తొలిసారిగా సిద్ధంచేసిన విద్యాశాఖ
త్వరలోనే విద్యార్థులకు పంపిణీ
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): 11 ఏండ్ల కల సాకారమైంది. ఓపెన్ స్కూళ్లకు పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటిని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించనున్నారు. తెలంగాణలో ఓపెన్ స్కూల్ విధానంలో ఏటా పదో తరగతి, ఇంటర్లో దాదాపు 60 వేలమంది ప్రవేశం పొందుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈ సంఖ్య ఈ ఏడాది 63 వేలకు పెరిగింది. పదో తరగతికి 909, ఇంటర్ విద్యార్థుల కోసం 935 చొప్పున ఓపెన్ స్కూల్ స్టడీసెంటర్లు ఉన్నాయి. వీరికి ఇప్పటివరకు ప్రశ్నలు, జవాబులతోకూడిన స్టడీ మెటీరియల్ మాత్రమే అందుబాటు లో ఉండేది. ఇక్కడ చదివినవారికి ఆయా పాఠ్యాంశాలపై సమగ్ర అవగాహన కొరవడి, పోటీ పరీక్షల్లో వెనుకబడుతున్నారనే అభిప్రాయం నెలకొంది. దీన్ని అధిగమించే లక్ష్యంతో 11 ఏండ్లుగా పాఠ్యపుస్తకా ల రూపకల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నా.. కార్యరూపం దాల్చలేదు. విద్యాశాఖ అధికారులు ఎన్సీఈఆర్టీ కరిక్యులం ప్రకారం పాఠ్యపుస్తకాల తయారీ బాధ్యతను ఎస్సీఈఆర్టీకి అప్పగించారు. కేంద్ర నూతన విద్యావిధానం మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను సిద్ధంచేశారు.
ఆన్లైన్ క్లాసులు ప్రారంభం
ఓపెన్ స్కూల్ విద్యార్థుల కోసం ఆదివారాలు కాంటాక్ట్ క్లాసులు నిర్వహించేవారు. ఏడాదిలో 30 కాంటాక్ట్ క్లాస్లు నిర్వహిస్తే.. విద్యార్థులు కనీసం 24 క్లాసులకు హాజరుకావాల్సి ఉంటుంది. కరోనాతో ప్రత్యక్షంగా కాంటాక్ట్ క్లాసులు నిర్వహించే అవకాశం లేక రెగ్యులర్ విద్యార్థులకు మాదిరిగానే వీరికి ఆన్లైన్ క్లాసులను ప్రారంభించారు. ‘తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ’ పేరుతో యూట్యూబ్ చానల్ను తీసుకొచ్చారు. ఆదివారం తొలిసారి నిర్వహించిన ఆన్లైన్ క్లాసులకు 36 వేల మంది హాజరైనట్టు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
స్వరాష్ట్రంలోనే బీడు భూములకు సాగునీరు
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్