పంటకు దేశంలో మంచి డిమాండ్.. ఉజ్వల భవిష్యత్తు
పంట మార్పిడితో సుస్థిర ఆదాయం: నిరంజన్రెడ్డి
ఆయిల్పామ్తో రైతుకు భరోసా: హరీశ్రావు
సిద్దిపేట, మార్చి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆయిల్పామ్ సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ పంట సాగుతో రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని తెలిపారు. ఉద్యాన శాఖ, ఆయిల్ ఫెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేటలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అధ్యక్షతన ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలకు ప్రాధాన్యమిస్తున్న తరుణంలో పంటల మార్పిడి ద్వారా రైతులు సుస్థిర ఆదాయం పొందేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగవుతుందని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల ఎకరాల్లో మాత్రమే సాగవుతుందని చెప్పారు. దేశంలోని 130 కోట్ల జనాభాకు 21 లక్షల టన్నుల నూనె అవసరం ఉండగా దేశీయంగా 8 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుందన్నారు. ఇంకా 13 లక్షల టన్నుల నూనె లోటును రూ.90 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ఈ లోటును భర్తీ చేయాలంటే రైతులు పామాయిల్ తోటలు వేసుకొని లాభాలు ఆర్జించవచ్చని సూచించారు. ఈ పంటను ఎవరైనా కొంటారో లేదో అని అనుమానించాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని, వచ్చే నాలుగేండ్లలో ఈ లక్ష్యం సాధించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేస్తే మరో పది లక్షల ఎకరాల్లో పంట సాగుకు కేంద్రం ఆమోదం తెలుపుతుందన్నారు.
వరి సాగును తగ్గించండి..
రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా ఉన్నదని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టులు పూర్తయి నీరు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో వరి సాగు మరింత పెరిగే అవకాశం ఉన్నదన్నారు. ఇదే జరిగితే వరి కారణంగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నదని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేసి స్థిరమైన ఆదాయం పొందాలని సూచించారు. సిద్దిపేట జిల్లా నుంచి కనీసం 1,500 మంది రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆయిల్పామ్ పంటను పరిశీలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు.
రైతులకు ఆర్థిక భరోసా: హరీశ్రావు
ప్రస్తుతం తెలంగాణలో ఆయిల్పామ్ సాగు రైతులకు లాభసాటిగా ఉన్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. పామాయిల్ సాగుకు ప్రభుత్వం అనేక సబ్సిడీలు అందిస్తున్నదని తెలిపారు. మొక్కలు, ఎరువులు, డ్రిప్లపై రాయితీలను ప్రభుత్వం అందిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. వరిని తగ్గించి ఆయిల్పామ్ సాగుకు మొగ్గు చూపాలని సూచించారు. ఇందులో వరి, చెరుకు కాకుండా ఏదైనా అంతర పంట వేయవచ్చన్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుత సంవత్సరం 50,585 ఎకరాల్లో ఈ పంట సాగు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో అశ్వారావుపేట, దమ్మపేటలో మాదిరిగా సిద్దిపేట జిల్లాలోని నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ సదస్సులో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, హుస్నాబాద్, మానకొండూరు ఎమ్మెల్యేలు వొడితెల సతీష్కుమార్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రఘోత్తంరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఓపెన్ స్కూళ్లకూ పాఠ్యపుస్తకాలు
స్వరాష్ట్రంలోనే బీడు భూములకు సాగునీరు
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్