కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు భయాందోళనల మధ్య కాలం వెల్లదీస్తున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలు కాలానుగుణంగా మరమ్మతులు లేకపోవడంతో పైకప్పుల నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. వర్షాలు కురిసిన ప్రతిసారీ గదులు ఊరుస్తుండటంతో విద్యార్థులు రాత్రి వేళలో నిద్రపోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 12 వసతి గృహాలు ఉండగా, వాటిలో నాలుగు కళాశాల విద్యార్థులకు, ఎనిమిది పాఠశాల విద్యార్థులకు సంబంధించినవి. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగినా. అందుకు అణుగుణంగా వసతులు పెంచకపోవడంతో నివాస గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు తీవ్రంగా కొరతగా మారాయి. కాగజ్నగర్లోని ఎస్సీ వసతి గృహంలో 70 మంది విద్యార్థులకు కేవలం రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉండగా, ఆర్వో ప్లాంటు కూడా పని చేయడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. వాంకిడిలోని బీసీ వసతిగృహ విద్యార్థులను కూడా ఎస్సీ వసతి గృహంలో ఉంచడంతో రద్దీ మరింత పెరిగింది. విద్యార్థుల సంఖ్యకు తగిన వసతులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా పుస్తకాలు, ఇతర సామగ్రి అందలేని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థులకు ఇబ్బందులు
అధికారుల నిర్లక్ష్యంతోనే జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల పరిస్థితి దారుణంగా మారింది. వసతిగృహాలపై పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. శాఖకు సంబంధం లేని ఇండస్ట్రీయల్ అధికారిని ఇన్చార్జిగా నియమించడంతో నిర్వహణ గాడి తప్పింది. విద్యార్థులకు అందించాల్సిన మెనూను అధికారులు ప్రకటించకపోవడంతో పాటు, అమలు కూడా కావడం లేదు. దాదాపు 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఎస్సీ వసతిగృహాల్లో కనీస మౌలిక వసతులు కూడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతిగృహాల సమస్యలపై ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించాలి. శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో కొత్త వసతిగృహాలు నిర్మించడంతో పాటు, నిర్వహణపై అవగాహన ఉన్న సమర్థవంతమైన అధికారిని నియమించాలి.
-దుర్గం దినకర్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి