రాష్ట్రంలో పెద్దఎత్తున వైకుంఠధామాలు
అంత్యక్రియలకు హాజరయ్యేవారికి స్నానపు గదులు, ఇతర వసతులు
1,554 కోట్ల ఖర్చుతో నిర్మాణాలు
8,644 వైకుంఠధామాలు పూర్తి
ఏప్రిల్లోగా నిర్మాణాల పూర్తే లక్ష్యం
ఒకప్పుడు.. ఇంట్లో ఎవరైనా చనిపోతే.. ముందు చెట్ల దగ్గరో, పుట్టల మధ్యనో.. వాగువంకల నడుమనో జాగలు వెతుక్కునే రోజులు! అక్కడ కూడా వేరే కులపోళ్లు అభ్యంతరం పెడితే.. మళ్లీ వెతుకులాట! ‘అయ్యో.. చచ్చాక కూడా మంచిగ సావు చెయ్యకపోతిమే’ అని కుటుంబసభ్యులు కుంగిపోతూ కన్నీరుపెట్టే దుస్థితి! దహన సంస్కారాలు చేసిన చోట నీటి సదుపాయం లేక.. అంత్యక్రియలకు హాజరైనవారు పడే ఇబ్బందులు సరేసరి! రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆఖరి మజిలీ గౌరవప్రదంగా ఉంటున్నది. మనిషి ఆఖరి మజిలీని ఆత్మీయంగా నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మిస్తున్నది. ఒకేసారి భారీ సంఖ్యలో వైకుంఠధామాలు నిర్మిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
మంజూరైన వైకుంఠధామాలు 12,750
అంచనా వ్యయం 1,554 కోట్లు
ఒక్కో వైకుంఠధామానికి 12.60 లక్షలు
ఇప్పటివరకు చేసిన ఖర్చు: 845 కోట్లు
స్థలాల ఎంపిక పూర్తయినవి: 12,744
పనులు ప్రారంభమైనవి: 12,699
నిర్మాణాలు పూర్తయినవి8,644
వినియోగంలోకి వచ్చినవి 6,317
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): చనిపోతే మృతదేహాల అంత్యక్రియలకు దేశంలోని వేల గ్రామాల్లో సరైన వసతులు లేవు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు సంవత్సరానికి లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నా అంతిమ సంస్కారాలు నిర్వహించే శ్మశానవాటికలపై పెద్దగా దృష్టిపెట్టింది లేదు. ఎవరి భూముల్లో వారు దహన సంస్కారాలు కానిచ్చేస్తున్నారు. భూములు లేనివారు వాగులు, చెరువుల పక్కన అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ వర్షాలు వచ్చే పరిస్థితుల్లో దహన సంస్కారాలు సగమే పూర్తయ్యేవి. దహన సంస్కారాలు పూర్తయినా.. బూడిద, అస్థికలు వరదల్లో కొట్టుకుపోయి.. కుటుంబ సభ్యులకు వేదనే మిగిలేది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో అన్నిరకాల వసతులతో వైకుంఠధామాలను నిర్మిస్తున్నది. జీవించినంత కాలం గౌరవంగా బతికిన మనిషి చివరి మజిలీని ప్రశాంతంగా, గౌరవప్రదంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నది. ఇప్పటివరకు కొన్నిచోట్ల కొన్ని కులాలవారికి మాత్రమే శ్మశానవాటికలు ఉండేవి. అక్కడ ఇతర కులాలవారు చనిపోయిన తమ ఆత్మీయుల దహన సంస్కారాలు నిర్వహించుకునే అవకాశం లేకుండేది. దహన సంస్కారాలపై అనేక గ్రామాల్లో వివాదాలు నడిచేవి. కొన్ని గ్రామాల్లో గొడవలు జరిగిన సందర్భాలు అనేకం. ఇలా మనిషి చివరి క్రియలు చేసుకోవడానికి సైతం గ్రామాల్లో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వీటి పరిష్కారానికి హైదరాబాద్లో మహాప్రస్థానం ఉన్నట్టు.. అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
మిషన్ భగీరథ కనెక్షన్.. లేదంటే బోరు
వైకుంఠధామాలన్నింటికి నీటి సౌకర్యం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. మిషన్ భగీరథ ద్వారా నీటి కనెక్షన్ ఇవ్వాలని స్పష్టంచేసింది. కొన్ని వైకుంఠధామాలు గ్రామాలకు దూరంగా ఉండటం.. అక్కడివరకు భగీరథ పైపులైన్ లేని ప్రాం తాల్లో బోర్లు వేసుకోవడానికి అనుమతిచ్చింది. ఈ విషయాన్ని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇటీవల అసెంబ్లీలో వెల్లడించారు. నిర్మాణాలను ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. నిర్మాణాలను ఏప్రిల్ చివ రి నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 12,750 వైకుంఠధామాలను మంజూరుచేశారు. 8,644 గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయ్యా యి. సంగారెడ్డి జిల్లాలో మంజూరుచేసిన మొత్తం నిర్మాణాలను పూర్తికాగా, అన్నింటిని వినియోగంలోకి తీసుకొచ్చారు. నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 98% నిర్మాణాలు పూర్తయ్యాయి. సూర్యాపేట, వరంగల్ రూరల్, మహబూబ్నగర్, పెద్దపల్లి, నల్లగొండ, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో మాత్రం ఇంకా 50 శాతం లోపే నిర్మాణాలు పూర్తయ్యాయి.
అన్ని వసతులతో నిర్మాణాలు
వైకుంఠధామాల నిర్మాణాలను అన్ని వసతులతో ప్రశాంతంగా, శుభ్రంగా, పచ్చదనంతో ఉండేలా చేపట్టారు. ప్రహరీ గోడలు, పార్కింగ్ సౌకర్యం, స్నానాల చేసేందుకు వీలుగా వసతులు కల్పించారు. వెయిటింగ్ హాల్, అస్థికలు నిల్వ చేసుకోవడానికి బాక్స్లు ఏర్పాటుచేశారు. కొన్ని గ్రామాల్లో ఒకేసారి ఇద్దరిని దహనం చేసేలా రెండు దహన వాటికలను నిర్మించారు. ప్రభుత్వ నిధులే కాకుండా గ్రామస్థులు అనేకమంది స్వచ్ఛందంగా సాయం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఫ్రీజర్లను, శవాలను తీసుకుపోవడానికి ప్రత్యేక వాహనాలను సమకూర్చారు.
వైకుంఠధామాల నిర్మాణాల పురోగతి
బేస్మెంట్ లెవల్ రూఫ్ లెవల్ పూర్తయినవి
ఉన్నవి ఉన్నవి
బర్నింగ్ ప్లాట్ ఫాంలు 901 2,286 9,332
వెయిటింగ్ రూంలు 806 2,457 9,246
మూత్రశాలలు 1,188 2,323 8,863
ఇవి కూడా చదవండి..
ఓపెన్ స్కూళ్లకూ పాఠ్యపుస్తకాలు
స్వరాష్ట్రంలోనే బీడు భూములకు సాగునీరు
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్