట్లు సవరించడమే చేతకాలేదు”.
“మరి దాన్నేం చేశావు?!”.
“తవ్వెడు బియ్యం అవసరమై, ఎవరో ఓ బ్రాహ్మణునికి అమ్మేశాను”.
“అతణ్ని నువ్వు గుర్తుపట్టగలవా?”.
“ఊహూఁ గుర్తుపట్టలేను”.
“ఇంతకీ నువ్వా వీణ ఎత్తుకొచ్చిన సంగతి చంద్రునికి తెలుసా?!”.
“తెలిస్తే ఊరుకుంటాడా?! వాణ్ని మట్టుపెట్టిన తరువాతే వీణ ఎత్తుకొచ్చేశాను”.
“మంచిపని చేశావు. ఇద్దరమూ వీరపురుషులమే”.
“అంటే నువ్వు కూడా విజయుణ్ని హతమార్చావా?! అన్నట్లు వాడి భార్య హేమను ఎత్తుకుపోయానని చెప్పావు కదా! ఆ తరువాత ఏమైంది?!”.
“వాణ్ని ఒక్కదెబ్బతో కైలాసానికి పంపాను. కానీ, ఏం లాభం?! ఆ మొండిది నా మాట వినలేదు”.
“ఏ అడవికో తీసుకుపోయి.. చెర పట్టవలసింది”.
“ఆ పనే చేశాను. చంపుతానని బెదిరించినా.. నా మాట లెక్క చేయలేదు. చివరికి చిరాకేసి ఓ నూతిలో తోసేశాను”.
“చచ్చిందా?”.
“ఏమో తెలియదు. అదే సమయానికి ఎవరో ఒక బ్రాహ్మణుడు స్నానం కోసం బావి దగ్గరికి వస్తుంటే, నేను పారిపోయి వచ్చేశాను”.
“మంచిపని చేశావు. వాళ్ల పీడ విరగడైనట్లే! ఇక మనం ఇంటికిపోయి, హాయిగా రాజ్యం చేసుకోవచ్చు”.
“నిజమే కానీ, నేనొక్కణ్నే వస్తే తండ్రిగారు ఆక్షేపించవచ్చు. ఎవరో ఒక స్త్రీని ఎన్నుకుని పెళ్లాడాలి”.
“ఈ ఊళ్లో నీకు నచ్చిన అమ్మాయిని ఎన్నుకో. రాత్రికి నేను, మీ వదిన కన్నం వేసి.. ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తాం. పెళ్లి చేసుకుని, ఇంటికి తీసుకుపోవచ్చు”. .. ఆ తరువాత గదిలో నుంచి ఒకటే నవ్వులు వినిపిస్తున్నాయి. వాళ్లిద్దరూ భానుడు, రాముడు అనే విషయం.. గదిబయట నుంచి వింటున్న విజయునికి, చంద్రునికి స్పష్టంగా అర్థమైంది. వీణ పోయినందుకు చంద్రుడు.. నూతిలో పడిన హేమ బతికుందో లేదోనని విజయుడు ఎంతగానో విచారించారు. అప్రయత్నంగా వారి కళ్లవెంట నీళ్లు వచ్చాయి. విజయుడు కన్నులు తుడుచుకుంటుంటే.. చూడలేక చంద్రుడు ఒరలోంచి కత్తి తీశాడు.
“వద్దు తమ్ముడూ! ఎంతైనా మనమందరం ఒక తండ్రి కడుపున పుట్టాం. మనకు ద్రోహం చేసినా సరే, వాళ్లను మనం చంపవద్దు” అని వారించాడు విజయుడు.
చంద్రుడు అప్పటికి తన కోపాన్ని అదుపు చేసుకున్నాడు. తెల్లవారింది. సత్రం బయట నలుగురు అన్నదమ్ములూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. తమకు చేసిన ద్రోహాన్ని మరిచిపోయి విజయుడు, చంద్రుడు తమ సోదరులను కుశల ప్రశ్నలు అడిగి, కౌగిలించుకున్నారు.
భానుడు సమయోచితంగా.. “ఆనాడు నువ్వు, వదిన దూరంగా ఉన్నారు. రాత్రివేళ అకస్మాత్తుగా ఒక పులి నామీద పడింది. నేను దాన్నుంచి తప్పించుకోవడానికి చాలాదూరం పరుగెత్తాను. రెండురోజుల తరువాత భయం తగ్గి నేను తిరిగి వచ్చేసరికి మీరు కనిపించలేదు. అన్నా! వదినగారు క్షేమంగా ఉన్నారా?!” అని ప్రశ్నించాడు.
రాముడు అంతకంటే తెలివిగా చంద్రునితో.. “తమ్ముడా! ఆనాడు సత్రంలో నువ్వు వేరొక గదిలో నిద్రిస్తున్నావు. అర్ధరాత్రివేళ రాజభటులు సోదాలు జరిపారు. మమ్మల్ని పట్టుకోవడానికే వచ్చారనిపించి, మేమిద్దరం పారిపోయి వచ్చేశాం. ఆ తరువాత నీ క్షేమ సమాచారం తెలుసుకోవడం సాధ్య పడలేదు. దైవవశాత్తూ నిన్ను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది” అన్నాడు.
ఆ ఇద్దరు మోసగాళ్ల మాటలకు సమాధానం ఏం చెప్పాలో తెలియక.. విజయుడు, చంద్రుడు మౌనంగా ఉండిపోయారు.
రెండుమూడు రోజుల తరువాత విజయుడు తమ్ముళ్లందరినీ పిలిచి..
“మనం ఇంటినుంచి వచ్చి, చాలాకాలం అయింది. ఇక ఇంటికి పోదాం” అన్నాడు.
అతని మాటలకు చంద్రుడు సమ్మతించాడు. కానీ, మిగిలిన ఇద్దరూ మరికొంతకాలం దేశాటనం చేద్దామన్నారు.
విజయుడు అన్యాపదేశంగా వారిని మందలించాడు. దాంతో ఆ మోసగాళ్లిద్దరూ రహస్యంగా మాట్లాడుకుని ఒక పథకం రచించుకున్నారు. ఆ రహస్యాన్ని విజయునికి, చంద్రునికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు.
అడవి మార్గం మీదుగా నలుగురు అన్నదమ్ములూ.. రుచిరతో కలిసి నడిచి వెళ్తున్నారు. దారిమధ్యలో భోజనం కోసం ఓ చెట్టుకింద ఆగారు. సమీపంలోని బావి నుంచి నీరు తోడి తేవడానికి వెళ్లిన రుచిర.. కొద్దిసేపటికే పెద్దగా కేకలు పెడుతూ వెనక్కి తిరిగి వచ్చింది.
“ఆ బావిలో ఇద్దరు స్త్రీలు మునుగుతూ, తేలుతూ కనిపిస్తున్నారు. ఎవరో తెలియడం లేదు. ప్రమాదంలో ఉన్నారో, క్రీడిస్తున్నారో చెప్పలేను” అన్నది. ఆమె మాటలు విన్న నలుగురు అన్నదమ్ములూ ఒకేసారి బావివైపు నడిచారు.
(వచ్చేవారం.. గెలుపు ఎప్పుడూ మంచికే!)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | శ్రీశైలంలో దేవకన్య
Kasi Majili Kathalu | వామన గుహ
Kasi Majili Kathalu | నలుగురు రాకుమారులు
Kasi Majili Kathalu | ఎగిరే జింక-2
Kasi Majili Kathalu | ఎగిరే జింక
Kasi Majili Kathalu | జయభద్రుని తెలివి
Kasi Majili Kathalu | నీతిమంతురాలు
Kasi Majili Kathalu | అనంగ చంద్రిక