ఇప్పపువ్వు, నారిగడ్డ కోసం కొందరి దుశ్చర్య!
ఒక్క నెలలోనే 200 చోట్ల అగ్నికీలలు
స్థానికేతరుల వల్లే నిప్పు ముప్పు: అటవీశాఖ
ప్రత్యేక ప్రతినిధి, మార్చి 28 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూలు జిల్లాలో విశాలమైన ప్రాంతంలో విస్తరించి ఉన్న నల్లమల అడవులు అరుదైన వన్యప్రాణులకు, అత్యంత విలువైన ఔషధ మొక్కలకు నెలవు. ఈ అటవీప్రాంతంలోనే దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఉన్నది. అమ్రాబాద్ పెద్దపులుల అభయారణ్యంగా పిలువబడే ఈ టైగర్ రిజర్వ్ 2.55 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నది. దాదాపు 2,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రాంతం దాదాపు 20 పెద్దపులులకు స్థావరంగా నిలిచింది. క్రూరమృగాలు, సాధు జంతువులు, అరుదైన వన్యప్రాణులకు నెలవుగా ఉన్న నల్లమ ల అటవీ ప్రాంతంలో అగ్గి రాజుకుంటున్నది. గత నెలరోజులుగా అచ్చంపేట, మన్ననూర్ రేంజ్లలో 200 చోట్ల మంటలు చెలరేగాయి. విలువైన అటవీ సంపద బుగ్గిపాలైంది. అటవీశాఖ ఫైర్ఫైటర్స్ ఒకచోట మం టలు ఆర్పితే మరోచోట మంట అంటుకుంటున్నది. వేసవికాలంలో అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరుగడం సహజం. అవీ ఎక్కడో ఒకచోట మాత్రమే. కానీ, వరుస ప్రమాదాలపై అటవీశాఖ అధికారులు ఆం దోళన వ్యక్తంచేస్తున్నారు. మానవ తప్పిదాల వల్లనే అగ్గి రాజుకుంటున్నదని చెప్తున్నారు. పశువుల కాపరులు, ఇప్పపువ్వు, నన్నారిగడ్డ సేకరణ కోసం అడవుల్లో గడ్డి, ఎండుటాకులకు అగ్గిరాజేస్తున్నారు. అటవీ ప్రాంతం నుంచి వెళ్లే పర్యాటకులు, స్థానికులు వంటలు వండి నిప్పు ఆర్పకపోవడం వల్లకూడా తరుచూ మంటలు రగులుకుంటున్నాయి. కానీ, నెలరోజులుగా నల్లమలలో అసాధారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
నట్టడవిలో ఫైర్ క్యాంప్లు
వేసవిలో ఇప్ప చెట్లకు మహువా పువ్వులను తెంపడం, నరిగడ్డ అనే ఔషధ దుంపలను సేకరణకు మన్ననూరు, అచ్చంపేట, అమ్రాబాద్ డివిజన్ల చెంచులు, గిరిజనులు అడవుల్లోకి వెళ్తుతుంటారు. వీరికి అటవీశాఖ అధికారులు సహకారమందిస్తుంటారు. వాటిని సేకరించడానికి నిర్ధిష్టమైన ప్రాంతంలో గడ్డి, ఆకులకు నిప్పు పెడుతారు. కొద్దిసేపటి తర్వాత అటవీ సిబ్బంది దానిని ఆర్పివేస్తారు. కానీ చెంచులు, గిరిజనులు కాకుం డా స్థానికేతరులు పెద్దసంఖ్యలో అడవి మధ్యలోకి వచ్చి రాత్రిపూట క్యాంపులను ఏర్పాటు చేసుకుంటున్నారు. పులులు, ఎలుగుబంట్లు రాకుండా గ్రౌండ్ఫైర్ ను రాజేస్తున్నారు. అది క్షణాల్లోనే కార్చిచ్చుగా మారుతున్నది. ప్రధానంగా ఇక్కడ లభించే ఔషధ గుణం కలిగిన నన్నారిగడ్డ (ఎకలాపి అమిల్టోనీ)కు బహిరంగమార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండటంతో దాని సేకరణ కోసం మన్ననూరు, అమ్రాబాద్, దోమలపెంటలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో దొంగతనంగా క్యాం పులు ఏర్పాటుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మన్ననూరు వెస్ట్ డివిజన్ వద్ద క్యాంపు ఏర్పాటుచేసుకుని మంటలు పెడుతున్నవారికి, అటవీశాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి మధ్య శనివారం రాత్రి ఘర్షణ జరిగింది. త ర్వాత మన్ననూరుకు చెందిన కొందరు అటవీ అధికారులు, సిబ్బందిపై దాడిచేయడం వాహనాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
స్థానికేతరులతోనే సమస్య
స్థానికంగా ఉండే చెంచులు, గిరిజనులతో సమస్య లేదు. నల్లమలలో అడవుల రక్షణకు ప్రత్యేక బృందాలు, టైగర్ ట్రాకర్లు, ఫైర్ ఫైటర్లుగా పనిచేసే వారంతా చెంచులే. ఇతర ప్రాంతాల నుంచి అడవిలోకి వచ్చి మంటలు పెడుతున్న వారితోనే సమస్య జటిలమవుతున్నది. వారే క్యాంపులు ఏర్పాటుచేసుకుని కార్చిచ్చుకు కారణమవుతున్నారు.
జీ కృష్ణాగౌడ్, జిల్లా అటవీ అధికారి, నాగర్ కర్నూలు
ప్రజలు సహకరించాలి
నరిగడ్డలు, ఇప్పపువ్వులను సేకరించడంలో విచక్షణారహితంగా వ్యవహరించడంవల్లే విలువైన అటవీ సంపద బుగ్గిపాలవుతున్నది. ఎక్కడినుంచో వచ్చినవారు మన్ననూరు నట్టనడవిలో క్యాంపులు వేయడం వల్లనే మంటలు చెలరేగుతున్నాయి. అత్యంత అరుదైన, విలువైన అడవులను కాపాడటానికి ప్రజలు సహకరించాలి.
చిర్ర రామాంజనేయులు, మన్ననూరు సెక్షన్ ఆఫీసర్
ఇవి కూడా చదవండి..
ఓపెన్ స్కూళ్లకూ పాఠ్యపుస్తకాలు
స్వరాష్ట్రంలోనే బీడు భూములకు సాగునీరు
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్