మహబూబ్నగర్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అకాల వర్షం.. రైతులను అతలాకుతలం చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో ఆరుగా లం కష్టపడి పండించిన వరి, మొక్కజొన్నను అమ్ముకునేందుకు మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం వర్షార్పణమైంది. నాగర్కర్నూల్, వనపర్తి, మ హబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నాగర్కర్నూల్ మార్కెట్లో కాంటా చేసి కుప్పలపై కవర్లు కప్పి పెట్టినా ధాన్యం తడిసిముద్దయ్యింది. చాలా ప్రాంతాల్లో వర్షపునీటిలో మక్క కొట్టుకుపోయింది.
ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బిజినేపల్లి మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. బకెట్లు, బిందెలతో గంటల తరబడి స్థానికులు తోడేశారు. అక్కడక్కడ కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యంపై రైతులు కవర్లను కప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. భూత్పూర్, మూసాపేట, అడ్డాకుల మండలాల్లో రైతు కష్టం వరద పాలైంది. సకాలంలో కొనుగోళ్లు జరగకపోవడంతో ధాన్యం నీటిలో మునిగింది. కళ్ల ముందే ధాన్యం తడిచి వర్షపు నీటిలో కొట్టుకుపోతుంటే రైతులు ఆందోళన చెందారు.

సీఎం ఇలాకా.. కోస్గి మండలంలో వాన దంచికొట్టింది. మండలంలోని చెన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం జలమయమైంది. అకాల వర్షం కురవడంతో అర్ధరాత్రి సమయంలో అన్నదాతలు తేరుకునేలోపే ధాన్యం నీటి పాలైంది. విషయం తెలుసుకొన్న అధికారులు బుధవారం చేరుకొని పరిశీలించి జేసీబీ సాయంతో నీటిని తొలగించారు. అయితే సకాలంలో కొనుగోలు జరిపి, గన్నీ బ్యాగులు అందించి ఉంటే తమకు ఈ దౌర్భాగ్యం వచ్చి ఉండేది కాదని పలువురు రైతులు వాపోయారు. రాత్రంతా ధాన్యం తడుస్తుంటే ఎక్కడికి పోయారంటూ అధికారులు వారిని నిలదీశారు. పలు ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి.