రాష్ట్రంలో 42 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
మండుతున్న ఎండలతో ప్రజలు బెంబేలు
మధ్యాహ్నంవేళ రోడ్లపై పలుచగా జనసంచారం
జాగ్రత్తలు పాటించాలని నిపుణుల సూచన
వాతావరణ వివరాలకు టీఎస్-వెదర్ యాప్
హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. తెలతెలవారుతూనే అరికాలు మంటెక్కిస్తున్నాడు. రాష్ట్రంలో అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎండకుతోడు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. మధ్యాహ్నంవేళ బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దాంతో హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో రోడ్లపై జనం పలుచగా కనిపిస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీ సెంటిగ్రేడ్ దాడే అవకాశముందని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (టీఎస్డీపీఎస్) అంచనా వేసింది. ఆదివారం రాష్ట్రంలో 42 డిగ్రీల గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొద్దిరోజులు ఎండలు ఇలాగే కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లా నస్పూర్లో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లోని నారాయణగూడలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. 14 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉష్ణోగ్రతల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు టీఎస్డీపీఎస్ ఆధ్వర్యంలో 589 మండలాల్లో 1,044 ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్లు ఏర్పాటుచేశారు. ఈ స్టేషన్లు గంటకోసారి ఉష్ణోగ్రతల వివరాలను తెలియజేస్తున్నాయి. టీఎస్డీపీఎస్ ద్వారా గ్రామస్థాయి వరకు వాతావరణ వివరాలను తెలిపేందుకు ప్రభుత్వం (ts- weather) మొబైల్ యాప్ను రూపొందించింది. ఈ యాప్ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొంటే ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలు తెలుసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, హైదరాబాద్లోని ప్రముఖ ప్రాంతాల్లో వాతావరణ వివరాలు తెలిపేందుకు ఎల్ఈడీ తెరలను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. విపత్తుల నిర్వహణశాఖ ‘హీట్వేవ్ యాక్షన్ ప్లాన్-2021’ను ఇప్పటికే విడుదల చేసింది. రాష్ట్రస్థాయి మానిటరింగ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. పగటిపూట తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది.
ఇవి కూడా చదవండి..
ఓపెన్ స్కూళ్లకూ పాఠ్యపుస్తకాలు
స్వరాష్ట్రంలోనే బీడు భూములకు సాగునీరు
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్