వికారాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లాలో పట్టుబడిన డీఏపీ నకిలీదేనని వ్యవసాయ అధికారులు తేల్చారు. పూడూర్, పరిగి, బంట్వారం, యాలాల మండలాల్లో నకిలీ డీఏపీ పట్టుబడగా పరీక్షల నిమిత్తం పోలీసులు ల్యాబ్కు పంపారు. యాలాల, పరిగి మండలాలకు సంబంధించిన రిపోర్టులో నకిలీ డీఏపీ అని తేలింది. మిగతా రెండు మండలాలకు సంబంధించిన రిపోర్టు రావాల్సి ఉన్నది. బంకమట్టి గుళికలపై నత్రజని, భాస్వరం పూతతో ఈ నకిలీ డీఏపీని తయారు చేసినట్టు గుర్తించారు.
నకిలీ డీఏపీ వ్యవహారంలో జిల్లా పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ డీఏపీని స్వాధీనం చేసుకొని పదిహేను రోజులు దాటినా ఇప్పటివరకు కేసులో ముందడుగు పడటం లేదు. కేసు నమోదు చేసిన పోలీసులు కేవలం ఓ డీలర్, ట్రాన్స్పోర్ట్ చేసిన వ్యక్తిని రిమాండ్ చేసి చేతులు దులుపుకొన్నారు. నకిలీ దందా వెనుక అసలు నిందితులు ఎవరున్నారనే దానిపై జిల్లా పోలీసులు దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తున్నది.