Kasi Majili Kathalu Episode 39 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : మధిర సుబ్బన్న దీక్షితులు 1930వ దశకంలో రచించిన కాశీమజిలీ కథలు అప్పట్లో ఆబాలగోపాలాన్ని అలరించాయి. తెలుగు సాహిత్యంలో తప్పకుండా చదవాల్సిన గొప్ప గ్రంథాల్లో కాశీమజిలీ కథలు ముఖ్య స్థానాన్ని ఆక్రమించాయి. పన్నెండు భాగాలుగా వెలువడిన ఈ గ్రంథంలోని మూడోభాగం కథలు ప్రస్తుతం మీరు చదువుతున్నారు.
కుంభకోణం పట్టణాన్ని విజయకేతుడనే రాజు పాలిస్తున్నాడు. ఆయన ఒక్కగానొక్క కొడుకు కందర్పుడు. పేరులోనూ, రూపంలోనూ మన్మథుడే. అతనికి చిన్నతనం నుంచి దేశవిదేశాల్లోని వింతలు చూడాలని కోరిక. కానీ దేశాటనం అంటే మాటలతో పని కాదు.
‘తల్లిదండ్రులతో చెబితే వెళ్లనివ్వరు. ఒకవేళ వారు ఒప్పుకొన్నా తక్కువ వ్యవధిలో దేశాలన్నీ చూసిరావడం అసాధ్యం. గట్టిగా ప్రయత్నిస్తే భరతఖండంలోని యాభై ఆరు దేశాలనూ చూడొచ్చు. మిగిలిన వాటిమాటేమిటి?! ఆకాశంలో ప్రయాణిస్తేకానీ చేరుకోలేని ద్వీపాలు, దేశాలెన్నో ఈ భూమండలంలో ఉన్నాయని చెప్పుకొంటారు. వాటిని చూడటం ఎలా?’ అనే ఆలోచనలే అనుక్షణమూ కందర్పుడిని బాధించేవి.
యుక్తవయసు వచ్చిన తరువాత తన మనసులోని భావాలను ఒక ఉపాధ్యాయునితో పంచుకున్నాడు. కానీ ఆయన సైతం..
“వత్సా! నీ తండ్రి వృద్ధుడు. నువ్వు ఆయనకు సహకరించాలి. రాజ్యభారాన్ని పంచుకుని ప్రజలను న్యాయంగా పాలించాలి. అంతేకానీ వెర్రి ఊహలు చేయకు” అని హితవు పలికాడు.
కందర్పుడు ఆ మాటలకు అంగీకరించలేదు.
“ఆచార్యా! విస్తారమైన ఈ భూమిపై మన రాజ్యం ఏపాటిది? మావంటి రాజులు ఎందరు లేరు? మీ ఇంటిలో మాత్రం ప్రజలు లేరా? వారికి మీరు మాత్రం ప్రభువులు కాదా? నా ప్రజలమీద నాకుమాత్రం అంతకంటే అధికారాలేం ఉంటాయి? వీటిపైన నాకు ఆసక్తి లేదు. మనుచరిత్రలో ప్రవరాఖ్యుని చరిత్ర చదివిన కొద్దీ నాకు దేశాటన పట్ల ఆసక్తి పెరిగిపోతున్నది. ఔషధాల వల్ల, యంత్రాలవల్ల మన పూర్వికులు ఇతరులకు సాధ్యంకాని
దూరతీరాలకు ప్రయాణించారని కావ్యాలు వర్ణిస్తున్నాయి కదా?! దయచేసి అటువంటి విశేషాలేమైనా మీకు తెలిస్తే చెప్పండి” అని పదేపదే అడిగాడు.
అందుకు ఆ ఉపాధ్యాయుడు..
“రాకుమారా! మన నగరంలో మణివర్మ ఉన్నాడు. వారు వంశపారంపర్యంగా యంత్రాలు చేయడంలో, తంత్రాలు పన్ని రూపాలు మార్చడంలో ఆరితేరినవారు. మణివర్మ ముత్తాతకైతే సాక్షాత్తూ విశ్వకర్మ అని పేరుండేది. ఆయన స్వయంగా ఒక కీలుజింకను తయారుచేసుకుని, దానిమీద దేశాలన్నీ తిరిగేవాడట. నా అంచనా నిజమైతే ఆ జింక ఇప్పటికీ మణివర్మ ఇంట్లోనే ఉండి ఉంటుంది” అని చెప్పాడు.
“అయితే పదండి. మణివర్మ ఇంటికి వెళ్దాం” ఆసక్తిగా అడిగాడు కందర్పుడు.
ఉపాధ్యాయుడు పెదవి విరిచి..
“మణివర్మ మహామూర్ఖుడు. అనుమతిలేనిదే చీమనైనా తన ఇంట్లోకి రానీయడు. తాను ఇల్లు వదిలి బయటికి రాడు. అటువంటివాడి వద్ద నేర్పుగా పని సాధించుకోవాలి” అని చెప్పాడు.
ఆ నిమిషం నుంచి కందర్పుడు అదే పనిలో ఉన్నాడు. ఒకనాడు సామాన్య పౌరునిలా వేషం వేసుకుని బయల్దేరాడు. కంచుకోటలా ఎత్తయిన ప్రహరీ, పటిష్టమైన సింహద్వారం కలిగిన మణివర్మ ఇంటికి కొద్దిదూరంలో నిలబడి వచ్చేపోయేవారిని గమనించసాగాడు. కొంతసేపటికి మణివర్మ ఇంట్లోంచి ఒక వృద్ధుడు బయటికి వచ్చాడు. కందర్పుడు అతనితో మెల్లిగా మాట కలిపాడు. మణివర్మ ఇంటి సంగతులు కొన్ని రాబట్టాడు.
“మణివర్మ కోపదారి మనిషి. భార్యను చీటికిమాటికి కొడుతుంటాడు. మనుమరాలైన సుభద్రను మాత్రమే ప్రేమగా చూస్తాడు. ఎప్పుడూ తన గదిలో ఒంటరిగా ఉండి, శక్తిపూజ చేసుకుంటూ ఉంటాడు. సుభద్ర చక్కటి పూలతోట ఒకటి పెంచుకుంటున్నది. నేను తోటమాలిగా పనిచేస్తున్నాను” అని వృద్ధుడు చెప్పుకొచ్చాడు.
ఆ విషయాలన్నీ పదేపదే తర్కించుకున్న తరువాత, “తాతా! నువ్వు నాకో సాయం చేసిపెట్టాలి. ఆరోగ్యం సరిగాలేదని వంకపెట్టి, నీకు సహాయకునిగా నీతోపాటు నన్ను కూడా పనికి తీసుకెళ్లు” అని కందర్పుడు బతిమాలాడు.
“ఈ సంగతి మణివర్మకు తెలిస్తే తోలు ఒలిచేస్తాడు. ఆయన అనుమతి లేకుండా పురుగైనా ఆ ఇంట్లో కాలుపెట్టలేదు” అని భయపెట్టాడు వృద్ధుడు.
అతని చేతిలో వరహాలమూట పెట్టాడు కందర్పుడు. వృద్ధుడి కళ్లు మెరిశాయి. మరునాడు ఇద్దరూ కలిసి మణివర్మ ఇంటికి వెళ్లారు. సుభద్ర తలుపు తీసింది. ముసలాయనతోపాటు కందర్పుడు కూడా లోపలికి ప్రవేశించడం ఆమె గమనించలేదు. కానీ, కందర్పుడు తేరిపార చూశాడు. ఆమె ముఖ కవళికలను
మనసులో ముద్రించుకున్నాడు.
వృద్ధుడు మొక్కలకు నీళ్లు తోడుతుంటే.. కందర్పుడు ఓ చెట్టుకింద మట్టిలో పుల్లతో గీస్తూ ఆడసాగాడు. కొంతసేపటికి సుభద్ర వచ్చింది.
“ఏమయ్యా! ఆ ముసలాయన అంతలా కష్టపడుతుంటే నువ్వు మాత్రం సోమరిపోతులా కూర్చున్నావేం?! కూలి తీసుకోవడం లేదా?” అని నిలదీసింది.
“ఏం చేయను మరి.. నాకీ మోటుపని అలవాటు లేదు. తోడుగా ఉండమని తాత పిలిస్తే వచ్చాను. నాకు తెలిసిన పని ఇదొక్కటే” అని కందర్పుడు ఆమె చేతికి ఒక చిత్రపటాన్ని చూపించాడు.
అందులో ఒక సుందరమైన ఉద్యానంలో ఆలుమగలు విహరిస్తున్నట్లు గీశాడు.
“ఈ అమ్మాయి బొమ్మ నా పోలికలో గీశావేం?!” అడిగింది సుభద్ర. కందర్పుడు నవ్వి ఊరుకున్నాడు.
“అబ్బాయి బొమ్మ నీ పోలికలో ఉన్నట్లుందేం?!” అని కోపం ప్రదర్శించింది.
“అవునా! నాకు తెలియదే..” అమాయకత్వాన్ని నటించాడు కందర్పుడు.
ఆమె కోపమూ, అతని అమాయకత్వమూ రెండూ నిజమైనవి కావు. ఆ తరువాత వాళ్లిద్దరి మధ్య చాలా సుదీర్ఘమైన సంభాషణ నడిచింది. కానీ ఆ మాటలేవీ అక్షరాల్లో ఒదగవు. అదంతా ఒట్టి కళ్ల భాష మాత్రమే.
ఆ భాషకు ముగింపుగా సుభద్ర..
“నాకు చిత్రలేఖనం నేర్చుకోవాలని చాలాకాలం నుంచి ఆశ. నేర్పించగలవా?” అని అడిగింది.
అందుకు కందర్పుడు ఒప్పుకొని.. అప్పటికప్పుడే ఆమెకు బోధన ప్రారంభించాడు. బొమ్మగీస్తున్న
సమయంలో అతని వేళ్లకేసి ఆదమరుపుగా చూసే సరికి రత్నపుటుంగరం తళుక్కున మెరిసింది.
“ఎవరు నువ్వు? ఇంత డబ్బున్న వాడివి కూలిపనికి ఎందుకు వచ్చావు?!” అని నిలదీసింది.
“చల్లకు వచ్చి ముంతదాచిపెట్టడం ఎందుకు?! నేను యువరాజు కందర్పుడను” అని చెప్పాడు.
ఆ మాటలతో నిలువెల్లా కంపించిపోయింది సుభద్ర.
“యువరాజులవారా? మా ఇంటికి వేంచేశారా?! ఇంతసేపూ నేను మిమ్మల్ని మామూలు కూలివాడిలా పరిగణించానా?!” అని అస్థిమితంగా అటూ ఇటూ తిరుగుతూ తన మనసులోని కలవరపాటును ప్రదర్శించింది. ఉన్నట్లుండి అతని పాదాలకు నమస్కరించింది.
ఆమెను లేవనెత్తి..
“అమ్మాణీ! మరేమీ పరవాలేదు. నేను నీ సహాయం కోరి వచ్చాను. మీ తాత సాక్షాత్తూ విశ్వకర్మ అవతారమేనని చెప్పుకొంటారు. మీ ఇంటిలో ఎన్నెన్నో వింత వస్తువులు ఉన్నాయని విన్నాను. వాటిని చూడాలని నా కోరిక. చూపగలవా?!” అడిగాడు కందర్పుడు.
గుండెల మీద చేయి వేసుకుని..
“మా తాతకు తెలిస్తే నా తల తీస్తాడు” అని చెప్పింది.
“మనసుంటే మార్గముండదా?! ఇంత దయగల దానివి ఈమాత్రం సాయం చేయలేవా” అంటూ కన్ను గిలిపాడు కందర్పుడు.
దాంతో మరింత తబ్బిబ్బుపడింది సుభద్ర.
“ఒక పనిచేయండి. రాత్రి పొద్దుపోయేదాకా ఓపిక పట్టండి. ఆ తరువాత మనం తాత గదిలోకి వెళ్లవచ్చు” అని చెప్పి, కందర్పుణ్ని తన గదిలోకి తీసుకుపోయింది.
అన్ని పనులూ పూర్తిచేసి, తాళపుచెవులు దొంగతనంగా తీసుకువచ్చింది. కందర్పుని తీసుకుని, వింత వస్తువులున్న గదిలో ప్రవేశించింది.
“నేను, మా తాత కాకుండా ఈ గదిలోకి వచ్చిన మూడోవ్యక్తి మీరే” అన్నది సుభద్ర.
“నిజమా!” అంటూ ఆమె భుజాలమీద చేయివేసి, అక్కడున్న విశేషాలన్నీ ఒక్కటొక్కటిగా చూడసాగాడు కందర్పుడు. చివరగా అతడు అన్వేషిస్తున్న తోలుజింక కనిపించింది. దీపపు వెలుగులో పరిశీలించి చూడగా దానిపై ఒక శాసనం ఉంది. అందులో..
‘ఈ తోలుజింక కుడిచెవిలోఉన్న బిరడా తీసి, నోటితో గాలి పూరించాలి. అప్పుడిది గుర్రంలా లేచి నిలబడుతుంది. మళ్లీ బిరడా బిగించి, దీనిని అధిరోహించాలి. కుడి, ఎడమలకు ప్రయాణించడానికి దీని చెవులే మీటలుగా పనిచేస్తాయి. నెత్తిమీద ఉన్న సీలను కుడికి, ఎడమకు తిప్పడం ద్వారా పైకి, కిందికి కూడా ప్రయాణించవచ్చు..’ అని రాసి ఉంది.
జింకను తిరిగి అక్కడే పెట్టేసి, సుభద్రవైపు తిరిగాడు కందర్పుడు. ఆమె చిబుకాన్ని కుడిచేతి చూపుడువేలితో ఎత్తిపట్టుకుని, చూపులో చూపు నిలిపి..
“నీకు నామీద ఎంత అనురాగం లేకపోతే.. ఇంత విలువైన వస్తువులను నాకు చూపిస్తావు?! దీనికి ప్రతిఫలంగా నీకేం ఇవ్వగలను?! నా ప్రియపత్నిగా చేసుకుంటానని బాస చేస్తున్నాను. నన్ను అంగీకరిస్తావు కదూ!” అన్నాడు.
ఆమె సిగ్గుపడి కన్నులు వాల్చింది. అతడామె అధరాన్ని చుంబించాడు. మరో అడుగు ముందుకు పడకముందే ఇద్దరూ విడివడ్డారు.
“సుభద్రా! మా తల్లిదండ్రులను ఒప్పించి కానీ, నిన్ను చేపట్టలేను. ప్రస్తుతానికి మన ప్రేమచిహ్నంగా ఈ తోలుజింకను నాతో తీసుకుపోతున్నాను. మీ తాతకు అనుమానం రాకుండా ఉండేందుకు అచ్చంగా దీనిలాగే ఉండే మరోజింక తయారుచేయించి పంపిస్తాను” అని చెప్పాడు కందర్పుడు.
ఏదో మత్తు జల్లిన దానిలా ఏమీ మాట్లాడలేక పోయింది సుభద్ర. ఆమె చూస్తుండగానే జింకను పూరించి, గాలిలోకి ఎగిరి చీకట్లో కలిసిపోయాడు.
ఎవరికీ తెలియకుండా, ఒక శిల్పిచేత ఆ జింకకు నకలు తయారుచేయించి, సుభద్రకు అందేలా చేశాడు. అనంతరం తన ఉపాధ్యాయునికి ఆ జింకను చూపించి..
“ఆర్యా! మీ అనుగ్రహం వల్ల నేను తలపెట్టిన కార్యం సఫలమైంది. హిమాలయాలకు ఆవల ఉన్న దేశాలను చూసి రావాలని అనుకుంటున్నాను. ఒక్కమాసంలోగా తిరిగివస్తాను. నేను వెళ్లిన తరువాత మా తల్లి దండ్రులు బెంగపెట్టుకోకుండా మీరే చూసుకోవాలి” అని కోరాడు.
మరునాడే చీకటిపొద్దున కొన్ని ఆహార పదార్థాలను మూటగట్టుకుని తోలుజింకను పూరించాడు. దానిని అధిరోహించి.. ‘జయ పరమేశ్వరా!’ అంటూ మర తిప్పాడు. వెంటనే జింక ఆకాశంలోకి ఎగిరింది. కందర్పుడు ఉత్తరాభిముఖంగా ప్రయాణించసాగాడు. గరుత్మంతుని కంటే వేగంగా జింక ఎగురుతున్నది. చిన్న కుదుపుకానీ, ప్రయాణపు బడలిక గానీ లేవు. మధ్యాహ్న వేళకు హిమాలయాలకు చేరి, అక్కడ కొంతసేపు విశ్రమించాడు. మళ్లీ జింకనెక్కి మరింత ఉత్తరానికి పోయాడు. హిమాలయాలకు ఆవలివైపు అనేక పర్వతాలు, అడవులు దాటాడు. మరొక్క జాములో సాయంత్రం కానుందనగా, అశేష జనవాహినితో నిండిన మహాపట్టణాన్ని గగనతలం నుంచి చూశాడు. ఊరి బయటనే కిందికి దిగి, తోలుజింక ఎడమచెవి బిరడా తీయగానే.. గాలిపోయి, కుంచించుకు పోయింది. దానిని చుట్టచుట్టి చంకలో పెట్టుకుని పట్టణంలో ప్రవేశించాడు. పది అడుగులు నడిచాడో లేదో రక్షకభటులు అడ్డం వచ్చారు.
“ఎవరు నువ్వు? ఏ దేశం వాడివి? సుంకం చెల్లించకుండా పట్టణంలోకి రావడానికి వీల్లేదు” అన్నారు.
కందర్పునికి వాళ్ల భాష అర్థం కాలేదు. అతడేదో చెప్పబోయాడు. అంతలోనే.. “వీడు తోలు కూడా తీసుకు వస్తున్నాడు. దీనికి వేరుగా సుంకం కట్టాలి. పదవయ్యా! కొత్వాల్ వద్దకు” అంటూ తోలుజింకను లాక్కుని, మెడమీద చెయ్యివేసి ముందుకు తోశారు.
“అయ్యా! దయచేసి ఆ తోలు తిరిగి ఇచ్చేయండి” అని కందర్పుడు వారిని బతిమిలాడ సాగాడు.
(వచ్చేవారం.. ఎగిరే జింక-2 )
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | జయభద్రుని తెలివి
Kasi Majili Kathalu | నీతిమంతురాలు
Kasi Majili Kathalu | అనంగ చంద్రిక
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | అదృష్టదీపుడు – 2
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | అదృష్టదీపుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | పాటపాడే చెట్టు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | స్వర్గంలో మానవుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | ఎగిరే చెట్లు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |కాశీ మజిలీ కథలు : దొంగల తప్పిదం
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |రహస్య స్నేహితుడు