Kasi Majili Kathalu Episode 43 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశీమజిలీ కథలను 1930వ దశకంలో మధిర సుబ్బన్న దీక్షితులు 12 భాగాలుగా రచించారు. ఈ కథల్లో జానపదాలు, చారిత్రక కల్పనలు, పౌరాణిక అనుసరణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆబాలగోపాలాన్ని అలరించాయి. సినిమాలుగానూ వచ్చాయి.మీరు చదువుతున్న కథ.. కాశీమజిలీల్లోని 3వ భాగంలోనిది.
సింధుబా నగరాన్ని వీరప్రతాపుడు పాలిస్తున్నాడు. ఆయనకు నలుగురు భార్యలు. పెళ్లిమీద పెళ్లి చేసుకున్నా సంతానం మాత్రం కలగలేదు. వీరప్రతాపుడు తన భార్యలను సమానంగా ప్రేమిస్తూ, సంతానం కలిగే శుభసమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అలాంటి సమయంలో ఆ రాజ్యానికి మంత్రసిద్ధుడైన ఒక యోగి వచ్చాడు. రాజుచేత పాయసంతో హోమం చేయించాడు. మిగిలిన పాయసాన్ని రాణులతో కలిసి భుజించమని రాజుకు చెప్పాడు. దక్షిణ నాయకుడు కావడం వల్ల వీరప్రతాపుడు ఆ పాయసాన్ని నలుగురు భార్యలకూ సమానంగా పంచిపెట్టాడు.
ఆ పాయస ప్రభావంతో నలుగురు భార్యలూ ఒకేసారి గర్భవతులయ్యారు. పదోమాసంలో ఒక్కరోజునే నలుగురు కుమారులను కన్నారు. వీరప్రతాపుడు నలుగురు కుమారులకూ ‘విజయ – భాను – రామ – చంద్రు’లని పేర్లు పెట్టాడు. నలుగురూ శుక్లపక్ష చంద్రుడిలా దినదినాభివృద్ధి చెందుతూ పెరిగారు. తగిన వయసులో విద్యా భ్యాసాలు కూడా పూర్తి చేసుకున్నారు. అంతలోనే వారికి యవ్వనప్రాయం వచ్చింది.
వీరప్రతాపుడు తన కుమారులకు తగిన కన్యలకోసం దేశదేశాలకు దూతలను పంపించి యువరాణుల చిత్ర పటాలు తెప్పించాడు. వాటిలో నుంచి ఉత్తమ లక్షణాలు కలిగిన నాలుగు చిత్రపటాలు తీసుకుని ముందుగా పెద్దరాణి వద్దకు వెళ్లాడు. ఆ నలుగురి చరిత్రలనూ రాణికి వివరించి చెప్పి..
“వీరిలో నుంచి నీ కుమారునికి తగిన అమ్మాయిని ఎంచుకో!” అని చెప్పాడు.
అప్పుడామె పద్మగంధిని తన కోడలిగా ఎంపిక చేసుకుంది. ఆ చిత్రపటాన్ని పెద్దరాణికి ఇచ్చేసి, మిగిలిన వాటితో రెండోరాణి వద్దకు వెళ్లాడు మహారాజు.
“మూడే తెచ్చారు. నాలుగో పటం ఏది?” అని ప్రశ్నించింది రెండోరాణి.
“ఆ అమ్మాయిని పెద్దవాడికి నిశ్చయించాం” అని సమాధానమిచ్చాడు ప్రతాపుడు.
“..అంటే అన్నివిధాలుగా బాగున్న సంబంధాన్ని పెద్దావిడ కొడుక్కి కట్టబెట్టి, మిగిలినవి మా ముఖాన పడేస్తారన్నమాట. అవసరం లేదు. మీకు మాపై అనురాగం ఉంటే ఆ సంబంధాన్నే నా కొడుక్కి కుదర్చండి. లేదంటే ఈ మూడుపటాలూ పెద్దావిడకే ఇచ్చేయండి” అన్నదామె.
రెండోరాణి మంకుపట్టు వల్ల చేసేదేమీ లేక వీరప్రతాపుడు పెద్దరాణికి ఇచ్చిన పద్మగంధి చిత్రాన్ని ఏదోవిధంగా వెనక్కి తెప్పించాడు. కానీ, ఈలోగా జరిగిందంతా మిగిలిన ఇద్దరు రాణులకూ తెలిసిపోయింది. దాంతో వాళ్లు కూడా ‘పద్మగంధి’నే తమ కోడలిగా చేయాలని పట్టుపట్టారు. వాళ్లమధ్య తగువు తీర్చలేక వీరప్రతాపుడు తల పట్టుకున్నాడు. చివరికి ఆ నాలుగు చిత్రపటాలనూ పక్కకు పారేశాడు. తన నలుగురు కుమారులనూ పిలిచి..
“నాయనలారా! మీకు వివాహం చేయాలని నేను ఉత్తమ వంశాలకు చెందిన రాజపుత్రికలను ఎంపిక చేశాను. కానీ, మీ తల్లుల మధ్య వివాదాన్ని పరిష్కరించ లేకపోయాను. ఆ సంగతి వదిలేద్దాం. మీ అందరికీ కావలసినంత ధనం ఇస్తాను. మీరు కొంతకాలం దేశాటనం చేయండి. కోరిన కన్యలను వివాహం చేసుకుని, ప్రయోజకులై తిరిగి రండి” అని చెప్పాడు.
తండ్రి ఆజ్ఞతో రాకుమారులందరూ శుభముహూర్తంలో దేశాటనకు బయల్దేరారు. సరిగ్గా ఏడాది తరువాత అదేరోజున కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.
* * *
నలుగురిలో మొదటివాడైన విజయుడు ఉత్తమాశ్వాన్ని అధిరోహించి తూర్పుదిక్కుగా పదిరోజులపాటు అలుపెరగకుండా ప్రయాణించాడు. పదకొండోనాడు చీకటి పడే
వేళకు ఒక పట్టణానికి చేరుకున్నాడు. ఊళ్లోకి వెళ్లే ముందుగా ఒక చావిడి కనిపించింది. ఆ రాత్రికి అక్కడే తలదాచుకోవచ్చని, గుర్రాన్ని కట్టేసి.. ఒకచోట నేల శుభ్రపరుచుకుని కూర్చున్నాడు. అంతలో దూరంగా కొంత వెలుగు కనిపించింది. అక్కడెవరో మనుషులు ఉండవచ్చని వెళ్లి చూడబోతే.. అదో శ్మశానం.
‘అయ్యో! తెలియక వల్లకాటిలో ఇంతసేపూ కూర్చున్నాను. ప్రేతకర్మల కోసం ఈ చావిడిని కట్టి ఉంటారు. సరే.. ఇప్పుడు మళ్లీ ఎక్కడికో పోవడం ఎందుకు?! తెల్లవారిన తరువాతే చూసుకుందాం’ అనుకుని ఆ రాత్రి నిద్రపోకుండా జాగారం చేస్తున్నాడు విజయుడు.
నడిరాత్రిలో ఒకమూల ‘దభేల్’మని చప్పుడైంది. అటు వైపు పరుగెత్తి చూసేసరికి అక్కడ కోటగోడ కనిపించింది. దానిపక్కనే ఒక పెట్టె పడి ఉంది. శ్మశానంలో మండుతున్న ఒక కొరివిని తీసుకొచ్చి ఆ పెట్టె తెరిచాడు విజయుడు. అందులో ఒక యువతి మూర్ఛపడి ఉంది. నాడి బలహీనంగా కొట్టుకుంటున్నది. విజయుడు వెంటనే తనకు తెలిసిన వైద్యం అందించాడు. ప్రాణగండం తప్పింది. కానీ, పెట్టెలోనుంచి బయటికి తీసిన తరువాత నిలబడలేక మళ్లీ సోలిపోయింది. మెల్లిగా ఆమెను చావిడివరకు తీసుకుని పోయి తెల్లవారే వరకు ఆగాడు విజయుడు. అటుపైన గుర్రంపై పడుకోబెట్టి మెల్లగా నడిపించుకుంటూ ఊళ్లోకి వెళ్లాడు. ఒక బ్రాహ్మణుని ఇంటికి వెళ్లి..
“అయ్యా! మేము బాటసారులం. ఈమె నా భార్య. అనుకోకుండా జబ్బు పడింది. మీరు అనుమతిస్తే రెండురోజులు మీ ఇంట్లో ఉండి, వైద్యం చేయిస్తా” అని కోరాడు.
ఆ బ్రాహ్మణుడు అందుకు సమ్మతించి, ఒక గది చూపించాడు. ఆ యువతిని అందులో ఉంచి పగలంతా ఆమెకు అనేక ఉపచారాలు చేశాడు విజయుడు. ఆ సాయంత్రానికి ఆమెకు స్పృహ వచ్చింది.
“అయ్యా! మీరెవరు? ఈ ఇల్లెవరిది? నేనిక్కడికి ఎలా వచ్చాను?!” అని ప్రశ్నించిందామె.
అప్పుడు విజయుడు..
“తరుణీ! నేను సింధుబా రాజ్యాన్ని ఏలే వీరప్రతాపుని కుమారుణ్ని. పెళ్లాడేందుకు తగిన కన్యకోసం అన్వేషిస్తూ ఈ దేశానికి వచ్చాను. తెలియక శ్మశానంలో తలదాచుకున్నాను. నిన్న రాత్రి ఎవరో నిన్ను పెట్టెలో ఉంచి కోటగోడపై నుంచి పారవేశారు. నేనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను” అని తన గురించి వివరంగా చెప్పాడు. ఆమె మౌనాన్ని చూసి..
“ఇంతకూ నువ్వెవరు? ఎవరు నిన్నలా పెట్టెలో బంధించారు?!” అని ప్రశ్నించాడు.
“ఆర్యా! నాపేరు హేమ. నేను ఈ పట్టణపు రాజు బలవర్ధనుల వారి కుమార్తెను. నా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది. మా తండ్రిగారు ఇటీవలే వినీతి అనే ఆమెను రెండోపెళ్లి చేసుకున్నారు. కాపురానికి వచ్చినప్పటి నుంచి ఆమెకు నామీద పట్టరాని ఈర్ష్య ఉండేది. రెండు రోజుల కిందట మా తండ్రిగారు వేటకు వెళ్లారు. నిన్నరాత్రి మా సవతి తల్లి నన్ను తన మందిరానికి పిలిచింది. నేను వద్దంటున్నా ఏదో ఫలహారం చేతికిచ్చి తినమని బలవంత పెట్టింది. నాకు అనుమానం కలిగి తినకుండా మూట గట్టుకున్నాను. ఆమె నన్నంతటితో విడిచిపెట్టకుండా గంధము పూయించి, పువ్వులు ముడిచి.. ఏదో పరిమళ ద్రవ్యం తీసుకు వచ్చి వాసన చూపించింది. నాకు వెనువెంటనే స్పృహ తప్పింది” అని తన కథను వివరించిందామె.
“అయితే నీకు స్పృహ తప్పించి కడతేర్చాలని ప్రయత్నించిందన్నమాట. కొన ఊపిరితో నా కంటపడ్డావు కనుక కోలుకోగలిగావు” అని ఆ కథను పూర్తిచేశాడు విజయుడు.
ఆమె తన రెండుచేతులూ జోడించి.. “ప్రాణదాతా! నేను మళ్లీ ఇంటికి తిరిగివెళ్లను. నన్ను మీరు చేపట్టగలిగితే పాదదాసినై సేవిస్తాను” అన్నది.
ఆమె గుణం, రూపం విజయుని మనసును తొలి చూపులోనే ఆకర్షించాయి. తన మనసులోని మాటనే ఆమె అభ్యర్థన రూపంగా చెప్పినందువల్ల వెనువెంటనే పాణి గ్రహణం చేశాడు. గాంధర్వపద్ధతిలో అప్పటికప్పుడే వారిద్దరూ భార్యాభర్తలయ్యారు.
* * *
ఆ మరునాడు అంగడికి వెళ్లిన విజయుడు కొద్దిసేపటికే ఆదుర్దాగా వెనుతిరిగి వచ్చాడు.
“హేమా! నిన్ననే మీ తండ్రి వేటనుంచి తిరిగి వచ్చారట. నువ్వు ఎవరితోనో లేచిపోయావని మీ సవతితల్లి పుకారు పుట్టించిందట. నిన్ను నీ ప్రియునితోపాటు బంధించి తెస్తే గొప్ప బహుమానం ఇస్తానని మీ తండ్రి భటులను నియోగించారట. ఇప్పుడు మనం నిజం చెప్పినా నమ్మరు. వీలైనంత వేగంగా ఈ పట్టణం విడిచిపెట్టి వెళ్లిపోవాలి మనం” అన్నాడు.
ఆమెకు పురుషునిలా మారువేషం వేయించి, అప్పటికప్పుడు ప్రయాణం కట్టించాడు. కొన్ని దినాల పాటు ఎక్కడా ఆగకుండా అతివేగంగా ప్రయాణించి, వాళ్లిద్దరూ మరో పట్టణానికి చేరుకున్నారు. అక్కడో సత్రంలో బసచేసి ఉండగా హేమ ఇలా ప్రశ్నించింది.
“నాథా! ఇంకా మనం ఎన్నిరోజులు ఈ కష్టాలు పడాలి? మనకు సుఖాలు దక్కేదెన్నడు?”.
విజయుడు చిరునవ్వుతో ఆమె చేతిని పట్టుకుని..
“హేమా! రేపటితో మన కష్టాలు తీరాయని భావించు. ఈ దేశపు రాజు సరసుడని విన్నాను. రేపే వెళ్లి ఆయన దర్శనం చేస్తాను. రేపు సాయంత్రానికల్లా నీ ఒళ్లంతా బంగారుమయం చేస్తాను. నిన్ను ఏడంతస్తుల మేడలో, పట్టుపరుపుల మీద కూర్చోబెడతాను” అని ఓదార్చాడు.
సరిగ్గా విజయుడు పై మాటలు చెబుతున్న సమయంలోనే, సత్రపు గది కిటికీకి ఆవలివైపు రహదారిపై ఒకాయన నిలబడి ఉన్నాడు. అతడు మరెవరో కాదు.. మారువేషంలో ఉన్న ఆ దేశపు రాజు భీమవర్మ. విజయుని మాటలు ఆయన చెవిలోనే పడ్డాయి.
“ఇతగాడెవరో అసాధ్యుడిలా ఉన్నాడు. నన్ను చూసిన మరుక్షణంలోనే బంగారం కురిపిస్తానంటున్నాడు. చూద్దాం.. ఈ మాటలన్నీ డాంబికాలో, యథార్థాలో” అనుకుంటూ కోటకు తిరిగి వెళ్లాడు. తెల్లవారుతూనే..
“సత్రంలో విడిదిచేసిన విదేశీ దంపతులలో మగవాడిని మర్యాదపూర్వకంగా సభకు ఆహ్వానించి తీసుకురండి” అని భటులను ఆజ్ఞాపించాడు.
రాజాజ్ఞ ప్రకారం తనవద్దకు వచ్చిన భటులను చూసి, విజయుడు ఆశ్చర్యపోయాడు. వెతకబోయిన తీగ కాలికి తగలడం ఇదే కాబోలనుకుని, రాజసభకు తగినట్లుగా హుందా అయిన వేషధారణతో వెళ్లాడు. అప్పటికే సింహాసనంపై కూర్చుని ఉన్న భీమవర్మకు వినయంగా నమస్కరించాడు. ఆయన ఏమీ మాట్లాడకుండా తనకు సమీపంలోని ఒక ఆసనాన్ని చూపించి కూర్చోమని సైగ చేశాడు.
ఆ తరువాత విజయుని వంక చూడకుండానే సభ నిర్వహించాడు. మధ్యాహ్న వేళకు సభ చాలించి భీమవర్మ సింహాసనం నుంచి పైకి లేచాడు. ఆయన వెంట రాజమందిరం వరకు కొందరు అనుసరించారు. అలా అనుసరించిన వారంతా ఐదు ద్వారాలు దాటి వెళ్లేసరికి ఆగిపోయారు. మంత్రి ఒక్కడే ఆరో ద్వారం వరకు వెళ్లాడు. విజయుడు మాత్రం ఏడోద్వారం వరకు వెళ్లాడు.
అప్పుడు కూడా భీమవర్మ తనతో ఏమీ మాట్లాడకపోవడం వల్ల విజయుడు తానే కల్పించుకున్నాడు.
“మహారాజా! ఇక సెలవిప్పిస్తే వెళ్లి వస్తాను” అన్నాడు.
“అలాగే వెళ్లిరండి!” అన్నాడు భీమవర్మ.
వెనుకటి ద్వారాలనుంచి ఇదంతా చూస్తున్న వారంతా ఆశ్చర్యపోయారు. ‘ఈయనెవరో రాజుగారికి బాగా సన్నిహితుడై ఉండాలి’ అనుకున్నారు.
విజయుడు అక్కడినుంచి బయటికి వస్తూనే.. “ఎవరక్కడ?” అన్నాడు గంభీరంగా..
పక్కనే ఉన్న మంత్రి ముందుకు వచ్చి.. “నేను!” అని మెల్లిగా సమాధానమిచ్చాడు.
కుడిచేతి పిడికిలి మూసి నడుముపై ఉంచుకుని వీరత్వం ఉట్టిపడుతుండగా.. పైనుంచి కిందికి ఒకసారి చూసి..
“నువ్వేనా మంత్రివి?! మాకిప్పుడు పారలు, గునపాలు వగైరా సాధనాలతోపాటు కూలివాళ్లు కావాలి. భూమి కొలతలకు వాడే గొలుసులు కూడా కావాలి. మూడువందల మంది భటులు కూడా నావెంట రావాలి” అన్నాడు విజయుడు.
“చిత్తం ప్రభూ! ఒక్క అరఘడియలో ఏర్పాటు చేస్తాను” అని అక్కడినుంచి వెళ్లాడు మంత్రి.
ఆయన మాటిచ్చిన విధంగానే విజయుడు కోరినవన్నీ ఏర్పాటయ్యాయి. గుర్రాన్నెక్కి భటులు అనుసరిస్తుండగా అన్నివీధులూ తిరుగుతూ.. ఒక పెద్ద భవంతి ముందు ఆగాడు విజయుడు.
(వచ్చేవారం.. వామన గుహ)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | ఎగిరే జింక-2
Kasi Majili Kathalu | ఎగిరే జింక
Kasi Majili Kathalu | జయభద్రుని తెలివి
Kasi Majili Kathalu | నీతిమంతురాలు
Kasi Majili Kathalu | అనంగ చంద్రిక