పోర్టల్లో అందుబాటులో 32 రకాల సేవలు
భూ లావాదేవీలు, సమస్యల కోసం 25 మాడ్యూల్స్
నేటితో ఐదు నెలలు పూర్తి.. నెలకు 75 వేల లావాదేవీలు
‘దేశానికే కాదు, ప్రపంచానికి కూడా తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా మారాలె. ల్యాండ్ రికార్డ్స్ క్లీన్గా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఏది? అని ప్రపంచంలో ఎవరడిగినా.. తెలంగాణ అని అమెరికాలో కూడా చెప్పుకొనే రోజు రావాలె. ఇందులో భాగంగానే ధరణి పోర్టల్ను తీసుకొచ్చినం. ప్రస్తుతానికి కొన్ని లావాదేవీలకే అనుమతి ఉన్నది. రానురాను ఆప్షన్లు పెరుగుతాయి. సమీప భవిష్యత్తులో భూ సమస్యల్లేని తెలంగాణ ఆవిష్కృతం అవుతుంది’.. గతేడాది అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేసిన వ్యాఖ్యలు ఇవి
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ రోజురోజుకూ విస్తృతమవుతున్నది. పోర్టల్ను ప్రారంభించినప్పుడు భూముల అమ్మకాలు, గిఫ్ట్, ఫౌతి, భాగపంపకాల సేవలు మాత్రమే అందుబాటులో ఉండగా.. తర్వాత ఒక్కో మాడ్యూల్ను జతచేస్తూ వచ్చారు. ప్రస్తుతం ధరణి ద్వారా 32 రకాల సేవలు అందుతున్నాయి. ఇందులో భూ లావాదేవీలు, సమస్యల పరిష్కారానికి సంబంధించినవి 25 మాడ్యూల్స్ ఉన్నాయి. మిగతావి సమాచార మాడ్యూల్స్. ధరణిని ప్రారంభించి సోమవారానికి ఐదు నెలలు పూర్తి కావస్తున్నది. ఇప్పటివరకు 3.7 లక్షల లావాదేవీలు జరిగాయి. సగటున నెల కు 75 వేల లావాదేవీలు జరుగుతున్నాయి.
గ్రీవెన్స్ మాడ్యూల్తో సమయం ఆదా
భూ సమస్యలపై దరఖాస్తు చేసుకునే గ్రీవెన్స్ ఆప్షన్ల వల్ల సమస్యలు వేగంగా.. పారదర్శకంగా పూర్తవుతున్నాయి. రైతుల డబ్బు, సమయం ఆదా అవుతున్నది. గతంలో రిజిస్ట్రేషన్ మొదలు మ్యుటేషన్, నాలా కన్వర్షన్కు ఎంతో కొంత ముట్టచెప్పాల్సి వచ్చేది. అదనంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇందుకు వారాలనుంచి నెలలు పట్టే ది. కానీ.. ఇప్పుడు ధరణిలో రిజిస్ట్రేషన్తోపాటే మ్యుటేషన్ పూర్తవుతున్నాయి. పెండింగ్ మ్యుటేషన్లు, నాలాలు సైతం రూపాయి అదనంగా ఖర్చుచేయాల్సిన అవసరం లేకుండా జరుగుతున్నాయి. పెండింగ్ మ్యుటేషన్లకు 1.18 లక్షల దరఖాస్తులురాగా వారాల వ్యవధిలోనే 1.14 లక్షలు పూర్తయ్యాయి. ఆధార్ సంబంధ సమస్యలను 3, 453 పరిష్కరించారు. 19,403 మార్టిగేజ్ దరఖాస్తులకు అప్రూవల్ ఇచ్చారు.
అవగాహన పెంచుకుంటే చాలు
అన్ని రకాల భూ సమస్యలను ధరణిలోని గ్రీవెన్స్ మాడ్యూల్లో ప్రస్తావించారు. చాలా మంది సరైన అవగాహన లేక తప్పు ఆప్షన్ను ఎంచుకొంటున్నారు. కలెక్టర్లు వాటిని తిరస్కరిస్తుండటంతో పోర్టల్పై అపోహలు పెంచుకుంటున్నారు. తమ సమస్య ఏ ఆప్షన్ కిందికి వస్తుందో స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే దరఖాస్తు చేయాలని, తద్వారా వేగంగా పరిష్కారమవుతుందని అధికారులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఓపెన్ స్కూళ్లకూ పాఠ్యపుస్తకాలు
స్వరాష్ట్రంలోనే బీడు భూములకు సాగునీరు