న్యూఢిల్లీ: భారత క్రికెటర్ అర్షదీప్ సింగ్(Arshdeep Singh) తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉన్న సుమారు 200 పోస్టులను అకస్మాత్తుగా డిలీట్ చేశారు. తన డిస్ప్లే పిక్చర్ను కూడా అతను మార్చేశాడు. 2025 చాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీతో తీసిన రీల్ను కూడా అతను డిలీట్ చేశాడు. ఆ రీల్కు సుమారు 15 కోట్ల వ్యూవ్స్ వచ్చాయి. అయితే ఎందుకు సడెన్గా తన ఇన్స్టా పోస్టులను డిలీట్ చేశాడో అర్షదీప్ చెప్పలేదు. బహుశా వ్యక్తిగతంగా తన మొబైల్ను రీసెట్ చేసి ఉంటాడని అతని అభిమానులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో క్లీనప్ చేపట్టి ఉంటాడని అనుకుంటున్నారు. రీ బ్రాండింగ్ కోసం అర్షదీప్ ప్రయత్నిస్తున్నాడేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అర్షదీప్ చర్యపై ఆన్లైన్లో ఎన్ని రూమర్స్ ఉన్నా.. పంజాబ్ కింగ్స్తో సంబంధం ఉన్న కాంటెంట్ను మాత్రం అతను తొలగించలేదు. తన బయోలో ఇంకా పీబీకేఎస్తో ఉన్నట్లు చెప్పాడు. ఇక తన ఇన్స్టాలో కుటుంబసభ్యులతో దిగిన ఫోటోలు, క్రికెట్ మైలురాళ్లు, బ్రాండ్ ప్రమోషన్స్కు చెందిన పిక్స్ ఉన్నాయి. తాజా ఐపీఎల్లో అర్షదీప్పై కొన్ని విమర్శలు వచ్చాయి. వర్ణవివక్ష కామెంట్ చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్తో మ్యాచ్ జరిగిన సమయంలో తిలక్ వర్మను అతను నల్లనోడా అంటూ పిలిచినట్లు విమర్శులు ఎదుర్కొన్నాడు. ఓయ్ అంధేరే.. సన్స్క్రీన్ లగాయా అంటూ తిలక్ను పలకరించాడు. ఆ కామెంట్పై ఆన్లైన్లో విమర్శలు వచ్చాయి. అర్షదీప్ వ్యాఖ్యల పట్ల మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఘాటుగా స్పందించారు. గతంలో తనను కూడా ట్రోల్ చేసినట్లు ఆయన చెప్పారు. అర్షదీప్ను బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ బీసీసీఐ చర్యలు తీసుకుంటే, తనను వేధించిన వారి పేర్లను బయటపెడుతానని శివరామకృష్ణన్ అన్నారు.
స్నాప్చాట్లో ఓ అభిమానికి ఆగ్రహంగా జవాబు ఇవ్వడం వల్ల కూడా అర్షదీప్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఐపీఎల్ 2026లో అర్షదీప్ ప్రదర్శన నిరాశజనకంగా ఉంది. 14 మ్యాచుల్లో అనతు కేవలం 14 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.