న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు గురువారం తెరపడింది. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల కాల్పులు, అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విరసనలు వెల్లువెత్తడంతో వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ఎలాంటి చర్చ లేకుండానే పలు కీలక బిల్లుల ఆమోదం పొందగా సమావేశాల ప్రారంభం నుంచి సభలో కనిపించని ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా చివరి రోజు లోక్సభలో ప్రత్యక్షమయ్యారు.
గురువారం ఉభయ సభలు సమావేశం కాగానే వందేమాతరంలోని ఆరు చరణాలు వినిపించారు. పార్లమెంట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. సమావేశాల కాలంలో సభ పనితీరు ప్రస్తావిస్తూ ఇచ్చే సాధారణ ముగింపు ప్రసంగాన్ని బిర్లా చదివి వినిపించలేదు.
చర్చలో పాల్గొనాలని బిర్లా విపక్ష సభ్యులను పదేపదే కోరినప్పటికీ ప్రతిపక్షం తమ నిరసనలను కొనసాగించడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. గురువారం కూడా ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జూలై 20న ప్రారంభమైన ఈ సమావేశాల్లో నీట్ పశ్న పత్రం లీక్ వ్యవహారం, అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల చోరీ ఆరోపణలపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.
రాజ్యసభ ఆమోదించిన రెండు బిల్లులు సహా మొత్తం 12 బిల్లులు ఈసారి సమావేశాల్లో ఆమోదం పొందాయి. దీంట్లో 10 బిల్లులు ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందటం గమనార్హం. రాష్ర్టాల అధికారాలను పరిమితం చేస్తూ గనులు, ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, 2026ను రాజ్యసభ గురువారం ఆమోదించింది.
జార్ఖండ్లో యువతపై పోలీసుల చర్య, అయోధ్యలోని రామ మందిరానికి వచ్చిన విరాళాల చోరీ ఆరోపణలకు సంబంధించిన నిరసనలు, పరస్పర నినాదాల హోరు మధ్య గురువారం మకర్ ద్వార్ వద్ద అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి ఎంపీలు ముఖాముఖి తలపడ్డారు.