Kalahandi : నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో దిగిన ఆరుగురు వ్యక్తులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఒడిశా (Odisha) రాష్ట్రం కలహండి జిల్లా (Kalahandi district) లో మంగళవారం ఉదయం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాళహండి జిల్లా మదన్పూర్-రాంపూర్ (Madhanpur-Rampur) బ్లాక్ పరిధిలోని గౌడ కర్లాంకుంట (Gouda Kurlam Kunta) గ్రామంలోగల ఓ ఇంట్లో కొత్తగా సెప్టిక్ ట్యాంకును నిర్మిస్తున్నారు. ఇప్పటికే సెంట్రింగ్ కొట్టి స్లాబ్ వేయగా.. మంగళవారం ఉదయం సెంట్రింగ్ సామాగ్రిని బయటకు తెచ్చేందుకు ఓ సెంట్రింగ్ మేస్త్రీ లోపలికి వెళ్లాడు.
అతడు లోపలున్న విషవాయువులు పీల్చుకుని ఊపిరాడక స్పృహ తప్పిపడిపోయాడు. అతడిని కాపాడేందుకు మరో ఇద్దరు మేస్త్రీలు, ఇద్దరు కూలీ లోపలికి వెళ్లారు. వారి వెంటనే ఆ ఇంటి యజమాని నిమైపాల్, అతడి కుమారుడు ఆకాశ్ పాల్ కూడా సెప్టిక్ ట్యాంకులోకి దిగారు. అందరూ స్పృహ తప్పి అందులోనే పడిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. లోపల ఉన్నవారిని వెలికితీసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మృతుల్లో ముగ్గురు మేస్త్రీలు, ఒక కూలీతోపాటు ఆ ఇంటి యజమాని, అతడి కుమారుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన మరో కార్మికుడు ప్రస్తుతం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.