ఉస్మాన్ అల్ హాజ్రీ తోసేయడంతో ఫిరోజ్ఖాన్ ఒక్కసారిగా కిందపడ్డారు. ఇరువురి మధ్య గొడవను సద్దుమణిచేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ను సైతం తోసేందుకు ప్రయత్నించగా, మిగతా నేతలు అడ్డుకున్నారు.
హైదరాబాద్, మే 27 (నమస్తేతెలంగాణ): గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీలు ఒకరినొకరు చొక్కాలు పట్టుకొని కొట్టుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల సమావేశం సందర్భంగా ఈ రసాభాస జరిగింది. మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ ముందే చొక్కాలు పట్టుకొని ఫిరోజ్, ఉస్మాన్ ఘర్షణకు దిగారు. అజారుద్దీన్ పక్కన కూర్చునే అంశంలో వివాదం చెలరేగింది. దీంతో ఉస్మాన్ అల్ హాజ్రీ తోసేయడంతో ఫిరోజ్ఖాన్ ఒక్కసారిగా కిందపడ్డారు.
ఇరువురి మధ్య గొడవను సద్దుమణిచేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు హనుమంతరావును సైతం తోసేందుకు ప్రయత్నించగా, మిగతా నేతలు అడ్డుకున్నారు. సమీక్షా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్తో పాటు విప్ అద్దంకి దయాకర్తో పాటు ఇతర నాయకులు ఉన్నారు. ఇరువురు నాయకులను అడ్డుకునేందుకు అక్కడ ఉన్ననేతలందరూ ప్రయత్నించినా.. ఇరు వర్గాల కార్యకర్తల అరుపులు, తోపులాటలతో గాంధీభవన్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో గాంధీభవన్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగారు.
అయినప్పటికీ ఇరువర్గాల కార్యకర్తల అరుపులు, కేకలతో కాంగ్రెస్ పార్టీ నైజం బయటపడింది. తీవ్ర ఘర్షణ నేపథ్యంలో మంత్రి అజహరుద్దీన్ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కాగా, ఈ గొడవను ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ చిన్న విషయమని, హైదరాబాద్లో పార్టీ బలపడుతుందనేదానికి సంకేతమని చెప్పుకొన్నారు. ప్రభుత్వంలో ప్రాధాన్యత కోసం ఇరువురి మధ్య గొడవ జరిగిందని చెప్పారు.
ఇదిలా ఉండగా, గాంధీభవన్లో జరిగిన గొడవపై ఉస్మాన్, ఫిరోజ్ఖాన్లు స్పందించారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవని, మాది కాంగ్రెస్ ఫ్యామిలీ అని, ఫ్యామిలీలో గొడవలు జరుగుతూనే ఉంటాయని కార్వాన్ కాంగ్రెస్ ఇన్చార్జి ఉస్మాన్ అల్ హాజ్రీ చెప్పారు. ఫిరోజ్ఖాన్కు క్షమాపణ చెప్పానని చెప్పారు. నాంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి ఫిరోజ్ఖాన్ మాట్లాడుతూ.. మంత్రి పక్కన కూర్చీలో కూర్చునే విషయంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల గొడవ జరిగిందన్నారు. ఉస్మాన్ అల్ హాజ్రీ తనకు అన్న లాంటీవాడని చెప్పారు.