Kasi Majili Kathalu Episode 43 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : సింధుబా రాజ్యాన్ని ఏలే వీరప్రతాపుడు.. తన నలుగురు కుమారులనూ దేశాటన చేసి, తగిన భార్యలను ఎన్నుకోమని పంపాడు. నలుగురిలో మొదటివాడైన విజయుడు.. రాజకుమారి హేమను ప్రమాదం నుంచి కాపాడి పెళ్లి చేసుకుని, భీమవర్మ రాజ్యానికి చేరుకున్నాడు. ఆ రాజుతో తనకు ముఖపరిచయం లేకపోయినా ముఖ్యస్నేహితునిలా నటించాడు. రాజోద్యోగులను వెంటబెట్టుకుని నగరంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
“ఇక్కడినుంచి నలభై అడుగులు తూర్పుగా కొలవండి” అని రాజోద్యోగులను ఆజ్ఞాపించాడు విజయుడు. వెంటనే గొలుసులు సిద్ధమయ్యాయి. కొలతల పని మొదలైంది. జరుగుతున్న కోలాహలానికి ఆ ఇంటి యజమాని బయటికి వచ్చాడు.
“ఏం జరుతున్నది?” అంటూ ఆదుర్దాగా ప్రశ్నించాడు.
“మీ వీధి రాజవీధి కాబోతున్నదయ్యా! కాకపోతే నీ ఇల్లు పడగొట్టాల్సి వస్తున్నది. అంచేత వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలి” అన్నాడు విజయుడు.. క్రౌర్యాన్ని నవ్వు మాటున కప్పిపుచ్చుతూ.
ఆ యజమానికి గుండెల్లో రాయిపడినట్లు అయ్యింది.
“మహాప్రభో! నా రక్తం ధారపోసి కట్టుకున్న ఇల్లండీ! గృహప్రవేశం చేసి గట్టిగా ఏడాది కూడా కాలేదు. దేవరవారు ఈ బీదవాణ్ని కాస్త కనికరించాలి” అని రెండు చేతులూ జోడించి వేడుకున్నాడు.
విజయుడు ఆ మాటలకు కాసేపు జాలిపడుతున్నట్లు నటించి, అంతలోనే గంభీరంగా.. “రాజాజ్ఞ మార్చడం నా చేతిలో లేదు కదా!” అన్నాడు.
యజమానికి తన కర్తవ్యం అర్థమైంది. వెంటనే విజయుణ్ని సాదరంగా ఇంటిలోకి తీసుకుపోయి, ఒక వెయ్యి వరహాల మూటను అతని చేతిలో ఉంచాడు.
విజయుడు బయటికి వస్తూనే తన వెంట వచ్చిన రాజోద్యోగులను, సైనికులను మరోవీధికి తరలించాడు. అక్కడ కూడా ఓ ఖరీదైన భవంతిని ఎంచుకుని, దానిని కూలదోస్తామని యజమానిని బెదిరించాడు. మరో రెండువేల వరహాలు సంపాదించుకున్నాడు. ఆవిధంగా ఆనాటి సాయంత్రానికి విజయుని వద్ద పాతికవేలదాకా పోగుపడ్డాయి. వాటినుంచి కొంతమొత్తాన్ని రాజోద్యోగులకు బహుమానంగా ఇచ్చేశాడు.
రెండువేల వరహాలతో అప్పటికప్పుడు గొప్ప భవంతిని కొనుగోలు చేశాడు. భార్యతో కలిసి ఆ భవంతిలో కాపురం పెట్టాడు. అతని వృత్తాంతం అంతా ఉద్యోగుల ద్వారా విన్న భీమవర్మ మహారాజుకు చాలా ఆశ్చర్యం వేసింది. మరునాడే విజయుణ్ని తన కొలువుకు రప్పించుకున్నాడు.
“మిత్రమా! నిన్నటి నుంచి నీ చర్యలన్నీ ఇంద్రజాల ప్రదర్శనలా ఉన్నాయి. నీ నేర్పరితనం, మా ఉద్యోగుల బుద్ధిమాంద్యం ఒకేసారి రుజువయ్యాయి. ఆజ్ఞాపత్రిక లేకుండానే.. రాజుకు మిత్రునిలా గొప్పగా నటించావు. నా ఉద్యోగులను నీ అధికారం కిందికి తెచ్చుకుని, అనుకున్నది సాధించుకోగలిగావు. నీవంటివాడు తోడుంటే స్వర్గం మీదికి కూడా దండెత్తి గెలవవచ్చు. నేటినుంచి నిన్ను ప్రధానమంత్రిగా నియమిస్తున్నాను. దయచేసి అంగీకరించు” అన్నాడు రాజముద్రికను చేతికి అందిస్తూ. విజయుడు ఆనందంగా అంగీకరించాడు. ఆనాటినుంచి ప్రజారంజకమైన పాలనలో భీమవర్మకు అన్ని విధాలా తోడ్పడుతూ.. గొప్ప కీర్తిప్రతిష్ఠలు ఆర్జించాడు.
* * *
ఒకనాడు విజయుడు గొప్ప అన్న సంతర్పణ చేశాడు. పేద, ధనిక భేదం లేకుండా ప్రజలందరూ వచ్చారు. విజయుడు అందరికీ సరిగ్గా వడ్డన జరుగుతున్నదో లేదోనని స్వయంగా పర్యవేక్షించ సాగాడు.
ఆ సమయంలో బీదవారి వరుసలో.. తన సోదరులలో ఒకడైన భానుడు కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్య పోయాడు. అతని వాలకం చూస్తే దుఃఖం పొంగి వచ్చింది.
“భానూ! ఏమిటిది? ఇలా అయిపోయావేమిటి?! మన తండ్రిగారు నీకిచ్చిన డబ్బంతా ఏం చేశావు?! నావంతు డబ్బు కూడా నీకే ఇచ్చాను కదా! ఆ డబ్బుతో నీకు నచ్చిన పిల్లను పెళ్లి చేసుకుని హాయిగా ఉండి ఉంటావనుకున్నాను. పోనీ ఇలాంటి దీనస్థితి దాపురించినప్పుడు ఇంటికి వెళ్లిపోతే సరిపోయేది కదా. అసలేం జరిగింది?” అని ప్రశ్నించాడు విజయుడు.
అప్పుడు భానుడు తన దీనగాథను ఇలా వివరించాడు.
“మీ అందరితోపాటు నేను కూడా మంచిగుర్రాన్ని ఎక్కి, దక్షిణదిక్కుగా ప్రయాణించాను. పదిహేను రోజుల ప్రయాణం తరువాత కుంభకోణం పట్టణానికి వెళ్లాను. అక్కడ ఒక సత్రంలో విడిది చేసి ఉండగా కొందరు ధూర్తులు నాకు పరిచయం అయ్యారు.
‘మా ఎరుకలో చక్కని పిల్ల ఉంది. కానీ కోటీశ్వరుణ్ని తప్ప వరించదు. నువ్వు తూగగలవా?!’ అని ప్రశ్నించారు.
నేను తలూపాను. వాళ్లు నన్నో ఇంటికి తీసుకుపోయారు. వాళ్లు చూపించిన అమ్మాయి తొలిచూపులోనే నా మనసును ఆకర్షించింది. ఆమె నా మెడలో హారం వేసింది. నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నా చేతిలో డబ్బంతా వాళ్ల చేతిలో పెట్టాను. ఆమె సాంగత్యంలో ఆరునెలల కాలం ఎలా గడిచిపోయిందో తెలియదు. ఒకనాడు ఆమె తల్లి నా దగ్గరికి వచ్చింది.
‘చూడబ్బాయ్! నువ్విచ్చిన సొమ్మంతా పూలకు, తాంబూలాలకు, పన్నీటికి, అత్తరుకు ఖర్చయిపోయింది. ఇంకా మరికొంచెం తెచ్చిస్తేనే ఇకమీదట నువ్వు మా అమ్మాయితో ఉండొచ్చు. లేదంటే నువ్వు నీ దారి చూసుకో. మా అమ్మాయి వేరొకరిని వరిస్తుంది’ అన్నది.
నాకు మతిపోయింది. ‘అదేమిటి? ఈమె నా భార్య కదా! వేరొకరిని ఎలా వరిస్తుంది?’ అని అమాయకంగా ప్రశ్నించాను.
అందుకు ఆమె వికటంగా నవ్వి.. ‘బాగుంది సంబరం. మా సంగతి నువ్వు ఎరగవు కాబోలు. ఇది మా వృత్తిబాబూ! మేము వేశ్యలం’ అన్నది.
ఆ దెబ్బతో నాకు ఒక్కసారిగా లోకమంతా చీకటై పోయింది. నా దగ్గర ధనం లేదని తెలుసుకున్న ఆ వేశ్యమాత నన్ను వీధిలోకి లాగించి తలుపు మూసేసింది. ఇటువంటి దుస్థితిలో ఇంటికి తిరిగి వెళ్లలేక.. సరైన తిండికి, బట్టకు నోచుకోక అప్పటినుంచి ఇలా తిరుగుతున్నాను”. ..భానుడు చెప్పిన గాథను విని, విజయుడు చలించి పోయాడు. తమ్ముడికి చక్కని వస్ర్తాలనిచ్చి, భోజనం పెట్టాడు. ఆనాటినుంచి భానుడు అన్నదగ్గరే ఉండి పోయాడు. కొంతకాలం గడిచింది.
* * *
నలుగురు అన్నదమ్ములూ ఇల్లు వదిలి వచ్చినప్పుడు.. ‘సరిగ్గా ఏడాది తరువాత సంకేత స్థలంలో కలుసుకోవాలి’ అని నియమం ఏర్పరుచుకున్నారు.
ఆ నియమాన్ని అనుసరించి విజయుడు తన భార్య హేమ, తమ్ముడు భానుడితో కలిసి బయల్దేరాడు. కొద్దిపాటి సైన్యం వారిని అనుసరించింది. రెండురోజుల ప్రయాణం తరువాత ఒక అడవిలో వారు విడిది చేశారు. రెండు శిబిరాలు నిర్మాణమయ్యాయి. విజయుడు తన శిబిరంలో హేమతో ఆనందంగా గడుపుతున్నాడు.
మరో శిబిరంలో ఒంటరిగా ఉన్న భానుడి మనసులో దుర్మార్గపు ఆలోచన ప్రవేశించింది. ‘నేను భార్య లేని దీనావస్థలో ఉండగా, తోటివాడైన విజయుడు ఆనందంగా గడపడం ఏమిటి? ఇద్దరమూ ఒక్క తండ్రి బిడ్డలమే కదా! నన్ను దురదృష్టం వెంటాడటం ఏమిటి? వాడికి సుఖభోగాలు దక్కడమేమిటి?’ అనుకున్నాడు.
ఒక రాత్రివేళ పైకి లేచాడు. అతని చేతిలో పిడిబాకు చీకట్లో కూడా మెరుస్తున్నది. మెల్లగా అడుగులు వేస్తూ విజయుడి శిబిరంలోకి నడిచాడు. ఆదమరిచి నిద్రపోతున్న సోదరుడి మెడలో బాకు దింపాడు. విజయుడు కొద్దిసేపు గిలగిలలాడి, అచేతనంగా మారాడు.
అంతలో పక్కనే నిద్రిస్తున్న హేమకు మెలకువ వచ్చింది. భర్త పరిస్థితిని కళ్లారా చూడగానే ఆమెకు స్పృహ తప్పింది. ఆమెను ఒక గుర్రంపై వేసుకుని భానుడు చీకట్లో కలిసిపోయాడు.
జరిగిన సంగతి ఇదీ అని రాజోద్యోగులకు తెల్లవారే వరకు తెలియదు. తమ మంత్రిగారు మెడలో బాకు గుచ్చుకుని, రక్తపు మడుగులో పడి ఉండటం గమనించి.. ఏం చేయాలో వాళ్లకు పాలుపోలేదు. మంత్రిగారి భార్య, తమ్ముడు కనిపించక పోవడం వల్ల వాళ్లేమై పోయారో అని మల్లగుల్లాలు పడసాగారు.
ఇంతలో ఎక్కడినుంచి వచ్చాడో కానీ, ఒక సాధుపురుషుడు అక్కడ దర్శనమిచ్చాడు. విజయుని మెడలో దిగబడి ఉన్న బాకుమీద ఏదో ఆకురసాన్ని పిండి పోశాడు. ఆ తరువాత మెల్లిగా బాకును లాగేశాడు. విచిత్రంగా ఒక్కబొట్టు నెత్తురు చిమ్మలేదు.. సరికదా ఉన్న గాయం కూడా చేత్తో తీసివేసినట్లు మాయమైంది.
విజయుడు నిద్రనుంచి మేల్కొన్నట్లుగా లేచాడు. తన ఎదురుగా ఉన్న సాధువుకు నమస్కరించాడు.
“చిరంజీవీ! నీ ఆయుష్షు చాలా గట్టిది. ఈ విద్య నాకు మాత్రమే తెలుసు. నీ అదృష్టం కొద్దీ ఈవేళ నేనిక్కడికి వచ్చాను. నిన్ను పొడిచిన వారెవరో కానీ బాకు తీయలేదు. ఒకవేళ తీసివుంటే ఈ పాటికి నువ్వు చనిపోయి ఉండేవాడివి” అని చెప్పి సాధువు తన దారిన తాను వెళ్లిపోయాడు.
విజయుడు జరిగినదంతా జ్ఞాపకం చేసుకుని, భానుడు చేసిన ఘాతుకానికి కొంతసేపు విచారించాడు. చేసేది లేక తాను చేస్తున్న ప్రయాణం ముందుకు కొనసాగించాడు. తమ అన్నదమ్ములంతా ముందుగా నిర్ణయించుకున్న సంకేత స్థలానికి పదిరోజుల ప్రయాణంతో చేరుకున్నాడు.
నలుగురిలో చివరివాడైన చంద్రుడు అప్పటికే అక్కడ ఉన్నాడు. అన్నదమ్ములు ఆనందంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. తమ కథలను కలబోసుకున్నారు. విజయుడు ముందుగా తన కథ చెప్పాడు. భానుడు చేసిన ఘాతుకాన్ని విని, చంద్రుడు సంతాపం వ్యక్తం చేశాడు. ఆ తరువాత తన కథ చెప్పసాగాడు.
* * *
“అన్నా! నేను మొదట ఉత్తరదిక్కుగా వెళ్లాను. అక్కడ ప్రసిద్ధ పట్టణాలన్నీ చూశాను. తరువాత పశ్చిమ దిక్కుకు వెళ్లాను. ఎక్కడా నా మనసుకు నచ్చిన రాజకన్యలు తారస పడలేదు. చివరికి ఒకనాడు కొందరు సిద్ధులు శ్రీశైలం వెళుతుంటే వారిని నేనూ అనుసరించాను.
మహాశివరాత్రి పర్వదినాన మల్లికార్జున మహాలింగాన్ని సేవించి ధన్యుడినయ్యాను. ఒకచోట కొందరు శ్రీశైల పర్వత పురాణం చదువుతుంటే శ్రద్ధగా ఆలకించాను.
వారు చెబుతున్న కథలో శ్రీశైలంలోని గుహావిశేషాలు నా మనసును ఆకట్టుకున్నాయి. వాటిలో ‘వామన గుహ’ వృత్తాంతాన్ని చక్కగా గుర్తు పెట్టుకున్నాను. ఆ మరునాడు పురాణంలో చెప్పిన గుర్తుల ప్రకారం పాతాళ గంగాతీరం వెంబడి తూర్పుదిక్కుగా ప్రయాణించాను.
ఒకచోట వామనమూర్తి బొమ్మ చెక్కి ఉన్న బిలమార్గం ఒకటి కనిపించింది. లోనికి తొంగిచూడగా నడిచివెళ్లేంత మార్గం కనిపించింది. సాహసించి దానిలో ప్రవేశించాను. కొంతదూరం నడక సజావుగానే సాగింది. పోతూపోతూ ఉండగా లోపలంతా చీకటి కమ్మేసింది. బిలం ఎత్తు తగ్గడం మొదలుపెట్టింది. దాంతో కొంతదూరం వంగి నడిచాను. మరికొంతదూరం మోకాళ్లపై పాకుతూ వెళ్లాను. రానురానూ బిలమార్గం ఇరుకైపోయింది. ఆ చీకట్లో ఎన్నిరోజులు ప్రయాణించానో తెలియడం లేదు.
ఆ బిలానికి ఎక్కడా ముగింపు కనిపించలేదు. వెనక్కి పోవడానికి కూడా శక్తి లేదు. ముందుకు పోవడానికి యుక్తి తోచడం లేదు. ఇక రెండుమూడు ఘడియల కంటే ఎక్కువ ప్రాణం నిలవదని నిశ్చయం చేసుకున్నాను. శ్రీశైల మహాదేవుణ్ని మనసులో స్మరించుకుంటూ మృత్యువు కోసం ఎదురు చూస్తున్నాను.
ఆ సమయంలో ఉన్నట్లుండి నా చెవులకు మనోహరమైన వీణాగానం వినిపించింది. బహుశా చావబోయే సమయంలో అట్లా వినిపిస్తుందేమో అనుకున్నాను. కానీ ఆ వీణాగానం అంతకంతకూ మరింత స్పష్టంగా వినిపించసాగింది. నేను కూర్చున్న చోటుకు సరిగ్గా పైన ఎవరో కూర్చుని పాడుతున్నట్లు అనిపించింది. చేతులతో గుహను తడిమిచూడగా.. ఒకచోట మెత్తగా అనిపించింది. వెంటనే కాళ్లు రెండూ తన్నిపెట్టి పైకి లేవడానికి ప్రయత్నించాను.
దాంతో బిలమార్గం బారెడు పొడవుగా మారింది. ఆవలినుంచి ఏదో వెలుగు లోపలికి రావడం మొదలుపెట్టింది. ఆ మార్గాన్ని అనుసరించి ఆ మెత్తని నేలను సరిచేసుకుంటూ బయటపడేసరికి.. నేను విశాలమైన కదళీవనంలో ఉన్నాను.
అక్కడ సూర్యబింబం లేదు. మనుషులెవరూ లేరు. కానీ, ఏదో అద్భుతమైన తేజఃపుంజం పట్టపగలులా సాయం చేస్తున్నది. ముందుకు నడిచి చూడగా ఒకచోట రత్నకాంతులు విరజిమ్ముతున్నాయి.
అక్కడ స్ఫటికమయమైన శిలామంటపం ఒకటి దర్శనమిచ్చింది. ఆ మంటపం మధ్యలో బిల్వదళాలతో అర్చనలు పొందిన స్ఫటిక శివలింగం ఉంది. లింగానికి సమీపంలో వీణ ఒకటి మేళవించి ఉన్నది.
‘ఇప్పుడే ఎవరో ఈ స్వామిని అర్చించి వెళ్లారు. బహుశా వాళ్లు చేసిన వీణాగానమే ఇందాక నా చెవినపడి ఉంటుంది. అయ్యయ్యో! ఇంకొంచెం ముందుగా వచ్చి ఉంటే వాళ్లెవరో కళ్లారా చూడగలిగేవాణ్ని కదా!’ అనుకున్నాను.
(వచ్చేవారం.. శ్రీశైలంలో దేవకన్య)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | నలుగురు రాకుమారులు
Kasi Majili Kathalu | ఎగిరే జింక-2
Kasi Majili Kathalu | ఎగిరే జింక
Kasi Majili Kathalu | జయభద్రుని తెలివి
Kasi Majili Kathalu | నీతిమంతురాలు
Kasi Majili Kathalu | అనంగ చంద్రిక