న్యూఢిల్లీ, జూన్ 19: పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించే ఒప్పందం కోసం అమెరికా, ఇరాన్ మధ్య శుక్రవారం జరగవలసిన చర్చలు రద్దయ్యాయి. చర్చలు జరగడం లేదని స్విట్జర్లాండ్ వెల్లడించింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన స్విస్ పర్యటనను రద్దు చేసుకోవడంతో శాశ్వత కాల్పుల విరమణపై అనిశ్చితి మరింత పెరిగింది. ఈ చర్చలకు సంబంధించిన కార్యకలాపాలు ఎప్పడూ సజావుగా, ఊహించిన విధంగా లేవని వైట్ హౌస్ ప్రతినిధి గురువారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రణాళికలు ఖరారైన వెంటనే స్విట్జర్లాండ్కు బయల్దేరడానికి వాన్స్, అమెరికా ప్రతినిధి బృందం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. బర్జెన్స్టాక్ మౌంటెన్టాప్ రిసార్టులో జరగాల్సిన చర్చలు జరగడం లేదని స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రిత్వశాఖ ధృవీకరించింది. అయితే వివరాలను తెలియచేయలేదు. బుధవారం 14 అంశాలతో కూడిన ఒప్పందంపై అమెరికా, ఇరాన్ సంతకాలు చేసిన అనంతరం శుక్రవారం ప్రారంభం కావలసిన సాంకేతిక చర్చలకు తాము సిద్ధమని ఇదివరకు ప్రకటించిన ఇరాన్ ప్రస్తుత పరిణామాలపై ఇప్పటివరకు స్పందించలేదు.
ఇజ్రాయెల్, హెజ్బొల్లా అంగీకారం లెబనాన్లో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హెజ్బొల్లా శుక్రవారం అంగీకరించాయి. పశ్చిమాసియా అంతటా శాశ్వత శాంతి ఒప్పందాన్ని సాధించేందుకు ఉద్దేశించిన విస్తృత దౌత్యపరమైన ప్రయత్నాలను దెబ్బతీసే ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. గురువారం రాత్రి లెబనాన్పై ఇజ్రాయెల్ సైనిక దళాలు భీకర దాడులు జరపగా డజన్ల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. హెజ్బొల్లా జరిపిన దాడుల్లో తమ సైనికులు కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన దరిమిలా ఈ ఘర్షణలు పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తాయన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. కాగా లెబనాన్లో స్థానిక కాలమానం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు(13.00 జీఎంటీ) కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇరాన్ సహకారంతో అమెరికా, ఖతార్కు చెందిన సంధానకర్తలు ఈ ఒప్పందాన్ని కుదిర్చారని ఆయన చెప్పారు. కాల్పుల విరమణకు రెండు దేశాలు ఒప్పుకున్నాయని ఆయన తెలిపారు.
ఇరాన్ పనైపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా నుంచి ఇరాన్కు చిల్లిగవ్వ రాదని కూడా ఆయన హెచ్చరించారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయిందని, వైమానిక దళం, నావికాదళం, ముఖ్యమైన రక్షణ వ్యవస్థలు ఏవీ ఇరాన్కు మిగలలేదని ఆయన చెప్పారు. తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో గురువారం ట్వీట్ చేసిన వరుస పోస్టుల్లో తన రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను ట్రంప్ కొట్టివేశారు. ఇరాన్ సైనిక బలాన్ని ఈ యుద్ధం నాటకీయంగా క్షీణింపచేసిందని ఆయన వాదించారు. యుద్ధం ఇరాన్ను బలహీనపరిచింది. దానికి ఇకపై వైమానిక దళం, నౌకాదళం, విమాన విధ్వంసక పరికరాలు, రాడార్ లేదా ఏ ఇతర ముఖ్యమైన సామగ్రి కూడా లేవు అని ట్రంప్ పేర్కొన్నారు. నాలుగు నెలల ముందు కన్నా ఇరాన్ ఇప్పుడు మరింత బలంగా ఉందన్న డెమోక్రాట్ల వాదనను ఆయన ఎద్దేవా చేశారు.