మంచిర్యాల, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ర్టాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ గొప్పులు చెప్పుకొన్నది. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది. కానీ.. ప్రభుత్వం ఏర్పడి 32 నెలలు పూర్తి కావస్తున్నా నిరుద్యోగుల విషయాన్ని పూర్తిగా విస్మరించింది. ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ సర్కార్ హయాంలో భర్తీ చేసినవే తప్ప, కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఇచ్చిన ఉద్యోగాలు ఏం లేవు. నోటిఫికేషన్ ఇచ్చింది.. పరీక్షలు పెట్టింది.. ఫలితాలు వెల్లడించింది కేసీఆర్ సర్కారైతే.. కేవలం అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి ఆ ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకుంటున్నది కాంగ్రెస్.
ఇది నిరుద్యోగ యువతలో తీవ్రమైన అసంతృప్తికి దారి తీస్తున్నది. మొన్నటికి మొన్న నిరుద్యోగులు హైదరాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులో నిరుద్యోగులు సర్కార్పై మండిపడ్డారు. రేవంత్రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిరుద్యోగులు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్న సమయంలోనే ఇంజినీర్లు క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో నిరుద్యోగులు రగిలిపోతున్నారు.
వచ్చేది మూడో సెప్టెంబర్.. ఏదీ జ్యాబ్ క్యాలెండర్..
ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలు ఏవీ నిలబెట్టుకోవడం లేదు. యేటా జూన్ 2వ తేదీ నాటికి అన్ని శాఖల ఖాళీలతో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. సెప్టెంబర్ 17 నాటికి నియామకాలు పూర్తి చేస్తామంటూ రేవంత్ సర్కార్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక వచ్చే నెలలో మూడో సెప్టెంబర్ 17 కూడా వస్తున్నది. పోయిన రెండేళ్లలో ఎలాగూ లేదు. కనీసం ఈ ఏడాదైనా ఉద్యోగాల ప్రకటన ఉంటుందనుకుంటే అతీగతీ లేదు. కేవలం పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అది తప్ప సర్కార్లోని ఇతర శాఖల్లో ఇప్పటి ఏ శాఖ నుంచి ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్న స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు. మరీ జాబ్ క్యాలెండర్ ఏమైనట్లు? ఉద్యోగాలు ఎప్పుడు చేస్తున్నట్లు? అని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2024 చివరి నాటికి 9 వేల మంది ఉద్యోగ విరమణ పొందగా.. 2025 ఆర్థిక సంవత్సరం చివరికి మరో 9 వేల మంది రిటైర్డ్ అయినట్లు అంచనా. ఈ లెక్కన ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల ఉద్యోగాలు ఖాళీ ఉండొచ్చని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. ఇవన్నీ వెంటనే భర్తీ చేయాల్సిన పోస్టులైనప్పటికీ నియామక ప్రక్రియ చేపట్టడంలో సర్కార్ ఘోరంగా విఫలం అవుతుందంటున్నారు. పైగా ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిస్ట్ 2028 తర్వాత ఇస్తామంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తున్నది. దీనిపై ఉద్యోగుల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. ఎలాగూ తాము ఇవ్వలేమని.. మరోసారి గెలవలేమని తెలిసే వచ్చే సర్కార్పై భారం మోపేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కావాలనే ఉద్దేశపూర్వంగా వాయిదా వేస్తుందనే చర్చ ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్నది.
రూ.4 వేల నిరుద్యోగ భృతికి ఎగనామం
ఉద్యోగాల భర్తీతోపాటు, నిరుద్యోగులకు రూ.4 వేల భృతి అందిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ ప్రక్రియను ప్రారంభించలేదు. ఏ ఆధారంతో, అర్హులను ఎలా గుర్తిస్తారు.. పథకాన్ని ఎలా అమలు చేస్తారన్న స్పష్టత లేదు. దీంతో ఉద్యోగాల భర్తీతోపాటు నిరుద్యోగ భృతి మరుగున పడిపోయింది. విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు, రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాల భరోసా ఇవన్నీ ఓటు వేసే ముందు వినిపించిన వాగ్ధానాలుగా మిగిలి పోయాయి. ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ఉచిత వైఫై, యూనివర్సిటీల రీసెర్చ్ స్కాలర్స్కు నెలకు రూ.10 వేల ఫెలోషిప్ హామీలు ప్రయోగ దశలోనే ఉన్నాయి.
విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీ గౌరవ వేతనం రూ.50 వేలకు పెంచుతామని చెప్పిన మాటలు అమలులోకి రాలేదు. తొలిసారి రుసుం చెల్లించి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేరు నమోదు చేస్తే, ఆ ఏడాదిలో మిగతా నోటిఫికేషన్లకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదన్న హామీ కూడా అమలులోకి రాలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాల ప్రక్రియ అంత వేగంగా సాగడం లేదు. ఇవేవీ చేయకపోగా ప్రభుత్వం ఉల్టా నిరుద్యోగులనే బదనం చేస్తున్నది. బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు పుణ్యంతోనే పోలీస్ ఉద్యోగాల భర్తీకి ముందుకు వచ్చిందే తప్ప, సర్కార్కు అసలు ఉద్యోగాలు భర్తీ చేసే ఆలోచనే లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు పొందడంలో ఆలస్యం, క్యాడర్ స్ట్రెంత్ విభజనపై స్పష్టత లేకపోవడం, విభాగాల పునర్వ్యస్థీకరణ జరగకపోవడం వంటి కారణాలతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది.