Kasi Majili Kathalu Episode 35 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : మణిప్రస్థ నగరాన్ని ఏలే కుంతీభోజుని ఏడో కుమారుడు జయభద్రుడు. వేశ్యా లోలుడై భార్యను నిర్లక్ష్యం చేశాడు. ఫలితంగా దొంగలబారిన పడ్డాడు. అమరావతి యువరాణి హైమవతిని అనుకోని రీతిలో రక్షించాడు. ఆమెను వివాహం చేసుకోవడానికి పంతాలు పట్టిన ధనవర్మను, గుణవర్మను తెలివిగా చంపాడు. అతనికి హైమవతితో వివాహం జరిగిన సమయంలో.. ఒక బ్రాహ్మణుడు ఆసక్తికరమైన విషయం చెప్పాడు.
“నేను చెప్పేది నిజమే మహారాజా! మణిప్రస్థ యువరాజు జయభద్రుడు అచ్చంగా మీ అల్లుడిలాగే ఉంటాడు” అని చెప్పాడు బ్రాహ్మణుడు.
ఆ మాటతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.
“స్వామీ! నేనే జయభద్రుణ్ని. మణిప్రస్థ మహారాజు కుంతీభోజులవారి ఏడో కుమారుణ్ని. సునీతి నా భార్యే. కానీ, నేనామెతో ఎన్నడూ కాపురం చేసింది లేదు. ఆమె ముఖమైనా ఎన్నడూ చూసింది లేదు. అన్నిటినీ మించి ఆరునెలలకు పైబడి నేను మణిప్రస్థంలో లేనే లేను. అలాంటప్పుడు మీరు నన్ను అక్కడ చూడటం సాధ్యం కాదు కదా!” అని జయభద్రుడు ప్రశ్నించాడు.
“లేదు రాకుమారా! నా కన్ను నన్ను మోసం చేయదు. కిందటివారమే సునీతి, జయభద్రుల చేతుల మీదుగా ఈ స్వర్ణకంకణాన్ని దానంగా అందుకున్నాను. చూడండి” అన్నాడు ఆ బ్రాహ్మణుడు.. తన వాదం నిజమేనని నిరూపిస్తూ.
“ఇందులో ఏదో మోసం ఉంది. నేను వెంటనే వెళతాను. దోషులను కనిపెట్టి, తగిన శాస్తి చేస్తాను” శపథం చేశాడు జయభద్రుడు.
“నాథా! ఇంకా కొంగుముడి కూడా వీడకముందే, మీరిలా నన్ను ఒంటరిని చేసి వెళ్లడం బాగాలేదు. నేను కూడా వస్తాను” అన్నది హైమవతి.
“అవును నాయనా! మేమూ వస్తాం. సమాచారం ఇవ్వకుండా ఈ పెళ్లి చేసినందుకు కుంతీభోజుల వారికి క్షమాపణలు చెప్పుకొంటాను” అని పలికాడు మంత్రపాలుడు.
“వద్దు మామగారూ! అక్కడి పరిస్థితినంతా చక్కబరిచిన తరువాత మీకు ఆహ్వానం పంపిస్తాను” అని సర్దిచెప్పాడు జయభద్రుడు.
ఆ మరునాడే హైమవతితో కలిసి, మణిప్రస్థానికి బయల్దేరాడు. రాజవీధిలో జయభద్రుడు, హైమవతితో కలిసి వెళ్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు.
‘చాలాకాలం తరువాత కనిపించినందువల్ల ఆ విధంగా చూస్తున్నారు కావొచ్చు’ అని జయభద్రుడు తలపోశాడు.
‘అతని పక్కన ఉన్న స్త్రీ ఎవరో!?’ అని ప్రజలకు వింత గొలుపుతున్నది.
ఇంతలో ఒకడు రథానికి ఎదురుగా వచ్చి..
“రాకుమారా! నిన్న మీరు ఆనతిచ్చినట్లే రేపటి కార్యక్రమానికి పండితులను తీసుకువచ్చాను. ఇదిగో వీరే!” అని చెప్పాడు.
ఈసారి ఆశ్చర్యపోవడం జయభద్రుడి వంతైంది.
అతనికేదో సర్దిచెప్పి, జయభద్రుడు నేరుగా తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. వారికి నమస్కరించి, హైమవతిని పరిచయం చేయాలని భావించాడు.
అంతలోనే అతని తల్లి..
“ఏమిటిది నాయనా! వేళకాని వేళలో వచ్చావు?! అవతల సునీతి నీకోసం కనిపెట్టుకుని ఉంటుంది. ఏదో వ్రతం చేసుకుంటున్నానని చెప్పింది. త్వరగా వెళ్లు” అన్నది.
“అమ్మా! నువ్వేం అంటున్నావో నాకు తెలియడం లేదు. నేను దేశాలు పట్టిపోయి దాదాపు ఆరునెలలు గడిచిపోయాయి. మళ్లీ ఇంతకాలానికి కొడుకును చూసిన ఆనందమేమీ నీలో కనిపించదేమిటి? నీ దీవెనల కోసం కొత్త కోడలిని తీసుకువచ్చాను. చూడు..” అని చెప్పాడు.
ఆ మాటలతో అక్కడి వారందరికీ మతులు పోయాయి.
“నువ్వెప్పుడూ మా కళ్లముందే ఉన్నావు. రోజూ మాతో మాట్లాడుతూనే ఉన్నావు కదా! ఉన్నట్లుండి ఏమైంది నీకు?! పిచ్చిగానీ ఎత్తలేదు కదా!?” అన్నాడు కుంతీభోజుడు కంగారుపడుతూ.
జయభద్రుని తల్లి బోరుమంటూ విలపించసాగింది.
అప్పుడు హైమవతి ముందుకొచ్చి..
“అత్తగారూ! వీరు చెబుతున్నది నిజమే! ఈ ఆరుమాసాల నుంచి మీ అబ్బాయి నాతోనే ఉన్నారు. మా తల్లిదండ్రుల సమక్షంలో మా వివాహం జరిగింది. కావాలంటే వాళ్లను రప్పించి సాక్ష్యం ఇప్పిస్తాను” అని చెప్పింది.
అంతా అయోమయంగా తయారైంది.
“..అంటే ఎవరో దొంగ నా స్థానంలో ఇన్నాళ్లనుంచి నాటకం ఆడుతున్నాడన్నమాట. ఇప్పుడే వాడి విషయం తేల్చేస్తాను” అంటూ జయభద్రుడు ఒంటరిగా సునీతి మందిరానికి బయల్దేరాడు.
* * *
గుమ్మంలో అడుగు పెట్టేసరికి, పీటలమీద తనను పోలిన మనిషి ఒకడు కూర్చుని ఉన్నాడు. సర్రున కత్తిదూసి ముందడుగు వేయబోయేంతలో.. ఆ మనిషి కూర్చున్న ప్రదేశంలో గాలిపాటుకు మేఘం కదిలిపోగా, శూన్యాకాశం మిగిలినట్లు ఖాళీ ఏర్పడింది. అంతా చిత్రంగా అనిపించింది. జయభద్రుడు ఇంకా ఆశ్చర్యంలోనే ఉండగా సునీతి అతణ్ని సమీపించింది.
“నాథా! సరిగ్గా దానమిచ్చే వేళకు పీటల మీదినుంచి లేచి వచ్చేశారేం?! వ్రతం పూర్తయ్యేవరకూ కొంచెం ఓపిక పట్టండి” అని చెయ్యి పుచ్చుకుని తీసుకుపోయి పీటలమీద కూర్చోబెట్టింది.
జయభద్రుడు యాంత్రికంగా క్రతువు పూర్తిచేశాడు. తాను కళ్లారా చూసింది నిజమో.. కలో!? తెలియక అయోమయ పడుతున్నాడు. ఆ విషయం సునీతిని ఎలా అడగాలో తోచలేదు. ముళ్లమీద కూర్చున్నట్లు కొద్దిసేపు గడిపిన తరువాత, గోడకు కొట్టిన బంతిలా తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చాడు.
“నాయనా! సునీతి మహాపతివ్రత. ఆమెను నేను అనుమానించలేను. నిజం ఏమిటో నిదానంగా కనుక్కో! నోరుజారితే వెనక్కు తీసుకోలేం. జాగ్రత్త” అని చెప్పింది తల్లి.
“నాథా! మీరు అనుమతిస్తే నేను దీన్ని చక్కబరుస్తాను” అన్నది హైమవతి.
“విషయం బయటికి పొక్కకుండా, మన పరువు చెడిపోకుండా నువ్వేం చేస్తావో..” అన్నాడు జయభద్రుడు, తన సందేహాలను, భయాలను సూచిస్తూ.
“మరేమీ పరవాలేదు. మా మంత్రపాలుని కుమార్తె మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. నువ్వు వెళ్లిరా అమ్మా!” అన్నాడు కుంతీభోజుడు.
హైమవతి ఒంటరిగా సునీతి వద్దకు వెళ్లింది. తానెవరో పరిచయం చేసుకుంది. నిమిషమైనా తన కొంగు విడిచిపెట్టని భర్త.. ఇలా ఈ ద్వితీయ వివాహం ఎలా చేసుకున్నాడో తెలియక సునీతి తబ్బిబ్బు పడింది.
“అక్కా! ఇంతకాలం నీ పక్కనున్నది మన భర్త కాదు. నువ్వు తడబాటు పడకుండా, మొదటిసారి ఆయనను కలుసుకున్నది మొదలు ఇప్పటివరకు ఏం జరిగిందో నాకు వివరంగా చెప్పు” అని హైమవతి బుజ్జగించి అడిగింది.
అప్పుడు సునీతి..
“హైమా! మొదట్లో వారు నన్ను నిర్లక్ష్యం చేసిన మాట నిజమే. అప్పుడు నా దాసిని సలహా అడిగాను. ఆమె ఒక పసరు తెచ్చింది. దానిని ప్రయోగిస్తే ఎంతటివారైనా నిమిషంలో వశులైపోతారని చెప్పింది. కానీ, అటువంటి వశీకరణ మూలికలు, పసరుల వల్ల ఒక్కోసారి బుద్ధిమాంద్యం కలగొచ్చు. మనిషి మనకు దక్కకపోగా ఉన్మాది కావచ్చు. అందువల్లే నేనా పసరుని ఒకచోట పారబోశాను. కానీ, ఏ మందూ అవసరం లేకుండానే వారే నా వద్దకు వచ్చారు. నన్ను ఇష్టభోగాలలో తేలియాడేలా చేశారు. నాకు ప్రతిరోజూ ఎంతో విలువైన కానుకలిచ్చేవారు. వాటినే పేదలకు దానం చేసి నేను గొప్ప కీర్తి పొందేదాన్ని. మొదట్లో ఆయన రాత్రి సమయంలో మాత్రమే కనిపించేవారు. ఆ తరువాత ఎల్లవేళలా నా పక్కనే ఉంటుండేవారు. నన్ను విడిచిపెట్టి ఒక్కక్షణం కూడా ఉండేవారు కాదు. అటువంటి వారు మీ రాజ్యం ఎప్పుడు వచ్చారు?! మీ పెళ్లి ఎప్పుడు జరిగింది? నేనిదంతా నమ్మలేకుండా ఉన్నాను” అన్నది.
కొద్దిసేపు వాళ్లిద్దరి మధ్య నిశ్శబ్దం తప్ప మాటలేమీ జరగలేదు. అటుపైన హైమవతి..
“అక్కా! ఇన్నిరోజుల కాపురంలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన సంఘటనలు ఏవో కొన్ని జరిగే ఉంటాయి. కొన్ని గుర్తు చేసుకుని చెప్పగలవా?” అని అడిగింది.
సునీతి చాలాసేపు ఆలోచించింది.
“ఒకనాటి రాత్రి మేమిద్దరం ఏకశయ్యపై నిద్రిస్తున్నాం. ఆవేళ నాకెందుకో నిద్రమధ్యలో మెలకువ వచ్చింది. పక్కకు తిరిగి చూసేసరికి, నా పక్కన వారికి బదులుగా మంచంమీద ఐదు తలల పాము కనిపించింది. నేను కెవ్వున కేకవేసి, కళ్లు మూసుకున్నాను. అంతలోనే వారు నన్ను భుజాలు పట్టుకుని కుదిపేస్తూ కళ్లు తెరిపించారు. వారి ఆకారం ఎప్పటిలా మామూలుగానే ఉంది. ‘ఏమిటిది స్వామీ! నిద్రలో మీ రూపం అలా మారిపోయిందేమిటి?’ అని నేనడిగాను. అందుకాయన.. ‘మనం రోజూ నిద్రలో ఎన్నెన్నో కలలు కంటుంటాం. ఆ కలల మధ్యలో ఉన్నపాటున మెలకువ వస్తే.. కలలో ఉన్నదే ఎదుట కూడా ఉన్నట్లు భ్రమపడతాం. ఇప్పుడు చూడు నేను నేనుగానే కనిపిస్తున్నాను కదా!’ అని నాకు సర్దిచెప్పారు” అని జరిగిన విషయాన్ని చెప్పింది.
“సరే.. ఇంతకీ ఆనాడు నువ్వా పసరు ఎక్కడ పారబోశావో చూపగలవా?” అని అడిగింది హైమవతి.
ఆమె చూపించిన చోట కోటగోడ ఉంది. పరిశీలించి చూడగా గోడకు ఆవలివైపున ఒక పాములపుట్ట ఉంది.
“అక్కా! నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. నువ్వు పారబోసిన పసరు ఎవరో నాగరాజు పడగపై పడి ఉండాలి. ఆయనకు కామరూప విద్య తెలిసి ఉండాలి. కామరూపులైన వారు నిద్రా సమయాల్లో తమ నిజరూపాన్ని దాచుకోలేరు. అందువల్లే నువ్వు ఆవేళ పక్కమీద పామును చూశావు”.. హైమవతి ఇంకా ఏదో చెబుతున్నది.
ఆమె మాటలింకా పూర్తికాకముందే.. పుట్టపైన ఐదుతలల పాము పడగలెత్తి కనిపించింది. ఆ పాము మానవ భాషలో మాట్లాడుతున్నది.
“హైమవతీ! నువ్వు చెప్పిందంతా నిజమే. సునీతీ! నువ్వు పోసిన పసరు నామీద పడినందువల్ల నేను నీకు వశుడినయ్యాను. నువ్వు ఎలా కోరుకుంటే అలా నడుచుకున్నాను. నువ్వు మనసారా నీ భర్తనే కోరుకున్నావు. నేను కూడా నీ భర్తలానే వచ్చాను. నేను దేవతా సర్పాన్ని. ఈ విషయంలో నీ భర్తముందు నిలిచి సాక్ష్యం ఇవ్వలేను. నా గురించి నీకు పూర్తిగా తెలిసిన తరువాత, మళ్లీ ఆ రూపాన్ని ధరించలేను. కానీ, వెళ్లేముందు నీకేదైనా వరమిస్తాను. కోరుకో” అని చెప్పింది.
సునీతికి ఏం కోరుకోవాలో తోచలేదు. ఆమె పక్షాన నాగరాజును హైమవతి ఇలా కోరుకుంది.
“స్వామీ! నువ్వు ఎల్లవేళలా మా సునీతిని రక్షించాలి. ఆమెకు ఏ ఆపదా కలగకుండా చూడాలి”.
నాగరాజు “తథాస్తు!” అని పలికి, పుట్టలోకి దూరిపోయాడు.
సునీతిని భర్త వద్దకు తీసుకు వచ్చింది హైమవతి.
“సాధ్వీమణీ! నిన్ను నిర్లక్ష్యం చేసి వేశ్యాలోలుణ్ని అయ్యాను. అందుకు తగిన శిక్ష అనుభవించాను. నా తప్పులన్నీ మన్నించు. నన్ను స్వీకరించు” అని జయభద్రుడు కోరాడు.
సునీతి కళ్లలో నీటిసుడులు తిరుగుతున్నాయి.
“అయ్యో! నా వల్ల ఎంత దోషం కలిగింది?! పూర్వ జన్మలో ఏవో చెడుకర్మలు చేసినందువల్లే నేనిలా పతితనై ఉంటాను” అని విలపించసాగింది.
హైమవతి, అత్తగారు కూడా సునీతిని ఓదారుస్తున్నారు. జయభద్రుడు ఆమె సమీపానికి వచ్చి..
“సాధ్వీమణీ! నీ సౌశీల్యం గొప్పదని, నువ్వు పతివ్రతవని నేను అంగీకరిస్తున్నాను. దేవతా సంగమం వల్ల మానవ స్త్రీలకు ఉత్తమత్వమే కానీ, పాతివ్రత్య భంగం కలగనేరదు” అని చెప్పి ఆమెను సమాధాన పరచబోయాడు.
కానీ, సునీతి ఒప్పుకోలేదు.
“ఇదంతా మిగిలినవారికి అర్థమవుతుందా?! నన్ను చూసినవారు చాటునైనా నవ్వుకోరా?! నిందార్హమైన ఈ జన్మను కొనసాగించడం కంటే నీచమున్నదా? నాథా! దయచేసి నాకోసం చితి ఏర్పాటు చేయించండి. అగ్నిప్రవేశంతో జన్మ చాలిస్తాను” అన్నది.
జయభద్రునితోపాటు రాజపరివారమంతా సునీతిని ఆ ప్రయత్నం నుంచి విరమించుకోమని బతిమాలారు. కానీ, ఎవరి మాటలనూ సునీతి చెవిన పెట్టలేదు. చేసేది లేక చివరికి జయభద్రుడు కోట ముంగిట చందనపు చెక్కలతో చితి పేర్పించాడు. నిలువెత్తు మంటలు చెలరేగుతున్నాయి. నగర ప్రజలందరూ అక్కడ గుమికూడారు.
సునీతి తన భర్త పాదాలకు నమస్కరించింది.
“నాథా! నేను త్రికరణశుద్ధిగా మీ పాదాలనే నమ్మి ఉంటే ఈ అగ్ని నన్నేమీ చేయదు. నాలో ఏ కళంకం ఉన్నా దగ్ధమైపోతాను. బంగారం మంచిదైతే అగ్ని శుద్ధి పొందిన తరువాత అలంకార యోగ్యమవుతుంది. లేదంటే కరిగిపోతుంది” అని చెప్పి అగ్నిప్రవేశం చేసింది.
అప్పటివరకు ఉవ్వెత్తున ఎగిసిపడ్డ అగ్నికీలలు ఉన్నట్లుండి చల్లారిపోయాయి. సునీతికి రవ్వంతైనా ప్రమాదం కలగలేదు.
“మహాసాధ్వి సునీతికి జయము.. జయభద్రుల వారికి జయము జయము!” అని పౌరులందరూ ముక్తకంఠంతో పలికారు.
ఆ తరువాత సునీతిని పట్టపురాణిగా చేసుకుని, హైమవతితో కలిసి మణిప్రస్థాన్ని, అమరావతిని కూడా చాలాకాలం పాటు జయభద్రుడు పాలించాడు.
(వచ్చేవారం.. ఎగిరే జింక)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | జయభద్రుని తెలివి
Kasi Majili Kathalu | నీతిమంతురాలు
Kasi Majili Kathalu | అనంగ చంద్రిక
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | అదృష్టదీపుడు – 2
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | అదృష్టదీపుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | పాటపాడే చెట్టు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | స్వర్గంలో మానవుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | ఎగిరే చెట్లు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |కాశీ మజిలీ కథలు : దొంగల తప్పిదం
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |రహస్య స్నేహితుడు