Kasi Majili Kathalu Episode 45 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : సింధుబా రాజ్యాన్నేలే వీరప్రతాపుడు.. తన నలుగురు కుమారులనూ దేశాటన చేసి, తగిన భార్యలను న్నుకోమని పంపాడు. మొదటివాడైన విజయుడు హేమను పెళ్లి చేసుకున్నాడు. రెండోవాడైన భానుడు ఒక అడవిలో విజయుణ్ని గాయపరిచి, హేమను ఎత్తుకుపోయాడు. అదే సమయానికి అక్కడికి చివరివాడైన చంద్రుడు వచ్చాడు. పర్యటనలో భాగంగా శ్రీశైలంలో తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తున్నాడు.
అక్కడ పగలు, రాత్రి తేడా తెలియడం లేదు. ఆకలి దప్పులూ లేవు. ఆ వనంలోని విశేషాలు చూస్తూ ఎంతసేపు ఒంటరిగా గడిపానో తెలియదు. తెల్లవారింది కాబోలని నాకు అనిపించిన సమయంలో.. అక్కడే ఉన్న సరస్సులో స్నానం చేసి, స్ఫటిక లింగాన్ని తనివితీరా అభిషేకించి పూజించాను.
ఇంతలో అక్కడేదో అలికిడి అయింది. ఎందుకైనా మంచిదని నేనో చెట్టుమాటున నిలబడి చూడసాగాను. శివలింగానికి వెనుక ఉన్న ద్వారం నుంచి నలుగురు స్త్రీలు చేతిలో పూజాద్రవ్యాలతో వచ్చారు.
వారిలో రాజకుమారిలా కనిపిస్తున్నామె..
“చెలీ! గమనించావా? ఇది నిన్న నేను చేసిన పూజ కాదు. ఈ పువ్వులు, దళాలు నేను ఉపయోగించినవి కావు. ఇక్కడికి మనం కాకుండా వేరెవరో కూడా వస్తున్నట్లున్నారు” అన్నది.
చెలికత్తెలు ఆమె అభిప్రాయంతో ఏకీభవించలేదు. “ఇక్కడికి ఎవరు వస్తారు?” అని తోసిపుచ్చారు.
రాజకుమారి వారితో పెద్దగా వాదించకుండా మౌనంగా ఉండిపోయింది. వారిమాటల వల్ల ఆ రాజకుమారి పేరు చారుమతి అని తెలిసింది. కానీ, వారు ఏ రాజ్యానికి చెందినవారో తెలియలేదు. నా దృష్టికి వారెవరూ మానవకాంతల్లా అనిపించలేదు. ఇదమిత్థంగా ఫలానా అని మాత్రం తెలియలేదు.
పూజ ముగించుకుని వాళ్లంతా వచ్చిన దారినే వెళ్లిపోయారు. నేను వాళ్లను అనుసరించాను. అయితే, చిత్రంగా ఆ ద్వారంలో ప్రవేశించిన తరువాత వారు అదృశ్యులైపోయారు. కొంతదూరం వెళ్లిన తరువాత, వెనక్కి వచ్చే మార్గం కూడా కనిపించకుండా పోయింది.
నా తెలివి తక్కువతనాన్ని నేనే నిందించుకుంటూ ముందుకే అడుగేశాను. ఆ దారివెంట చాలాదూరం నడిచి, చివరికి పాతాళగంగ ఒడ్డున తేలాను. మళ్లీ కదళీవనానికి వెళ్లే మార్గమేమిటో బోధపడక ఆ రాత్రంతా నిరీక్షిస్తూ కూర్చున్నాను.
తెల్లవారవస్తుండగా పాతాళగంగ ఒడ్డున ఒక ఏనుగు దర్శనమిచ్చింది. ఆ ఏనుగు తన తొండంతో బంగారు కలశాన్ని పట్టుకుని ఉంది.
‘అడవి ఏనుగైతే కలశం పట్టుకుని ఉండదు కదా! ఇది ఎక్కడికి వెళుతున్నదో కనిపెట్టాలి’ అనుకుంటూ లాఘవంగా ఆ ఏనుగుపైకి ఎక్కి కూర్చున్నాను. అది నది ఒడ్డునే నడుచుకుంటూ వెళ్లి, మళ్లీ కదళీవనానికే తీసుకుపోయింది. నా ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఆ ఏనుగు తెచ్చిన బంగారు కలశంలోని నీటితో స్ఫటిక లింగానికి మనసారా అభిషేకం చేశాను.
మరికొంతసేపటికి ఆ దేవకన్యలు మళ్లీ వచ్చారు. వారి కంటబడకుండా ఉండటానికి పక్కనే ఉన్న ఒక బిల్వవృక్షం ఎక్కి కూర్చున్నాను. అక్కడినుంచి వారి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.
తమ రాకకంటే ముందుగా అక్కడ లింగార్చన జరిగిందని.. నిర్మాల్యం తారుమారుగా ఉండటాన్ని బట్టి చారుమతి గుర్తుపట్టింది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం చూసి, ఎవరో సిద్ధులు కావచ్చని చెలికత్తెలతో చెప్పిందామె. యథాప్రకారం తనవంతు లింగార్చన పూర్తిచేసింది. ఆ తరువాత మంటపంలోనే ఉంచిన వీణను తీసుకుని, కొద్దిసేపు శివార్పణంగా వీణావాదన చేసింది. చివరగా వీణను పక్కనపెట్టి, శివుడికి నమస్కరించింది. అందరూ మంటపం దిగివచ్చారు. వనంలో విహరిస్తూ కొంతసేపు కబుర్లు చెప్పుకొంటున్నారు. వారిమాటల్లో చారుమతి మానవకన్య కాదనీ, యక్షరాజైన మణికంధరుని కుమార్తె అని తెలిసింది. ఆమెకు ఒక మానవుడితో వివాహం కాగలదని నారదుడు సెలవిచ్చాడట. వరుని కోసం నిరీక్షిస్తూ ఈ కదళీవనంలోని స్ఫటిక శివలింగాన్ని ఆరాధించమని చెప్పాడట.
‘నీకు కాబోయే వరుడు అక్కడికి వస్తాడు. అష్టదిగ్గజాలలో ఒక ఏనుగును అధిరోహిస్తాడు. నీలాగే స్వామిని అభిషేకిస్తాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపుగా ఒకేరోజులో కాశీ విశ్వనాథుణ్ని, రామేశ్వరుణ్ని దర్శిస్తాడు. అతణ్నే నువ్వు వివాహం చేసుకుంటావు’ అని నారద మహర్షి చెప్పాడట.
“ఇది వరమో శాపమో అర్థం కావడం లేదు. యక్షకన్యగా పుట్టి, మానవుణ్ని పెళ్లి చేసుకోవాల్సి రావడం ఏ కర్మఫలమో!?” అన్నది చారుమతి విచారంగా.
అందుకు ఆమె పక్కనే ఉన్న చెలికత్తె..
“అలా ఎందుకు అనుకుంటున్నావు? మన యక్షుల కంటే మానవులు తక్కువవారేమీ కాదు. మానవులలో కూడా గొప్ప అందగాళ్లు ఉంటారని వింటూ ఉంటాం కదా! వారిలో కూడా గొప్పగొప్ప కార్యాలు చేసిన వారున్నారు. దేవతలకు అంతులేని సహాయాలు చేసిన వారున్నారు. కనుక మానవుణ్ని తక్కువ అంచనా వేయకు. అదీకాకుండా విధిరాతను ఎవరూ తప్పించుకోలేరు. రేపోమాపో నీ కాబోయే వరుడు ఎదురైతే నీకు లోకం పట్టదు. అప్పుడు మేమంతా గుర్తుంటామో లేదో” అని యుక్తిగా మాట్లాడి, చారుమతిని సంతోషపెట్టింది.
అంతటితో వారు అక్కడినుంచి వెళ్లిపోయారు.
నేను చెట్టుమీద మిగిలిపోయాను.
‘నేను ఎక్కిన ఏనుగు అష్టదిగ్గజాలలో ఒకటి అని అప్పటికి అర్థమైంది. అయితే నారదుడు చెప్పినట్లు ఒక్కరోజులో కాశీ విశ్వేశ్వరుణ్ని, రామేశ్వరం రామనాథుణ్ని కూడా దర్శించగలనా? అదెలా సాధ్యం?!’ అని నాలో నేనే తర్కించుకుంటూ ఉండిపోయాను. ఉన్నట్లుండి నేను ఎక్కిన బిల్వవృక్షం గాలిలోకి లేచింది. ఆకాశంలోకి ఎగురుతూ ముందుకు వెళ్లసాగింది.
‘అయితే సంచార వృక్షాలు ఉంటాయని చెప్పుకొనే మాటలు నిజమే అన్నమాట’ అనుకున్నాను.
తెల్లవారుజాము వేళకు ఆ వృక్షం నన్ను గంగ ఒడ్డుకు తీసుకుపోయింది. ఎదురుగా కాశీ విశ్వనాథుడు కనిపిస్తున్నాడు. ఆయనను కళ్లారా చూస్తూ కూడా చెట్టుమీద నుంచి కిందికి దిగలేని పరిస్థితి. నేను వెళ్లి స్వామిని పూజించి వచ్చేలోపల ఆ చెట్టు కాస్తా ఎగిరిపోతే.. నేను మళ్లీ వెనక్కి వెళ్లలేను కదా! అందువల్ల ఆ చెట్టుపైనే కూర్చుని, స్వామికి మనసారా నమస్కరించుకున్నాను.
కొద్దిసేపటికి చెట్టు మళ్లీ ఎగిరింది. మధ్యాహ్న వేళకు రామేశ్వర దర్శనం కూడా పూర్తయింది. సాయంత్రానికల్లా మళ్లీ నన్ను శ్రీశైలంలోని కదళీవనానికి ఆ చెట్టు తీసుకుపోయింది. నెమ్మదిగా కిందికి దిగి, అక్కడి స్వామికి భక్తిగా మొక్కాను.
చారుమతి రాకకోసం నిరీక్షిస్తూ కూర్చున్నాను. మరునాడు చెలికత్తెలతో కలిసి ఆమె వచ్చింది. ఈసారి నేను కనిపించకుండా దాగిపోలేదు. ఆమెకు ఎదురపడ్డాను.
చారుమతి స్త్రీ సహజమైన సిగ్గువల్ల పక్కకు తొలగిపోయింది. ఆమె చెలికత్తెలు నాతో రాయబారం నడిపారు.
“నేను మీ మాటలన్నీ విన్నాను. నారదుల వారు చెప్పినట్లుగా దిగ్గజాన్ని ఎక్కివచ్చి, స్ఫటికలింగాన్ని అభిషేకించాను. ఒకేరోజులో కాశీరామేశ్వరాలు సందర్శించాను” అని వారితో చెప్పాను.
అందుకు తగిన రుజువులు కూడా చెప్పాను.
నా మాటలతో వారు సంతృప్తి చెందారు. నాకు చారుమతికి మాట కలిసింది. మా మనసులు కలిశాయి. ఆ శివాలయంలోనే మా వివాహం జరిగింది. కొంతకాలం మేమిద్దరం ఆనందంగా గడిపాం.
* * *
ఒకరోజున కదళీవనంలోనే ఉన్న ఒక కొలనులో నన్ను మునగమని చారుమతి చెప్పింది. నేను మునకవేసి లేచేసరికి స్త్రీగా మారిపోయాను. అలా స్త్రీవేషంలో చారుమతి నాకు కుబేరుని రాజధాని అలకాపురిని, స్వర్గలోక నగరమైన అమరావతిని చూపించింది. ఆ తరువాత మేమిద్దరం మళ్లీ శ్రీశైలానికి వచ్చేశాం. మళ్లీ అదే కొలనులో మునగగా నాకు పురుష రూపం వచ్చేసింది.
కొంతకాలం గడిచిన తరువాత, చారుమతి గర్భిణి అయింది. వారి సంప్రదాయం ప్రకారం గర్భిణులకు పురుష సంపర్కం నిషిద్ధం. అందువల్ల తాను అలకాపురికి వెళతానని, ప్రసవం తర్వాత మళ్లీ కలుసుకోవచ్చని చారుమతి చెప్పింది.
“ఎప్పుడైనా నిన్ను చూడాలనిపిస్తే ఏం చేయను?” అని అడిగాన్నేను.
అందుకామె స్ఫటికశిలా మంటపంలో ఉంచిన వీణను తీసుకొచ్చి నాకిచ్చింది.
“దీనిని శ్రుతిచేసి మీటితే వెనువెంటనే మీ వద్దకు వస్తాను” అని చెప్పింది.
నన్ను కదళీవనం నుంచి బయటికి తీసుకువచ్చి, తాను అంతర్ధానమై పోయింది. ఆ తరువాత నేను అన్ని క్షేత్రాలూ దర్శిస్తూ ఉజ్జయినికి వెళ్లాను. అక్కడ విక్రమార్కుడు స్థాపించిన ఒక సత్రంలో తలదాచుకున్నాను. అక్కడ నాకు మన రాముడు కనిపించాడు. అతడెందుకో కానీ, చాలా విచారంగా ఉన్నాడు. నన్ను పలకరించనే లేదు. నేనే వెళ్లి.. “అన్నా! నేను నీ తమ్ముణ్ని చంద్రుడిని. నన్ను గుర్తు పట్టలేదా?! నువ్విక్కడికి వచ్చి ఎన్నాళ్లయింది? ఏయే దేశాలు తిరిగావు?! ఏమేం వింతలు చూశావు?! పెళ్లి చేసుకున్నావా?! నీ కథంతా వివరంగా చెప్పు”.. అని అడిగాను.
అప్పుడు రాముడు తన కథను ఇలా చెప్పాడు.
* * *
“నాన్నగారి మాటప్రకారం మనమందరం ఒక్కసారే ఇల్లు వదిలి బయలుదేరాం కదా! నేను డబ్బంతా గుర్రాలమీద ఎక్కించుకుని, కొంతమంది అనుచరులతో కలిసి పడమటి దిక్కుకు వెళ్లాను. ఒక అడవి మార్గం గుండా ప్రయాణిస్తుండగా.. దొంగలగుంపు ఒకటి అకస్మాత్తుగా మామీద పడి, మమ్మల్ని కొట్టి సొమ్మంతా దోచుకుని పోయింది.
నేను ఒక్కణ్నే ఆ దొంగలను వెంబడించాను. వారంతా అడవిలోని ఒక మారుమూల పల్లెలో ప్రవేశించారు. తమ నాయకుడి ఇంటికి వెళ్లి దోచుకున్న సొమ్మంతా అతనికి అప్పగించారు. దూరంనుంచి అదంతా గమనించిన నేను, సమయం చూసుకుని వెళ్లి ఆ నాయకునితో పరిచయం చేసుకున్నాను.
అతడు నాకు ఆశ్రయమిచ్చి, కొంతకాలం తన ఇంట్లో ఉండనిచ్చాడు. రోజూ అతడివద్దకు దొంగలు రావడం, తాము చేసిన వీరకృత్యాలు వినిపించడం చేస్తుండేవారు. వాళ్లమాటలు వినేకొద్దీ నా మనసు మారిపోయింది.
నాకు కూడా దొంగతనాలు చేయాలని బుద్ధి పుట్టింది. ఆ నాయకుడిని బతిమాలి నేనూ వారి జట్టులో చోటు సంపాదించుకున్నాను. కొంతకాలానికి దొంగతనాల్లో ఆరితేరాను. నైపుణ్యంగా కన్నాలు వేసి వెండి బంగారాలు దొంగిలించి అందరితోపాటు నేను కూడా నాయకుడికే సమర్పిస్తూ ఉండేవాడిని.
ఆ నాయకునికి రుచిర అనే పేరుగల కూతురుంది. ఆమె నామీద మనసు పడింది. తండ్రి ఆమెకు తన మేనమామతో పెళ్లి చేయబోగా.. మేమిద్దరం ఎవరికీ తెలియకుండా పారిపోయి ఈ నగరానికి వచ్చాం.
మాతో పాటు తెచ్చుకున్న మణిభూషణాలను తెగనమ్మి కొంతకాలం కులాసాగా కాలక్షేపం చేశాం. అంతలో జరుగుబాటు కష్టం అయింది.
అప్పుడు రుచిర..
“ఎకిమీడా! మనిద్దరం చోరవిద్యలో ఆరితేరిన వాళ్లమే. మీరు కన్నం తవ్వితే నేను లోనికి పోయి ఎంత భద్రంగా దాచిన వస్తువునైనా సంగ్రహించి తేగలను. ఎవరింటికో పోవడం ఎందుకు?! విక్రమార్క మహారాజుగారి ఇంటినే దోచుకుందాం. ఈ రాత్రికే..” అని బోధించింది.
ఇద్దరం ఒంటినిండా మసిపూసుకుని, చమురు పట్టించాం. కాసికోకలు బిగించాం. చౌర్యానికి తగిన సాధనాలు తీసుకుపోయాం. అతిలాఘవంగా కోటగోడ లంఘించాం. అనేక సౌధాలు, గదులు వెతికి వెతికి విక్రమార్కుడు శయనించి ఉన్న అంతఃపురాన్ని కనిపెట్టాం. కన్నం వేసి లోపలికి ప్రవేశించాం.
అప్పటికింకా రాజుగారు నిద్రపోలేదు. మహారాణి ఆయనను ఏదో అడుగుతున్నది.
“నాథా! మీకు చోరవిద్యలోని మర్మాలన్నీ తెలుసునని చెప్పారు. ఎప్పటినుంచో నాకో సందేహం ఉంది. ఇంటిలో ఏ వస్తువు ఎక్కడుంటుందో చక్కగా తెలిసిన వారికైనా రాత్రివేళ దీపం లేకపోతే చాలా కష్టం కదా! ఏ వస్తువు ఎక్కడుందో కనిపెట్టలేం కదా!! అటువంటిది దొంగలు చీకటింటిలో అతిలాఘవంగా వస్తువులను ఎలా సంగ్రహిస్తారు?!”.
అందుకు మహారాజు నవ్వి..
“దానినే తస్కరశక్తి అంటారు. కళ్లకు పూసుకున్న అంజనం ప్రభావంతో చీకటిలో వస్తువులు చక్కగా కనిపిస్తాయి. నేటికాలంలో అటువంటి ప్రభావం కలిగిన చోరాగ్రేసరులు చాలామంది ఉన్నారు. వారి ఆటలు కట్టించాలన్నదే మా తాపత్రయం” అని చెబుతున్నాడు.
మేము వారికంట పడకుండా పక్కగదిలో ప్రవేశించాం. చేతికి అందిన వస్తువులను సంగ్రహించి, వెనుతిరగ బోయే సమయంలో నా చేయి అనుకోకుండా ఒక బల్లపై ఉంచిన వీణపై పడింది. అది చప్పుడు చేస్తూ మోగింది.
వెనువెంటనే విక్రమార్కుడు అప్రమత్తం అయ్యాడు. నేను తప్పించుకున్నాను కానీ, రుచిర దొరికిపోయింది.
(వచ్చేవారం.. ఇద్దరు మోసగాళ్లు)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | వామన గుహ
Kasi Majili Kathalu | నలుగురు రాకుమారులు
Kasi Majili Kathalu | ఎగిరే జింక-2
Kasi Majili Kathalu | ఎగిరే జింక
Kasi Majili Kathalu | జయభద్రుని తెలివి
Kasi Majili Kathalu | నీతిమంతురాలు
Kasi Majili Kathalu | అనంగ చంద్రిక