ముంబై : రాష్ట్రంలో ప్రస్తుతం విధించిన ఆంక్షలు కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దోహదపడ్డాయని, కొత్తగా అదనంగా ఎలాంటి ఆంక్షలు విధించే యోచన ప్రభుత్వానికి లేదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 10లక్షలకు పెరిగాయని, త్వరలోనే తగ్గుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. వైరస్ థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రెండో దశకు సైతం సిద్ధంగా ఉన్నా.. వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుందని, మొదటి వేవ్ కంటే ఘోరంగా ఉంటుందని ఎవరూ చెప్పలేదని సీఎం చెప్పారు. మహారాష్ట్రలో ప్రతి రోజు 1,200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుండగా.. ప్రస్తుతం 1,700 మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉందని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి తరలించి, కొరతను నెరవేస్తున్నామన్నారు. త్వరలోనే మరికొన్ని ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.