సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశమే హద్దుగా పెరగడానికి తోడు బుక్చేసిన సిలిండర్లు సకాలంలో అందకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం తాజాగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం డొమస్టిక్ సిలిండర్ బుక్ చేసిన 25 రోజుల తర్వాత మరో సిలిండర్ బుక్ చేయడానికి వీలుంటుంది. కానీ చాలామంది కస్టమర్లకు 25 రోజులు గడిచి 2 నెలలు గడుస్తున్నా బుకింగ్కు అవకాశం ఇవ్వడం లేదంటూ వాపోతున్నారు. ఈ విషయంపై గ్యాస్ ఏజెన్సీలను సంప్రదిస్తే పైనుంచి గ్యాస్ కొరత ఉందంటూ చేతులెత్తేస్తున్నారు.
అయితే ఇక్కడే చాలావరకు గ్యాస్ ఏజెన్సీలు.. ఇలా కృత్రిమ కొరత సృష్టించి గ్యాస్బండల బ్లాక్ దందాకు తెరలేపి డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి బుకింగ్ సీరియల్ నంబర్ ప్రకారమే సిలిండర్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ డీలర్లు ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ గ్యాస్ కొరతను సాకుగా చూపుతూ.. ఇళ్లకు సరఫరా చేయాల్సిన డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లు, హాస్టళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఎక్కువ ధరలకు అక్రమంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి
. హైదరాబాద్లో సాధారణంగా రోజుకు 70వేల బుకింగ్లు జరిగేవి. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులతో 25 రోజుల గడువు పెట్టడంతో ఆ సమయం అనంతరం ఒక్కసారిగా బుకింగ్స్ సంఖ్య లక్ష దాటుతోందని సమాచారం. రూ.965 గా ఉన్న డొమెస్టిక్ సిలిండర్ ధరపై తాజాగా రూ.29 పెంపుతో రూ.994కి చేరింది. ఇలా వంట గ్యాస్ ధరల పెంపుతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రజలపై నెలకు రూ.10.44 కోట్లకు పైగా అదనపు ఆర్థిక భారం పడుతుందని లెక్కలు చెబుతున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ -మలాజిగిరి జిల్లాల పరిధిలో సుమారు 320 కి పైగా గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వాటికి చెందిన సుమారు 48.60 లక్షలకు పైగా డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. రోజువారీగా సిలిండర్ల డిమాండ్ సుమారు 1.61 లక్ష వరకు ఉండగా.. ఏజెన్సీల ద్వారా రోజుకు సగటున 1.20 లక్షల వరకు సిలిండర్లు వినియోగదారుల ఇళ్లకు డెలివరీ అవుతున్నాయి. ఈ లెకన ప్రతి సిలిండర్ పై పెరిగిన రూ.29 చొప్పున లెకిస్తే రోజుపై దాదాపు రూ.34.80 లక్షల అదనపు భారం పడనుంది.
